యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా.. ‘ఖేలో ఇండియా డైలాగ్ – ఖేల్ కీ బాత్, పీఎం మోదీ కే సాథ్’: 2026 ఆగస్టు 27న దేశవ్యాప్తంగా నిర్వహణ
క్రీడలు, యువ నాయకత్వం, వికసిత్ భారత్ అంశాలపై వర్ధమాన యువ క్రీడాకారులనుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
1,500కు పైగా విద్యాసంస్థలకు చెందిన యువత, క్రీడాకారులు, విధాన రూపకర్తలను ఒక్కచోట చేర్చే సంవాదం
प्रविष्टि तिथि:
24 AUG 2026 4:07PM by PIB Hyderabad
జాతీయ క్రీడా దినోత్సవం 2026 సందర్భంగా.. ఆగస్టు 27న దేశవ్యాప్తంగా 1,500కు పైగా ప్రాంతాలలో యువత, క్రీడాకారులు, విద్యాసంస్థలను ఒక్కచోటికి చేర్చేలా రూపొందించిన ‘ఖేలో ఇండియా డైలాగ్ - ఖేల్ కీ బాత్, ప్రధానమంత్రి మోదీ కే సాథ్’ పేరిట ఒక బృహత్తరమైన యువ భాగస్వామ్య కార్యక్రమానికి దేశం సిద్ధమైంది.
భారతీయ క్రీడా, యువజన సంక్షేమ వ్యవస్థ భవిష్యత్తుపై తమ ఆలోచనలు, సూచనలు, వినూత్న భావాలను పంచుకునేలా.. వర్ధమాన యువ క్రీడాకారులకు ఈ దేశవ్యాప్త కార్యక్రమం ఒక ప్రత్యక్ష వేదికను కల్పిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యాసంస్థల్లో ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు, ఎయిమ్స్, ప్రముఖ వైద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం అనంతరం అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో ప్రత్యక్ష కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
యువత ఆకాంక్షలు, వారి క్షేత్రస్థాయి అనుభవాలకూ, విధాన రూపకల్పనకూ నడుమ అనుసంధానాన్ని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం. క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు క్షేత్రస్థాయి సదుపాయాలను విస్తరించడం, శిక్షణ, అవకాశాలు, వైజ్ఞానిక పద్ధతుల్లో ప్రతిభావంతులను గుర్తించి 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులను తీర్చిదిద్దడం, పాలన వ్యవహారాల్లో యువ నాయకత్వాన్ని పెంపొందించడం, భవిష్యత్ సన్నద్ధ నైపుణ్యాలు, స్వచ్ఛంద సేవా అవకాశాల ద్వారా దేశ నిర్మాణంలో యువతను సాధికారులను చేయడం... అనే నాలుగు ప్రధాన అంశాలపై కార్యక్రమంలో పాల్గొనే యువత చర్చించనున్నారు.
దేశంలోని అగ్రశ్రేణి క్రీడాకారులు, పతక విజేతలతో.. క్రీడలపై ఆసక్తి ఉన్న యువత నేరుగా ముఖాముఖీ సంభాషించే అవకాశం కల్పించడం ఈ కార్యక్రమ విశేషం. దీపా కర్మాకర్, సైనా నెహ్వాల్, గగన్ నారంగ్, శ్రీజేశ్, మేరీ కోమ్, బైచుంగ్ భూటియా, గోపీచంద్, అంజు బాబీ జార్జ్, కరణం మల్లీశ్వరి, మీరాబాయి చాను, పి.టి. ఉష వంటి దిగ్గజ క్రీడాకారులతోపాటు.. ప్రముఖ క్రికెటర్లతో ముచ్చటిస్తారు. క్రీడా రంగంలో తమ ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు, తమ అనుభవాలను వారితో పంచుకుంటారు.
క్రీడాకారులతోపాటు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు, రాష్ట్ర క్రీడా మంత్రులు కూడా యువతతో ముచ్చటించి.. పై నాలుగు ప్రధానాంశాలపై వారి ఆలోచనలను, సూచనలను స్వీకరిస్తారు.
ఈ కార్యక్రమంలో భాగంగా.. వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ క్విజ్’ను నిర్వహించడమే కాకుండా... ‘మై భారత్’ పోర్టలులో నమోదు చేసుకునేలా యువతను ప్రోత్సహిస్తారు. తద్వారా ఈ ఒక్క రోజు కార్యక్రమానికే పరిమితం కాకుండా.. యువతతో నిరంతర భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఇది మార్గం సుగమం చేస్తుంది.
భారత క్రీడా రంగంలో సమూల మార్పులకు అంతిమంగా దేశ యువతే మూలాధారమన్న భావనను.. ‘ఖేలో ఇండియా డైలాగ్ – ఖేల్ కీ బాత్, ప్రధానమంత్రి మోదీ కే సాత్’ కార్యక్రమం.. మరింత బలోపేతం చేస్తుంది. యువత ఆకాంక్షలు, వారి క్రీడా అనుభవాలు, విధానపరమైన దృక్పథాలను ఒకే ఉమ్మడి వేదికపైకి తీసుకురావడం ద్వారా.. దేశంలో క్రీడల భవితను తీర్చిదిద్దడంలోనూ, యువత వికాసంలోనూ వారు అర్థవంతంగా గళాన్ని వినిపించే అవకాశాన్ని కల్పించడం ఈ కార్యక్రమ లక్ష్యం.
***
(रिलीज़ आईडी: 2302951)
आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
हिन्दी
,
Urdu
,
Marathi
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam