వ్యవసాయ మంత్రిత్వ శాఖ
మెట్ట వ్యవసాయ భూములపై ఢిల్లీ ప్రకటన ఆమోదంతో ముగిసిన డ్రైల్యాండ్ కాంగ్రెస్ 2026
మెట్ట వ్యవసాయ భూముల పరివర్తనకు విజ్ఞానం, ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు అవసరమని పిలుపునిస్తూ ముగిసిన మూడు రోజుల సదస్సు
దృఢమైన మెట్ట భూముల వ్యవసాయ- ఆహార వ్యవస్థల నిర్మాణానికి బలమైన డేటా వ్యవస్థలు, ప్రయోగశాలలు కీలకం: డీఏఆర్ఈ కార్యదర్శి డాక్టర్ ఎంఎల్ జాట్
నాడు పోస్టు చేయడమైనది:
13 SEP 2026 9:07AM by PIB Hyderabad
మూడు రోజులపాటు సాగిన డ్రైల్యాండ్ కాంగ్రెస్ 2026 (మెట్ట వ్యవసాయ భూముల సదస్సు) నేడు న్యూఢిల్లీలో ముగిసింది. మెట్ట వ్యవసాయానికి అవసరమైన పరిష్కారాలను వేగవంతం చేసేందుకు బలమైన దక్షిణ- దక్షిణ సహకారం, త్రైపాక్షిక సహకారరాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ సదస్సు పిలుపునిచ్చింది. ముగింపు రోజు ఐక్యరాజ్యసమితి దక్షిణ- దక్షిణ సహకార దినోత్సవం కూడా కలిసిరావడం విశేషం. ఈ సందర్భంగా మెట్ట భూములపై ఢిల్లీ ప్రకటనను (3డీ) ఆమోదించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరస్పర సహకారం, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, ఆవిష్కరణలు, సమష్టి కార్యాచరణ ద్వారా మెట్ట వ్యవసాయ భూముల రూపురేఖలను మార్చేందుకు ఒక ఉమ్మడి అజెండాను ఇది నిర్దేశించింది. శుష్క భూభాగాల సదస్సు 2026 ముగింపు ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వాలు, సంస్థలు, భాగస్వాములు, ప్రతినిధులు ఈ ప్రకటనకు ఆమోదం తెలిపారు.
ముగింపు సమావేశంలో డీఏఆర్ఈ కార్యదర్శి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎంఎల్ జాట్ ప్రసంగిస్తూ.. మెట్ట వ్యవసాయం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ముందస్తు ఆలోచనలు, భవిష్యత్తు దృక్పథాన్ని ప్రధాన అంశంగా చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకోసం పటిష్టమైన సంస్థాగత వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. మెట్ట వ్యవసాయంపై భవిష్యత్తు దృక్పథానికి సంబంధించిన కార్యక్రమాలకు నాయకత్వం వహించే బాధ్యతను ఐసీఏఆర్-జాతీయ వ్యవసాయ ఆర్థిక శాస్త్రం, విధాన పరిశోధన సంస్థ (ఐసీఏఆర్-ఎన్ఐఏపీ)కు అప్పగించాలని సూచించారు. మెట్ట వ్యవసాయ-ఆహార వ్యవస్థలకు పటిష్టమైన డేటా, సమాచార వ్యవస్థల అవసరాన్ని తెలియజేశారు. పరిశోధనను క్షేత్రస్థాయి ఆచరణ, విధానాలతో అనుసంధానించే ఉమ్మడి ఆవిష్కరణ వేదికలు, సజీవ ప్రయోగశాలలు అవసరమని తెలిపారు.
ఐసీఆర్ఐఎస్ఏటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ మాట్లాడుతూ.. ప్రపంచ ఆహార భద్రతకు మెట్ట భూములు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమని పేర్కొన్నారు. గత మూడు రోజులుగా జరిగిన చర్చలను స్పష్టమైన కార్యాచరణగా మార్చాలని పిలుపునిచ్చారు. చర్చల సారాంశాన్ని రూపొందించి, వాటిని స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలకు ప్రాధాన్యతా క్రమంలో విభజించాలని సూచించారు. నైపుణ్యం, జ్ఞానం, స్నేహపూర్వక సహకారాన్ని ఒకచోట చేర్చి ఆలోచనల నుంచి భావనలకు, భావనల నుంచి స్పష్టమైన కార్యాచరణ, అమలుకు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
చివరి రోజు సమావేశంలో మొత్తం సదస్సు ద్వారా ఏర్పడిన కొత్త భాగస్వామ్యాలు, సహకారాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. గ్లోబల్ క్రాప్ డైవర్సిటీ ట్రస్టుతో కొత్త ఒప్పందాలు, అవగాహనా ఒప్పందాలు కుదిరినట్లు ప్రకటించారు. మెట్ట వ్యవసాయంలో ఆవిష్కరణలు, కార్యాచరణకు మరింత మద్దతిచ్చేలా ఏవియర్ లైఫ్ సైన్సెస్, నిఫ్టెమ్, విప్రో, ఒడిశాలోని అంగుల్, రాయగడ జిల్లా పాలనా యంత్రాంగాలతో ఇక్రిశాట్ సంస్థ అవగాహన ఒప్పందాలను పరస్పరం మార్చుకుంది. మూడు రోజుల చర్చల సారాంశాన్ని సమర్పించి, సదస్సు నుంచి వెలువడిన కీలక ఫలితాలు, సిఫార్సులను సదస్సు సహ అధ్యక్షులు ఐసీఏఆర్ పంటల శాస్త్ర విభాగం డీడీజీ డాక్టర్ డీకే యాదవ్, ఇక్రిశాట్ పరిశోధన, ఆవిష్కరణల విభాగం డీడీజీ డాక్టర్ స్టాన్ఫోర్డ్ బ్లేడ్ వివరించారు.
