హోం మంత్రిత్వ శాఖ
తమిళనాడులోని మహాబలిపురంలో జరిగిన దక్షిణ భారత ప్రాంతీయ మండలి 31వ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా
గత 5-7 దశాబ్దాల్లో సాధించలేని వాటిని రాబోయే 5-7 ఏళ్లలో సాధించాలనీ... అప్పుడే ప్రపంచ పోటీలో మన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలమని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి పిలుపునిచ్చారన్న కేంద్ర మంత్రి
ప్రాంతీయ మండలిని అర్థవంతమైన వేదికగా తీర్చిదిద్దిన మోదీ ప్రభుత్వం
2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన 70 సమావేశాల్లో... మొత్తం 1,869 సమస్యలకు గానూ దాదాపు 80 శాతం పరిష్కారం
దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి భారత ప్రగతికి ప్రధాన పునాది
అధిక అక్షరాస్యత, శిక్షణ పొందిన మానవ వనరులు, సముద్రాన్ని వినియోగించుకోగల సాంకేతిక నైపుణ్యం ఈ అభివృద్ధికి మూడు మూల స్తంభాలు
వాటి పురోగతి నీటిపైనే ఆధారపడి ఉంటుందని వ్యాఖ్య
జల్ శక్తి మంత్రిత్వశాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ, అంతర్-రాష్ట్ర మండలి ద్వారా సంబంధిత రాష్ట్రాలతో ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తూ... దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న నీటి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్న కేంద్ర హోంమంత్రి
ఉత్తర భారతం అంతటా నీటికి సంబంధించిన సమస్యలను వివాదరహితంగా పరిష్కరించడంలో విజయం సాధించిన కేంద్ర ప్రభుత్వం
దక్షిణ భారతంలో నీటి పంపిణీ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం వినూత్నంగా ఆలోచించడం అవసరం
పెండింగ్లో ఉన్న నీటి వివాదాలను పరస్పర చర్చలు, వివాద పరిష్కారం పట్ల సానుకూల దృక్పథంతో వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని సూచించిన కేంద్ర హోంమంత్రి - అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వాలు
ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించిన సమస్యలను కేంద్ర హోంశాఖతో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవడానికి అంగీకరించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు
సొంత రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడంలో తప్పులేదు... ఆ ప్రయోజనాల పరిరక్షణ వల్ల ఇతర రాష్ట్రాలకు ఏళ్ల తరబడి నీరు దక్కని పరిస్థితి ఏర్పడితే ఎవరి ప్రయోజనాలకూ రక్షణ ఉండదని వ్యాఖ్య
బ్రహ్మపుత్ర నుంచి కావేరి, గోదావరి వరకూ దేశంలోని ప్రధాన నదుల అనుసంధానం జరిగితే... రాబోయే 100 ఏళ్లపాటు భారత్లో నీటి కొరత ఉండకపోవచ్చు.
మహిళలు, పిల్లలపై జరిగే నేరాలపై తక్షణ దర్యాప్తు... అత్యాచారం, పోక్సో కేసుల సత్వర పరిష్కారం విషయంలో 'ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టుల' ఏర్పాటు అత్యంత సున్నితమైన, కీలకమైన అంశం
పోషకాహార లోపం, ఎదుగుదల లోపం, బడి మానేసే వారి నిష్పత్తి పెరుగుదలతో భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం
బడి మానేసే వారి నిష్పత్
प्रविष्टि तिथि:
20 AUG 2026 6:25PM by PIB Hyderabad
తమిళనాడులోని మహాబలిపురంలో జరిగిన దక్షిణ భారత ప్రాంతీయ మండలి 31వ సమావేశానికి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ సి. జోసెఫ్ విజయ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ డి. కె. శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి శ్రీ వి. డి. సతీశన్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కె. కైలాష్నాథన్, అండమాన్-నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ (రిటైర్డ్) డి. కె. జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ ప్రఫుల్ పటేల్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు పాల్గొన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు, ఇతర ఉన్నతాధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులూ ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సమావేశంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ... దేశాభివృద్ధిలో దక్షిణ భారతం అత్యంత కీలకమైన ప్రాంతమని పేర్కొన్నారు. సాహిత్యం, పరిశోధన-అభివృద్ధి, అంతరిక్ష రంగం, ఐటీ, కృత్రిమ మేధ, పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయం - ఇలా ప్రతి రంగంలోనూ దక్షిణ భారతం తనవంతు సహకారాన్ని అందిస్తూనే ఉందని ఆయన అన్నారు. దేశంలోని ఐటీ, వాహన తయారీ (ఆటోమొబైల్స్), ఔషధ రంగం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అన్ని రంగాల్లోనూ దక్షిణ భారతం కీలక పాత్ర పోషించిందనీ, అందుకే భారీ మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ ప్రాంతానికి తరలివచ్చాయనీ ఆయన తెలిపారు.
