పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

దర్భంగా నుండి రోజువారీ విమానాల బుకింగు‌లు ఈ నెలాఖరు నుండీ ప్రారంభం : హర్దీప్ ఎస్ పురి


ఈ విమానాశ్రయం ఉత్తర బీహార్ ‌లోని 22 జిల్లాలకు ఒక వరం : పౌర విమానయాన శాఖ మంత్రి

ఉడాన్ పథకం కింద ప్రాంతీయ విమాన మార్గాల అనుసంధానతకు ప్రోత్సాహం

దర్భంగా, దియోఘర్ విమానాశ్రయ పనులను క్షేత్రస్థాయిలో సమీక్షించిన - పౌర విమానయాన శాఖ మంత్రి

Posted On: 12 SEP 2020 4:08PM by PIB Hyderabad

దర్భాంగా నుండి ఢిల్లీ, ముంబై, బెంగళూరు లకు సెప్టెంబర్ చివరి నాటికి రోజువారీ విమానాల బుకింగ్ ప్రారంభమవుతుందని పౌర విమానయాన శాఖ ఇంచార్జ్ సహాయ మంత్రి, శ్రీ హర్దీప్ సింగ్ పురి తెలియజేశారు.   బీహార్‌లోని దర్భంగా విమానాశ్రయం పనులను క్షేత్ర స్థాయిలో సమీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, పవిత్ర పండుగ ఛత్ పూజకు ముందే, నవంబర్ మొదటి వారంలో విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని చెప్పారు.  ఉత్తర బీహార్‌లోని 22 జిల్లాలకు ఇది ఒక వరం అని ఆయన అన్నారు.

దర్బంగా విమానాశ్రయం పురోగతి మరియు నిర్మాణ స్థితిని పౌర విమానయాన శాఖ మంత్రి మీక్షించారు. మధుబని పార్లమెంటు సభ్యుడు శ్రీ అశోక్ యాదవ్,  పౌర విమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి, శ్రీ ప్రదీప్ సింగ్ ఖరోలా;  ఏ.ఏ.ఐ. చైర్మన్, శ్రీ అరవింద్ సింగ్ తో పాటు ఇతర అధికారులు, మంత్రి వెంట ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. 

 

దర్భంగా విమానాశ్రయం పనుల పురోగతిపై శ్రీ పురీ సంతృప్తి వ్యక్తం చేస్తూ, విమానాశ్రయంలో చాలా వరకు పనులు దాదాపుగా పూర్తయ్యాయని పేర్కొన్నారు.  రాక, పోకలకు వినియోగించే హాళ్ళు, చెక్-ఇన్ సౌకర్యం, కన్వేయర్ బెల్టు మొదలైనవి ఇప్పటికే ఏర్పాటయ్యాయనీ, మిగిలిన పనులు అక్టోబర్ చివరిలోపు పూర్తవుతాయని ఆయన చెప్పారు.  ఆర్.‌సి.ఎస్-ఉడాన్ కింద ఈ మార్గం ఇప్పటికే స్పైస్ ‌జెట్‌ కు లభించింది.

'హవాయి చప్పల్ సే హవాయి జహాజ్ తక్'  అనే ప్రధానమంత్రి భావన, ప్రజల జీవితాలను మారుస్తూనే ఉందని శ్రీ పురీ ఉద్ఘాటించారు.  దర్భంగా విమానాశ్రయ మైదానంలో పనులు పూర్తి స్థాయిలో జరుగుతుండగా, ఇతర ప్రక్రియలు కూడా పురోగతిలో సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.  మంత్రి  దర్భంగా విమానాశ్రయంలో ఉన్న సమయంలోనే స్పైస్ జెట్ ద్వారా విమాన క్రమాంకనం జరిగింది.

జార్ఖండ్‌ లోని డియోఘర్ విమానాశ్రయం యొక్క స్థితిని సమీక్షించిన అనంతరం, శ్రీ పురీ మాట్లాడుతూ,  డియోఘర్ విమానాశ్రయంలో పనులు చివరి దశలో ఉన్నాయనీ, నిర్ణీత సమయంలో పూర్తి కాగలవనీ తెలియజేశారు.  పార్లమెంటు సభ్యుడు శ్రీ నిషికాంత్ దుబేతో ఆయన విస్తృతంగా చర్చలు జరిపారు.  ఈ విమానాశ్రయం త్వరలో పనిచేయడం ప్రారంభిస్తుందని శ్రీ పురీ చెప్పారు.  వచ్చే వారం నాటికి ప్రభుత్వం ఈ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన తెలియజేశారు. 

సంతల్ ప్రాంతానికి విమానయాన సర్వీసుల అనుసంధానంతో పాటు, పాట్నా, కోల్‌కతా మరియు బాగ్డోగ్రాకు కూడా అనుసంధానతను అందించడానికి వ్యూహాత్మకంగా ఉన్న దియోఘర్‌లోని విమానాశ్రయం, బీహార్ లోని భాగల్పూర్ మరియు జముయ్ జిల్లాల ప్రజలకు కూడా సేవలందించగలుగుతుంది. 

'సబ్ ఉడేన్, సబ్ జుడేన్' అనే నినాదంతో దేశంలోని మారుమూల ప్రాంతాలకు విమాన సర్వీసులతో అనుసంధానం కల్పించే ప్రతిష్టాత్మక ఉడాన్ పథకం కింద ఇది మరో ముందడుగని, మంత్రి పేర్కొన్నారు.

****

 



(Release ID: 1653660) Visitor Counter : 178