ఆయుష్

కోవిడ్-19 రోగులకు ఉచిత పరీక్ష మరియు చికిత్సా సౌకర్యాలు ప్రారంభించిన - అఖిల భారత ఆయుర్వేద సంస్థ.

Posted On: 30 JUL 2020 12:03PM by PIB Hyderabad

కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ శ్రీపాద యశో నాయక్ ఇటీవల ప్రకటించిన విధంగా న్యూఢిల్లీ లోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏ.ఐ.ఐ.ఏ),  తన కోవిడ్-19 ఆరోగ్య కేంద్రం (సి.హెచ్.సి) లో రోగులకు ఉచిత పరీక్ష మరియు చికిత్సను అందించడం ప్రారంభించింది.

కోవిడ్-19 రోగుల చికిత్స కోసం కేంద్రంలో ఏర్పాట్లను సమీక్షించడానికి శ్రీ నాయక్ 2020 జూలై, 28వ తేదీన సి.హెచ్.సి. ని సందర్శించారు.  రోగులందరికీ సి.హెచ్.సి. ఉచితంగా పరీక్ష, చికిత్సా సౌకర్యాలు కల్పిస్తుందని తమ పర్యటన సందర్భంగా మంత్రి ప్రకటించారు.  వెంటిలేటర్ సదుపాయంతో పాటు ఐ.సి.యు. కు ఉండవలసిన అన్ని ఇతర ప్రామాణిక నిబంధనలతో సి.హెచ్.‌సి. లో ఏర్పాటు చేసిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను కూడా ఆయన ప్రారంభించారు.

ఏ.ఐ.ఐ.ఏ. ను కోవిడ్-19 పరీక్షల (ఆర్.టి-పి.సి.ఆర్. మరియు రాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్) కేంద్రంగా ఢిల్లీ ప్రభుత్వం నియమించింది. సాధారణ ప్రజలు టెలిఫోను ద్వారా అడిగే, కోవిడ్-19 కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు అందించడానికి వీలుగా ఏ.ఐ.ఐ.ఏ. వద్ద ఒక కోవిడ్ కాల్ సెంటరు ను ఏర్పాటుచేశారు. 

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, అశ్వగంధ, వేప, కాలమేఘా, తిప్పతీగ  మొదలైన వాటితో కూడిన వ్యాధి నివారణ, నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ మరియు పరిశోధనాంశాలలో ఈ సంస్థకు ముఖ్యమైన పాత్ర ఉంది.

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 80,000 మంది ఢిల్లీ పోలీసు సిబ్బంది కోసం నిర్వహిస్తున్న రోగనిరోధక కార్యక్రమం ‘ఆయురక్ష’ ను మంత్రి ప్రశంసించారు.  కోవిడ్-19 కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో ముందు వరుసలో యోధులుగా సేవలందిస్తున్న ఢిల్లీ పోలీసులకు రోగనిరోధక శక్తిని పెంచడం కోసం, అలాగే  కోవిడ్-19 కు వ్యతిరేకంగా జీవన ప్రమాణాలను పెంపొందించడం కోసం, వారికి "ఆయురక్ష కిట్" లను అందజేయడం జరిగుతోంది.   "ఆయురక్ష కిట్" లో తిప్పతీగ నుండి తయారుచేసిన సంషామణి, ఆయుష్ కథా కాషాయం, ముక్కులో వేసుకోవడానికి అనూ తైలం మొదలైనవి ఉంటాయి.  ఇప్పటి వరకు 1,58,454 ఆయురక్ష కిట్లు రెండు దశల్లో పంపిణీ చేయబడ్డాయి, మొత్తం 90 శాతం కంటే ఎక్కువ మంది వీటిని సమ్మతితో వినియోగిస్తున్నారు.   ఢిల్లీ పోలీసు సిబ్బంది అభిప్రాయాలను భారతీయ ప్రజారోగ్య సంస్థ (పి.హెచ్.‌ఎఫ్.‌ఐ) సహాయంతో విశ్లేషిస్తున్నారు. ఆందోళన స్థాయి తగ్గడం, సాధారణ శ్రేయస్సు అనుభూతి మరియు జలుబు, దగ్గు వంటి చిన్నచిన్న అనారోగ్య  లక్షణాలు తగ్గినట్లు, సిబ్బంది నుండి సానుకూల స్పందనలు వస్తున్నాయి.  ఢిల్లీలోని సాధారణ జనాభా పోకడలతో పోల్చితే, కోవిడ్-19 వ్యాధి సోకిన వారి సంఖ్య తగ్గినట్లు కూడా గమనించదమైంది. 

ఏ.ఐ.ఐ.ఏ. సందర్శనలో భాగంగా, మంత్రి వైద్యుల బృందంతో కూడా సంభాషించారు. కేంద్రంలోని రోగుల శ్రేయస్సు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. కోవిడ్-19 ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి, ఆయుర్వేద ఔషధాల చికిత్స ఫలితాల గురించి,  ఆయన, వారి అభిప్రాయాలను అడిగి, తెలుసుకున్నారు. 

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఏ.ఐ.ఐ.ఏ. అందిస్తున్న అందిస్తున్న సేవలకు కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.  ఆయుర్వేద సూత్రాల ఆధారంగా కోవిడ్ పాజిటివ్ రోగులకు సంరక్షణ అందించడంలో ఏ.ఐ.ఐ.ఏ. మొత్తం బృందం ప్రదర్శించిన స్ఫూర్తి,  ఉత్సాహం, ధైర్యం, కృషి ప్రశంసనీయమని, ఆయన పేర్కొన్నారు.  దేశవ్యాప్తంగా కోవిడ్-19 రోగులకు వారి శరీర తత్వానికి తగిన విధంగా ఆయుర్వేద ఔషధంతో పాటు, ఆహారం, యోగా మరియు విశ్రాంతి పద్ధతుల ద్వారా సంపూర్ణ సంరక్షణను అందించడంలో ఏ.ఐ.ఐ.ఏ. ఒక ఆదర్శవంతమైన పాత్ర పోషిస్తోందని శ్రీపాద యశో నాయక్  అభినందించారు. 

*****



(Release ID: 1642327) Visitor Counter : 560