యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
విశాఖపట్నంలో ముగిసిన బ్రిక్స్-2026 యువజన మంత్రుల సమావేశం... ఉమ్మడి ప్రకటనకు ఆమోదం
బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే
అభివృద్ధిలో యువత సహకారాన్ని, భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటంపై ఉమ్మడి ప్రకటనను ఆమోదించిన బ్రిక్స్ దేశాల యువజన మంత్రులు
గాంధీనగర్లో జరిగిన బ్రిక్స్ యువజన సదస్సు, బ్రిక్స్ యువజన మండలి సదస్సుల ఫలితాల ఆధారంగా జరిగిన సమావేశం
'ఏక్ పేడ్ మా కే నామ్' మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని, చారిత్రక తొట్లకొండ బౌద్ధారామాన్ని సందర్శించిన ప్రతినిధులు
प्रविष्टि तिथि:
22 AUG 2026 6:49PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని యువజన వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం ఆగస్టు 22, 2026న శనివారం రోజున విశాఖపట్నంలో విజయవంతంగా ముగిసింది.

ఈ సమావేశానికి యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ గౌరవ కేంద్రమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయమంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే, యువజన వ్యవహారాల విభాగం కార్యదర్శి శ్రీ సునీల్ పలివాల్ పాల్గొన్నారు.
బ్రిక్స్ యువజన శిఖరాగ్ర సమావేశం, బ్రిక్స్ యువజన మండలి సమావేశం ఫలితాల ఆధారంగా మంత్రుల సమావేశంలో చర్చలు సాగాయి. ఈ వేదికల నుంచి వెలువడిన సిఫార్సులు, దృక్పథాలు మంత్రుల స్థాయి చర్చలకు కీలక ఆధారంగా నిలిచాయి.
యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ గౌరవ కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. "భారత్కు స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి, అంటే 2047 నాటి కోసం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మేం ఒక విజన్ డాక్యుమెంట్ను రూపొందించాం. ఈ దిశగా దేశాన్ని నడిపించేందుకు రాజకీయ నేపథ్యం లేని 1,00,000 మంది యువ నాయకులను తయారుచేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు" అని తెలిపారు.
"ఈ స్ఫూర్తితోనే మేం అనేక కార్యక్రమాలను ప్రారంభించాం. వాలంటీర్ పనిచేయటం, నేర్చుకోవటం, నాయకత్వం, పౌర భాగస్వామ్యం కోసం ఏకైక వేదికగా మైభారత్ పోర్టల్ను తయారుచేశాం. నేడు 25 మిలియన్లకు పైగా యువత ఈ వేదికలో రిజిస్టర్ అయి, ఉత్సాహంగా పాల్గొంటున్నారు" అని అన్నారు.
బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాల యువ ప్రతినిధులు, యువ నాయకులు, విధాన రూపకర్తలు, ఉన్నతాధికారులను ఈ వేదికలు ఒకచోట చేర్చాయి. ఇవి యువతకు ప్రాధాన్యతనిచ్చే అంశాలపై చర్చించేందుకు, అనుభవాలను పరస్పరం పంచుకునేందుకు, కలిసి పనిచేసేందుకు సరైన వేదికలుగా నిలిచాయి.

యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి మాట్లాడుతూ... మెరుగైన భవిష్యత్తును తీర్చిదిద్దటంలో యువత భాగస్వామ్యం కీలకమని స్పష్టం చేశారు. "బ్రిక్స్ భారత అధ్యక్షతన మా విధానం చాలా స్పష్టంగా ఉంది. యువతను కేవలం లబ్ధిదారులుగా మాత్రమే కాక భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ఉమ్మడి క్రియాశీల భాగస్వాములుగా గుర్తించాలి. యువత భాగస్వామ్యం నుంచి యువత భాగస్వామ్య బంధానికి, సంప్రదింపుల నుంచి సహ-రూపకల్పన, యువత కోసం కార్యక్రమాలు నుంచి యువతతో కలిసి వేదికల నిర్మాణం దిశగా మనం అడుగులు వేద్దాం. భవిష్యత్తు కోసం మాత్రమే యువత సన్నద్ధం కావటమే కాక, తామే స్వయంగా భవిష్యత్తును తీర్చిదిద్దేలా బ్రిక్స్ దేశాలను నిర్మిద్దాం" అని తెలిపారు.
బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సందర్భంగా 'ఏక్ పేడ్ మా కే నామ్' మొక్కలు నాటే ప్రత్యేక కార్యక్రమంలో బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొని, వారి మాతృమూర్తుల గౌరవార్థం ఒక్కో మొక్కను నాటారు. మాతృమూర్తుల పట్ల కృతజ్ఞతను చాటే హృదయపూర్వక, ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని పర్యటనకు వచ్చిన ప్రతినిధి బృందాలు అభినందించాయి.
విశాఖపట్నం సమీపంలోని ప్రముఖ చారిత్రక వారసత్వ ప్రదేశాల్లో ఒకటైన తొట్లకొండ బౌద్ధారామాన్ని కూడా ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్శన భారతదేశ సుసంపన్న నాగరికత వారసత్వాన్ని, శాంతి, సామరస్యాలు, సాంస్కృతిక మార్పిడికి సంబంధించిన సుదీర్ఘ సంప్రదాయాలను ప్రతినిధులకు కళ్లకు కట్టినట్లు చూపింది. పర్యటనకు వచ్చిన ప్రముఖుల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ మొత్తం కార్యక్రమం... సుసంపన్నమైన సాంస్కృతిక కోణాన్ని జోడించటంతో పాటు బ్రిక్స్ దేశాల యువత మధ్య మైత్రిని, పరస్పర అవగాహనను మరింత బలోపేతం చేసింది.

