ప్రధాన మంత్రి కార్యాలయం

మణిపూర్ నీటి సరఫరా ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 23 JUL 2020 3:16PM by PIB Hyderabad

మణిపూర్ గవర్నర్ శ్రీమతి నజ్మా హెఫ్తుల్లాజీ, ప్రముఖ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ బీరేన్ సింగ్ జీ, నా కేబినెట్ సహచరులు శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ జీ, శ్రీ రత్నలాల్ కటారియాజీ, మణిపూర్ కి చెందిన ఎంపిలు, ఎంఎల్ఏలు, సోదరసోదరీమణులారా!!

కరోనా సంక్షోభ సమయంలో కూడా దేశం ఆగిపోలేదనడానికి మణిపూర్ లో ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం చక్కని ఉదాహరణ. దేశం ఏ మాత్రం అలసిపోలేదు. వ్యాక్సిన్ వచ్చే వరకు మనం తీవ్రంగా పోరాడడమే కాదు, విజయం కూడా సాధించాలి. అదే సమయంలో అభివృద్ధి పనులు సంపూర్ణమైన శక్తితో ముందుకు నడిపించాలి. ఈ రోజు ఒక రకంగా ఉత్తరభారతదేశం, ఈశాన్య భారతం ఒక విధంగా రెండు సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఈశాన్య రాష్ర్టాల్లో ఈ ఏడాది మరోసారి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల బీభత్సంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు, ఎందరో బలవంతంగా ఇళ్లు వదిలి పోయారు. బాధిత కుటుంబాలన్నింటికీ నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ కష్ట సమయంలో జాతి మొత్తం వారి వెంట నిలుస్తుందని నేను హామీ ఇస్తున్నాను. రాష్ట్రప్రభుత్వాలతో భుజంభుజం కలిపి అవసరమైన పనులన్నీ చేపట్టడానికి భారత ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తోంది.

మిత్రులారా,
మణిపూర్ లో కరోనా వైరస్ వ్యాప్తిని, వేగాన్ని నిరోధించేందుకు రాష్ట్రప్రభుత్వం రేయింబవళ్లు శ్రమించి పోరాడుతోంది. లాక్ డౌన్ సమయంలో మణిపూర్ ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని తిరిగి తీసుకువచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం వీలైనన్ని చర్యలు తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద 5-6 లక్షల కుటుంబాలకు చెందిన 25 లక్షల మంది మణిపూర్ సోదరసోదరీమణులు ఉచిత ఆహార ధాన్యాలు అందుకున్నారు. అలాగే ఉజ్వల స్కీమ్ కింద1.5 లక్షల కన్నా ఎక్కువ మంది సోదరీమణులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా అయ్యాయి. ఈ సంక్షోభ సమయంలో పేద ప్రజలకు ఇదే తరహాలో కేంద్రప్రభుత్వ పథకాలు అండగా ఉంటాయని నేను హామీ ఇస్తున్నాను.
 
మిత్రులారా,
మణిపూర్ కు చెందిన లక్షలాది మంది మిత్రులకు ప్రత్యేకించి ఇంఫాల్ కు చెందిన వారికి ఇంకా ప్రత్యేకించి సోదరీమణులకు ఇది ఎంతో ముఖ్యమైన రోజు. రాఖీ సమయంలో మణిపూర్ సోదరీమణులకు మంచి బహుమతి అందింది. రూ.3,000 కోట్ల వ్యయంతో చేపట్టిన మణిపూర్ నీటి సరఫరా ప్రాజెక్టు పూర్తయితే ప్రజల నీటి ఎద్దడి సమస్యలన్నీ తగ్గుతాయి. ఈ ప్రాజెక్టులోని నీరు గ్రేటర్ ఇంఫాల్ సహా మొత్తం 25 నగరాలకు, 1700 పైగా గ్రామాలకు జీవనాధారంగా నిలుస్తుంది. వర్తమాన అవసరాలే కాకుండా రాబోయే 20-22 సంవత్సరాల అవసరాలు కూడా దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది. 

ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది మంది ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందుబాటులోకి రావడమే కాకుండా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. స్వచ్ఛమైన నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధుల నుంచి తట్టుకునే సామర్థ్యం వస్తుందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అందుకే ఈ ప్రాజెక్టులోని నీరు పైప్ ల ద్వారా సరఫరాకే పరిమితం కాదు. ప్రతీ ఒక్క ఇంటికీ పైప్ ల ద్వారా సురక్షితమైన మంచినీరు అందించాలన్న మా సమగ్ర లక్ష్యానికి ఇది వేగం తెస్తుంది. ఈ నీటి ప్రాజెక్టు విషయంలో మణిపూర్ తల్లులు, సోదరీమణులను నేను అభినందిస్తున్నాను. 

మిత్రులారా,
గత ఏడాది జల్ జీవన్ కార్యక్రమం ప్రారంభించినప్పుడు గతంలోని ప్రభుత్వాల కన్నా ఎన్నో రెట్లు వేగంగా మనం పని చేయాల్సి ఉంటుందని నేను చెప్పాను. ఈ రోజున 15 కోట్ల ఇళ్లకు పైప్ ల ద్వారా మంచినీరు అందించగల స్థాయి ఏర్పడినప్పుడు కూడా ఒక్క క్షణం విరామం తీసుకోవాలని మేము భావించడంలేదు. అందుకే లాక్ డౌన్ సమయంలో కూడా పైప్ లైన్ పనులు కొనసాగించి పంచాయతీల సహాయంతో ప్రజలను చైతన్యవంతం చేసే కృషి కొనసాగించాం.

ఈ రోజున దేశంలో రోజుకి లక్ష నీటి కనెక్షన్లు ఇవ్వగలిగే స్థితిలో ఉన్నాం. ఆ రకంగా ప్రతీ రోజూ లక్ష మందికి పైగా తల్లులు, సోదరీమణుల నీటి ఒత్తిడిని తగ్గించగలుగుతున్నాం. ఒక లక్ష కుటుంబాలకు చెందిన తల్లులు, సోదరీమణుల జీవితాలు తేలిక అయ్యాయి. జల్ జీవన్ కార్యక్రమం ఒక ప్రజాకార్యక్రమంగా మారుతున్నందు వల్లనే ఇది సాధ్యమయింది. ఈ రోజున గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రత్యేకించి సోదరీమణులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ఎక్కడెక్కడ పైప్ లు వేయాలి, ఎక్కడ నుంచి నీరు తీసుకోవాలి, ఎక్కడ టాంక్ నిర్మించాలి, ఎంత బడ్జెట్ అవసరం అనే నిర్ణయించగలుగుతున్నారు.

మిత్రులారా,
ప్రభుత్వ యంత్రాంగంలో వికేంద్రీకరణ, గ్రామీణ స్థాయిలో సాధికారత ఏర్పడడంతో నీటి శక్తి ఎంతటిదో మీరు ఊహించవచ్చు.

మిత్రులారా,
మెరుగైన జీవనానికి సులభతర జీవనం ఒక అవసరం. డబ్బు రావచ్చు లేదా పోవచ్చు కాని సులభతర జీవనం ప్రతీ ఒక్కరి ప్రత్యేకించి ప్రతీ ఒక్క సోదరుడు, తల్లి, సోదరి, దళితుడు, వెనుకబడిన తరగతి, గిరిజనుల హక్కు. 

అందుకే గత ఆరేళ్లుగా సులభతర జీవనం దేశంలో ఒక ప్రజాఉద్యమంగా మారింది. భారతదేశం తన పౌరులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేస్తోంది. గత ఆరేళ్లుగా ప్రతీ ఒక్క రంగంలోను అన్ని కార్యక్రమాలను ప్రజాఉద్యమంగా మార్చి ముందుకు పురోగమించేలా పేదలను ప్రోత్సహిస్తున్నాం. ఈ రోజు మణిపూర్ సహా దేశం యావత్తు బహిరంగ మలమూత్ర విసర్జన రహితమైనదిగా మారింది. ఈ రోజు ప్రతీ ఒక్క గ్రామానికి, ప్రతీ ఒక్క కుటుంబానికి విద్యుత్ సరఫరా అందుబాటులో ఉంది. నిరుపేదలందరి వంటగదులకు ఎల్ పిజి గ్యాస్ అందుబాటులోకి వచ్చింది. ప్రతీ ఒక్క గ్రామానికి మంచి రోడ్ల నెట్ వర్క్ ఏర్పడింది. నిరాశ్రయులైన ప్రతీ ఒక్క పేదలకు ఇంటి వసతి ఏర్పడింది. అయినా స్వచ్ఛమైన మంచినీటికి మాత్రం భారీగా కొరత ఉంది. అందుకే ఉద్యమ స్ఫూర్తితో మంచినీటి సరఫరా పనులు చేపట్టాం.

