గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పట్టణ రూపాంతరీకరణ గడచిన నాలుగేళ్లలో (25 జూన్ 2015 నుంచి 25 జూన్ 2019 మధ్య) ఘనమైన స్థాయిలో పురోగమించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి (పట్టణ) ఆవాస్ యోజన (PMAY(U), అమృత్ (AMRUT-అటల్ మిషన్ ఫర్ రెజూవినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‘ఫర్మేషన్), అత్యాధునిక నగరాల కార్యక్రమం (SCM) వంటి ప్రతిష్ఠాత్మక పథకాలు, కార్యక్రమాలను కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేసింది. ఈ మూడు పథకాలు, కార్యక్రమాలలో మొత్తం రూ.8 లక్షల కోట్లమేర పెట్టుబడులు పెట్టింది.
పీఎంఏవై (అర్బన్) కింద 81 లక్షలకుపైగా ఇళ్లు మంజూరు చేయగా, 48 లక్షల ఇళ్లు ప్రస్తుతం వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. మరో 26 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి, లబ్ధిదారులకు అప్పగించారు. ఇంకొక 13 లక్షల ఇళ్లను కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు. ఇళ్లను మహిళల పేరిట లేక సంయుక్త యాజమాన్యం కింద అప్పగిస్తుండగా, PMAYలో రాయితీతో కూడిన రుణ పథకం (CLSS)కింద 6.32 లక్షల మందికిపైగా వ్యక్తులు లబ్ధిపొందారు.
అమృత్ కింద రూ.64వేల కోట్లతో చేపట్టిన 4,910 ప్రాజెక్టులు పూర్తి/అమలు దశలో ఉన్నాయి. మొత్తం 62 లక్షలకుపైగా పాత వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులు అమర్చారు. మొత్తం 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనివిసహా 1,705 పట్టణ స్థానిక సంస్థలలో ఆన్‘లైన్ నిర్మాణ అనుమతుల విధానం (OBPS)అమలుద్వారా పౌరుల జీవన సౌలభ్య కల్పన లక్ష్యసాధన దిశగా ముందడుగు పడింది.
మొత్తం 353 నగరాల్లో విద్యుత్ పొదుపు పంపుల ఏర్పాటు పూర్తయింది- అలాగే 467 అమృత్ నగరాలకు క్రెడిట్ ప్రదానం ప్రకియ పూర్తయింది. వీటిలో 163 నగరాలకు పెట్టుబడుల స్వీకరణ స్థాయి రేటింగ్ ఇవ్వబడింది. పురపాలక బాండ్ల జారీద్వారా 8 నగరాల్లో దాదాపు రూ.3,400 కోట్ల న
Posted On:
25 JUN 2019 3:06PM by PIB Hyderabad
కేంద్ర గృహనిర్మాణ-పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గడచిన నాలుగేళ్లలో చేపట్టిన వివిధ ప్రతిష్ఠాత్మక పథకాలు, కార్యక్రమాలవల్ల దేశంలో పట్టణ రూపాంతరీకరణ ఘనంగా పురోగమిస్తోంది. ప్రధానమంత్రి (పట్టణ) ఆవాస్ యోజన (PMAY(U), అమృత్ (AMRUT-అటల్ మిషన్ ఫర్ రెజూవినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‘ఫర్మేషన్), అత్యాధునిక నగరాల కార్యక్రమం (SCM) వంటి పథకాలు, కార్యక్రమాలు కేవలం దేశ పట్టణ స్వరూపాన్ని రూపాంతరీకరించడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యానికి భరోసా ఇస్తున్నాయి. దేశంలో 2004-14 మధ్య పట్టణ పునరుత్తేజానికి మొత్తం రూ.1.57 లక్షల కోట్లు మాత్రమే వెచ్చించగా- దానితో పోలిస్తే 2014-19 మధ్య కేవలం ఐదేళ్లలో ప్రభుత్వం రూ.10.31 లక్షల కోట్లు ఖర్చు చేసింది. శాతంరీత్యా చూస్తే ఇది ఏకంగా 554 శాతం అధికమన్న మాట! ఇక ప్రధానమంత్రి (పట్టణ) ఆవాస్ యోజన, అమృత్, అత్యాధునిక నగరాల కార్యక్రమాలకు దాదాపు రూ.8 లక్షల కోట్లు వెచ్చిస్తోంది. అంతేకాకుండా ఈ పథకాలు, కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరు గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు నిర్దేశించిన లక్ష్యాలు, వ్యవధికన్నా ఎంతో ముందుండటం మరింత విశేషం. రాబోయే సంవత్సరాల్లో కూడా పట్టణ రూపాంతరీకరణ, దాని ప్రభావంపై ఇదే విధమైన శ్రద్ధ కొనసాగనుంది.
ప్రధానమంత్రి (పట్టణ) ఆవాస్ యోజన కింద మొత్తం రూ.4.83 లక్షల కోట్ల పెట్టుబడితో 81 లక్షల ఇళ్లు మంజూరు చేయబడ్డాయి. దీనివల్ల దేశంలోని పట్టణ పేదల్లో అత్యధిక శాతానికి గూడు కల్పించాలన్న లక్ష్యం నెరవేరనుంది. మంజూరైనవాటిలో సుమారు 48 లక్షల ఇళ్ల నిర్మాణ ప్రగతి వివిధ దశల్లో ఉంది. మరో 26 లక్షల ఇళ్ల నిర్మాణం ముగియగా, లబ్ధిదారులకు అప్పగింత కూడా పూర్తయింది. దేశంలో అందరికీ 2022నాటికి గృహవసతి కల్పించడంపై లక్ష్యంరీత్యా, కాలవ్యవధి రీత్యా పనుల ప్రగతి నిర్దేశించినదానికన్నా ఎంతో ముందంజలో ఉంది. కాగా, 13 లక్షలకుపైగా ఇళ్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో నిర్మించడం విశేషం. ఈ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం వాటా కింద రూ.1.26 లక్షల కోట్లకు హామీ ఇవ్వగా, ఇందులో ఇప్పటికే రూ.51వేల కోట్లకుపైగా నిధులు విడుదల చేయడం పూర్తయింది. కాగా, ప్రధానమంత్రి (పట్టణ) ఆవాస్ యోజన కింద ఇళ్లను మహిళల పేరిట లేదా సంయుక్త యాజమాన్యం కింద కేటాయించడం మహిళా సాధికారత కల్పనకు ఒక ప్రమాణంగా పరిగణించవచ్చు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగమైన రాయితీతో కూడిన రుణ పథకం (CLSS) కింద రూ.18 లక్షల వార్షికాదాయంగల మధ్యాదాయ వర్గాల కుటుంబాలకు తొలిసారి ఇల్లు కొనుగోలు కోసం రుణం ఇవ్వబడుతోంది. దీంతోపాటు ఈ రుణం పొందడానికి ఇంటిలోపలి స్థలం పరిమితిని 200 చదరపు మీటర్లకు పెంచారు. ఈ పథకం కింద 2005-19 మధ్యకాలంలో 6.32 లక్షలమందికిపైగా వ్యక్తులు లబ్ధిపొందారు.
అటల్ పట్టణ రూపాంతరీకరణ-పునరుత్తేజ పథకం (అమృత్) కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో సంస్కరణల కార్యక్రమాల అమలుకు కేంద్రం ప్రోత్సాహకాలను అందిస్తుంది. సార్వత్రిక నీటి సరఫరా, మురుగుపారుదల నెట్‘వర్క్ అభివృద్ధి, దివ్యాగులు/పిల్లల కోసం పచ్చదనం/పార్కుల అభివృద్ధి, వర్షపునీటి పారుదల సదుపాయం మెరుగు, మోటారురహిత పట్టణ రవాణా పథకాలు ఇందులో భాగంగా ఉంటాయి. ఇందుకు అనుగుణంగా అమృత్ కింద రాష్ట్రాలు ప్రతిపాదించిన రూ.77,640 కోట్ల ప్రణాళికలను కేంద్రం ఆమోదించింది. ఈ మేరకు రూ.39,011 కోట్ల విలువైన నీటి సరఫరా పథకాలు; రూ.32,456 కోట్ల విలువైన మురుగుపారుదల-సెప్టిక్ ట్యాంకుల నిర్వహణ పథకాలు; రూ.2,969 కోట్ల విలువైన వర్షపునీటి పారుదల సదుపాయం మెరుగుదల; రూ.1,436 కోట్ల విలువైన మోటారురహిత పట్టణ రవాణా; రూ.1,768 కోట్ల విలువైన హరిత స్థలాలు/పార్కుల అభివృద్ధి పథకాలకు ఆమోదం లభించింది. ఈ పథకాలన్నిటికీ సంబంధించి రూ.65వేల కోట్ల విలువైన 4,910కిపైగా ప్రాజెక్టులలో కొన్ని పూర్తికాగా, మరికొన్ని ప్రగతి దశలో ఉన్నాయి. ఈ వినూత్న పథకాలు, కార్యక్రమాలద్వారా 22 కోట్లకుపైగా పట్టణ ప్రజానీకానికి లబ్ధి చేకూరింది. ఇక 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనివిసహా 1,705 పట్టణ స్థానిక సంస్థలలో ఆన్‘లైన్ నిర్మాణ అనుమతుల విధానం (OBPS)అమలుద్వారా పౌరుల జీవన సౌలభ్య కల్పన లక్ష్యసాధన దిశగా ముందడుగు పడింది. దీంతోపాటు 62 లక్షలకుపైగా పాత వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులు అమర్చారు.
