ప్రధాన మంత్రి కార్యాలయం
జైసల్మేర్ లోని లోంగేవాలాలో సాయుధ బలగాల మధ్య దీపావళి జరుపుకున్న సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
Posted On:
14 NOV 2020 4:14PM by PIB Hyderabad
తల్లి భారతిసేవ, సురక్ష కోసం అహర్నిశలు పాటుపడే మీ అందరికీ 130 కోట్ల దేశ ప్రజానీకం తరఫున దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. సరిహద్దుల్లో, ఆకాశంలో, సముద్రజలాల్లో, మంచు కొండల్లో, దట్టమైన అడవుల్లో దేశ రక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్న వీరులైన సోదరసోదరీమణులు, మన సైన్యం, బి ఎస్ ఎఫ్, ఐ టి బి పి, సి ఆర్ పి ఎఫ్ వంటి రక్షణ బలగాలు, మన పోలీసులు ఇలా అందరికీ దీపావళి పర్వదినాన ఆదరపూర్వకంగా నమస్కరిస్తున్నాను.
మీరు ఉంటేనే దేశం ఉంది. దేశం ఉంటేనే ప్రజలు సుఖంగా ఉంటారు. అలాగే ఈ పండగలు ఉంటాయి. ఈ రోజు నేను మీకు ప్రతి భారతీయుని శుభాకాంక్షలను తీసుకుని వచ్చాను. కోటి కోటి దేశవాసుల అభిమానాన్ని, ప్రేమను తీసుకువచ్చాను. దేశంలోని పెద్దల ఆశీస్సులు తీసుకువచ్చాను. పండుగ రోజున కూడా దేశ రక్షణ వీధుల్లో నిమగ్నమైన వీర సైనికుల కుటుంబాలు కూడా ఎంతో అభినందనపాత్రమైనవి. అటువంటి కుటుంబాలలోని వీర మాతలు, సోదరీమణులు, పిల్లలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
ప్రధానిగా మొదటిసారి బాధ్యతలు చేపట్టిన తరువాత 2014లో దీపావళి పండుగ జరుపుకునేందుకు నేను సియాచిన్ కు వెళ్ళాను. ఇలా సరిహద్దులో సైనికులతో పండుగ జరుపుకునేందుకు వెళ్ళడం చాలమందికి ఆశ్చర్యంగా అనిపించింది. పండగ రోజు ప్రధాని ఇలా చేస్తున్నారేమిటి అని అనుకున్నారు. కానీ ఇప్పుడు వారితోపాటు మీకు కూడా నా ఉద్దేశ్యం ఏమిటో అర్ధమయ్యే ఉంటుంది. దీపావళి రోజు నా సన్నిహితుల మధ్యలో ఉండాలనుకున్నాను. అందుకనే ఈసారి కూడా మీ మధ్యకు వచ్చాను. నా సన్నిహితుల మధ్యకు వచ్చాను. మీరు మంచు కొండలపై ఉన్నా, ఎడారుల్లో ఉన్నా మీతో గడిపినప్పుడే నా దీపావళి పండుగ సార్ధకమవుతుంది. మీ ముఖాల్లో ఆనందాన్ని, కాంతిని చూసినప్పుడు నా సంతోషం మరింత పెరుగుతుంది. ఈ ఆనందాన్ని పొందడానికి, దేశవాసులందరి ఉత్సాహం, ఉల్లాసాలను మీకు అందించడానికి నేను ఈ ఎడారి ప్రదేశంలో మీ మధ్యకు వచ్చాను. మరోమాట, ఈ పండుగ రోజున నేను మీ కోసం మిఠాయి కూడా తీసుకువచ్చాను. కేవలం ఈ దేశ ప్రధాని మాత్రమే మీ కోసం మిఠాయి తెచ్చారని మీరు అనుకోకండి. ఇది నా ఒక్కడిదే కాదు, అందులో మొత్తం దేశవాసులందరి ప్రేమ, ఆప్యాయతల సువాసన కూడా ఉంది. ఈ మిఠాయిలో ప్రతి భారతీయ తల్లి ఆప్యాయతను కూడా మీరు అనుభవించవచ్చును. అలాగే ప్రతి సోదరి, సోదరుడి ప్రేమ, తండ్రి ఆశీర్వాదం కూడా అనుభూతి చెందవచ్చును. అందువల్ల నేను మీ మధ్యకు ఒక్కడినే రాలేదు. నాతో పాటు దేశవాసులందరి ప్రేమ, స్నేహం, ఆశీర్వాదాలు కూడా తీసుకుని వచ్చాను.