మిత్రులారా,
మెరుగైన జీవనం, పురోగతి, సుసంపన్నత అన్నింటికీ కనెక్టివిటీతోనే ముడిపడి ఉంది. ఈ ప్రాంత ప్రజల జీవన సౌలభ్యం ఇక్కడ ఉన్న ప్రజల జీవనానికే కాదు, సురక్షితమైన, స్వయంసమృద్ధ భారత లక్ష్యం చేరడానికి కూడా చాలా ప్రధానం. ఈ కనెక్టివిటీ వల్ల మయన్మార్, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ లతో సామాజిక వాణిజ్య్ సంబంధాలు బలోపేతం కావడమే కాదు భారతదేశం అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీకి కూడా ఉత్తేజం ఇస్తుంది. 

ఒక విధంగా తూర్పు ఆసియా ప్రాంతంతో మన ప్రాచీన సాంస్కృతిక సంబంధాలకు ఈశాన్య ప్రాంతం ఒక గేట్ వే మాత్రమే కాదు, వాణిజ్యం, ప్రయాణ, పర్యాటక రంగాల భవిష్యత్తుకు కూడా ప్రధానం. మణిపూర్ సహా ఈశాన్య ప్రాంతం మొత్తంలో కనెక్టివిటీ పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. రోడ్ వేలు, హైవేలు, ఎయిర్ వేలు, వాటర్ వేలు, ఐవేలతో పాటు గ్యాస్ పైప్ లైన్, ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్, పవర్ గ్రిడ్ వంటి ఆధునిక మౌలిక వసతులు కూడా ఈశాన్యంలో నిర్మాణంలో ఉన్నాయి.

గత ఆరేళ్లుగా ఈశాన్య ప్రాంతాల్లో మౌలిక వసతుల నిర్మాణానికి వేలాది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాం. ఈశాన్య ప్రాంత రాజధానులన్నింటినీ నాలుగు లేన్ల రోడ్లు, జిల్లా ప్రధాన కేంద్రాలన్నింటినీ రెండు లేన్ల రహదారులు, గ్రామాలన్నింటికీ అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే రోడ్ల నిర్మాణానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కింద 3000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తి కాగా మరో 6000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం త్వరితగతిన సాగుతోంది.   

మిత్రులారా,
ఈశాన్య రాష్ర్టాల్లో రైల్ కనెక్టివిటీలో కూడా ఎంతో మార్పును ఎవరైనా గమనించవచ్చు. ఒకపక్క ఈశాన్య ప్రాంతంలో రైళ్లు కొత్త స్టేషన్లకు చేరుతుండగా మరోపక్క రైలు మార్గాలన్నింటినీ బ్రాడ్ గేజ్ గా మారుస్తున్నారు. మీరందరూ ఈ మార్పును స్పష్టంగా చూడవచ్చు. రూ.14,000 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జిరిబామ్-ఇంఫాల్ రైల్వేలైను మణిపూర్ ముఖచిత్రాన్నే మార్చేస్తుంది. వచ్చే రెండేళ్ల కాలంలోనూ ఈశాన్య  రాష్ర్టాల రాజధానులన్నింటినీ మంచి రైల్ నెట్ వర్క్ తో అనుసంధానం చేసే కృషి త్వరితగతిన జరుగుతోంది.

మిత్రులారా,
ఈశాన్య రాష్ర్టాల్లో రోడ్డు కనెక్టివిటీతో పాటు రైల్వే, విమాన కనెక్టివిటీ కూడా అంతే ప్రధానం.ఈ రోజున ఈశాన్య రాష్ర్టాల్లో పెద్దవి, చిన్నవి కలిపి 13 విమానాశ్రయాలు పని చేస్తున్నాయి. రూ.3,000 కోట్ల వ్యయంతో ఈశాన్య రాష్ర్టాల్లో ఇంఫాల్ విమానాశ్రయం సహా వివిధ విమానాశ్రయాల విస్తరణ, ఆధునిక వసతుల కల్పన జరుగుతోంది.