నీటికొరత నుంచి నీటి భద్రత దిశగా ముందడుగు వేసేవిధంగా రూ.33,900 కోట్ల విలువైన 1,132 పథకాలు అమలవుతున్నాయి. వీటికింద ఇప్పటివరకూ 58 లక్షల కొళాయి కనెక్షన్లు ఇవ్వగా, మరో 81 లక్షల కనెక్షన్లు ఇవ్వనున్నారు. మొత్తంమీద ఈ కార్యక్రమం పూర్తిగా అమలయ్యే సమయానికి ప్రతి ఇంటికీ నీటి సరఫరా సదుపాయం సమకూరుతుంది. ఇక వ్యర్థ జలశుద్ధి-పునరుపయోగానికి సంబంధించి రూ.26,589 కోట్ల విలువైన 622 మురుగునీటి శుద్ధి-సెప్టిక్ నిర్వహణ పథకాలు అమలయ్యే దశలో ఉన్నాయి. అంతేకాకుండా 37 లక్షల మురుగుపారుదల కనెక్షన్లు ఇవ్వగా, మరో 108 లక్షల కనెక్షన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తికానున్నాయి. ఆ మేరకు కార్యక్రమ అమలు పూర్తయ్యేనాటికి మురుగుపారుదల వసతి కల్పన 31 శాతం నుంచి 62 శాతానికి పెరగనుంది. ఆరోగ్యకర జీవనశైలి కోసం ఉద్దేశించిన హరిత స్థలాలకు సంబంధించి రూ.593 కోట్ల విలువైన 1,048 పార్కుల అభివృద్ధి పూర్తికాగా, రూ.1,004 కోట్ల వ్యయంతో మరో 1,356 పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. వీటన్నిటిలోనూ మహిళలతోపాటు దివ్యాంగులు, పిల్లలకు తగిన ఏర్పాట్లు ఉంటాయి.
దేశంలోని 353 నగరాల్లో ఇంధన పొదుపు పంపుల ఏర్పాటు పూర్తికాగా, ఈ కార్యక్రమం కింద 11,000 పంపులను మార్చాలని గుర్తించారు. ఇక అమృత్ పథకం కింద 467 నగరాలకు క్రెడిట్ ప్రదానం ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. వీటిలో వీటిలో 163 నగరాలకు పెట్టుబడుల స్వీకరణ స్థాయి రేటింగ్ ఇవ్వగా అందులో 36 నగరాలకు A మైనస్ కన్నా ఎగువస్థాయి రేటింగ్ లభించింది. మొత్తం 8 పట్టణ స్థానిక సంస్థలు... పుణె, హైదరాబాద్, భోపాల్, ఇండోర్, విశాఖపట్నం, అమరావతి, అహ్మదాబాద్, సూరత్ నగరపాలక సంస్థలు పురపాలక బాండ్ల జారీద్వారా రూ.3,400 కోట్లు సమీకరించాయి. ఇందుకుగాను ప్రకటించిన ప్రోత్సాహకం కింద ప్రతి రూ.100 కోట్లకు రూ.13 కోట్ల వంతున ఇప్పటివరకూ సదరు పట్టణ స్థానిక సంస్థలకు రూ.181 కోట్లు విడుదలయ్యాయి.
