అంతరిక్ష విభాగం

భారత అంతరిక్ష ప్రయాణంలో ప్రైవేటు రంగం భాగస్వామి కాబోతోంది: కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్

ఉపగ్రహ ప్రయోగాలు, అంతరిక్ష ఆధారిత కార్యక్రమాల్లో ప్రైవేటు సంస్థలకు త్వరలో తగిన స్థానం లభిస్తుంది: డా.జితేంద్ర సింగ్

Posted On: 11 OCT 2020 4:34PM by PIB Hyderabad

భారత అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు రంగానికి భాగస్వామ్యంలో భాగంగా; తనకు చెందిన అన్ని సౌకర్యాలను ప్రైవేటు రంగం వినియోగించుకునేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసిందని భారత అంతరిక్ష విభాగం సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డా.జితేంద్ర సింగ్‌ వెల్లడించారు.

    ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, అంతరిక్ష విభాగంలో తీసుకొచ్చిన్న సరికొత్త చారిత్రక సంస్కరణల గురించి మాట్లాడుతూ, భవిష్యత్తులో చేపట్టే గ్రహాన్వేషణ, అంతరిక్ష యాత్రలు వంటి కార్యక్రమాలు ప్రైవేటు రంగానికి కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. స్వావలంబన భారత్‌ దిశగా మోదీ ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్‌ భారత్‌లో ఇది కూడా ఒక భాగమని డా.జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. అంతరిక్ష కార్యక్రమాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచడం కేంద్రం ఉద్దేశంగా చెప్పారు.

    భారత అంతరిక్ష రంగ ప్రయాణంలో భారత ప్రైవేటు రంగం భాగస్వామి అవుతుందని డా.జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. ఉపగ్రహ ప్రయోగాలు, అంతరిక్ష ఆధారిత కార్యక్రమాల్లో ప్రైవేటు సంస్థలకు త్వరలో తగిన స్థానం దొరుకుతుందన్నారు. దేశంలోని అంతరిక్ష సంబంధ కార్యక్రమాలను "పంపిణీ ఆధారిత నమూనా" నుంచి "గిరాకీ ఆధారిత నమూనా" దిశగా కొత్త సంస్కరణలు తీసుకెళతాయన్నారు. 'నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌' (ఇన్‌ స్పేస్‌) ఏర్పాటుతో ఒక యంత్రాంగం అందుబాటులోకి వస్తుందని; సామర్థ్యాలను పెంచుకునేలా, ఇస్రోకు చెందిన అన్ని సౌకర్యాలు, సంబంధిత ఇతర ఆస్తులను వినియోగించుకునేలా ప్రైవేటు రంగానికి అనుమతి ఉంటుందని వెల్లడించారు.

    ప్రైవేటు సంస్థలు తమ దరఖాస్తులను పంపడానికి ఒక వెబ్‌లింక్‌ అందుబాటులోకి తెచ్చామన్న డా.జితేంద్ర సింగ్‌; పరిశ్రమలు, అంకుర సంస్థల నుంచి వచ్చిన దరఖాస్తులను ఉన్నత స్థాయి కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు.

***


(Release ID: 1663571) Visitor Counter : 239