వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

'వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు' జాతీయ పోర్టబిలిటీ క్లస్టర్‌లోకి కేంద్ర పాలిత ప్రాంతాలు ల‌ద్దాఖ్, ల‌క్ష‌ద్వీప్‌లు

- ఇప్పుడిక 26 రాష్ట్రాలు / యుటీలలోని వలస పీడీఎస్ లబ్ధిదారులు తమకు నచ్చిన ఏదైనా ప్రభుత్వ ‌సరసమైన ధరల దుకాణం నుండి సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలను పొందే వెసులుబాటు

Posted On: 01 SEP 2020 4:37PM by PIB Hyderabad

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ఎస్. రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ఇటీవల “వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్” వ్య‌వ‌స్థ‌ అమలులో సాధించిన పురోగతిని సమీక్షించారు. ఈ సంద‌ర్భంగా రెండు కేంద్ర పాలిత‌పు ప్రాంతాలైన‌ ల‌ద్ధాఖ్‌, ల‌క్ష‌ద్వీప్‌ల‌ను ఈ ప‌థ‌కంలో అనుసంధానం చేయ‌డానికి కావాల్సిన సాంకేతిక స‌న్న‌ద్ధ‌త‌ను గురించి మంత్రి స‌మీక్షించారు. ఈ రెండు  కేంద్ర పాలిత ప్రాంతాల‌ను ఇప్పటికే ఉన్న 24 రాష్ట్రాలు / ‌యూటీల స‌మాహారంగా ఉన్న  “వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్” వ్య‌వ‌స్థ జాతీయ పోర్టబిలిటీ క్లస్టర్‌తో అనుసంధానం చేసేందుకు గాను ఆమోదం తెలిపారు. ట్ర‌య‌ల్ అండ్ టెస్టింగ్ ప్రాతిప‌దిక‌న రెండు యుటీల నుంచి జాతీయ క్లస్టర్‌లోని ఇతర రాష్ట్రాలు / యుటీలతో జాతీయ పోర్టబిలిటీ లావాదేవీలు పూర్తి చేశారు. దీంతో మొత్తం 26 రాష్ట్రాలు / యుటీలు ఇప్పుడు “వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్” ప‌థ‌కం ప్రకారం ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన‌ట్ట‌యింది మ‌రియు ఈ 26 రాష్ట్రాలు / యుటీలలోని వలస పీడీఎస్ లబ్ధిదారులు తమకు స‌ర్కారు అందిస్తున్న సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలను ఒకే రూపంలో మరియు ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన జారీ ధరలలో తమకు నచ్చిన ఏదైనా సరసమైన ధర దుకాణంలో (ఎఫ్‌పీఎస్) సెప్టెంబ‌రు 1వ 2020, నుంచి పొందే సౌక‌ర్యం అందుబాటులోకి వ‌చ్చింది.
65 కోట్ల మంది ల‌బ్ధిదారుల‌కు వెసులుబాటు..
ఈ కింది 26 రాష్ట్రాలు / యుటీలలో మొత్తం 65 కోట్లకు పైగా లబ్ధిదారులు (అంటే మొత్తం ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ జనాభాలో 80%) వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ వ్యవస్థ ద్వారా ఆయా ప్రాంతాల‌లో వారి సబ్సిడీ ఆహార ధాన్యాలను పొందేలా వీలు క‌లుగ‌నుంది. సంబంధిత రాష్ట్రాలు / యుటీలు ఇలా ఉన్నాయి..  గోవా, ఆంధ్రప్రదేశ్, బీహార్, దాద్రా నగర్ హవేలి మరియు డామన్ & డయ్యూ,  గుజరాత్, హర్యాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, లద్ధాఖ్‌, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తర ప్రదేశ్ తో ఉత్తరాఖండ్ ఉన్నాయి. మార్చి, 2021 నాటికి మిగిలిన రాష్ట్రాలు / యుటీలు జాతీయ పోర్టబిలిటీలో విలీనం చేయాల‌ని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశంలో ఎక్కడైనా వారి భౌతిక స్థానంతో సంబంధం లేకుండా, జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) పరిధిలో ఉన్న లబ్ధిదారులందరికీ ఆహార భద్రత అర్హతలను అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసిన ప్రయత్నమే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ వ్య‌వ‌స్థ. అన్ని రాష్ట్రాలు / యుటీల వారి సహకారంతో 'ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (ఐఎం-పీడీఎస్‌)' పై కొనసాగుతున్న కేంద్ర ప్ర‌భుత్వ రంగ పథకం కింద రేషన్ కార్డుల వారికి దేశ వ్యాప్తంగా చౌక ధ‌ర‌ల స‌రుకులు పొందేలా పోర్టబిలిటీని అమలు చేయడం ఈ వ్య‌వ‌స్థ ఉద్దేశం.
వ‌ల‌స ల‌బ్ధిదారుల‌కు మేలు..
ఈ వ్యవస్థ ద్వారా  తాత్కాలిక ఉపాధిని వెతుక్కుంటూ త‌రుచుగా తమత‌మ‌ నివాస స్థలాన్ని మార్చే వలస ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారులు దేశ వ్యాప్తంగా ఇప్పుడు తమకు నచ్చిన ఏదైనా సరసమైన ధరల దుకాణం (ఎఫ్‌పీఎస్‌) నుండి తమకు కేటాయించ‌బ‌డిన ఆహార ధాన్యాల కోటా పొందే ఎంపిక‌ను ల‌భించ‌నుంది. ఆయా  ఎఫ్‌పీఎస్‌ లలో వ్యవస్థాపించబడిన ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈపీఓఎస్‌) పరికరంలో బయోమెట్రిక్ / ఆధార్ ఆధారిత ప్రామాణీకరణతో ఇప్పటికే ఉన్న రేషన్ కార్డును ఉపయోగించడం ద్వారా వలస ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారులు దేశ వ్యాప్తంగా త‌మ కోటా రేష‌న్‌ను పొంద‌వ‌చ్చు.


                               

****  



(Release ID: 1650569) Visitor Counter : 308