పట్టణ రూపాంతరీకరణ కార్యక్రమాల కింద 25 జూన్ 2015న శ్రీకారం చుట్టుకున్న అత్యాధునిక నగరాల కార్యక్రమం (Smart Cities Mission) అత్యంత ప్రధానమైనది. అత్యాధునిక విధానాలతో పట్టణ మౌలిక వసతుల బలోపేతంసహా పౌరులకు నాణ్యమైన జీవనం ప్రసాదించడం ఈ కార్యక్రమ ధ్యేయం. ఇక 16 సమీకృత కంట్రోల్-కమాండ్ కేంద్రాల (ICCC) ప్రారంభంతో పౌరులకు అనేక రకాల ఆన్‘లైన్ సేవలు అందించే వీలు కలిగింది. ఇవి నేర నిరోధంలో తోడ్పడటంతోపాటు నిఘా మెరుగుపడటమేగాక మహిళలపై నేరాల సంఖ్య తగ్గడంలోనూ దోహదపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో 55 కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ వివిధ దశల్లో కొనసాగుతోంది. ఇప్పటివరకూ మొత్తం 100 ప్రత్యేక ప్రయోజన సంస్థ (SPV)లు ఏర్పాటు కాగా, 100 నగరస్థాయి సలహా వేదిక (CLAF)లు, 100 పథకాల నిర్వహణ సంప్రదింపు సంస్థ (PMC)లు కూడా ఏర్పాటు కావడంతోపాటు రూ.2.05 లక్షల కోట్ల విలువైన 5,151 ప్రాజెక్టులు మంజూరు చేయబడ్డాయి.
● మొత్తం ప్రాజెక్టులలో రూ.1,33,407 కోట్ల విలువైన 3,589 పథకాల (57 శాతం)కు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. వీటిలో రూ.88,898 కోట్ల విలువైన 2,793 ప్రాజెక్టుల (38 శాతం) పనులు ప్రారంభం కాగా, కొన్ని పూర్తయిన నేపథ్యంలో మరికొన్ని పురోగమన దశలో ఉన్నాయి.
● అత్యాధునిక నగరాల కార్యక్రమం కింద 2018 మార్చినుంచి మొదలైన ప్రాజెక్టుల టెండర్ ప్రక్రియ 240 శాతంమేర వేగం పుంజుకుంది.
దేశంలోని 111 నగరాలకు సంబంధించి 13 ఆగస్టు 2018న ‘జీవన సౌలభ్య సూచీ’ ప్రారంభమైంది. పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన వివిధ వినూత్న చర్యలద్వారా పట్టణ పర్యావరణంలో ప్రగతిని ఆయా నగరాలు అంచనా వేసుకునే వీలు కల్పించడమే దీని ధ్యేయం. ఈ చట్రం కింద నాలుగు... ‘వ్యవస్థాగత, సామాజిక, ఆర్థిక, భౌతిక’ స్తంభాల ప్రాతిపదికన ‘జీవన సౌలభ్యం’ అంచనా వేయబడుతుంది. ఈ అంచనాలను బట్టి ఇప్పటిదాకా పుణె, నవీ ముంబై, గ్రేటర్ ముంబై, తిరుపతి, చండీగఢ్ అగ్రస్థానంలో నిలిచాయి.
అత్యాధునిక నగరాల కార్యక్రమం కింద అత్యాధునిక రహదారుల నిర్మాణంద్వారా వినియోగదారులకు సురక్షిత, సౌలభ్య రహదారులు, మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ మేరకు రహదారి ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గడంతోపాటు రవాణా సంబంధిత అభివృద్ధికి ప్రోత్సాహం లభించింది. అంతేకాకుండా ప్రయాణం మధ్యలో ఆగి, తమకు ఇష్టమైన రీతిలో కాలం గడిపే వెసులుబాటు వినియోగదారులకు లభించింది. ఇప్పటిదాకా 25 నగరాల్లో రూ.837 కోట్ల వ్యయంతో అత్యాధునిక రహదారుల నిర్మాణం పూర్తికాగా మరో 59 నగరాల్లో ఇలాంటి రహదారుల నిర్మాణం కొనసాగుతోంది. మరో 36 నగరాల్లో వీటి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మరోవైపు 94 నగరాల్లో రూ.13,000 కోట్ల విలువైన అత్యాధునిక రహదారుల నిర్మాణానికి సంబంధించి కొన్ని నగరాల్లో పనులు ప్రారంభం కాగా, మరికొన్నిటిలో టెండర్ల ప్రక్రియ ముగిసింది.
