ప్రధాన మంత్రి కార్యాలయం
దేశవ్యాప్త యువ నూతన ఆవిష్కర్తలు మరియు స్టార్ట్-అప్ ఆంత్రప్రెన్యోర్ లతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించిన ప్రధాన మంత్రి
Posted On:
06 JUN 2018 1:00PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువ నూతన ఆవిష్కర్తలతోను, స్టార్ట్-అప్ ఆంత్రప్రెన్యోర్ లతోను ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించారు. ప్రభుత్వ పథకాలకు చెందిన వేరు వేరు లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి జరుపుతున్న ముఖాముఖి సమావేశాలలో ఇది నాలుగో సమావేశం.
భారతదేశానికి చెందిన యువ ప్రతిభావంతులు ఉద్యోగాలను ఇచ్చే వారుగా తయారు కావడం పట్ల సంతోషించిన ప్రధాన మంత్రి వయస్సు పరంగా ఉన్న సానుకూల అంశాన్ని వినియోగించుకొనేందుకు ప్రభుత్వం కట్టుబడివున్నట్లు చెప్పారు. స్టార్ట్-అప్ రంగంలో రాణించడానికి తగినంత మూలధనం, ధైర్యంతో పాటు ప్రజలతో సంధానం కావడం కూడా అవసరమని కూడా ప్రధాన మంత్రి అన్నారు.
స్టార్ట్-అప్ లు అంటే అవి కేవలం డిజిటల్, ఇంకా సాంకేతిక విజ్ఞాన సంబంధిత నూతన ఆవిష్కరణలకు సంబంధించినవి అనే దశ నుండి పరిస్థితులు మార్పు చెందాయని ప్రధాన మంత్రి వివరించారు. ప్రస్తుతం అనేక రంగాలలో స్టార్ట్-అప్ నవ పారిశ్రామికులు ఎదిగివచ్చారని ఆయన తెలిపారు. 28 రాష్ట్రాలలో, 6 కేంద్ర పాలిత ప్రాంతాలలో మరియు 419 జిల్లాలలో స్టార్ట్-అప్ లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. వీటిలో 44 శాతం స్టార్ట్-అప్ లు రెండో అంచె మరియు మూడో అంచె నగరాలలో నమోదు అయ్యాయి. ఆయా ప్రాంతాలలో స్థానికంగా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం పై స్టార్ట్-అప్ ఇండియా శ్రద్ధ వహిస్తోంది. దీనికి తోడు, 45 శాతం స్టార్ట్-అప్ లు మహిళలు ఏర్పాటు చేసినవే.
ప్రభుత్వం ఆధ్వర్యంలో పేటెంట్ లు మరియు ట్రేడ్ మార్క్ ల దాఖలు ప్రక్రియ ఎంతగా సులభం అయిపోయిందో కూడా శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ఒక ట్రేడ్ మార్క్ కై దరఖాస్తు చేయడానికి అవసరపడే ఫారాల సంఖ్యను ప్రభుత్వం డెభ్భై నాలుగు నుండి ఎనిమిది కి కుదించింది. దీని పర్యవసానంగా మూడు సంవత్సరాలలో ట్రేడ్ మార్క్ ల రిజిస్ట్రేశన్ లలో మూడింతల పెరుగుదల చోటు చేసుకొంది. నమోదైన పేటెంట్ల సంఖ్య సైతం మునుపటి ప్రభుత్వం తో పోలిస్తే మూడింతలు అధికంగా ఉంది.
యువ నవ పారిశ్రామికులతో జరిగిన ముఖాముఖి లో భాగంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, వారు వారి యొక్క స్టార్ట్-అప్ లకు సంబంధించి నిధుల కొరత సమస్యను ఎదుర్కోనక్కర లేకుండా చూడడానికి, నూతన ఆవిష్కారాలకై యువజనులు నడుం బిగించేటట్లు చూడడానికి గాను ప్రభుత్వం 10000 కోట్ల రూపాయలతో ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్’ ను ఏర్పాటు చేసిందని ప్రధాన మంత్రి తెలిపారు. ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్’ ద్వారా 1285 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించనుండడంతో పాటు ఇంతవరకు వెంచర్ ఫండ్ లలో మొత్తం 6980 కోట్ల రూపాయల మేరకు అండదండలను అందించడమైంది.