మిత్రులారా,
ఈశాన్య రాష్ర్టాల్లో అంతర్గత జలమార్గాల అభివృద్ధి మరో పెద్ద ప్రయత్నం. అందులో అతి పెద్ద విప్లవం నేను చూడగలుగుతున్నాను. ఇక్కడ 20కి పైగా జాతీయ జలమార్గాలు నిర్మాణంలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ కనెక్టివిటీ కేవలం సిలిగురి కారిడార్కు మాత్రమే పరిమితం కాదు. ఇప్పుడు సాగర, నదీ మార్గాల ద్వారా నిరంతరాయంగా కనెక్టివిటీ కల్పించే నెట్ వర్క్ నిర్మాణం జరుగుతోంది. పెరిగిన కనెక్టివిటీతో మన పారిశ్రామికులు, రైతులకు అపారమైన ప్రయోజనం కలుగుతోంది. ఈశాన్య రాష్ర్టాల్లో రవాణా సమయం కూడా ఎంతో ఆదా అవుతోంది. ఈశాన్య రాష్ర్టాలకు చెందిన గ్రామాలు, రైతులు ఉత్పత్తి చేసే పాలు, కూరగాయలు, ఖనిజాలు వంటి ఉత్పత్తులకు దేశవిదేశాల్లోని పెద్ద మార్కెట్లతో అనుసంధానం ఏర్పడింది.

మిత్రులారా, 
ఈశాన్య రాష్ర్టాల్లోని ప్రకృతిసిద్ధమైన, సాంస్కృతిక వైవిధ్యం ఈ ప్రాంతంలోని సాంస్కృతిక బలానికి నిదర్శనం. భారతదేశానికే అది గర్వకారణం. ఇలాంటి వాతావరణంలో ఆధునిక మౌలిక వసతులు నిర్మించినట్టయితే టూరిజం కూడా ఉత్తేజితమవుతుంది. మణిపూర్ సహా ఈశాన్య ప్రాంతాల్లోని పర్యాటక సామర్థ్యం పూర్తిగా వెలుగులోకి రాలేదు. ఇప్పుడు సోషల్ మీడియా, వీడియో స్ర్టీమింగ్ ద్వారా ఈశాన్య రాష్ర్టాల్లోని పర్యాటక ప్రాంతాలు దేశంలోని ప్రతీ ఒక్క ఇంటికి చేరుతున్నాయి. ఇంతవరకు ఎవరూ వెళ్లని పలు ప్రాంతాల వీడియోలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇలాంటి ప్రదేశాలు మన దేశంలోనే ఉన్నాయా అని కూడా విస్మయం చెందుతున్నారు. ఈ శక్తిని ఈశాన్య రాష్ర్టాలు పూర్తిగా ఉపయోగించుకుని లబ్ధి పొందాలి. ఈ ప్రాంతాలకు చెందిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పలు ప్రభుత్వ ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి.

మిత్రులారా,
దేశ ఆర్థికాభివృద్ధికి చోదకశక్తిగా నిలవగల సామర్థ్యం ఈశాన్య ప్రాంతానికి ఉంది. ఈశాన్య ప్రాంతం యావత్తులో క్రమక్రమంగా శాంతి నెలకొంటున్నందు వల్ల రోజురోజుకీ నా విశ్వాసం బలోపేతం అవుతోంది. గతంలో ప్రతికూల వార్తలతో ప్రతిధ్వనించిన ఈ శాన్యం ఒప్పుడు శాంతి, పురోగతి, సౌభాగ్యంతో అలరారుతోంది. 
ఈ రోజున మణిపూర్ లో అవరోధాల నిర్మాణం గతంలో మాట. ముఖ్యమంత్రి ఇప్పుడే ఈ మాట చెప్పారు. ఇందుకు నేను ఈశాన్య ప్రాంత పౌరులందరినీ ప్రత్యేకించి మణిపూర్ ప్రజలను అభినందిస్తున్నాను. మీ మద్దతు, ప్రోత్సాహం వల్లనే ఈ అవరోధాలు గత చరిత్రగా మారిపోయాయి. అస్సాంలో దశాబ్దాలుగా సాగుతున్న దౌర్జన్యకాండ అంతరించిపోయింది. త్రిపుర, మిజోరం రెండు రాష్ర్టాల్లోనూ యువత అహింసా మార్గాన్ని వదిలేశారు. శరణార్థులు క్రమంగా మెరుగైన జీవితంలోకి అడుగు పెడుతున్నారు.  