అత్యాధునిక నగరాల కార్యక్రమం కింద చేపట్టిన అత్యాధునిక సౌరవిద్యుత్ ప్రాజెక్టుల వల్ల సంప్రదాయ విద్యుత్ వాడకంపై ఆధారపడే పరిస్థితి తగ్గింది. ఆ మేరకు 15 నగరాల్లో ఇప్పటిదాకా రూ.113 కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తయ్యాయి. దీనివల్ల 19 మెగావాట్ల సౌరవిద్యుదుత్పాదన సాధ్యమైంది. అలాగే మరో 45 నగరాల్లో రూ.850 కోట్లకుపైగా వ్యయంతో సౌర విద్యుత్ పథకాలు ప్రారంభం కావడంతోపాటు కొన్నిచోట్ల టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇక 10 నగరాల్లో అత్యాధునిక వ్యర్థజలశుద్ధి ప్రాజెక్టులు పూర్తయి పనిచేయడం ప్రారంభించగా 50 నగరాల్లో నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక మరో 24 నగరాల్లో అత్యాధునిక నీటి సరఫరా ప్రాజెక్టులు పూర్తయి పనిచేస్తుండగా, మరో 56 నగరాల్లో వివిధ దశల్లో ఉన్నాయి.
భారత అత్యాధునిక నగరాల సహకార సభ్యత్వ కార్యక్రమం: పట్టణ ప్రణాళిక-రూపకల్పన రంగం సంబంధిత అంశాల విషయంలో 39 మంది యువ వృత్తి నిపుణులు ‘అత్యాధునిక నగర సహకార సభ్యులు’గా ఎంపిక చేయబడ్డారు. వీరు ’విశ్లేషణ, పరిశోధన, పత్రాల తయారీ’లో కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖలోని అత్యాధునిక నగరాల కార్యక్రమ సంచాలకుల కార్యాలయంలో సహాయకులుగా లేదా ఎంపిక చేసిన అత్యాధునిక నగరాల ముఖ్య కార్యనిర్వహణాధికారు (CEO)లుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
జీవన సౌలభ్య సూచీ-2019: జీవన సౌలభ్య సూచీ మెరుగు నేపథ్యంలో దీనికి సరికొత్త రీతిలో జీవన సౌలభ్య సూచీ-2019 ప్రారంభించబడింది. పౌరుల జీవన సౌలభ్య లక్ష్యాలు, ఫలితాలపై మూడు స్తంభాల ప్రాతిపదికన అంచనా వేయడంపై మరింత దృష్టి సారించడమే దీని ధ్యేయం.
భారత పట్టణ పరిశోధనాలయం: కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖలో అత్యాధునిక ‘భారత పట్టణ పరిశోధనాలయం’ పనిచేయడం ప్రారంభించింది. ఇది వివిధ నగరాలతో అనుసంధానమై అక్కడి ప్రత్యక్ష, నమోదిత సమాచార వనరులద్వారా గణాంకాలు సేకరించి వాటిని విశ్లేషించి నగరాలు, విద్యావ్యవస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వాల కోసం లోతైన ఆలోచనలను అందిస్తాయి. ప్రజాభాగస్వామ్యంగల విధాన నిర్ణయాలకు ఇది ఎంతగానో దోహదపడుతుంది.
అత్యాధునిక నగరాల డిజిటల్ చెల్లింపుల పురస్కారాలు-2018: భారత పట్టణవాసుల జీవన సౌలభ్యం మెరుగుదిశగా కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ చేపట్టిన వినూత్న చర్యల్లో భాగంగా ‘‘100 అత్యాధునిక నగరాల్లో 100 రోజుల పోటీ’’లో విజేతలను ప్రోత్సహించేందుకు అత్యాధునిక నగరాల డిజిటల్ చెల్లింపుల పురస్కారాలు-2018 (SCDPA)ని 9 జూలై 2018న ప్రారంభించారు.
దీటైన సుస్థిర, సమగ్ర, వినూత్న ఆవిష్కరణల కోసం నగర పెట్టుబడులపై పోటీ (CITIIS): నగరాల్లో సవాళ్లను దీటైన సుస్థిర, సమగ్ర, వినూత్న ఆవిష్కరణలతో ఎదుర్కొనే లక్ష్యంతో అత్యాధునిక నగరాల కార్యక్రమం కింద ఏఎఫ్‘డి (AFD), ఈయూ (EU), ఎన్ఐయూఏ (NIUA)ల భాగస్వామ్యంతో 2018 జూలైలో ఈ పోటీని ప్రవేశపెట్టారు. దీనికింద 36 అత్యాధునిక నగరాల నుంచి అందిన 67 ప్రతిపాదనలలో 13 పథకాలు 100 మిలియన్ యూరోల పెట్టుబడి పొందడానికి ఎంపికయ్యాయి. తదనుగుణంగా 2019 ఫిబ్రవరి 26న నిర్వహించిన రెండో అత్యాధునిక నగర సీఈవోల శిఖరాగ్ర సదస్సులో పురస్కారాలను అందజేశారు.
****
(Release ID: 1575913)