ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 ప్లాస్మా విరాళం కోసం ఢిల్లీ లోని ఎయిమ్స్ లో ప్రచారాన్ని ప్రారంభించిన - డాక్టర్ హర్ష వర్ధన్.

కోవిడ్-19 పై మనం సాధించే విజయ యాత్రలో ప్రతి ఒక్కరి కృషి అమూల్యమైనది, ఇటువంటి కరోనా యోధుల అవసరం మనకెంతో ఉంది : డాక్టర్ హర్ష వర్ధన్.

Posted On: 19 JUL 2020 7:07PM by PIB Hyderabad

కోవిడ్-19 ప్లాస్మా విరాళం కోసం ప్రచారాన్ని ఢిల్లీ లోని ఎయిమ్స్ లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈరోజు ప్రారంభించారు.   ఈ కార్యక్రమ నిర్వహణలో ఢిల్లీ పోలీసులు కూడా పాలుపంచుకున్నారు.  కోవిడ్ నుండి కోలుకున్న 26 మంది పోలీసులు ఈ సందర్భంగా స్వచ్ఛందంగా వారి రక్త ప్లాస్మాను దానం చేశారు.

ఢిల్లీ పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమానికి డాక్టర్ హర్ష వర్ధన్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "కరోనా కారణంగా డజను మందికి పైగా ఢిల్లీ పోలీసు సిబ్బంది మరణించడం చాలా విచారకరం.  ఈ విధంగా ప్రాణనష్టం జరిగినప్పటికీ, వైరస్ వ్యాప్తి నిరోధాన్ని అరికట్టే విధుల్లో పాల్గొని వారు అమూల్యమైన సేవలందిస్తున్నారు. మరోపక్క, కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 200 నుండి 600 కు పెరిగింది.” అని పేర్కొన్నారు. 

26 మంది పోలీసు కానిస్టేబుళ్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేస్తూ, ఈ వాలంటీర్ల సహకారాన్ని డాక్టర్ హర్ష వర్ధన్ ప్రశంసించారు.  వీరిలో శ్రీ ఓం ప్రకాష్ అనే కానిస్టేబుల్, ఈ రోజు మూడోసారి తన ప్లాస్మాను దానం చేశారు.  ఈ ప్లాస్మా విరాళాలు ఇతర దేశస్థులపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయనీ, వారి ప్లాస్మాను దానం చేయడానికి ప్రేరణనిస్తాయనీ, కేంద్ర మంత్రి పేర్కొన్నారు.  కోవిడ్-19 పై విజయం సాధించే మన ప్రయాణంలో ప్రతి దాత సహాయం అమూల్యమైనదనీ, ఖచ్చితమైన చికిత్స లేదా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు మహమ్మారితో పోరాడటానికి ఈ ప్లాస్మా యోధుల అవసరం మనకెంతో ఉందనీ, ఆయన అభిప్రాయపడ్డారు. 

ఈ వ్యూహం యొక్క భారీ సామర్థ్యాన్నీ, దానిని నిర్వహించడానికి తలపెట్టిన ప్రభుత్వ సంకల్పాన్నీ, ఆయన ప్రశంసించారు.   "24 గంటలూ అందుబాటులో ఉండే విధంగా వివిధ ప్లాస్మా బ్యాంకులు ఏర్పాటు చేయబడినప్పుడు, కారుణ్య ఉపయోగం కోసం అనుకూలమైన ప్లాస్మా చికిత్సను ఆమోదించడం జరిగింది" అని ఆయన పేర్కొన్నారు.  "భారతదేశంలో కోవిడ్-19 చికిత్స నుండి కోలుకున్నవారి రేటు అత్యధికంగా ఉన్నప్పటికీ, వారి నుండి ప్లాస్మా విరాళాల సేకరణ ఇంకా ప్రారంభించలేదు. ఢిల్లీ పోలీసు కరోనా యోధుల సహకారంతో, న్యూఢిల్లీ లోని ఎయిమ్స్ ఈ ప్లాస్మా విరాళం ప్రచారాన్ని నిర్వహిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.” అని డాక్టర్ హర్ష వర్ధన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.  

1994 లో పల్స్ పోలియో ప్రచారం విజయవంతం కావడానికి ఢిల్లీ పోలీసులు అందజేసిన సహకారాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. దాదాపు పదివేల మంది పోలీసు కానిస్టేబుళ్లు అభియాన్‌లో చేరి భారీ అవగాహనా కార్యక్రమాన్ని రూపొందించారని డాక్టర్ హర్ష వర్ధన్ పేర్కొన్నారు.  100 ఫోన్ నంబరును కూడా ఇందుకోసం అంకితం చేసిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.  

కోవిడ్-19 వ్యాధి నుండి కోలుకున్న రోగుల ప్లాస్మాలో నోవెల్ సార్స్-కోవ్-2 వైరస్ ని నిరోధించే యాంటీబాడీస్ ఉన్నాయి.  కోవిడ్ -19 రోగులకు ఈ ప్లాస్మా ను మార్పిడి చేసినప్పుడు రోగనిరోధక శక్తి లభిస్తుంది.  దీని ప్రయోజనాన్ని పరిగణనలోకి తీసుకుని, సాంప్రదాయ చికిత్సకు స్పందించని రోగులకు ప్లాస్మా చికిత్స అందించబడుతుంది.  కోవిడ్-19 నుండి కోలుకున్న అనంతరం చికిత్స లేదా  ఐసోలేషన్ పూర్తయిన 28 రోజుల తరువాత, 50 కిలోల కంటే ఎక్కువ బరువుతో 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు వారి రక్త ప్లాస్మాను దానం చేయడానికి అర్హులు.  రక్తదానానికి వారి అర్హతను బ్లడ్ బ్యాంకు అంచనా వేస్తుంది. వారు దానం చేయడానికి ముందు వారి రక్తంలో కోవిడ్-19ను ఎదుర్కొనే యాంటీబాడీ స్థాయిలను కూడా బ్లడ్ బ్యాంకు తనిఖీ చేస్తుంది.  కోవిడ్ నుండి బయటపడినవారి రక్తంలో సాధారణంగా అటువంటి ప్రతిరోధకాలు అధికంగా ఉంటాయి. అవసరం ఉన్న వ్యక్తికి ఇచ్చినప్పుడు, ఈ ప్రతిరోధకాలు రక్తంలో కలిసి, కణజాలాలకు చేరి, వైరస్ ను తటస్తం చేస్తాయి.  ఈ విధంగా ప్లాస్మా ను దానం చేసే ప్రక్రియ ఒకటి నుండి మూడు గంటల్లో పూర్తవుతుంది. అదే రోజున ప్లాస్మాను సేకరించవచ్చు.

*****



(Release ID: 1639870) Visitor Counter : 281