సహచరులారా,
నేను ఈ రోజు లొంగోవాలా పోస్ట్ లో ఉన్నాను. ఇప్పుడు దేశప్రజానీకపు దృష్టి అంతా ఇక్కడే ఉంది. ఇక్కడ నా ముందు భారతమాత వీరపుత్రికలు, నా పుత్రికాసమానులు, నా దేశానికి గౌరవాన్ని తెచ్చేవారు కూర్చున్నారు. దేశంలోని వివిధ సైనిక పోస్ట్ లలో ఎక్కువగా ప్రజలకు తెలిసినది, తరతరాలు గుర్తుపెట్టుకునేది ఏదైనా ఉందంటే అది లొంగోవాలా పోస్ట్. ఇక్కడ వేసవిలో ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు మించి ఉంటే, చలికాలంలో జీరో డిగ్రీల కంటే తక్కువకు చేరుతుంది. ఈ పోస్ట్ లో మీ సహచరులు చూపిన శౌర్యప్రతాపాలు ప్రదర్శించారో నేటికీ ప్రతి భారతీయుడిని ఉత్తేజితుడిని చేస్తాయి. లొంగోవాలా పేరు చెప్పగానే హృదయాంతరాళ నుంచి `జో బోలె సో నిహాల్, సత్ శ్రీ ఆకాల్’ అనే నినాదమే వస్తుంది, ప్రతిధ్వనిస్తుంది.
సహచరులారా,
ఎప్పుడెప్పుడు యుద్ధ నైపుణ్యం, సైన్య పరాక్రమం గురించి చర్చవచ్చినా అప్పుడు లొంగోవాల్ యుద్ధం తప్పక గుర్తుకు వస్తుంది. పాకిస్తాన్ సైన్యం అమాయకులైన బంగ్లాదేశ్ ప్రజలపై అత్యాచారాలు, దుర్మార్గాలు, మారణకాండకు పాల్పడుతున్న రోజులు అవి. పాకిస్తాన్ సైనికులు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న సమయమది. పాకిస్థాన్ దుష్ట తంత్రం, భయంకర రూపం ప్రపంచానికి తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం దృష్టిని మరల్చడానికి పాకిస్థాన్ మన పశ్చిమ సరిహద్దు ప్రాంతాలపై దాడికి తెగబడింది. అలా చేసి ఆ తరువాత భారత్ అలా చేసింది, ఇలా చేసిందని మొసలి కన్నీరు కారుస్తూ బంగ్లాదేశ్ పై తాము చేస్తున్న అత్యాచారాలను కప్పిపుచ్చుకోవాలన్నది పాకిస్థాన్ ఆలోచన. కానీ మన సైనికులు ఎంత గట్టిగా సమాధానం చెప్పరంటే పాకిస్థాన్ పప్పులు ఏవి ఉడకలేదు.
సహచరులారా,
ఈ పోస్ట్ దగ్గర మన సైనికులు చూపిన పరాక్రమం శత్రువు మనోస్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది. వాళ్ళకేం తెలుసు ఇక్కడ తల్లి భారతి వీర పుత్రులు, పుత్రికలను ఎదుర్కోవలసి వస్తుందని? మేజర్ కుల్దీప్ సింగ్ చంద్ పురి నేతృత్వంలో భారతీయ వీరులు ట్యాంకులతో శత్రు సైన్యాన్ని మట్టికరిపించారు. వారి కుతంత్రాన్ని సాగనివ్వలేదు. కుల్దీప్ గురించి విన్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది వారి తల్లిదండ్రులు తమ కుమారుడు వంశాన్ని ఉద్ధరిస్తాడని కుల్దీప్ అని పేరు పెట్టారని. కానీ ఆయన తన పరాక్రమంతో తమ వంశానికే కాదు, మొత్తం దేశానికే పేరు తెచ్చారు.
