పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
గాంధీనగర్లో ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరం (డబ్ల్యూసీఈఎఫ్) 2026ను ప్రారంభించిన కేంద్ర పర్యావరణశాఖ మంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి
ప్రపంచం కోసం ఆచరణాత్మక సర్క్యులర్ పరిష్కారాలను అభివృద్ధి చేస్తూ వసుధైక కుటుంబం స్ఫూర్తిని డబ్ల్యూసీఈఎఫ్ 2026 ప్రతిబింబించాలి: గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్
మార్చడానికి ముందు మరమ్మతులు, పారేయడం కంటే పునర్వినియోగం, వ్యర్థాలుగా మార్చడం కంటే పునరుద్ధరణకు ప్రాధాన్యం అన్న మన సంప్రదాయాల్లోనే భారతీయ జీవన విధానం: శ్రీ
భూపేందర్ యాదవ్
సర్క్యులర్ ఆర్థిక విధానానికి సహకారమే కీలకం: జ్ఞానం, సాంకేతికత, ఆర్థిక వనరులు, బాధ్యతలు సరిహద్దులు, రంగాలను దాటి పంచుకోవాలి: కేంద్ర పర్యావరణశాఖ మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
15 SEP 2026 12:20PM by PIB Hyderabad
గుజరాత్ సీఎం శ్రీ భూపేంద్రభాయ్ పటేల్తో కలిసి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులశాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ గాంధీనగర్లో నేడు ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరం (డబ్ల్యూసీఈఎఫ్) 2026ను ప్రారంభించారు. ‘ప్రజలు, సమృద్ధి కోసం సర్క్యులర్ ఎకానమీ: పరివర్తన’ అనే ప్రధానాంశంతో సెప్టెంబర్15 నుంచి 18 వరకు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ప్రారంభ కార్యక్రమంలో గుజరాత్ అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పులశాఖ మంత్రి అర్జున్భాయ్ మోధ్వాడియా, గుజరాత్ అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పులశాఖ సహాయ మంత్రి ప్రవీణ్భాయ్ మాలి, భారత్లోని ఫిన్లాండ్ రాయబారి మిక్కో కివికోస్కీ, నెదర్లాండ్స్ ఆర్థిక వ్యవహారాలు, వాతావరణశాఖ సర్క్యులర్ ఎకానమీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మారికే స్పైకర్బోయర్, సిట్రా అధ్యక్షుడు అట్టే జెస్కెలైనెన్తో పాటు కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ ప్రసంగిస్తూ.. దక్షిణాసియాలో డబ్ల్యూసీఈఎఫ్ను నిర్వహించడం ఇదే మొదటిసారి అనీ, ఇది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతతో ప్రపంచ స్థాయిలో భారత్ ఎదుగుతున్న నాయకత్వానికి నిదర్శనమని చెప్పారు. ప్రపంచ సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థకు మిషన్ లైఫ్ బలమైన ఆధారంగా మారుతోందని, ఈ వేదిక ప్రపంచానికి ఉపయోగపడే ఆచరణాత్మక సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ పద్ధతులను ప్రదర్శిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
అభివృద్ధి, పర్యావరణానికి మధ్య సమతుల్యతను పాటిస్తూ పర్యావరణ పరిరక్షణ దిశగా సాగుతున్న గుజరాత్ ప్రయాణాన్ని ముఖ్యమంత్రి వివరించారు. సంప్రదాయ సర్క్యులర్ విధానాలను ప్రస్తావిస్తూ.. సోమనాథ్ ఆలయంలో భక్తులు సమర్పించే కానుకలను పునర్వినియోగ వనరులుగా మార్చి, స్థానిక ప్రజలకు జీవనోపాధి కల్పిస్తున్న ఉదాహరణను ఆయన పేర్కొన్నారు. పునర్వినియోగ సంస్కృతి, వ్యర్థాలను సంపదగా మార్చే ఆలోచన భారతీయ సంప్రదాయాల్లో ఎప్పటినుంచో భాగంగా ఉన్నాయని తెలిపారు. ప్రపంచం కోసం ఆచరణాత్మక సర్క్యులర్ పరిష్కారాలను అభివృద్ధి చేస్తూ డబ్ల్యూసీఈఎఫ్ ‘వసుధైక కుటుంబం’ స్ఫూర్తిని ప్రతిబింబించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
