రైల్వే మంత్రిత్వ శాఖ

దిగ్బంధం తర్వాత తొలి 2వారాల్లో రైల్వే సిబ్బందికి 2.5 లక్షల కాల్స్‌

138, 139 హెల్ప్‌లైన్లతోపాటు సామాజిక మాధ్యమాలు, మెయిల్స్‌
1.85 లక్షల కాల్స్‌కు ప్రత్యక్ష స్పందన; హెల్ప్‌లైన్లలో రియల్‌టైమ్‌ రెస్పాన్స్‌
నేషనల్‌ రైల్‌ మదద్‌ హెల్ప్‌లైన్‌ 139, ప్రాంతీయ భాషల్లో 138ద్వారా జవాబులు

Posted On: 11 APR 2020 2:54PM by PIB Hyderabad

జాతీయ దిగ్బంధం నేపథ్యంలో ప్రయాణ, రవాణా కార్యకలాపాలకు సంబంధించి ప్రయాణికులు, ఇతర పౌరుల సందేహాల, సమస్యల నివృత్తికోసం భారత రైల్వేశాఖ సహాయకేంద్ర సదుపాయాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు తొలి రెండు వారాల్లోనే భారీ ఎత్తున 2,05,000 కాల్స్‌కు రైల్వే సిబ్బంది ప్రతిస్పందించారు. వీటిలో 90 శాతానికి (1,85,000కు) పైగా కాల్స్‌కు నేరుగా జవాబివ్వగా, మిగిలినవాటికి 24 గంటల హెల్ప్‌ లైన్‌ నంబర్లు 139, 138 ద్వారా ప్రజలకు సమాధానాలు లభించాయి. కాగా, సహాయకేంద్రాల కార్యకలాపాలను డైరెక్టర్‌ స్థాయి అధికారులు 24 గంటలూ పర్యవేక్షిస్తూ వచ్చారు. ఇక తొలి రెండువారాల్లో రైల్‌ మదద్‌ హెల్ప్‌ లైన్‌ 139ద్వారా 1,40,000కుపైగా కాల్స్‌కు వ్యక్తిగతంగా సిబ్బంది జవాబిచ్చారు. మిగిలినవాటికి ఐవీఆర్‌ఎస్‌ సదుపాయంద్వారా స్పందన లభించింది. ఈ కాల్స్‌లో అధికశాతం రైళ్లను తిరిగి ఎప్పటినుంచి నడుపుతారు? లేదా టికెట్ల సొమ్ము వాపసు ప్రక్రియలకు సంబంధించినవే. అలాగే ఈ పరీక్షా సమయంలో బోగీలను ఆస్పత్రులుగా మార్చడం, నిత్యావసరాల నిరంతర రవాణా, పేదలకు ఆహార ప్యాకెట్ల పంపిణీ, వ్యక్తిగత రక్షణ సామగ్రి తయారీ, వ్యాగన్ల సరుకు స్వీకరణలో ఆలస్య రుసుము రద్దు తదితర రూపాల్లో రైల్వేల కృషిపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తాయి. మరోవైపు 138 నంబరుద్వారా కాల్స్‌... సమీపంలోని రైల్వే డివిజనల్‌ కంట్రోల్‌ కార్యాలయాలకు వెళ్లేవి కాగా, అక్కడి సిబ్బంది వాటికి జవాబిచ్చేవారు. మొత్తంమీద ప్రయాణికుల, వాణిజ్య ఖాతాదారుల సంతృప్తి మేరకు సేవలందించడంలో రైల్వేశాఖ సంపూర్ణంగా విజయవంతమైంది.

*****



(Release ID: 1613308) Visitor Counter : 177