భారతదేశ స్టార్ట్-అప్ ఇకో సిస్టమ్ ను పటిష్టంగా మలచడం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను గురించి ప్రధాన మంత్రి ఏకరువు పెడుతూ, స్టార్ట్-అప్ లు వాటి ఉత్పత్తులను ప్రభుత్వానికి విక్రయించేందుకు వీలుగా గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ (GEM) ను స్టార్ట్-అప్ ఇండియా పోర్టల్ తో సంధానించినట్లు చెప్పారు. స్టార్ట్-అప్ లకు మూడు సంవత్సరాల పాటు ఆదాయపు పన్ను మినహాయింపును ఇవ్వడమైంది. యువ నవ పారిశ్రామికులు కేవలం స్వీయ ధృవపత్రం సమర్పిస్తే సరిపోయేందుకు అనువుగా ఆరు కార్మిక చట్టాలలోను మరియు మూడు పర్యావరణ సంబంధ చట్టాలలోను మార్పులు చేయడమైంది. స్టార్ట్-అప్ లకు సంబంధించిన యావత్తు సమాచారం నవ పారిశ్రామిలకు అందుబాటులో ఉండేటందుకుగాను స్టార్ట్-అప్ ఇండియా హబ్ పేరుతో ఒక వన్-స్టాప్ డిజిటల్ ప్లాట్ఫారమ్ ను కూడా ప్రభుత్వం ఆరంభించింది.
కార్యక్రమంలో పాలుపంచుకొన్న వారితో శ్రీ నరేంద్ర మోదీ సంభాషిస్తూ, యువజనులలో నూతన ఆవిష్కరణలను మరియు స్పర్ధ ను పెంపొందించడం కోసం ప్రభుత్వం అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్, స్మార్ట్ ఇండియా హ్యాకథన్, ఇంకా అగ్రికకల్చర్ గ్రాండ్ ఛాలెంజ్ ల వంటి వివిధ పోటీలను మొదలు పెట్టినట్లు తెలిపారు. భారతదేశం మరియు సింగపూర్ లకు చెందిన నూతన ఆవిష్కర్తల మధ్య ఒక స్మార్ట్ ఇండియా హ్యాకథన్ ను పోలిన సవాలును నిర్వహించడం గురించి సింగపూర్ ప్రధాని తో తాను చర్చించిన సంగతిని కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు.
భారతదేశంలో నూతన ఆవిష్కారాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకొందని కూడా ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. పరిశోధన మరియు నూతన ఆవిష్కారం.. వీటి పట్ల యువతీ యువకులు దృష్టి సారించేటట్లుగా వారిని ప్రోత్సహించేందుకు దేశమంతటా ఎనిమిది రిసర్చ్ పార్కులను మరియు 2500 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ను నెలకొల్పడం జరిగింది.
రండి, వ్యవసాయ రంగంలో ఎలా పరివర్తనను తీసుకురావచ్చో అనే దిశగా ఆలోచనలు చేయండి అని శ్రీ నరేంద్ర మోదీ అంటూ యువత కు ఆహ్వానం పలికారు. ‘మేక్ ఇన్ ఇండియా’ తో పాటే ‘డిజైన్ ఇన్ ఇండియా’ కూడా అత్యంత అవసరమని ఆయన అన్నారు. యువజనులు నూతన ఆవిష్కారాలను ఆపకుండా కొనసాగించాలని చెప్తూ వారిని ప్రధాన మంత్రి ఉత్సాహపరిచారు. ‘ఇనవేట్ ఆర్ స్టాగ్నేట్’ అనే మంత్రాన్ని ఉపదేశించారు.
స్టార్ట్-అప్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రవేశపెట్టిన వివిధ ప్రభుత్వ పథకాలు కొత్తగా స్టార్ట్-అప్ లను ఏర్పాటు చేయడంలో ఏ మేరకు తోడ్పడ్డాయో యువ నూతన ఆవిష్కర్తలు తమ సంభాషణలో భాగంగా ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వ్యవసాయ రంగ సంబంధిత నూతన ఆవిష్కరణలు మొదలుకొని బ్లాక్ చైన్ టెక్నాలజీ వరకు విస్తృత శ్రేణిలో తాము చేసిన నూతన ఆవిష్కారాలను గురించి నవ పారిశ్రామికులు మారియు నూతన ఆవిష్కర్తలు ప్రధాన మంత్రికి చెప్పుకొచ్చారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లో క్రియాశీలంగా ఉన్న బడి పిల్లలు తమ నూతన ఆవిష్కారాలను ప్రధాన మంత్రి సమక్షంలో వెల్లడించారు. వారి శాస్త్ర విజ్ఞాన సంబంధ ప్రావీణ్యాలను ప్రధాన మంత్రి అభినందిస్తూ, అటువంటి మరిన్ని నూతన ఆవిష్కరణలతో ముందుకు రావాలంటూ వారిని ఉత్సాహపరిచారు.
‘ఇనవేట్ ఇండియా’ ను ఒక సామూహిక ఉద్యమంగా మార్చాలంటూ దేశ ప్రజలకు ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. పౌరులు వారి వారి ఉపాయాలను మరియు నూతన ఆవిష్కారాలను #InnovateIndia ద్వారా వెల్లడి చేయాలని చెప్తూ ఆయన వారిని ఉత్సాహపరిచారు.
****
(Release ID: 1534605)
Visitor Counter : 121