సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ఐ.ఎ.ఎస్. సివిల్ జాబితా-2020 మరియు దాని ఈ-వెర్షన్ను విడుదల చేసిన - కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 25 JUN 2020 4:28PM by PIB Hyderabad

కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డి.ఓ.ఎన్.ఈ.ఆర్) శాఖ ఇండిపెండెంట్ ఛార్జ్, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా పిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ఐ.ఎ.ఎస్. సివిల్ లిస్ట్ -2020 మరియు దాని ఇ-వెర్షన్‌ను ఇక్కడ ప్రారంభించారు.  అందుబాటులో ఉన్న అభ్యర్థుల వ్యక్తిగత వివరాల ఆధారంగా సరైన నియామకానికి సరైన అధికారిని ఎన్నుకోవడంలో డైనమిక్ జాబితా సహాయపడుతుందని, సాధారణ ప్రజల కోసం వివిధ పోస్టులను నిర్వహించే ఈ అధికారుల సమాచారమే కీలక వనరు అని ఆయన అన్నారు.

 

ఇది ఐ.ఏ.ఎస్. సివిల్ జాబితా యొక్క 65 వ ఎడిషన్ మరియు అన్ని రాష్ట్రాలకు చెందిన క్యాడర్ ఐ.ఏ.ఎస్. అధికారుల ఫొటోలతో కూడిన  2వ ఈ-సివిల్ జాబితా.  ఈ జాబితాలో ఐ.ఏ.ఎస్. అధికారుల గురించి,  ఏ బ్యాచ్, ఏ  రాష్ట్రానికి చెందిన క్యాడర్ , ప్రస్తుత పోస్టింగ్, పే అండ్ అలవెన్సులు, విద్య మరియు  పదవీ విరమణ వంటి పూర్తి సమాచారం కూడా ఉంది.

 

ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 5-6 సంవత్సరాల్లో డి.ఓ.పి.టి. కి ఇచ్చిన ప్రోత్సాహంతో, సాధారణ ప్రజా ప్రయోజనాల కోసం అనేక ఆవిష్కరణలు, సంస్కరణలు వచ్చాయని అన్నారు.  2014 మే నుండి ప్రభుత్వం తీసుకున్న అనేక "అవుట్ ఆఫ్ బాక్స్" నిర్ణయాలను ప్రస్తావిస్తూ, గెజిటెడ్ అధికారి ధృవీకరించిన పత్రాలను సమర్పించడాన్ని, స్వీయ-ధృవీకరణతో భర్తీ చేయడం, ఐ.ఏ.ఎస్. లు తమ ఉద్యోగం ప్రారంభంలో సహాయ కార్యదర్శులుగా మూడు నెలలు కేంద్ర ప్రభుత్వ పనితీరును గమనించడం వంటి పాత పద్ధతిని తొలగించడం, డి.ఏ.ఆర్.పి.జి.కి చెందిన ప్రధానమంత్రి ప్రతిభా పురస్కారాల ప్రదానం వంటివి విప్లవాత్మకమైన నిర్ణయాలని ఆయన పేర్కొన్నారు.

 

జాతీయ నియామక ఏజెన్సీ (ఎన్.ఆర్.ఏ.) ని స్థాపించే ప్రతిపాదన, దాదాపు చివరి దశకు చేరుకుందనీ, ఇది ఆచరణలోకి వస్తే, అభ్యర్థులకు ఒక స్థాయిని కలగజేసేదిగా దేశ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నమోదు అవుతుందని మంత్రి అభివర్ణించారు.  నాన్-గెజిటెడ్ ఉద్యోగాల్లో నియామకం కోసం ప్రతి జిల్లాలో  ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసి కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ ఉమ్మడి అర్హత పరీక్షను ఎన్.‌ఆర్.‌ఏ. నిర్వహిస్తుంది.  కోవిడ్-19 ను పరిష్కరించే ఫ్రంట్‌లైన్ కార్మికుల శిక్షణ అవసరాలకు అనుగుణంగా ఐ.జి.ఓ.టి. లో  25 లక్షల మంది అధికారులు తమ పేర్లు నమోదు చేసుకోవడం పట్ల కూడా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.  కరోనా వారియర్‌గా ఐ.ఏ.ఎస్. అధికారికి శిక్షణ ఇవ్వడానికి ఈ చర్య ఎంతగానో సహాయపడుతుందని ఆయన నొక్కి చెప్పారు.  అదేవిధంగా, కోవిడ్ కి సంబంధించి 50 వేల కు పైగా ప్రజా ఫిర్యాదులను  గ్రీవెన్స్ సెల్ స్వీకరించింది. ఇది త్వరలో లక్ష మార్కును తాకనుంది. ఈ ఫిర్యాదులను ఒక్కొక్కటీ 1.4 రోజుల వ్యవధిలో పరిష్కరించడం జరిగింది.  ఈ సంస్కరణలు, చర్యలు అంతిమంగా సులభతరమైన పరిపాలనతో, సులభతరమైన జీవనానికి దారి తీస్తాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

******

 



(Release ID: 1634359) Visitor Counter : 219