దక్షిణ భారత సమగ్ర అభివృద్ధి ప్రస్థానం... అధిక అక్షరాస్యత రేటు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సముద్ర వనరుల వినియోగంలో సాంకేతిక నైపుణ్యం అనే మూడు ప్రధాన స్తంభాలపై ఆధారపడి ఉందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఈ మూడు అంశాలు దేశాభివృద్ధిలో దక్షిణ భారతాన్ని అత్యధిక భాగస్వామ్యం కలిగిన ప్రాంతంగా నిలిపాయని పేర్కొన్నారు. ఆవిష్కరణలు, ఆదాయ వనరుల పెంపుదల వంటి రంగాల్లో దక్షిణ భారత ప్రజలు, అక్కడి ప్రభుత్వాలు అనేక ఉత్తమ సంప్రదాయాలను నెలకొల్పాయని ఆయన అన్నారు. ఈ రెండు అంశాల్లో యావత్ భారతం... దక్షిణ భారతం నుంచి స్ఫూర్తి పొందాలని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.
గత ఏడు దశాబ్దాల్లో సాధించలేని వాటిని రాబోయే ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో సాధించాలని 80వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని కేంద్ర హోంమంత్రి గుర్తుచేశారు. అప్పుడే ప్రపంచ స్థాయి పోటీలో మన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలమని ఆయన పేర్కొన్నారు. అటువంటి అభివృద్ధిని సాధించడానికి ప్రతి రాష్ట్రం తన వంతు సహకారాన్ని అందించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు.
2014 నుంచి ప్రాంతీయ మండలిని అర్థవంతమైన వేదికగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ప్రాంతీయ మండలి వాస్తవానికి ఒక రాజ్యాంగబద్ధమైన యంత్రాంగమనీ... గత ప్రభుత్వాల వల్ల కాలక్రమేణా ఇది కేవలం నామమాత్రపు ప్రక్రియగా మారిపోయిందని విచారం వ్యక్తం చేశారు. 2004-2014 కాలంతో 2014-2026 కాలాన్ని పోల్చుతూ... గతంలో ఈ మండలి ఏడాదికి సగటున రెండున్నర సమావేశాలు మాత్రమే నిర్వహించేదన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఏడాదికి ఆరు సమావేశాలు నిర్వహిస్తోందని తెలిపారు. 2014 నుంచి ఇప్పటివరకు మొత్తం 70 ప్రాంతీయ మండలి సమావేశాలు జరిగాయన్నారు. వీటిలో గుర్తించిన 1,869 సమస్యలకు గానూ 1,445 సమస్యలు (సుమారు 80 శాతం) పరిష్కరించామనీ ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతీయ మండలి సమావేశాల ద్వారా 60 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అనేక సమస్యలూ పరిష్కారమయ్యాయని శ్రీ అమిత్ షా తెలిపారు.
ఉత్తర భారతంలో నదీ జలాల పంపిణీకి సంబంధించిన ఎనిమిది సమస్యల్లో ఐదు సమస్యలు బ్రిటిష్ పాలనకు ముందు నుంచే కొనసాగుతూ వస్తున్నాయని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. ఐదు నెలల కిందటే ఈ సమస్యలన్నింటి పరిష్కారం కోసం సమగ్ర ఒప్పందం కుదిరిందని తెలిపారు. దీని ద్వారా కాశ్మీర్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు ఉన్న జల వివాదాలన్నీ (100 శాతం) పరిష్కరించి, వివాద రహిత ఉత్తర భారతాన్ని సాధించినట్లు శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.
దేశ పురోగతికి దక్షిణాది రాష్ట్రాలు ప్రధాన స్తంభాలనీ, ఈ రాష్ట్రాల అభివృద్ధి నీటిపైనే ఆధారపడి ఉంటుందనీ శ్రీ అమిత్ షా అన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఆరోగ్యవంతమైన పౌరులు, పర్యావరణం - ఇలా అన్ని రంగాల కోసం ఈ ప్రాంతానికి నీరే ప్రాణాధారమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడం తప్పేమీ కాదని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఆ ప్రయోజనాలను పరిరక్షించుకునే క్రమంలో నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతూ... ఇతర రాష్ట్రాలు మాత్రం ఏళ్ల తరబడి నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తే, దానివల్ల ఎవరికీ ఎటువంటి ప్రయోజనం చేకూరదని ఆయన అన్నారు. బ్రహ్మపుత్ర నుంచి కావేరి, గోదావరి వరకు ప్రధాన నదులను అనుసంధానించడం ద్వారా, రాబోయే 100 ఏళ్లపాటు భారత్లో నీటి కొరత లేకుండా చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం అనేక జలమార్గాల ఏర్పాటుకూ దోహదపడుతుందన్నారు. దీనివల్ల ఇంధన ఆదా, పర్యావరణ పరిరక్షణతో పాటు, తక్కువ ఖర్చుతో కూడిన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందనీ శ్రీ అమిత్ షా వివరించారు.