సహచరులారా,
లొంగోవాల్ యుద్ధం మన సైన్యపు శౌర్య పరాక్రమాలకు మాత్రమేకాక వైమానిక దళం, బి ఎస్ ఎఫ్ ల మధ్య అద్భుతమైన సమన్వయానికి కూడా గుర్తు. భారతీయ త్రివిధ దళాల ముందు ఎవరు నిలవలేరని ఈ యుద్ధం నిరూపించింది. 71లో జరిగిన లొంగోవాల్ యుద్ధానికి 50 ఏళ్ళు పూర్తికావస్తున్నాయి. కొన్ని వారాల తరువాత జరిగే కార్యక్రమంలో ఆ యుద్ధాన్ని మరోసారి సగర్వంగా గుర్తుచేసుకుంటాము. అందుకనే ఇప్పుడు కూడా ఇక్కడకు రావాలని నాకు అనిపించింది. దేశం మొత్తం మన వీరుల విజయగాధలను గుర్తుచేసుకుని గర్విస్తుంది. అలాగే దేశ ప్రజానీకపు ధైర్యం మరింత పెరుగుతుంది. యువతరానికి ఎంతో ప్రేరణ లభిస్తుంది. ఇది వారి జీవితాల్లో చాలా ముఖ్యమైన విషయం అవుతుంది. అటువంటి వీరపుత్రుల గురించి ఈ రాజస్థాన్ కు చెందిన కవి నారాయణ సింహ్ భాటి వ్రాసారు. ఆయన స్థానిక భాషలో ఆ కవిత వ్రాసారు. తన వీరపుత్రుల బలిదానాలకు ఈ భూమి గర్విస్తుంది, ఆకాశం గర్విస్తుంది, చరిత్ర గర్విస్తుంది. ఎప్పుడెప్పుడు సూర్య కిరణాలు ఈ భూమిపై అంధకారాన్ని తరిమివేయడానికి క్రిందికి వస్తాయో రాబోయే తరాలు ఈ అపూర్వ బలిదానాల పట్ల గర్విస్తారు అని ఆ కవిత అర్ధం.
సహచరులారా,
ఉన్నత హిమాలయాలైనా, దుర్గమమైన ఎడారి అయినా, దట్టమైన అడవి అయినా, విశాలమైన సముద్రమైనా మీ వీరత్వాన్ని అడ్డుకోలేవు. కొందరు ఇప్పుడు ఈ ఎడారి ప్రాంతంలో స్థిరంగా నిలిస్తే, మరికొందరు మంచుకొండల్లో పహరా కాస్తున్నారు. స్థితి, పరిస్తితి ఎలా ఉన్నప్పటికీ మీ పరాక్రమం అసామాన్యమైనది. అందుకనే శత్రువుకు కూడా తెలుసు భారతీయ వీరులకు సరిసాటి ఎవ్వరూ లేరని. మీ ఈ పరాక్రమానికి వందనం చేస్తూ 130 కోట్ల భారతీయులు మీతోపాటు నిలిచి ఉన్నారు. నేడు ప్రతి భారతీయుడు తన సైన్యపు శక్తి, పరాక్రమానికి గర్విస్తున్నాడు. దేశ సరిహద్దులను రక్షించడంలో మన వీర సైనికులను ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేదు.
సహచరులారా,
దురాక్రమణదారులను ఎదుర్కొనగలిగిన సామర్ధ్యం కలిగిన దేశమే సురక్షితంగా ఉంటుందని, ప్రగతి సాధించగలుగుతుందని ప్రపంచ చరిత్ర చెపుతోంది. నేటి పరిస్థితులు చూస్తే అంతర్జాతీయ సహకారం ఎంతగా లభించినా, ప్రపంచ సమీకరణలు ఎంతగా మారినా, శక్తిసామర్ధ్యాలు మాత్రమే సురక్షను ఇవ్వగలవని, అప్రమత్తతే సుఖశాంతులను తేగలదని అర్ధమవుతుంది. సామర్ధ్యమే విజయానికి మూలం. నేడు భారత్ సురక్షితంగా ఉన్నదంటే దానికి కారణం తనను తాను రక్షించుకోగలిగిన శక్తి సంపాదించుకుంది. మీ వంటి వీర పుత్రులు, పుత్రికలు భారత్ కు ఉన్నారు.