ఐక్యరాజ్యసమితి దక్షిణ-దక్షిణ సహకార దినోత్సవ స్మారక వేడుకతో అంతకముందు రోజు వేడుక ప్రారంభమైంది. ఇందులో ఐరాస ప్రధాన కార్యదర్శి, ఎఫ్ఎఓ డైరెక్టర్ జనరల్, యుఎన్ఓఎస్ఎస్సీ డైరెక్టర్ శ్రీమతి దిమా అల్-ఖతీబ్ సందేశాలను వినిపించారు. వ్యవసాయంలో దక్షిణాది-దక్షిణాది సహకారం కోసం అంతర్జాతీయ సంఘీభావం (ఐఎస్ఎస్సీ) కార్యాచరణ దృక్పథాన్ని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ పంచుకున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య భాగస్వామ్యాలను బలపరచడం కీలకమని చెప్పారు. మరింత మెరుగైన ఫలితాల కోసం దక్షిణ- దక్షిణ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇక్రిశాట్, ఐసీఏఆర్, సీజీఐఏఆర్, ఆర్ఐఎస్, నాబార్డ్, సీజీఐఏఆర్కెపాసిటీ షేరింగ్ యాక్సిలరేటర్ ప్రతినిధులు తమ నిబద్ధతలను ప్రకటించారు.
అనంతరం సీజీఐఏఆర్ సహకారంతో “సరిహద్దులు లేని జ్ఞానం: దక్షిణ–దక్షిణ, త్రైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడం” అనే అంశంపై ప్రత్యేక సమావేశం జరిగింది. దక్షిణ–దక్షిణ, త్రైపాక్షిక సహకారాన్ని మరింత సమర్థవంతంగా మార్చడం, విజయవంతమైన నమూనాలను విస్తృత స్థాయిలో అమలు చేయడం వంటి అంశాలపై నిపుణుల స్థాయిలో రెండు చర్చలు జరిగాయి. ఇథియోపియా, సెనెగల్, బ్రెజిల్, చైనా, భారత్ల జాతీయ వ్యవసాయ పరిశోధనా వ్యవస్థలకు చెందిన వక్తలు, సీజీఐఏఆర్, ఎఫ్ఏఆర్ఏ, ఏపీఏఏఆర్ఐ ప్రతినిధులు కలిసి తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు.
సదస్సులో భాగంగా ఐఎస్ఎస్సీఏ ప్రపంచ అవార్డులు 2026 ప్రదానం కూడా జరిగింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వివిధ సంస్థలు అభివృద్ధి చేసిన, విజయవంతంగా అమలైన వ్యవసాయ ఆవిష్కరణలను గుర్తించి, వాటిని విస్తృత స్థాయిలో అమలు చేయడానికి, ఇతర దేశాలకు అనుగుణంగా స్వీకరించడానికి ఉన్న అవకాశాలను ప్రోత్సహించే వార్షిక ప్రతిష్టాత్మక కార్యక్రమమే ఐఎస్ఎస్సీఏ ప్రపంచ అవార్డులు. తొలిసారిగా నిర్వహించిన ఈ అవార్డులకు ఆసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, లాటిన్ అమెరికా, కరేబియన్లోని 34 దేశాల నుంచి 170 నామినేషన్లు అందాయి. ‘టీఏఏటీ గోధుమ కాంపాక్ట్ సాంకేతికతలు: అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే గోధుమ రకాలు’ కోసం కృషి చేసినందుకు లెబనాన్కు చెందిన ఐసీఏఆర్డీఏ సంస్థకు ఐఎస్ఎస్సీఏ గ్లోబల్ అవార్డ్ ఫర్ ట్రాన్స్ఫార్మేటివ్ ఎక్సలెన్స్(మెగా అవార్డు)ను, ఈ-అగ్రాలజీ 360 రూపకల్పనకు గాను మెక్సికోకు చెందిన సీఐఎంఎంవైటీ సంస్థకు, ‘పోషకాహారం, గ్రామీణ స్థితిస్థాపకత కోసం మహిళల నాయకత్వంలో చేపడుతున్న సుస్థిర వ్యవసాయం’ విభాగంలో భారత్లోని ఒడిశా ప్రభుత్వానికి చెందిన ఒడిశా లైవ్లీహుడ్స్ మిషన్కు ప్రదానం చేశారు.
