ఉప రాష్ట్రపతి సచివాలయం
పంజాబ్ యూనివర్సిటీలో అధునాతన పరికరాల కేంద్రం, టెక్ ఇన్నొవేషన్ ఫోరమ్ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
విశ్వవిద్యాలయాన్ని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దే దిశగా సమష్టిగా కృషి చేయాలని పిలుపు
నాణ్యమైన విద్య, పరిశోధనలకు అంతర్జాతీయ గమ్యస్థానంగా నిలుస్తున్న భారత్
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, నషా ముక్త్ భారత్ నిర్మాణంలో ముందుండాలని విద్యార్థులకు సూచన
క్యాంపస్ భద్రతకు యూనివర్సిటీ అత్యంత ప్రాధాన్యమివ్వాలన్న ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
04 SEP 2026 3:42PM by PIB Hyderabad
భారత ఉపరాష్ట్రపతి, పంజాబ్ విశ్వవిద్యాలయ ఎక్స్ అఫిషియో ఛాన్సలర్ శ్రీ సి. పి. రాధాకృష్ణన్.. ఛండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయాన్ని ఈ రోజు సందర్శించారు. అధునాతన పరీక్షా పరికరాల కేంద్రం/కేంద్ర పరికరాల ప్రయోగశాల (ఎస్ఏఐఎఫ్/సీఐఎల్)లో ఏర్పాటు చేసిన అధునాతన పరికరాల కేంద్రాన్ని ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రారంభించారు. దీనితోపాటు పంజాబ్ యూనివర్సిటీ టెక్ ఇన్నోవేషన్ ఫోరమ్ (పీయూ-టీఐఎఫ్)ను కూడా ఆయన ప్రారంభించారు. విశ్వవిద్యాలయ విద్యా, అనువర్తిత పరిశోధన వ్యవస్థలో ఎస్ఏఐఎఫ్/సీఐఎల్, పీయూ-టీఐఎఫ్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి పరిశోధకులు, ఆవిష్కర్తలు, వివిధ పరిశ్రమలకు అవసరమైన అధునాతన పరీక్ష కేంద్రాలు, పరిశోధనలను ఆచరణలోకి తెచ్చే అనువర్తిత పరిశోధన సదుపాయాలు, ప్రారంభపూర్వ (ఇంక్యుబేషన్), వ్యవస్థాపక సహకారాన్ని అందిస్తాయి.
సభనుద్దేశించి ప్రసంగించిన శ్రీ సి. పి. రాధాకృష్ణన్.. 1882లో పంజాబ్ విశ్వవిద్యాలయం ప్రారంభమైనప్పటి నుంచి దాని ఘన చరిత్రను గుర్తుచేసుకున్నారు. తరతరాలుగా నాయకులను, న్యాయకోవిదులను, శాస్త్రవేత్తలను, క్రీడాకారులను, ప్రభుత్వ అధికారులను తీర్చిదిద్దుతూ దేశ నిర్మాణంలో ఈ విశ్వవిద్యాలయం కీలక భూమిక పోషించిందన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో.. భారత ఉన్నత విద్య, శాస్త్రీయ పరిశోధన వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఉపరాష్ట్రపతి అన్నారు. నాణ్యమైన విద్య, పరిశోధనలు, ఆవిష్కరణల్లో అంతర్జాతీయ కేంద్రంగా భారత్ వేగంగా ఎదుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ప్రారంభోత్సవాలను రెండు కీలకమైన మైలురాళ్లుగా శ్రీ సి. పి. రాధాకృష్ణన్ అభివర్ణించారు. అటామిక్ ఫోర్స్ మైక్రోస్కోప్, రామన్ స్పెక్ట్రోమీటర్, డీఎన్ఏ సీక్వెన్సర్, ఫ్లో సైటోమీటర్, ఎఫ్టీఐఆర్ స్పెక్ట్రోమీటర్ అనే అయిదు అధునాతన శాస్త్రీయ పరికరాల ఏర్పాటుతో.. నానోటెక్నాలజీ, మెటీరియల్ సైన్స్, పర్యావరణ విజ్ఞానం, జీనోమిక్స్ వంటి రంగాల్లో విశ్వవిద్యాలయ పరిశోధన సామర్థ్యాలు గణనీయంగా బలోపేతమవుతాయన్నారు.
