రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా కోవిడ్-19 లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ, రైతు సమాజానికి సమృద్ధిగా ఎరువులు సరఫరా చేయడంలో నూరు శాతం సామర్ధ్యంతో పనిచేస్తున్న - జాతీయ ఎరువుల సంస్థ - ఎన్.ఎఫ్.ఎల్.

రైతులకు కొరత లేకుండా యూరియా ఎరువులను అందుబాటులో ఉంచుతున్న - ఎన్.ఎఫ్.ఎల్.

Posted On: 14 APR 2020 3:31PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ లోని ఎరువుల విభాగంలో ప్రముఖ ఎరువుల కంపెనీ, జాతీయ ఎరువుల సంస్థ (ఎన్.ఎఫ్.ఎల్.) దేశంలో కోవిడ్-19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ రైతు సమాజానికి సమృద్ధిగా ఎరువులు సరఫరా అయ్యే విధంగా కృషి చేస్తోంది. 

నంగల్, బతిండా, పానిపట్ తో పాటు విజయపూర్ లోని రెండు యూనిట్లు పూర్తి స్థాయిలో ఉత్పత్తి పనిలో నిమగ్నమై ఉన్నాయని ఎన్.ఎఫ్.ఎల్. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మనోజ్ మిశ్రా తెలియజేశారు.  ఈ ఐదు యూనిట్లలో ప్రతీ రోజూ 11 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల ఉత్పత్తి జరుగుతుందనీ, వాటిని క్రమ తప్పకుండా మార్కెట్ కి పంపుతున్నామనీ ఆయన చెప్పారు. 

ఇటువంటి క్లిష్ట సమయంలో కూడా ఈ యూనిట్లలో పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించి, ముఖ్యంగా, దేశంలోని రైతు సమాజానికి ప్రభుత్వం ఇచ్చిన భరోసాను నెరవేర్చే దిశగా ఎన్.ఎఫ్.ఎల్. చేస్తున్న కృషి ఒక విజయ గాథగా చరిత్రకెక్కనుంది.   

భారత ప్రభుత్వం దేశంలోని ఎరువుల కర్మాగారాల్లో  ఉత్పత్తి కొనసాగించడానికి నిత్యావసర వస్తువుల చట్టం కింద అనుమతినిచ్చింది. దీనివల్ల లాక్ డౌన్ ప్రభావం వ్యవసాయ రంగంపై పడకుండా వచ్చే ఖరీఫ్ పంట కాలానికి సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉండడానికి అవకాశం కలిగింది. 

 

 

 ఈ యూనిట్లలో ఎరువులు లారీల్లో ఎక్కించడం, దింపడం, రవాణా, పంపిణీ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నప్పటికీ, కోవిడ్-19 నిబంధనల విషయంలో ఎటువంటి రాజీ పడకుండా, జాగ్రత్తలన్నీ పాటించడం జరుగుతోంది.  కోవిడ్-19 వ్యాప్తి ని అరికట్టేందుకు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా అమలయ్యేలా చూసేందుకు అన్ని యూనిట్లలో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని నియమించడం జరిగింది.  ఈ కంపెనీల ప్రాంగణాల్లో పనిచేసే కార్మికులు, ఇతర సిబ్బంది అందరికీ మాస్కులు అందజేశారు.  వారు తరచుగా చేతులు కడుక్కోడానికి వీలుగా ఏర్పాట్లు కూడా చేశారు. 

ఎన్.ఎఫ్.ఎల్. సంస్థ మరియు ఉద్యోగులు కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సహకారం అందిస్తున్నారు. అవసరమైన వారికి ఆహారం, మందులు వంటి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు.  ప్రధానమంత్రి కెర్స్ నిధికి వారు ఒక నెల వేతనాన్ని కూడా విరాళంగా అందజేశారు. 

*****



(Release ID: 1614393) Visitor Counter : 145