ప్రధాన మంత్రి కార్యాలయం

నూతన పార్లమెంటు భవనానికి 2020 డిసెంబర్ 10 న శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి


Posted On: 08 DEC 2020 8:39PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 డిసెంబర్ 10 న, అంటే గురువారం, న్యూ ఢిల్లీ లోని సంసద్ మార్గ్ లో నూతన పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నూతన భవనం ఆత్మనిర్భర్ భారత్దార్శనికత లో ఓ ముఖ్య భాగం. అంతేకాకుండా, స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటి సారి గా ప్రజల పార్లమెంటు ను నిర్మించడానికి ఇది ఒక చరిత్రాత్మకమైన అవకాశం కూడా కానున్నది. ఇది 2022 లో స్వాతంత్య్ర దిన 75 వ వార్షికోత్సవం లో న్యూ ఇండియాఅవసరాలకు, ఆకాంక్షల కు తులతూగేదిగా ఉంటుంది.

నూతన పార్లమెంటు భవనం ఆధునికంగాను, అత్యాధునికమైందిగాను, శక్తి ని తక్కువ మొత్తంలో ఉపయోగించుకొనేది గాను, సువ్యవస్థిత భద్రత సౌకర్యాలతో కూడినదిగాను ఉండబోతోంది. ప్రస్తుత పార్లమెంటు కు ఆనుకొని త్రికోణీయ ఆకారం లో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. లోక్‌ సభ ఇప్పటి పరిమాణం కంటే 3 రెట్లు, రాజ్య సభ భవనం చెప్పుకోదగినంత పెద్దది గాను ఉంటుంది. నూతన భవనం యొక్క లోపలి భాగం లో భారతీయ సంస్కృతి తో పాటు మన ప్రాంతీయ కళ లు, హస్తకళ లు, వస్త్రాలు, వాస్తుశిల్పం ల సుశోభిత మిశ్రణం మనకు దర్శనమివ్వనుంది. వైభవోపేతమైన కేంద్ర రాజ్యాంగ ప్రదర్శన శాల కోసం సువిశాల ప్రదేశానికి కూడా చోటు చూపించారు. ఈ ప్రదర్శన శాల ను సందర్శించే అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తారు.

నూతన పార్లమెంట్ భవన నిర్మాణం వనరులను చక్కగా వినియోగించుకొనే హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగివుంటుంది; పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రోత్సహిస్తుంది; ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు, ఆర్థిక పునరుజ్జీవనానికి దోహదం చేస్తుంది. నూతన భవనం అధిక నాణ్యత గల ధ్వనిప్రసార వ్యవస్థ, దృశ్య- శ్రవణ సౌకర్యాలు, మెరుగైన, సుఖప్రదమైన సీటింగ్ ఏర్పాట్లు, సమర్థవంతమైన, భవనం లోపల ఉండే వారిని అత్యవసర సమయాల్లో ఖాళీ చేయించేందుకు తగ్గ వెసులుబాటులతోను ఉంటుంది. ఈ భవనం భూకంప సంబంధమైన జోన్-5 అవసరాలకు అనుగుణం గా రూపుదిద్దుకోవడంతో పాటు, దీని నిర్వహణ సులభతరంగా ఉండేలా తయారు కానుంది.

ఈ శంకుస్థాపన కార్యక్రమానికి లోక్ సభ గౌరవనీయ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ వెంకటేశ్ జోశి, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ హర్ దీప్ ఎస్. పురీ, రాజ్య సభ డిప్యూటీ చైర్ మన్ శ్రీ హరివంశ్ నారాయణ్ సింహ్ లు హాజరు కానున్నారు. కేంద్ర కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, కార్యదర్శులు, రాయబారులు / హై కమీషనర్లతో సహా దాదాపు 200 మంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

వెబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

****



(Release ID: 1679280) Visitor Counter : 258