ఆవిష్కరణల ప్రాధాన్యాన్ని ఉపరాష్ట్రపతి వివరించారు. ‘బయో నెస్ట్’ను లాభాపేక్ష లేని (సెక్షన్- 8) సంస్థగా పంజాబ్ యూనివర్సిటీ సాంకేతిక ఆవిష్కరణల వేదిక (టెక్ ఇన్నోవేషన్ ఫోరమ్)గా మార్చడం ద్వారా.. పరిశోధనలు, వ్యాపార నైపుణ్యం, సాంకేతిక అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కే సరికొత్త వ్యవస్థాగత వేదికగా అది నిలుస్తుందన్నారు. విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సంస్థలు (ఇంక్యుబేటర్లు), పెట్టుబడిదారులు కలిసి పనిచేస్తేనే ఆవిష్కరణలు పరుగులు పెడతాయని ఆయన స్పష్టం చేశారు.
యువ పరిశోధకులకు దిశానిర్దేశం చేస్తూ... నిర్దిష్ట లక్ష్యంతో పరిశోధనలు సాగించాలని, వైఫల్యాలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా నిలదొక్కుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజ అవసరాలను తీర్చేలా, అందరికీ ఉపయోగపడేలా, విస్తృత స్థాయికి తీసుకెళ్లగలిగేలా ఆవిష్కరణలు ఉండాలని సూచించారు. పరిశోధనల ఫలితాలు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపాలని పేర్కొన్నారు. పరిశోధన ఫలితాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చేలా.. విద్యార్థులు, పరిశోధకులు సరైన దిశలో ముందడుగు వేయాలన్నారు.
క్యాంపస్ భద్రత అంశంపైనా ఉపరాష్ట్రపతి స్పందించారు. ఒక పీహెచ్డీ విద్యార్థి మరణం దురదృష్టకరమన్నారు. విశ్వవిద్యాలయ ప్రాంగణమంతటా సమగ్ర భద్రతా తనిఖీలు నిర్వహించాల్సిందిగా తక్షణమే అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. క్యాంపస్లోని ప్రస్తుత మౌలిక సదుపాయాలను సమీక్షించి సమగ్ర నివేదిక సమర్పించేందుకు ఒకర్గత కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. విద్యార్థులు, సిబ్బంది భద్రత, సంక్షేమానికి విశ్వవిద్యాలయం అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఆయన స్పష్టం చేశారు.
‘నషా ముక్త్ భారత్’ దిశగా ముందుకు సాగాల్సిందిగా విద్యార్థులకు ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, కుటుంబ సభ్యులు, మిత్రులకు కూడా అవగాహన కల్పించాలని వారిని కోరారు.
ఈ అధునాతన వైజ్ఞానిక కేంద్రాలు, పంజాబ్ యూనివర్సిటీ సాంకేతిక ఆవిష్కరణల వేదిక (టెక్ ఇన్నోవేషన్ ఫోరమ్)... పరిశోధన, ఆవిష్కరణ, వ్యవస్థాపక రంగాల్లో విశ్వవిద్యాలయ సేవలను మరింత బలోపేతం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తరగతి గదులు, ప్రయోగశాలల నుంచి పుట్టుకొచ్చే ఆలోచనలు యువతకు ఉపాధిగా, వ్యాపార అవకాశాలుగా నిలవాలని, ఆ దిశగా విద్యార్థులు, అధ్యాపకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తద్వారా వికసిత భారత్, ఆత్మనిర్భర భారత్ కలల సాకారంలో భాగస్వాములు కావాల్సిందిగా ఉద్బోధించారు. ఉన్నత విద్య, పరిశోధనల్లో అంతర్జాతీయ స్థాయి సంస్థగా పంజాబ్ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిస్తూ... ఉపరాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు. ఈ దిశగా అవసరమైన సూచనలు, సలహాలను అందించాల్సిందిగా విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యాపక బృందాన్ని ఆయన కోరారు.
పంజాబ్ గవర్నర్, ఛండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా, హర్యానా గవర్నర్ ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్, లోక్సభ ఎంపీ శ్రీ మనీశ్ తివారీ, పంజాబ్ విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ మీనాక్షీ గోయల్, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2306831)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11