భారత్కు సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ అనేది “కొత్త గమ్యం కాదు.. పాత జ్ఞానాన్ని కొత్త కోణంలో చూసే విధానం” అని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులశాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ అన్నారు. పునర్వినియోగం, మరమ్మతులు చేయడం, వనరులను గౌరవించడం వంటి సూత్రాలు దేశ సామాజిక, సాంస్కృతిక జీవన విధానంలో లోతుగా పాతుకుపోయాయని తెలిపారు. ‘‘విధానపరమైన భాషలో ఇప్పుడు ‘సర్క్యులారిటీ’గా పిలుస్తున్న అంశాలు, ఒకప్పుడు భారతీయుల రోజువారీ జీవితంలో సాధారణ ఆలోచనలుగా ఉండేవి. కొత్త వస్తువు కొనడం కంటే మరమ్మతులు చేయడం, పారేయడం కంటే పునర్వినియోగించడం, వ్యర్థాలుగా మార్చడం కంటే వాటి నుంచి ఉపయోగకరమైన వనరులను తిరిగి పొందడం భారతీయ సంప్రదాయాల్లో భాగం’’ అని వివరించారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదని, అభివృద్ధిని మరింత సమర్థవంతంగా వనరులను వినియోగించేలా, స్థిరంగా, సవాళ్లను తట్టుకునేలా మార్చుకునే అవకాశం మన ముందుందని మంత్రి పేర్కొన్నారు. “సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ నిజమైన విజయాన్ని మనం ఎంత వ్యర్థాన్ని రీసైకిల్ చేశామనే దానితో కాకుండా, ఎంత తక్కువ విలువను వృథా కాకుండా కాపాడగలిగామనే దానితో కొలవాలి” అని ఆయన అన్నారు. సర్క్యులర్ భవిష్యత్తు కోసం డబ్ల్యూసీఎఫ్ 2026 భాగస్వామ్యాలను, పరిష్కారాలను రూపొందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో నియంత్రణ సంస్కరణలు, డిజిటల్ నిబంధనల అమలు వ్యవస్థల ద్వారా సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ పయనిస్తోందని కేంద్రం మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా వివిధ రంగాల వ్యర్థాల నిర్వహణ నిబంధనలను బలోపేతం చేయడంతో పాటు విస్తరించిన ఉత్పత్తిదారుల బాధ్యత (ఈపీఆర్) విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి చర్యలు ఉన్నట్లు తెలిపారు. ‘‘ ఒక ఉత్పత్తి ప్రయాణానికి వ్యర్థం ముగింపు దశగా కాకుండా, మరొ వనరుల చక్రానికి ప్రారంభంగా కనిపించాలి’’ అనేదే ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఆగస్టు 2026 నాటికి వివిధ ఈపీఆర్ విధానాల కింద 83,000 కంటే ఎక్కువ మంది తయారీదారులు, 4,802 మంది రీసైకిలర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. నియంత్రణ పరిధిలోని వివిధ రకాల వ్యర్థాల్లో దాదాపు 482.24 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను శుద్ధి చేసినట్లు ఆయన వెల్లడించారు.
కేవలం నిబంధనలు రూపొందించడం ద్వారా మాత్రమే సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థను సాధించలేమని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రజలు వస్తువులను ఎలా వినియోగిస్తారనే అంశం నుంచే సర్క్యులర్ విధానం ప్రారంభం కావాలని అన్నారు. పర్యావరణం కోసం జీవనశైలి కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ.. సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ కేవలం రీసైక్లింగ్ కేంద్రాల వద్ద ప్రారంభం కాదని, మార్కెట్లో వస్తువుల కొనుగోలు, వినియోగం నుంచే మొదలై, ఇళ్లలో కొనసాగి, చివరకు రోజువారీ జీవితంలో ఒక అలవాటుగా మారాలని వివరించారు. సర్క్యులర్ ఆర్థిక విధానం సహజంగానే సహకారంతో కూడుకున్నదని పేర్కొన్న మంత్రి.. ఏ దేశం, సంస్థ లేదా ప్రజలు ఒంటరిగా వనరుల చక్రాన్ని పూర్తిచేయలేవని అన్నారు. జ్ఞానం, సాంకేతికత, ఆర్థిక వనరులు, బాధ్యతలు దేశాల సరిహద్దులు, వివిధ రంగాలను దాటి విస్తరించాల్సిన అసరం ఉందని పేర్కొన్నారు. సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ విషయంలో భారత్ అందిస్తున్న అంతర్జాతీయ సహకారాన్ని ప్రస్తావిస్తూ.. భారత్ జీ20 అధ్యక్షత సమయంలో ప్రారంభించిన వనరుల సమర్థ వినియోగం, సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ పరిశ్రమల కూటమిని (ఆర్ఈసీఈఐసీ) ఉదాహరణగా పేర్కొన్నారు. సుస్థిర జీవనశైలి, పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ, వాతావరణ మార్పులకు అనుగుణంగా మారడం వంటి అంశాలతో పాటు సర్క్యులర్ ఆర్థిక విధానాన్ని కూడా పరస్పరం అనుసంధానమైన ప్రాధాన్య అంశంగా భారత్ బ్రిక్స్ అధ్యక్షతలో చేర్చిందని మంత్రి తెలిపారు.
