రైల్వే మంత్రిత్వ శాఖ

శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్ల ద్వారా 20 రోజుల్లో 23.5 లక్షల మందికి పైగా ప్రయాణం

20 మే, 2020 (ఉదయం 10 గం.‌) వరకు 1773 రైళ్లను నడిపిన రైల్వే శాఖ
ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 205 రైళ్లు నడిపి, 2.5 లక్షల మందికిపైగా తరలింపు

Posted On: 20 MAY 2020 3:34PM by PIB Hyderabad

లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, యాత్రికులు, విద్యార్థులు, ఇతరులను శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్ల ద్వారా స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంగీకరించిన నేపథ్యంలో.., మే 1, 2020 నుంచి రైల్వే శాఖ 'శ్రామిక్‌ స్పెషల్‌' రైళ్లను నడుపుతోంది. 

    20 మే, 2020 (ఉదయం 10 గం.‌) వరకు 1773 శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య రైల్వే శాఖ నడిపింది. ఈ  రైళ్ల ద్వారా ఈ 20 రోజుల్లో 23.5 లక్షల మందికిపైగా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చింది. 

    19 మే, 2020న (మంగళవారం), ఒక్కరోజే రికార్డు స్థాయిలో 205 రైళ్లను రైల్వే శాఖ నడిపింది. వీటిద్వారా 2.5 లక్షలకు పైగా ప్రయాణీకులు వారి స్వస్థలాలకు చేరారు.

    ఆంధ్రప్రదేశ్, బీహార్, చండీగఢ్‌, దిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, జమ్ము&కశ్మీర్‌, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఈ 1773 రైళ్లు ప్రారంభమవుతున్నాయి.

    ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, జమ్ము&కశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ రైళ్లు చేరుతున్నాయి.

    రైళ్లు ఎక్కేముందే ప్రయాణీకులకు కొవిడ్‌ సంబంధిత వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రయాణ సమయంలో అందరికీ ఉచితంగా ఆహారం, తాగునీరు అందిస్తున్నారు.



(Release ID: 1625392) Visitor Counter : 218