మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి మరియు గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఉమ్మడిగా పట్టణ స్థానిక సంస్థలలో ఇంటర్న్ షిప్ కార్యక్రమం 'తులిప్' ను ఢిల్లీలో గురువారం ప్రారంభించారు.

Posted On: 04 JUN 2020 3:45PM by PIB Hyderabad

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి శ్రీ రమేష్ పొక్రియాల్ 'నిషాంక్'  మరియు గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (ఇంచార్జి) శ్రీ హర్దీప్ ఎస్. పూరి ఉమ్మడిగా దేశంలో మొట్టమొదటిసారిగా  'పట్టణాల అధ్యనానికి సంబంధించిన ఇంటర్న్ షిప్ కార్యక్రమం (తులిప్)' ను గురువారం ఢిల్లీలో ప్రారంభించారు.   కాలేజీ నుంచి కొత్తగా పట్టభద్రులై బయటికి వచ్చిన వారికి  అన్ని పట్టణ స్థానిక సంస్థల (యు ఎల్ బి)లో  మరియు స్మార్ట్ సిటీలలో  మలిదశ శిక్షణ (ఇంటర్న్ షిప్) పొందే అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం.    తద్వారా కొత్త పట్టభద్రులకు  పట్టణాల గురించి అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది.  ఈ సందర్బంగా ఈ కార్యక్రమం గురించిన పోర్టల్ ను కూడా ప్రారంభించారు.   ఈ సందర్బంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి అమిత్ ఖరే,   గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్రా ఏఐసిటీఇ చైర్మన్ శ్రీ అనిల్ సహస్రబుద్ధ మరియు రెండు మంత్రిత్వ శాఖలు, ఏఐసిటీఇ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.  
https://twitter.com/DrRPNishank/status/1268433318833319936

ఈ సందర్బంగా శ్రీ పొక్రియాల్ మాట్లాడుతూ ఈ కొత్త ప్రయత్నం జాతి నిర్మాణంలో యువత శక్తి సామర్ధ్యాలను వినియోగంలోకి తేవాలన్న   ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భావనకు అనుగుణంగా ఉందని అన్నారు.   నవ భారత నిర్మాణానికి పునాదిగా 'తులిప్' కార్యక్రమం కీలకమైన పాత్ర పోషించగలదని మంత్రి అన్నారు.  ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవాన్ని కలుగజేయడమే కాక పట్టణ స్థానిక సంస్థలు, స్మార్ట్ సిటీల పనిలో కొత్త భావనలను పాదుకొలిపి వినూత్న కల్పనల సృష్టికి దారితీయగలదని ఆయన అన్నారు.  
యువతను అభినందిస్తూ,  మన దేశంలో తెలివితేటలకు కొదువ లేదని అనేక  బహుళజాతి సంస్థల  సి ఈ ఓలు / అధిపతులుగా భారత సంతతి వారు ఉన్నారని అన్నారు.  మన విద్యార్థుల సామర్ధ్యం స్మార్ట్ ఇండియా హాకెథాన్ వంటి కార్యక్రమాలలో బయట పడిందని మంత్రి ప్రముఖంగా పేర్కొన్నారు. తులిప్ కార్యక్రమ ద్వారా  దేశవ్యాప్తంగా ఉన్న 4400 పట్టణ స్థానిక సంస్థలలో,  స్మార్ట్ సిటీలలో ఇంటర్న్ షిప్ అవకాశాలు  లభిస్తాయి.

ఈ కార్యక్రమం గురించి వివరిస్తూ మొదటి సంవత్సరంలోనే దాదాపు 25వేల మంది కొత్త పట్టభద్రులకు ఇంటర్న్ షిప్ అవకాశం  లభించగలదని గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (ఇంచార్జి) శ్రీ హర్దీప్ ఎస్. పూరి  వెల్లడించారు.   పట్టణాలలో ఉండే సమస్యలపై అవగాహన,  స్థానిక సంస్థలు చేసే పనుల గురించిన అనుభవం  ఇంటర్నీ లకు  వస్తుందని,  ఈ అనుభవం వారికి మంచి ఉపాధి అవకాశాలు పొందడానికి తోడ్పడగలదని అన్నారు.  

కేంద్ర ప్రభుత్వ 2020-21 వార్షిక బడ్జెట్ లో  ఆర్ధిక మంత్రి శ్రీమతి  నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన తరువాత తులిప్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.  కొత్తగా ఇంజనీరింగ్ పట్టా పొందిన వారికి పట్టణ స్థానిక సంస్థలు ఒక ఏడాది వరకు ఇంటర్నీలుగా ఉండే అవకాశం కల్పిస్తాయని మంత్రి తమ బడ్జెట్  ప్రసంగంలో తెలిపారు.

ఈ కార్యక్రమం అమలు చేయడానికి గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఏఐసిటీఇ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.   ఇది అయిదేళ్ల పాటు అమలులో ఉంటుంది.  

బి. టెక్, .బి. ఆర్కిటెక్చర్,  బి. ప్లాన్,  బి.ఎస్సీ  మొదలగు డిగ్రీలలో దేనిలోనైనా  పట్టభద్రులైన వారు డిగ్రీ పూర్తయిన 18 నెలల లోపల ఈ ఇంటర్న్ షిప్ లో చేరడానికి https://internship.aicteindia.org/module_ulb/Dashboard/TulipMain/index.php లో దరఖాస్తు చేయవచ్చు.



(Release ID: 1629506) Visitor Counter : 1786