గుజరాత్ అటవీ, పర్యావరణశాఖ మంత్రి అర్జున్భాయ్ మోధ్వాడియా మాట్లాడుతూ.. భూమి ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చగలదు కానీ ప్రతి ఒక్కరి అత్యాశను తీర్చలేదంటూ మహాత్మాగాంధీ చెప్పిన సందేశాన్ని గుర్తుచేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్లో సర్క్యులర్ ఆర్థిక వ్యవస్తకు పునాది వేశారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ నాయకత్వంలో ఆ దిశగా మరింత పురోగతి సాధిస్తూ గుజరాత్ రాష్ట్రాన్ని సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ పరివర్తనకు ప్రపంచ కేంద్రంగా నిలిపే దిశగా కృషి జరుగుతోందని అన్నారు. వ్యర్థాలను వనరులుగా, వనరులను విలువగా మార్చడం ద్వారా సుస్థిరమైన, సవాళ్లను తట్టుకునే భవిష్యత్తును నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఫిన్లాండ్ రాయబారి మిక్కో కివికోస్కీ మాట్లాడుతూ.. సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ ప్రత్యేక పర్యావరణ కార్యక్రమం కాదని, అభివృద్ధికి సంబంధించిన ప్రాథమిక ఆలోచనా విధానమని అన్నారు. ఇది ఫిన్లాండ్ జాతీయ విధానంలో అంతర్భాగంగా మారిందని తెలిపారు. 2035 నాటికి వనరుల వినియోగాన్ని 2015 స్థాయి కంటే తక్కువకు తీసుకురావాలన్న ఫిన్లాండ్ లక్ష్యాన్ని ఆయన ప్రస్తావించారు. భారత్లో పనిచేస్తున్న 100కు పైగా ఫిన్లాండ్ కంపెనీలు సుస్థిర సాంకేతికతలు, సర్క్యులర్ విధానాలతో ముందుకెళుతున్నాయని పేర్కొన్నారు. ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి, వాటి విలువను సాధ్యమైనంత ఎక్కువ కాలం ఎలా కొనసాగించాలనే అంశాలపై పునరాలోచించడం ద్వారా సర్క్యులర్ విధానాన్ని ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభ దశ నుంచే అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. “అసలు ఉత్పత్తి కాని వ్యర్థమే అత్యుత్తమ వ్యర్థం” అని పేర్కొన్నారు. డిజిటలైజేషన్, సుస్థిరతపై దృష్టి పెడుతూ.. భారత్-ఫిన్లాండ్ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచినట్లు తెలిపారు.
నెదర్లాండ్స్ ఆర్థిక వ్యవహారాలు, వాతావరణ శాఖ సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మారికే స్పైకర్బోయర్ మాట్లాడుతూ.. సర్క్యులర్ ఆర్థిక విధానం నెదర్లాండ్స్ పారిశ్రామిక విధానంలో అంతర్భాగమని అన్నారు. 2050 నాటికి పూర్తిస్థాయి సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థగా మారాలన్న లక్ష్యంతో ఆ దేశం పనిచేస్తోందని తెలిపారు. పదార్థాల వినియోగాన్ని తగ్గించడంలో సాధించిన పురోగతిని, సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ చట్టం, ఈపీఆర్ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు చేపడుతున్న చర్యలను ఆమె వివరించారు. సర్క్యులర్ విలువ వ్యవస్థలను నిర్మించేందుకు అంతర్జాతీయ సహకారం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. డబ్ల్యూసీఈఎఫ్ 2026లో 20కి పైగా డచ్ కంపెనీలు, సంస్థలు పాల్గొంటున్న విషయాన్ని వెల్లడిస్తూ.. పెద్ద కంపెనీలతో పాటు అంకుర సంస్థల్లోనూ సర్క్యులర్ విధానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భారత్ చూపుతున్న ఉత్సాహాన్ని, ఆశయాన్ని ఆమె ప్రశంసించారు.
ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరం (డబ్ల్యూసీఈఎఫ్) 2026 ప్రాంగణంలో 135 జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనకారులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రముఖులు ప్రారంభించి, పరిశీలించారు. ఇందులో సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఆచరణాత్మక పరిష్కారాలను చూపించారు. ఈ వేదికలో 62 దేశాల నుంచి వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలతో సహా 3600 మందికి పైగా వివిధ రంగాల భాగస్వాములు పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో రెండు ప్రచురణలను (‘శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగానికి ఉత్తమ పద్ధతులు’, ‘సుస్థిరత దిశగా అడుగులు-భారత సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ, ఈపీఆర్ కార్యక్రమాలకు మార్గదర్శి’) కూడా ప్రముఖులు విడుదల చేశారు.
ఈ కార్యక్రమాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ), ఫిన్లాండ్కు చెందిన ది ఫిన్నిష్ ఇన్నోవేషన్ ఫండ్ సిట్రా, ఫిన్లాండ్ ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ, గుజరాత్ ప్రభుత్వం, గుజరాత్ కాలుష్య నియంత్రణ మండలి (జీపీసీబీ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2310762)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7