మిత్రులారా,
మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీ, శాంతి స్థాపనతో పెట్టుబడి అవకాశాలు కూడా ఎన్నో రెట్లు పెరిగాయి. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ముందుకు నడిపించడంలో ఈశాన్య రాష్ర్ర్టాలకు చెందిన ప్రధానమైన ఆర్గానిక్ ఉత్పత్తులు, వెదురు రెండూ కీలకంగా నిలిచే ఆస్కారం ఉంది.  ఈ రోజు నేను ఈశాన్యరాష్ర్టాలకు చెందిన రైతు సోదరసోదరీమణులతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈశాన్య ప్రాంతం ఆర్గానిక్ రాజధాని అని నాకు తరచు చెబుతూ ఉంటారు. నేను మరో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. నేను ముందు రోజు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికవేత్తలను కలిశాను. వారు నాకు ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఈశాన్య ప్రాంత రైతులు పామోలిన్ పండించగలిగితే వారు ఎంతో లాభపడతారని శాస్త్రవేత్తలు నాకు తెలిపారు. ఈ రోజు పామోలిన్ ఆయిల్ కు భారతదేశంలో మంచి మార్కెట్ ఉంది. వారు ఆర్గానిక్ పంటలు పండించగలిగితే దేశానికి ఎంత పెద్ద ప్రయోజనం చేకూరుస్తారో మీరు ఊహించుకోవచ్చు. మన ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజం ఎలా కల్పించాలి?  ప్రతీ ఒక్క రాష్ట్రంలోనూ పామోలిన్ ఉద్యమం చేపట్టాలని నేను ముఖ్యమంత్రులందరినీ కోరుతున్నాను. ఈ విషయంలో ప్రజలను విద్యావంతులను చేసి ఉత్తేజపరుద్దాం. మనందరం ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రయత్నంలో రైతులకు ఏ విధంగా సహాయం చేయాలన్న ప్రణాళిక రూపొందిద్దాం. ఈ దిశగా ఆలోచిద్దామని ఈ రోజు మణిపూర్ కు చెందిన సోదరసోదరిమణులకు నేను తెలియచేస్తున్నాను.

ఈశాన్య ప్రాంతానికి చెందిన నా సోదరసోదరీమణులందరూ స్థానికానికి అనుకూలంగానే ఎప్పుడూ నినదిస్తూ ఉంటారు. కాని వారిది కేవలం నినాదమేనా?  వారు స్థానికం అంటే ఎంతో గర్వపడతారు, అదే ప్రత్యేకత. నేను ఈ రకమైన స్కార్ఫ్ కట్టుకున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలు దాన్ని స్పష్టంగా గుర్తించడం నేను చూశాను. మీ వస్తువుల విషయంలో గర్వపడడం చాలా మంచి లక్షణం. మీరు ఇప్పటికే నాలుగు అడుగులు ముందుకు వేసి ఉన్నారు, స్థానికం అంటే గర్వపడతారు గనుక స్థానికంపై మక్కువ పెంచుకోండి అని నేను వారికి వేరే చెప్పనక్కరలేదు. స్థానికం అంటే గర్వపడడం పెద్ద బలం.

ఈశాన్యానికి చెందిన అధిక శాతం ఉత్పత్తులకు విలువ జోడింపు, ప్రోత్సాహం, మార్కెట్ యాక్సెస్ తక్కువ. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద స్థానిక ఉత్పత్తులకు విలువ జోడింపు, మార్కెటింగ్ కోసం క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్న విషయం కూడా ఇక్కడి ప్రజలకు తెలియదు.  ఈ క్లస్టర్లలో ఆగ్రో స్టార్టప్ లు, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు అన్ని వసతులు అందుబాటులో ఉంటాయి. ఈశాన్య రాష్ర్టాలు కూడా తమ ఆర్గానిక్ ఉత్పత్తులు దేశంలోని ఇతర ప్రాంతాలు, విదేశాలకు పంపడానికి అవసరం అయిన అన్ని వసతులు వాటిలో ఏర్పాటవుతాయి.

మిత్రులారా,
భారతదేశం వెదురు ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించి దాని స్థానంలో స్థానిక ఉత్పత్తులు ప్రవేశపెట్టగల సామర్థ్యం ఈశాన్య ప్రాంతానికి ఉంది. దేశంలో అగరుబత్తీలకు ఎంతో డిమాండు ఉంది. వాటి తయారీ కోసం కూడా ఏన్నో కోట్ల ఖర్చుతో వెదురు దిగుమతి చేసుకుంటున్నాం. ఈ పరిస్థితి మార్చేందుకు ఎంతో కృషి జరుగుతోంది. దీని వల్ల ఈశాన్య ప్రాంతానికి చెందిన ప్రజలు కూడా ఎంతో లాభపడతారు. 
 