గుజరాత్లోని గాంధీనగర్లో ఆగస్టు 19 నుంచి 20, 2026 వరకు జరిగిన బ్రిక్స్ యువజన సదస్సు, బ్రిక్స్ యువజన మండలి సదస్సు అనంతరం యువజన కార్యక్రమాల ముగింపులో భాగంగా బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశాన్ని నిర్వహించారు. బ్రిక్స్ సభ్య దేశాల యువజన వ్యవహారాల మంత్రులు, సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించటం, విధివిధానాలపై దృక్పథాలను పరస్పరం పంచుకోవటం, సమ్మిళిత, సుస్థిరాభివృద్ధిలో యువత పాత్రను మరింత ముందుకు తీసుకెళ్లటంపై ఈ సమావేశంలో చర్చించారు.
సంయుక్త ప్రకటనను ఆమోదించటం... ఈ సమావేశ ముగింపులో కీలకమైనది. ఇది బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారాన్ని బలోపేతం చేయటానికి, అభివృద్ధి ప్రక్రియల్లో యువత పాల్గొనేలా ప్రోత్సహించటానికి ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ సంయుక్త ప్రకటనలో విద్య, శిక్షణ, నైపుణ్యాలు, యువజన పారిశ్రామికవేత్తల అభివృద్ధి, శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణ, సామాజిక, సాంస్కతిక భాగస్వామ్యం, సామాజిక సేవ, వాలంటరీ కార్యక్రమాలు, అభివృద్ధి, పేదరికం, ఆకలి, అసమానతల నిర్మూలన, ఆరోగ్యం, యువత, క్రీడలు, యువత, పర్యావరణం, సుస్థిరత, వివిధ మతాల యువత చర్చ, యువజన మార్పిడి కార్యక్రమాలు, యువత భాగస్వామ్యం వంటివి ప్రధాన అంశాలు.

యువత సామర్థ్యాలను పెంపొందించుకోవటానికి, నిర్ణయాల్లో అర్థవంతంగా భాగస్వాములయ్యేందుకు, యువతకు సంబంధించిన సమకాలీన సమస్యల పరిష్కారానికి సహకరించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించటం మంత్రుల సమావేశంలో చర్చించిన కీలక అంశాల్లో ఒకటి. యువత నేతృత్వంలోని కార్యక్రమాలను బలోపేతం చేయటం, నూతన ఆవిష్కరణలు, వ్యవస్థాపకతను పెంపొందించటం, అనుభవాలను పరస్పరం పంచుకోవటం, సాధారణ ప్రయోజన అంశాలపై అభిప్రాయాలను అందించటం ద్వారా వివిధ దేశాల మధ్య యువత సహకారాన్ని పెంపొందించాల్సిన ప్రాధాన్యతను స్పష్టం చేశారు.
బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం విజయవంతంగా ముగియటం, బ్రిక్స్ యువజన మంత్రుల సంయుక్త ప్రకటనకు ఆమోదం లభించటం, బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారాన్ని ముందుకు తీసుకెళ్లటంలో ఈ కార్యక్రమం కీలకంగా నిలుస్తుంది.

బ్రిక్స్ దేశాల యువకులు, సంస్థల మధ్య భాగస్వామ్యాలను బ్రిక్స్ యువజన కార్యక్రమాలు బలపరిచాయి. పరస్పర అవగాహనను పెంపొందించాయి. నిరంతర సహకారానికి నూతన మార్గాలను సృష్టించాయి.
బ్రిక్స్-2026 భారతదేశ అధ్యక్షతన, "పటిష్ఠత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం" ఇతివృత్తానికి అనుగుణంగా... ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవటం, జాతీయ ప్రాధాన్యతలు, సహకార చర్యలపై ప్రత్యేక దృష్టి సారించి యువజన సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ యువజన వేదికలు సహకరించాయి.
బ్రిక్స్-2026 భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ యూత్ క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్లో భాగంగా బ్రిక్స్ యువజన సదస్సు, బ్రిక్స్ యువజన మండలి సమావేశం, బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆగస్టు 22, 2026న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం విజయవంతంగా జరిగింది.
భారత బ్రిక్స్ అధ్యక్ష హోదా ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ఈ వేదిక ద్వారా సాధించిన ఫలితాలు భవిష్యత్ సహకారానికి బలమైన పునాదిని అందిస్తున్నాయి. మరింత పటిష్ఠమైన, నూతన ఆవిష్కరణలతో కూడిన, సమ్మిళిత, సుస్థిర భవిష్యత్ నిర్మాణంలో యువ శక్తిని వినియోగించుకోవాలనే బ్రిక్స్ దేశాల ఉమ్మడి నిబద్ధతను ఇవి మరోసారి స్పష్టం చేశాయి.

బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సందర్భంగా... దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మంత్రులతో డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. నైపుణ్యాభివృద్ధి, యువ పారిశ్రామికవేత్తలు, యువత భాగస్వామ్యానికి డిజిటల్ వేదికలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ... యువజన వ్యవహారాలు, క్రీడా రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయటంపై ఈ చర్చలు దృష్టి సారించాయి.
యువత, క్రీడా రంగాల్లో భారత్, సంబంధిత దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయటానికి... మార్పిడి కార్యక్రమాలు, సామర్థ్య పెంపుదల కార్యక్రమాలు, సంస్థాగత విధానాల ద్వారా మరింతగా సహకరించుకోవాలని అన్ని దేశాలు చర్చించాయి.
***
(रिलीज़ आईडी: 2302456)
आगंतुक पटल : 8