పంటల అభివృద్ధి, ఉత్పత్తి సాంకేతికతల విభాగంలో బారి చినాబాదం-9 వేరుశనగ రకానికి గాను బంగ్లాదేశ్లోని బంగ్లాదేశ్ వ్యవసాయ పరిశోధనా సంస్థకు (బీఏఆర్ఐ), జీపీబీడీ 4 రకానికి గాను భారత్లోని ధార్వాడ వ్యవసాయ శాస్త్ర విశ్వవిద్యాలయానికి, వాతావరణ అనుకూల, తక్కువ కాలపరిమితిలోనే పండే శనగ, కంది, వేరుశనగ రకాలను అభివృద్ధి చేసినందుకు గాను మయన్మార్కు చెందిన వ్యవసాయ పరిశోధనా శాఖకు (డీఏఆర్) అవార్డులు లభించాయి. సహజ వనరుల నిర్వహణ, వాతావరణ స్థితిస్థాపకత పురస్కారల విభాగంలో కృషి భాగ్య పథకానికి గాను కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ శాఖకు, సమగ్ర అరటి సూడో-స్టెమ్ (బోద, కాండం) ప్రాసెసింగ్ కోసం మన దేశానికి చెందిన నెక్టార్ సంస్థకు, ఆహార్-పైన్ ప్రకృతి దృశ్యాలను పునరుద్ధరించినందుకు గాను బీహార్ ప్రభుత్వ వ్యవసాయ శాఖకు, డిజిటల్ భూ పునరుద్ధరణ పర్యవేక్షణకు గాను మలావికి చెందిన సస్టైనబుల్ ఫార్మింగ్ సొల్యూషన్స్ సంస్థకు అవార్డులు దక్కాయి.
వ్యవసాయ వాణిజ్యం, మార్కెట్ వ్యవస్థల విభాగంలో ఈ-కృషక్ వేదిక కోసం పనిచేసిన బంగ్లాదేశ్కు చెందిన బీఐఐడీ ఫౌండేషన్కు, టీఎన్ఏయూ-ఎఫ్పీఓ అనుసంధాన కార్యక్రమం కోసం తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, పారాబోలిక్ ఆకారపు సోలార్ డ్రైయర్ రూపకల్పనకు కృషి చేసిన నైజీరియన్ స్టోర్డ్ ప్రొడక్ట్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్కు అవార్డులు లభించాయి. డిజిటల్ వ్యవసాయం విభాగంలో ఏపీఎంఐపీ డిజిటల్ వ్యవస్థ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యానవన శాఖకు, కృషి ప్రగతి వేదిక కోసం పనిచేసిన గుజరాత్ ప్రభుత్వ వ్యవసాయం, రైతు సంక్షేమం, సహకార శాఖకు అవార్డులు ప్రదానం చేశారు.
పశుసంపద అభివృద్ధి, ఉత్పత్తి సాంకేతికతల విభాగంలో అభివృద్ధి చేసిన బొచ్చె (కార్ప్) చేపల విత్తన వ్యవస్థకు గాను బంగ్లాదేశ్లోని వరల్డ్ఫిష్ సంస్థకు, దేశవాళీ కోళ్ల జాతుల అభివృద్ధి కార్యక్రమం (పీఐసీ-బీఐపీ) కోసం కెన్యాలోని అంతర్జాతీయ పశుసంపద పరిశోధనా సంస్థకు (ఐఎల్ఆర్ఐ) అవార్డులు లభించాయి. వీటితో పాటు మెట్ట వ్యవసాయంలో మేలైన పరిశోధనలు, అభివృద్ధి చెందుతున్న శాస్త్రీయ ప్రతిభను గుర్తిస్తూ విద్యార్థులు, పరిశోధక పండితులకు 16 ఉత్తమ పోస్టర్ అవార్డులను ప్రధానం చేశారు.
“దక్షిణ–దక్షిణ సహకారంతో మెట్ట వ్యవసాయాన్ని రూపాంతరం చేయడం” అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ సదస్సు.. శాస్త్రీయ జ్ఞానాన్ని కార్యాచరణగా మార్చడం, నిరూపితమైన ఆవిష్కరణలను విస్తృత స్థాయిలో అమలు చేయడం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పటిష్టమైన స్థితిస్థాపక, సుస్థిర మెట్ట భూభాగాల వ్యవసాయం కోసం భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాలన్న పునరుద్ధరించిన నిబద్ధతతో ముగిసింది.
***
(రిలీజ్ ఐడి: 2309903)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11