జలశక్తి మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అంతర్-రాష్ట్ర మండలి, ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో జరిగే సంయుక్త సమావేశాల ద్వారా దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న నీటి వివాదాలను త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరాన్ని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు. పరస్పర చర్చలు, నిర్మాణాత్మక పరిష్కారాల ద్వారా పెండింగ్లో ఉన్న నీటి వివాదాలను వేగంగా పరిష్కరించుకోవాలన్న కేంద్ర హోంమంత్రి సూచనతో దక్షిణాది రాష్ట్రాలు ఏకీభవించాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదించి... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించిన విషయాలను పరిష్కరించుకోవడానికి ఆ రెండు రాష్ట్రాలూ అంగీకరించాయి.
మహిళలు, పిల్లలపై జరిగే అత్యాచార కేసుల వేగవంతమైన దర్యాప్తు... 'ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల' ఏర్పాటు ద్వారా అత్యాచారం, పోక్సో కేసుల సత్వర పరిష్కారం వంటివి అత్యంత సున్నితమైన అంశాలని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఈ అంశాలను అత్యంత సున్నితమైనవిగా పరిగణిస్తూ, వీటికి సంబంధించి ముఖ్యమంత్రుల స్థాయిలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు. కొత్త క్రిమినల్ చట్టాల అమలు తర్వాత, ఈ మొత్తం ప్రక్రియను వేగవంతం చేయడానికి అనేక సాధనాలు మనకు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర హోం మంత్రి తెలిపారు.
పోషకాహార లోపం, ఎదుగుదల లోపం, బడి మానేసే వారి నిష్పత్తి పెరుగుదల వంటివి మన భవిష్యత్ తరాలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని కేంద్ర హోంమంత్రి అన్నారు. బడి మానేసే వారి నిష్పత్తిని తగ్గించడంలో మనం 100 శాతం కంటే తక్కువ ఫలితంతో సంతృప్తి చెందకూడదన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బడి మానేసే వారి నిష్పత్తి 9.5 శాతంగా ఉందనీ, అన్ని రాష్ట్రాలు స్వల్ప మెరుగుదల కనబరిచినా దీనిని 3 శాతం కంటే తక్కువకు తీసుకురాగలమని శ్రీ షా పేర్కొన్నారు. బడి మానేసే వారి నిష్పత్తి జాతీయస్థాయిలో 3 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు, పిల్లలు విద్యావంతులైన పౌరులుగా ఎదుగుతారన్నారు. అప్పుడు రాజ్యాంగ స్ఫూర్తిని దాని నిజమైన అర్థంతో క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి దేశంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుందనీ శ్రీ షా పేర్కొన్నారు.
పోషకాహార లోపంపైనా మనం ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర హోం మంత్రి సూచించారు. పోషకాహార పథకాలకు, పాఠశాల స్థాయిలో చదువు మానేసే వారి (డ్రాపౌట్స్) సంఖ్యకు మధ్య సంబంధం ఉందని తెలిపారు. ఎదుగుదల లోపమనే మరింత ప్రమాదకరమైన సమస్య దిశగా మనం పయనిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇది క్రమంగా మన భావి తరాల సామర్థ్యాలను దెబ్బతీసే జాతీయ సమస్యగా మారుతున్నట్లు కనిపిస్తోందన్నారు. పోషకాహార లోపం, ఎదుగుదల లోపం వంటి సమస్యలను మనం అత్యంత తీవ్రంగా పరిగణించాలని సూచించారు. పోషకాహార లోపానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఇప్పటికే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రారంభించాయనీ, అది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆమోదం పొందిందని శ్రీ షా తెలిపారు. ఇప్పుడు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు గడుస్తున్నా పోషకాహార లోపంతో బాధపడే పిల్లల భారాన్ని మనం దేశంపై ఉంచలేమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రుల స్థాయిలో ఈ సమస్య పట్ల సున్నితత్వంతో కూడిన విధానాలు అమలు చేస్తే... దేశాన్ని ఈ సమస్య నుంచి త్వరలోనే విముక్తం చేయవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. విద్యావంతులైన, ఆరోగ్యవంతులైన ప్రజలతో కూడిన దేశాన్ని నిర్మించడం కోసం కృషి చేయడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు.
మాదకద్రవ్య రహిత భారత్ను సాకారం చేసుకోవడం ప్రస్తుతం ప్రతి ప్రభుత్వానికీ, సమాజానికీ అత్యవసరమని శ్రీ అమిత్ షా అన్నారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ మూడేళ్ల కార్యాచరణ ప్రణాళికను దీని కోసం రూపొందించిందని తెలిపారు. ఇందులో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ శాఖల బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల శాఖలు ఈ ఉద్యమంలో భాగస్వాములు కానంత వరకూ, రాబోయే తరాలను దీని బారి నుంచి రక్షించలేమని తెలిపారు. విద్యావంతులైన, ఆరోగ్యవంతులైన ప్రజలు గల దేశాన్ని నిర్మించడం కోసం కృషి చేయడం మనందరి బాధ్యత అని శ్రీ అమిత్ షా పునరుద్ఘాటించారు.
***
(रिलीज़ आईडी: 2301772)
आगंतुक पटल : 6