ప్రధాన మంత్రి కార్యాలయం

హజీరా వద్ద రో-పాక్స్ టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

Posted On: 08 NOV 2020 3:18PM by PIB Hyderabad

ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రారంభం అవడం ద్వారా ఆ ప్రాంతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (వ్యాపారానుకూల వాతావరణం), ఈజ్ ఆఫ్ లివింగ్ (ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం)లో ఎలాంటి సానుకూల మార్పు వస్తుందో చెప్పడానికి ఈ ప్రాజెక్టు ఓ చక్కటి ఉదాహరణ. ఇప్పుడే నాకు నలుగురైదుగురు సోదరులు, సోదరీమణులతో మాట్లాడేందుకు అవకాశం లభించింది. తీర్థయాత్రల విషయంలో, వారి వాహనాలకు తక్కువ నష్టం జరగడం, తక్కువ సమయంలో ప్రయాణం పూర్తవడం, వ్యవసాయ ఉత్పత్తి పెరగడం, వ్యవసాయంలో నష్టాన్ని తగ్గించడం, స్వచ్ఛమైన పళ్లు, కూరగాయల ఉత్పత్తి.. సూరత్ మార్కెట్‌కు తరలించడం వంటి సౌకర్యాలను వారు నాతో పంచుకున్నారు. దీని వల్ల వ్యాపార సౌలభ్యం పెరగడంతోపాటు పనుల్లో వేగం పెరుగుతుంది. మొత్తంమీద సంతోషకర వాతావరణం ఏర్పుడుతుందని నేను విశ్వసిస్తున్నాను. వ్యాపారులు, చిరువ్యాపారులు, ఉద్యోగులు, కూలీలు, రైతులు, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన అనుసంధానతతో లబ్ధి పొందబోతున్నారు. మనవారి మధ్య దూరం తగ్గుతున్నకొద్దీ మనస్సు సంతృప్తి లభిస్తుంది.

 

ఒకరకంగా చెప్పాలంటే గుజరాత్ ప్రజలకు దీపావళి కానుక కాస్త ముందుగానే లభించిందని చెప్పుకోవాలి. ఇలాంటి సంతోషకర సమయంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరైన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీమాన్ విజయ్ రూపాణీ జీ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు భాయీ మాన్‌సుఖ్ భాయ్ మాండవీయ జీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటులో నా సహచరుడు శ్రీమాన్ సీఆర్ పాటిల్ జీ, గుజరాత్ మంత్రిమండలిలోని సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతోపాటు వివిధ ప్రాంతాలతనుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సోదర, సోదరీమణులారా.. నేడు ఘోఘా, హజీరా మధ్య రో-పాక్స్ సేవలు ప్రారంభం కావడం వల్ల సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రజల సుదీర్ఘ స్వప్నం సాకారమైంది. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న దృశ్యం పూర్తయింది. హజీరాలో ఇవాళ కొత్త టర్మినల్ ను కూడా జాతీయం చేయడం జరిగింది. భావ్ నగర్, సూరత్ మధ్య నిర్మించిన ఈ సరికొత్త సముద్ర అనుసంధానత సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు.

 

మిత్రులారా, ఘోఘా, హజీరా మధ్య ప్రస్తుతమున్న 375 కిలోమీటర్ల రోడ్డుమార్గం.. ఈ ప్రాజెక్టు ద్వారా 90 కిలోమీటర్లకు తగ్గింది. అంతకుముందు ఈ ప్రయాణానికి 10 నుంచి 12 గంటలు పట్టే సమయం.. ఇప్పుడు కేవలం 3-4 గంటల్లోనే పూర్తవుతుంది. అందుకే ఇది సమయంతోపాటు ఖర్చును కూడా గణనీయంగా తగ్గించింది. తద్వారా రోడ్డుపై తగ్గనున్న ట్రాఫిక్ ద్వారా కాలుష్యం కూడా తగ్గుతుంది. ఇప్పుడే మనవాళ్లు చెప్పినట్లు.. ఏడాదిలో దాదాపు 80వేల యాత్రికుల వాహనాలు, 30వేల ట్రక్కులకు ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధిచేకూరుతుంది. ఎంతమొత్తంలో పెట్రోల్, డీజిల్ పొదుపు అవుతుందో ఆలోచించండి.


మిత్రులారా,

గుజరాత్ లోని ఓ పెద్ద వ్యాపార కేంద్రంతోపాటు ఈ అనుసంధానత ద్వారా సౌరాష్ట్ర అభివృద్ధిలో భారీ మార్పులు వస్తాయి. ఇప్పుడు సౌరాష్ట్ర రైతులు, పాడిరైతుల ఉత్పత్తి, పళ్లు, కూరగాయలు, పాలు వంటివి సూరత్ కు చేర్చడం చాలా సులభం అవుతుంది. గతంలో ట్రక్కుల్లో వీటిని సూరత్  చేర్చడం వల్ల అందులోనే ఎక్కువశాతం పాడయ్యేవి. చాలా నష్టం కూడా జరిగేది. మరీ ముఖ్యంగా పళ్లు, కూరగాయల విషయంలో ఈ నష్టంగా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ నష్టాన్ని తగ్గించవచ్చు. సముద్ర మార్గం ద్వారా పాడి రైతులు, అన్నదాతల ఉత్పత్తులను వేగంగా, సురక్షితంగా మార్కెట్ కు తరలించేందుకు వీలుంటుంది. దీంతోపాటు సూరత్ లోని వ్యాపారులు, శ్రామికులు కోసం రాకపోకలు, రవాణా చాలా మరింత చవకగా పూర్తవుతాయి.

