నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

నైపుణ్యాల శిక్షణా వ్యవస్థ పటిష్టతకు

కొత్త మార్గదర్శక సూత్రాలు, నిర్వహణా సూచనలు

“నైపుణ్యాల శిక్షణా వ్యవస్థకు,. మంజూరు సంస్థలు, మధింపు సంస్థలు మూల స్తంభాలు. కొత్త మార్గదర్శక సూత్రాలు నైపుణ్య నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి.”: మహేంద్ర నాథ్ పాండే

Posted On: 27 OCT 2020 3:40PM by PIB Hyderabad

  ప్రపంచానికి నైపుణ్య కేంద్రంగా భారతదేశాన్నితీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీదార్శనికతకు అనుగుణంగా, నైపుణ్య ధ్రువీకరణకోసం మంజూరు సంస్థలకు, మధింపు సంస్థలకు పటిష్టమైన మార్గదర్శక సూత్రాలను కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వశాఖ (ఎం.ఎస్.డి.ఇ.) ఆవిష్కరించింది. న్యూఢిల్లీలో ఈ రోజు డిజిటల్ పద్ధతిలో జరిగిన సమావేశంలో కొత్త మార్గదర్శక సూత్రాలను విడుదల చేశారు.  జాతీయ వృత్తి విద్య, శిక్షణా మండలి (ఎన్.సి.వి.ఇ.టి.) సహకారంతో కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. నైపుణ్యాల స్థాయి ధ్రువీకరణలో కీలకపాత్ర పోషించే మంజూరు సంస్థలు, మధింపు సంస్థలు, నైపుణ్య శిక్షణా వ్యవస్థకు సంబంధించిన ఇతర కీలకాంశాల గుర్తింపునకు ఈ మార్గదర్శ సూత్రాలను, నిర్వహణాపరమైన సూచనలను తయారుచేశారు. నైపుణ్యాన్ని, ఉత్పత్తి మెరుగుదలను నిర్ధారించడం, స్కిల్ ఇండియా పథకం కింద నిర్ధారణ ప్రక్రియను ప్రమాణబద్ధం చేయడంకోసం ఈ సూత్రాలను రూపొందించారు.

 

    కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్కిల్ ఇండియా దార్శనికతకు అనుగుణంగా క్రియాశీలక మార్గదర్శక సూత్రాలు ఎంతో ఆవశ్యకమని వివరించారు. “విభిన్నమైన నైపుణ్యాల శిక్షణలో తగిన సానుకూల వ్యవస్థలకు మనదేశం అవకాశం కల్పిస్తోంది. కీలకమైన భాగస్వామ్య వర్గాలు, ఇతర సంస్థలనుంచి ఇందుకు తగిన మద్దతు కూడా లభిస్తోంది. ఈ నేపథ్యంలో, నైపుణ్య నిర్ధారణ వ్యవస్థలో మెరుగుదల, పరివర్తనకోసం క్రియాశీలక విధాన వ్యవస్థ చాలా అవసరం. నైపుణ్యం స్థాయిపై హామీని, అర్హతను నిర్ధారించేందుకు జాతీయ వృత్తివిద్యా శిక్షణా మండలి (ఎన్.సి.వి.ఇ.టి.)పేరిట ఒక నియంత్రణ సంస్థ ఏర్పాటైందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.”  అని మంత్రి అన్నారు. నైపుణ్య శిక్షణా సంస్థల సమర్థ నిర్వహణకు మార్గదర్శక సూత్రాల్లోని సృజనాత్మక పద్ధతులు, నిర్మాణాత్మక అంశాలు దోహదపడతాయన్నారు. మార్గదర్శక సూత్రాలను రూపొందించడంలో క్రమం తప్పకుండా సలహా సంప్రదింపులు, సమన్వయ కృషి జరిపిన ఎన్.సి.వి.ఇ.టి.ని అభినందిస్తున్నట్టు మంత్రి చెప్పారు.

   నైపుణ్యంలో శిక్షణ, పునః శిక్షణ, శిక్షణ ఉన్నతీకరణ ప్రక్రియలకు ప్రస్తుత ప్రంపంచానికి  అత్యంత ఆవశ్యకమని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారని మంత్రి చెప్పరు.  క్రియాశీలక మార్గదర్శక సూత్రాల సహాయంతో నైపుణ్య రంగంలో స్వల్పకాలిక, దీర్షకాలిక నైపుణ్య శిక్షణా ప్రక్రియల్లో ఆశించిన ఫలితాలను సాధించగలమని ఆయన చెప్పారు. గత, ఐదేళ్ల కాలంలో దాదాపు ఐదున్నర కోట్లమంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. తాజాగా తీసుకువచ్చిన సంస్కరణలు  నైపుణ్య శిక్షణా రంగంలో పెనుమార్పులు తేగలవన్నారు.