మిత్రులారా,
ఈశాన్యంలో వెదురు పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేక వెదురు పారిశ్రామిక పార్క్ కు ఆమోదం కూడా ఇవ్వడం జరిగింది. వెదురు నుంచి బయో ఇంధనం తయారుచేసే ఒక ఫ్యాక్టరీ కూడా నుమాలిగఢ్ లో నిర్మాణం కాబోతోంది. నేషనల్ బాంబూ మిషన్ కింద వందలాది కోట్ల పెట్టుబడితో వెదురు రైతులు, కళాకారులు, దానికి సంబంధించిన హస్తకళా ఉత్పత్తుల తయారీదారులను ప్రోత్సహించడం, వాటికి సంబంధించిన పరిశ్రమల అభివృద్ధికి ఎంతో కృషి జరుగుతోంది. ఈశాన్య భారతంలో స్టార్టప్ లకు ఇది మంచి ఉత్తేజం. 

మిత్రులారా,
ఈశాన్యంలో అమిత వేగంతో చోటు చేసుకుంటున్న ఈ మార్పుల ద్వారా చురుగ్గా ఉండే రాష్ర్టాలు మాత్రమే ప్రయోజనం పొందుతాయి. మణిపూర్ కి అపారమైన వనరులు అందుబాటులో ఉన్నాయి. మణిపూర్ ఈ అవకాశాన్ని చేజార్చుకోదని నేను భావిస్తున్నాను. ఇక్కడి రైతులు, యువ పారిశ్రామికులకు ఇది ఎంతో ప్రయోజనం కల్పిస్తుంది. మణిపూర్ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు క్పలించాలన్నది మా ప్రయత్నం. ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి విభాగాల్లో ఎన్నో సంస్థలు, స్టార్టప్ లు, ఇతర శిక్షణ వసతులు ఇక్కడ ఏర్పాటవుతున్నాయి. 

క్రీడా విశ్వవిద్యాలయం, ప్రపంచ శ్రేణి క్రీడీ స్టేడియంల నిర్మాణంతో మణిపూర్ దేశానికి చెందిన క్రీడా ప్రతిభావంతులకు ఒక ప్రధాన కేంద్రంగా మారనుంది. అలాగే మణిపూర్ యువతతో పాటు దేశవ్యాప్తంగా యువత అందరికీ మంచి హాస్టళ్లు సహా మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. మనం ఈ తరహా అభివృద్ధిని, విశ్వాసాన్ని బలోపేతం చేయాలి. మరోసారి ఈ నీటి ప్రాజెక్టు విషయంలో మీ అందరికీ అభినందనలు తెలియచేస్తున్నాను. 

ప్రతీ ఒక్క ఇంటికీ నీటి సరఫరా అందుబాటులో ఉంచాలన్న మా లక్ష్యం నీరుగారకుండా నిర్దేశిత గడువు కన్నా ముందే అది అందుబాటులోకి తేవడం కోసం మణిపూర్ కి చెందిన తల్లులు, సోదరీమణుల ఆశీర్వాదాలు నేను కోరుతున్నాను. ఆ తల్లులు, సోదరీమణులు మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను. మీ ఆశీస్సులే మాకు పెద్ద బలం. రక్షాబంధన్ సమీపంలో ఉన్నందు వల్ల  కూడా మీ ఆశీస్సులు కోరుతున్నాను. మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోండి. స్వచ్ఛత విషయంలో ఈశాన్యం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. దేశానికే అది ఒక నమూనాగా నిలుస్తుంది. మనం ఈ రోజు కరోనాపై పోరాటం చేస్తున్నాం. దో గజ్ దూరీ (రెండు గజాల దూరం) సూత్రం, ఫేస్ మాస్క్ ధరించడం, చేతులు శానిటైజ్ చేసుకోవడం ఎప్పుడూ గుర్తుంచుకోండి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దు. కరోనాపై పోరాటానికి ఈ రోజు ఇదే శక్తివంతమైన ఆయుధం. కరోనాపై పోరాటంలో మీకు ఈ సూత్రాలు ఎప్పుడూ సహాయంగా కొనసాగుతాయి. 
 
అందరికీ ధన్యవాదాలు... 

 



(Release ID: 1641330) Visitor Counter : 130