 

మిత్రులారా,

గుజరాత్ లో రో-పోక్స్ ఫెర్రీ సేవలను అందుబాటులోకి తీసుకురావడం అంత సులభంగా జరగలేదు. ఇందుకోసం చాలా మంది శ్రమించారు. ఎన్నో సమస్యలు.. మధ్యలో కొత్త సవాళ్లు  ఎదురయ్యాయి. ఈ ప్రాజెక్టుకోసం నేను మొదట్నుంచీ అనుసంధానమై ఉన్నాను. అందుకే ఆ సమస్యల గురించి నాకు బాగా తెలుసు. ఎలాంటి సమస్యల్లోనుంచి మార్గాలు వెతక్కుంటూ ప్రాజెక్టు పూర్తి చేయాల్సి వచ్చిందో నాకు తెలుసు. అసలు ఈ ప్రాజెక్టును చేస్తామా? లేదా అని చాలాసార్లు అనిపించేది. మాకు ఇదో కొత్త అనుభవం. గుజరాత్ లో నేను ఇలాంటి చాలా అంశాలను చూశాను. అందుకే ఈ ప్రాజెక్టును పూర్తిచేసినందుక ప్రతి ఒక్కరూ అభినందనీయులు. విశ్వాసంతో పనిచేసి.. ఈ స్వప్నాన్ని సాకారం చేసిన ఇంజనీర్లు, శ్రామికులకు ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారి శ్రమ, వారి ధైర్యం, లక్షల మంది గుజరాతీయులకోసం ఈ సౌకర్యాన్ని అందించాయి. కొత్త అవకాశాలను అందించాయి.

 

మిత్రులారా,

గుజరాత్ కు సముద్ర వ్యాపార వారసత్వం ఉంది. ఇప్పుడే మాన్‌సుఖ్ భాయ్ వేల ఏళ్ల ఘనమైన చరిత్రను మనకు వెల్లడించారు. మనం సముద్ర వ్యాపారంతో ఎలా అనుసంధానమై ఉన్నామో చెప్పారు. దీన్ని గుర్తించే దశాబ్దాలుగా పోర్టు ఆధారిత అభివృద్ధిని ప్రాథమికాంశంగా ఎంచుకుని ముందుకెళ్తున్నాం. ఇది ప్రతి గుజరాతీయుడికి గర్వకారణం. ఈసారి గుజరాత్ కోస్తాప్రాంతంలో మౌలికవసతుల ప్రాజెక్టుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ పాలసీ రూపకల్పన, షిప్ బిల్డింగ్ పార్క్ నిర్మాణం, ప్రత్యేకమైన టర్మినళ్ల నిర్మాణం ఇలా ప్రతి అంశానికీ తగిన ప్రాముఖ్యతనిచ్చాం. దహేజ్ లో సాలిడ్ కార్గో, కెమికల్, ఎల్ఎన్జీ టర్మినల్, ముంద్రాలో కోల్ టర్మినల్ ఇందులో భాగంగా వచ్చినవే. దీంతోపాటుగా నౌకల ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ, గ్రౌండ్ బ్రేకింగ్ కనెక్టివిటీ ప్రాజెక్టును కూడా పూర్తిస్థాయిలో వేగవంతం చేశాం. ఈ ప్రయత్నాల కారణంగానే గుజరాత్ పోర్ట్ రంగానికి సరికొత్త దిశను అందించ గలిగాం.

 

మిత్రులారా,
కేవలం పోర్టులో భౌతిక మౌలికవసతుల కల్పన మాత్రమే కాదు.. పోర్టుల చుట్టుపక్కల ఉన్న మిత్రుల జీవితాలను మరింత సానుకూలంగా మార్చేందుకు కూడా కార్యక్రమాలు చేపట్టాం. తీరప్రాంతాల ఎకోసిస్టమ్ ను ఆధునీకరించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాం. సాగర్ ఖేడు వంటి మిషన్ మోడ్ కార్యక్రమమైనా.. లేదా.. షిప్పింగ్ పరిశ్రమ ద్వారా స్థానిక యువకుల నైపుణ్యాభివృద్ధి ద్వారా వారికి ఉపాధి కల్పించడమైనా.. ఇవన్నీ గుజరాత్ లో పోర్టు ఆధారిత అభివృద్ధితోపాటు సమాంతరంగా జరిగాయి. ప్రభుత్వం తీరప్రాంతంలోని అన్ని రంగాల సమగ్రాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేసింది.



(Release ID: 1671363) Visitor Counter : 208