అంతరిక్ష విభాగం

అధిక నాణ్యత, తక్కువ ఖర్చుతో కూడుకున్న ఫేస్ మాస్క్ ను బార్క్ అభివృద్ధి చేసింది : డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 13 JUN 2020 8:42PM by PIB Hyderabad

అణు ఇంధన శాఖ కు అనుబంధంగా ముంబాయిలో ఉన్న భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) అధిక నాణ్యత గల ఫేస్ మాస్క్ ను అభివృద్ధి చేసింది. హెపా ఫిల్టర్ ను ఉపయోగించి అభివృద్ధి చేసిన ఈ మాస్క్ తక్కువ ఖర్చు తో తయారౌతుందని కూడా భావిస్తున్నారు.

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డి.ఓ.ఎన్.ఈ.ఆర్.),సహాయమంత్రి (ఇండిపెండెంట్ ఛార్జి), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా పిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, గత ఏడాది కాలంలో తన మంత్రిత్వ శాఖలు సాధించిన కొన్ని ప్రధాన విజయాల గురించి తెలియజేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. 

అణు ఇంధన శాఖ కింద ఆర్ & డి సంస్థలు, విద్యాసంస్థలు, ఎయిడెడ్ ఆసుపత్రులు, ప్రభుత్వ రంగ సంస్థలు మొదలైన 30 యూనిట్లు ఉన్నాయి.  ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ హోమి జె. భాభా స్థాపించిన ముంబై లోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కూడా అణుఇంధన శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. 

గత సంవత్సర కాలంలో, అణు ఇంధన శాఖ చేసిన కొన్ని ప్రధాన కార్యకలాపాలు మరియు కార్యక్రమాల గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావిస్తూ, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సమాజానికి మద్దతుగా సేవలందిస్తున్న శాస్త్రజ్ఞులను అభినందించారు.  అటామిక్ / న్యూక్లియర్ శాస్త్రవేత్తలు అధిక నాణ్యత గల ఫేస్ మాస్క్‌తో పాటు, వ్యక్తిగత రక్షణ పరికరాలు (పి.పి.ఈ.లు) ను రేడియేషన్ స్టెరిలైజేషన్ తరువాత తిరిగి ఉపయోగించే విధంగా  ప్రోటోకాల్‌ను కూడా అభివృద్ధి చేశారని ఆయన తెలియజేశారు.  అయితే, ఇది ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు. 

ఆర్.టి.పి.సి.ఆర్. టెస్టింగ్ కిట్ ‌లను అభివృద్ధి చేయడానికి కొత్త ప్రాంతాలను గుర్తించినట్లు కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.  ఈ కిట్ ధర తక్కువగా ఉండడంతో పాటు ఫలితాలను వేగంగా విశ్లేషించగలదని ఆయన చెప్పారు. 

గత ఆరు సంవత్సరాల కాలంలో అణుశక్తి శాఖకు అందించిన ప్రత్యేక ప్రేరణ మరియు బడ్జెట్ కేటాయింపులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కి డాక్టర్ జితేంద్ర సింగ్ ధన్యవాదములు తెలియజేశారు.  ప్రధానమంత్రి ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ గురించి ఆయన మాట్లాడుతూ, ఇందులో, వివిధ రకాల పండ్లు మరియు కూరగాయలు ఎక్కువ రోజులు తాజా గా ఉంచడానికి ఉపయోగపడే, రేడియేషన్ ప్లాంట్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే పధకం కూడా ఉందని చెప్పారు.  

ఇప్పటివరకు దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలకు లేదా మహారాష్ట్ర వంటి పశ్చిమ ప్రాంతాలకు మాత్రమే పరిమితంగా ఉన్న అణుశక్తి కార్యకలాపాలు, ప్రస్తుతం  దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించడం, మోడీ ప్రభుత్వంలో సాధించిన ఒక ముఖ్యమైన విజయమని,  డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి అణు కర్మాగారాన్ని ఢిల్లీ కి చాలా దగ్గరగా ఉన్న గోరఖ్‌పూర్ అనే ప్రదేశంలో ఏర్పాటు చేసే పని జరుగుతోందని ఆయన తెలియజేశారు.

<><><>



(Release ID: 1631488) Visitor Counter : 268