  దేశంలోని వివిధ రంగాలకు వివిధ స్థాయిల్లో నైపుణ్య శిక్షణకు నైపుణ్య శిక్షణా వ్యవస్థ దోహదపడుతోంది. తాజాగా విడుదలైన మార్గదర్శ సూత్రాలు కీలకమైన భాగస్వామ్య వర్గాలన్నింటి అవసరాలనూ నెరవేర్చి, సుపరిపాలనకు దోహదపడతాయి.  ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ, ఎప్పటికప్పుడు తలెత్తే కొత్త పరిణాణాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసుకుంటూ ప్రతి అభ్యర్థికి నైపుణ్యంలో సాధికారత కల్పించేందుకు ఈ మార్గదర్శక సూత్రాలు ఉపయోగపడతాయి. మార్గదర్శ సూత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఎన్.సి.వి.ఇ.టి. చైర్మన్ ప్రవీణ్ కుమార్, ఎన్.సి.వి.ఇ.టి. కార్యవర్గ సభ్యురాలు వినీతా అగ్గర్వాల్, మంత్రిత్వ శాఖ ప్రధాన సలహాదారు సునీతా సంఘీ తదితరులు పాల్గొన్నారు.

 

నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ (ఎం.ఎస్.డి.ఇ.)

   యువత ఉద్యోగాలకు అర్హమైన నైపుణ్యాలను పెంపొందించే అంశంపై దృష్టిని కేంద్రీకరించేందుకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖను భారత ప్రభుత్వం 2214, నవంబరు 9న ఏర్పాటు చేసింది. నైపుణ్యాభివృద్ధికి ఒక విధానాన్ని రూపొందించేందుకు, తగిన ప్రమాణాలను తయారు చేసేందుకు, కొత్త కార్యక్రమాలను, పథకాలను ప్రారంభించేందుకు, కొత్త మౌలిక సదుపాయాల ఏర్పాటుకు, ప్రస్తుత నైపుణ్యాభివృద్ధి సంస్థల స్థాయిని పెంపొందించేందుకు, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసేందుకు ఈ మంత్రిత్వ శాఖ తొలినుంచి అనేక చర్యలు తీసుకుంది. నైపుణ్య శిక్షణలో పరిశ్రమలకు ప్రమేయం కల్పించేందుకు, నైపుణ్య శిక్షణకు సామాజికపరమైన ఆమోదాన్నిపొందేందుకు ఈ మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టింది. నైపుణ్యం కలిగిన సిబ్బందికి ఉన్న గిరాకీకి, సరఫరాకు మధ్య అంతరాన్ని పూడ్చివేసేందుకు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉద్యోగాలకే కాక, కొత్తగా అందుబాటులోకి వచ్చే ఉద్యోగాలకు కూడా తగిన నైపుణ్యాల్లో మానవ వనరుల శిక్షణకు వ్యవస్థలను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుని ఈ మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన స్కిల్ ఇండియా పథకం కింద ఇప్పటివరకూ 3కోట్లమందికిపైగా అభ్యర్థులు నైపుణ్య శిక్షణ పొందారు.  ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పి.ఎం.కె.వి.వై.) అనే పతాక పథకం కింద 2016-2020 సంవత్సరాల మధ్య, 92లక్షలమందికిపైగా అభ్యర్థులకు ఈ మంత్రిత్వ శాఖ శిక్షణ కల్పించింది.

 

  జాతీయ వృత్తి విద్య, శిక్షణా మండలి (ఎన్.సి.వి.ఇ.టి.)

   జాతీయ వృత్తి విద్య, శిక్షణా మండలి(ఎన్.సి.వి.ఇ.టి.) ఏర్పాటుకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ 2018 డిసెంబరు 5న నోటిఫికేషన్ వెలువరించింది. నైపుణ్యాల శిక్షణకు సంబంధించి ఒక నియంత్రణా వ్యవస్థగా ఎన్.సి.వి.ఇ.టి. వ్యవహరిస్తుంది. వృత్తి విద్య, శిక్షణ అందించే సంస్థల పనితీరును నియంత్రించడం, ఈ సంస్థలు చేపట్టే దీర్ఖకాలిక, స్వల్పకాలిక శిక్షణ కోర్సులను పర్యవేక్షించడం తదితర కార్యకలాపాలను ఎన్.సి.వి.ఇ.టి. నిర్వహిస్తుంది. వాటికి కనీస ప్రమాణాలను నిర్దేశిస్తుంది. నైపుణ్య శిక్షణ ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలను, నిర్వహణా సూత్రాలను రూపొందించేందుకు ఎన్.సి.వి.ఇ.టి. చిత్తశుద్ధితో కృషి చేయడంతో దేశంలో నైపుణ్య శిక్షణా వ్యవస్థకు పటిష్టమైన మార్గదర్శ సూత్రాలు అందుబాటులోకి వచ్చాయి. నైపుణ్య ధ్రువీకరణకోసం ఎన్.సి.వి.ఇ.టి. ఒకే తరహా యోగ్యతాపత్రాన్నిరూపకల్పన చేయడం, సంస్కరణల దిశగా ఒక ముందడుగని చెప్పవచ్చు.  సర్టిఫికెట్ జారీ వ్యవస్థ సాధికారితను ఇది మరింత బలోపేతం చేస్తుంది.

******

 



(Release ID: 1667886) Visitor Counter : 169