సహచరులారా,
తమ దగ్గర శక్తితోపాటు సరైన జవాబు ఇవ్వడానికి అవసరమైన రాజకీయ శక్తి కూడా ఉందని భారత్ అనేకసార్లు నిరూపించింది. సైన్యపు శక్తి, పరాక్రమం, సంకల్పం మన దేశ ప్రాబల్యాన్నిఅనేక రెట్లు పెంచుతోంది. నేడు భారత్ తీవ్రవాదులను, వారిని పెంచిపోషిస్తున్నవారిని వారి ఇంట్లోకి వెళ్ళి మరీ నాశనం చేస్తోంది. ఈ దేశం తన ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీ పడదని ప్రపంచమంతా నేడు గ్రహిస్తున్నది. భారత్ సాధించిన ఈ స్థితికి మీ శక్తి, పరాక్రమాలే కారణం. మీరు ఈ దేశాన్ని సురక్షితం చేశారు కాబట్టే ప్రపంచ వేదికపై తన వాణిని వినిపించగలుగుతోంది.
సహచరులారా,
నేడు ప్రపంచమంతా విస్తరణవాద శక్తుల వల్ల ఇబ్బందులు పడుతోంది. విస్తరణవాదం ఒక రకమైన మానసిక వికృతి. అది 18వ శతాబ్దపు ధోరణికి గుర్తు. ఈ ధోరణికి వ్యతిరేకంగా భారత్ తన గొంతు గట్టిగా వినిపిస్తున్నది.
సహచరులారా,
మన దేశం ఈరోజున రక్షణ రంగాన్ని స్వయంసమృద్ధం (ఆత్మనిర్భర్) చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది, ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా మన దళాలు 100 కు పైగా వస్తువులను విదేశాలనుండి దిగుమతి చేసుకోకుండా, మన దేశంలో తయారయిన వాటినే వాడాలని నిర్ణయించాయి. ఇందులో ఆయుధాలు, వాటి విడిభాగాలూ ఉండడం విశేషం. వీటిని ఇక్కడే తయారు చేయడానికి ఏవేవి అవసరమో అన్నీ సమకూర్చాలని నిర్ణయించారు. ఇది అంత సులువైన నిర్ణయమేమీ కాదు. దీని కోసం చాలా ధైర్యం కావాలి. మన సైనికుల మీద నమ్మకం కావాలి. ఈ సందర్భంలో ఈ త్యాగ తపోభూమి నుండి, ఈ అత్యావశ్యకమైన నిర్ణయం తీసుకున్నందుకు నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నిర్ణయం చిన్నది కాదని నాకు తెలుసు. ఆత్మనిర్భర భారత్ వైపు ఒక స్ఫూర్తి దాయకమైన నిర్ణయం సైన్యం తీసుకుంది. ఈ నిర్ణయం 130 కోట్ల మంది దేశ ప్రజానీకానికి ఒక సందేశాన్నిచ్చింది, ఆ సందేశం మొత్తం దేశంలో మార్మోగింది అదే ‘వోకల్ టు లోకల్'. సైన్యం తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం 130 కోట్ల దేశ ప్రజలకు ప్రేరణనిచ్చింది. ఈ రోజున నేను దేశంలోని యువకులు , సైన్యం , పారామెడికల్ ఫోర్సెస్ నుండి ఒకరి తరువాత ఒకరు ఇటువంటి నిర్ణయాల ద్వారా మన దేశంలో యువకులు ఎలాంటి ఎలాంటి కొత్త వస్తువులు తయారు చేసి తెస్తారో మన సైనికుల, రక్షణ బలగాల శక్తి అంత పెరుగుతుంది. కొద్ది రోజులలోనే కొన్ని స్టార్టప్స్ సైన్యపు అవసరాలు తీర్చడానికి ముందకు వచ్చాయి. రక్షణ రంగంలో యువకుల స్టార్టప్స్ మన దేశ స్వయం ఆధారత్వాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తాయి.
సహచారులారా,
రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్ , పెరుగుతున్న మన దేశ సామర్థ్య లక్ష్యం – సరిహద్దులలో శాంతి. ఈ రోజున భారతదేశ రణనీతి సుస్పష్టంగా ఉంది. ఈ రోజున భారత్ ‘వినడం, వినిపించడం' అనే సూత్రాన్ని నమ్ముతోంది. వినడం అలాగే వినిపించడం . కానీ ఒకవేళ దౌర్జన్యం చేయాలని ప్రయత్నిస్తే మాత్రం దానికి ప్రచండంగా జవాబు ఇస్తుంది.
సహచారులారా,
దేశ అఖండత్వం ప్రజల ఐకమత్యం మీద ఆధారపడి ఉంటుంది. దేశంలో శాంతి , ఏకత్వం, సద్భావన అఖండతకు దారినిస్తాయి. సరిహద్దుల రక్షణ , రక్షణ బలగాల శక్తితో ముడి పడి ఉంది. సరిహద్దులలో మన సైనికుల మనోనిబ్బరం సుదృఢంగా ఉండడానికి, ఆకాశాన్ని మించిన మనోబలం ఉండడానికి, వాళ్ళకి సంబంధించిన ప్రతి అవసరం, ప్రతి విషయం ఈ రోజున దేశ సర్వోన్నత ప్రాముఖ్యతల్లో ఒకటి. వారి కుటుంబ పరిరక్షణ దేశ బాధ్యత. కొద్ది రోజులుగా సైనికుల పిల్లల విద్య, ఉద్యోగం కోసం అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం నేను తిరిగి ప్రమాణస్వీకారం చేసిన తరువాత తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం అమరుల పిల్లల విద్యకు సంబంధించినది. ఇందులో భాగంగా నేషనల్ డిఫెన్స్ ఫండ్ ద్వారా ఇచ్చే ఉపకారవేతనాన్ని పెంచాము.
సహచారులారా,
వసతులతో పాటు సైనికుల గౌరవం కోసం కూడా దేశంలో ఎన్నో అద్భుతమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేషనల్ వార్ మెమోరియల్, రాష్ట్రీయ సమర్ స్మారక్ కావచ్చు లేదా నేషనల్ పోలీస్ మెమోరియల్ కావచ్చు, ఈ రెండూ మన సైనికుల శౌర్యానికి చిహ్నంగా దేశ ప్రజలకు , భావి తరాలకు ప్రేరణనిస్తున్నాయి.
సహచరులారా ,
కఠిన పరిస్థితులలో మీ వ్యవహారం, జట్టు భావన, దేశానికి ప్రతి కష్టంలోనూ పోరాడాలనే పటిమను అందిస్తోంది. ఇదే పోరాటపటిమతో దేశం ఈ రోజున కరొన మహమ్మారి మీద యుద్ధం సాగిస్తోంది. దేశంలో కొన్ని వేల మంది డాక్టర్లు, నర్సులు , సహాయ సిబ్బంది రాత్రింబవళ్ళు అడ్డు అలుపు లేకుండా పని చేస్తున్నారు. దేశ ప్రజలు కూడా ఈ యుద్ధంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగా పోరాడుతున్నారు. ఇన్ని నెలలుగా దేశ ప్రజలు అనుశాసనాన్ని పాటిస్తూ, మాస్క్ వంటి జాగ్రత్తలు తీసుకుంటూ తమ, తమవారి జీవితాలని రక్షిస్తున్నారు. మాస్క్ పెట్టుకోవడమే ఇంత ఇబ్బందిగా ఉంటే మీ రక్షణ కవచాలు(జాకెట్స్) వేసుకోవడానికి మీ శరీరం మీద ఇంకెంత భారం పడుతుందో మాకు అర్ధం అవుతోంది. ఇన్ని వేసుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో కదా. మీ ఈ త్యాగంతో దేశం అనుశాసనం అలవర్చుకుంటోంది, సేవా భావనను ఆచరిస్తోంది.
సహచరులారా,
సరిహద్దులలో ఉంటూ మీరు చేసే ఈ తపస్సు, త్యాగం దేశంలో ఒక విశ్వాసభరిత వాతావరణాన్ని నిర్మాణం చేస్తుంది, ప్రతి భారతీయుడిలో ఒక కొత్త నమ్మకాన్ని తెస్తుంది. కలిసికట్టుగా పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కోవచ్చుననే విశ్వాసాన్ని అందిస్తోంది. మీరిచ్చిన ఈ ప్రేరణతో దేశం ఈ మహమ్మారి నుండి ప్రతి వ్యక్తి రక్షణ కోసం నిలబడి ఉంది. ఇన్ని నెలలుగా దేశం 80 కోట్లకు పైగా తమ వారి కోసం భోజన సదుపాయం కల్పిస్తోంది. అలాగే దీనితో పాటే దేశం ఆర్థిక వ్యవస్థను కూడా మళ్ళీ ముందుకు తీసుకువెళ్లడానికి సంపూర్ణ ఉత్సాహంతో ప్రయత్నం చేస్తోంది. దేశ ప్రజల ఈ ఉత్సాహం, ధైర్యం వల్లనే ఈ రోజున అనేక రంగాలలో మళ్ళీ రికార్డు స్థాయిలో రికవరీ, ఎదుగుదల కనిపిస్తున్నాయి. ఇలాంటి అనేకానేక పోరాటాలు, వాటి సాఫల్యం వీటన్నింటి శ్రేయస్సు సరిహద్దులలో గట్టిగా నిలబడ్డ మన సైనికులకే చెందుతుంది, మీకే చెందుతుంది.
సహచరులారా ,
ప్రతీ సారీ మీ మధ్యకు వచ్చినపుడు, మీతో సమయం గడిపినపుడు, మీ సుఖ దుఃఖాలలో భాగం పంచుకుంటున్నప్పుడు, నా దేశ రక్షణ, దేశ సేవా సంకల్పం మరింత గట్టిపడుతూంటుంది. మీరు ఎటువంటి సందేహంలేకుండా మీ కర్తవ్య పథంలో ముందుకు సాగండి. ప్రతి పౌరుడు మీతో ఉన్నాడని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ రోజున ఒక మిత్రుడిగా, ఒక సహచరుడిగా మీతో మూడు విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను, ఈ నా వినతి మీకు సంకల్పంగా మారుతుందని నాకు నమ్మకం ఉంది. మొదటిది – ఏదైనా పని సృజనాత్మకంగా చేసే అలవాటుని, కొత్త పద్ధతిలో చేసే అలవాటుని, కొత్త విషయాలను అన్వేషించే అలవాటుని జీవితంలో భాగంగా చేసుకోండి. ఇలాంటి మన జవాన్ల సృజనాత్మకత దేశానికి ఏదో ఒక కొత్త విషయాన్ని అందిస్తుందని నేను గమనించాను. మీరు సృజనాత్మకంగా పని చేయడంపట్ల ధ్యాస పెట్టండి. విసుగు నుండి మీరు ఎలా బయటపడతారో, దానివల్ల చాలా లాభం ఉంటుంది. నా రెండో వినతి, ఇది మీకు చాలా అవసరమైనది , మీరు ఎట్టి పరిస్థితులోనూ యోగాను మీ జీవితంలో భాగం చేసుకోండి. ఇక మూడవది, మనందరికీ మన మాతృ భాష ఉంది, మనలో చాలా మంది హిందీ కూడా మాట్లాడతాం, మనలో కొంత మంది ఆంగ్లం కూడా మాట్లాడతారు, వీటన్నింటితో మనకి సహజంగా బంధం ఏర్పడింది. ఒక లఘు భారతం ఇప్పుడు నా ముందు కూచుంది. దేశంలోని వివిధ ప్రాంతాల జవాన్లు ఇక్కడ ఉన్నారు. వివిధ మాతృభాషాలు కలిగిన వాళ్ళు కూర్చొని ఉన్నారు కనుక ఇప్పుడు నాది ఒక వినతి , వాళ్ళకి వారి మాతృ భాష వచ్చు, మీకు హిందీ వచ్చు, ఆంగ్లం వచ్చు, మన సహచరులలో ఎవరో ఒకరి నుండి భారత్ లోని ఏదో ఒక్క భాష మీరు తప్పక నేర్చుకోండి. అప్పుడు చూడండీ, అది మీకు ఒక కొత్త శక్తి అవుతుంది. ఇది మీ అందరిలో ఒక కొత్త శక్తి నింపుతుంది.
సహచరులారా,
మీలో ధైర్యం, త్యాగం తపస్సు ఉన్నాయి, 130 కోట్ల దేశ ప్రజల ఈ ఆత్మవిశ్వాసాన్ని ఎవరూ సడలించలేరు. మీరు ఉన్నంతవరకూ దేశంలో దీపావళి ఇలా వెలుగులతో జరుగుతూనే ఉంటుంది . ఈ లోంగేవాలా పరాక్రమ భూమి నుండి, సాహస భూమి నుండి త్యాగ తపో భూమి నుండి మరలా ఒకసారి మీ అందరికీ, అలాగే దేశ ప్రజలందరికీ అనేకానేక దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నాతోపాటు , రెండు పిడికిళ్ళు బిగించి పైకి ఎత్తి పూర్తి శక్తితో చెప్పండీ, భారత్ మాతా కి జై ! భారత్ మాతా కి జై ! భారత్ మాతా కి జై !
ధన్యవాదాలు!
***
(Release ID: 1673091)
Visitor Counter : 292
Read this release in:
Manipuri
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam