రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

4.76 కోట్లకు చేరిన రైల్‌వన్ యాప్ డౌన్‌లోడ్‌లు; రోజుకు సగటున 10 లక్షల టికెట్‌ బుకింగ్‌లు


రైల్‌వన్ యాప్ ద్వారా ఒకే వేదికపై రిజర్వ్‌డ్, అన్‌రిజర్వ్‌డ్, ప్లాట్‌ఫారమ్ టికెట్ల బుకింగ్‌తో పాటు రైలు, పీఎన్ఆర్ వివరాలు, ప్రయాణికుల ఫిర్యాదులు, సమస్యలు సహాయ అభ్యర్థనల పరిష్కారం

రైల్వే విచారణ కౌంటర్ల వద్ద క్యూ లైన్లు, వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తూ, రోజూ 6 కోట్లకు పైగా విచారణలను, ఒకే సమయంలో 80,000మంది వినియోగదారుల సేవా అభ్యర్థనలను పరిష్కస్తున్న ఎన్టీఈఎస్

प्रविष्टि तिथि: 12 AUG 2026 4:58PM by PIB Hyderabad

రిజర్వ్‌డ్‌తో పాటు అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్ల కొనుగోలును డిజిటల్‌ విధానంలో మరింత విస్తరించే ఉద్దేశంతో రైల్వే శాఖ 01.07.2025న రైల్‌వన్‌ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్‌ ద్వారా ప్రయాణికులు తమ మొబైల్‌ ఫోన్‌లోనే రిజర్వ్‌డ్‌, అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ ద్వారా భారతీయ రైల్వేలకు సంబంధించిన రిజర్వ్‌డ్‌ టికెట్‌ బుకింగ్‌, అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్‌ బుకింగ్‌, ప్లాట్‌ఫారమ్‌ టికెట్‌ బుకింగ్‌, రైలు వివరాల, పీఎన్ఆర్‌ వివరాల పరిశీలన, ప్రయాణికుల ఫిర్యాదులు, సమస్యలు, సహాయ అభ్యర్థనల పరిష్కార (రైల్‌మదద్‌) సేవలన్నీ ఒకే వేదికపై అందుబాటులోకి వచ్చాయి.  ఈ యాప్‌లో సింగిల్‌ సైన్‌-ఆన్‌ (ఎస్ఎస్ఓ)  సదుపాయం ద్వారా వినియోగదారులు ఒకే లాగిన్‌తో అనేక రైల్వే సేవలను పొందవచ్చు. దీంతో రైల్వేలకు సంబంధించిన పలు యాప్‌లను వేర్వేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరం, అనేక పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాల్సిన ఇబ్బంది తొలగిపోయింది.

02.08.2026 నాటికి రైల్‌వన్‌ యాప్‌ ద్వారా జరిగిన లావాదేవీల వివరాలు  క్రింద విధంగా ఉన్నాయి:

రోజువారీ సగటున టిక్కెట్లు

10  లక్షలు

రిజర్వుడ్ టికెట్లు 

2.79 లక్షలు

అన్ రిజర్వ్ టికెట్లు 

7.24 లక్షలు

డౌన్లోడ్లు

4.76 కోట్లు

2000లో ప్రారంభించిన నేషనల్‌ ట్రైన్‌ ఎంక్వైరీ సిస్టమ్‌ (ఎన్టీఈఎస్) ద్వారా ప్రయాణికులకు రైళ్ల రాకపోకల స్థితి, రైళ్ల షెడ్యూళ్లతో సహా ఎప్పటికప్పుడు రైళ్ల నడకకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు. విచారణ కౌంటర్లు, ఎన్‌టీఈఎస్‌ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌లు (ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌), దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న రైల్‌ ఎంక్వైరీ నంబర్‌ 139 వంటి పలు మార్గాల ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీని ప్రధాన ఫీచర్లలో ‘స్పాట్‌ యువర్‌ ట్రైన్‌’, ‘లైవ్‌ స్టేషన్‌’, ‘ట్రైన్‌ షెడ్యూల్‌’, ‘ట్రైన్స్‌ బిట్వీన్‌ స్టేషన్స్‌’ ఉన్నాయి. వీటి ద్వారా ప్రయాణికులు విశ్వసనీయమైన, ప్రామాణికమైన రైలు సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. ఎన్‌టీఈఎస్‌ మొబైల్‌ యాప్‌ను అక్టోబర్‌ 2014లో ఆండ్రాయిడ్‌, అక్టోబర్‌ 2015లో ఐఓఎస్‌ కోసం ప్రారంభించారు. 01.08.2026 నాటికి ఆండ్రాయిడ్‌లో 4.5 కోట్లకు పైగా, ఐఓఎస్‌లో 16 లక్షలకు పైగా డౌన్‌లోడ్‌లు నమోదయ్యాయి. ప్రస్తుతం ఎన్‌టీఈఎస్‌ ఒకేసారి సుమారు 80,000 మంది వినియోగదారుల సేవలను నిర్వహిస్తూ, రోజుకు 6 కోట్లకు పైగా విచారణలను ప్రాసెస్‌ చేస్తోంది. ఈ సేవకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

ప్రయాణికులకు వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌లు, రైల్‌ ఎంక్వైరీ నంబర్‌ 139 వంటి పలు డిజిటల్‌ వేదికల ద్వారా ప్రామాణికమైన, ఎప్పటికప్పుడు రైళ్ల ప్రయాణ సమాచారాన్ని సులభంగా అందించే నేషనల్‌ ట్రైన్‌ ఎంక్వైరీ సిస్టమ్‌ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు రైల్వే విచారణ కౌంటర్లను సందర్శించే అవసరం గణనీయంగా తగ్గింది. ఫలితంగా విచారణ కౌంటర్ల వద్ద క్యూలు, నిరీక్షణ సమయం కూడా తగ్గాయి.

రైలు రద్దు అయిన సందర్భాల్లో, ఆన్‌లైన్‌ ఈ - టికెటింగ్‌ వ్యవస్థ (నెక్స్ట్ జనరేషన్ ఈ టికెటింగ్-ఎన్జీఈటీ) రైలు బయలుదేరే నిర్ణీత సమయం ముగిసిన వెంటనే రీఫండ్‌ ప్రక్రియను స్వయంచాలకంగా ప్రారంభిస్తుంది. వర్తించే రీఫండ్‌ మొత్తాన్ని ప్రయాణికుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. రైలు రద్దుతో సంబంధం ఉన్న ఆటోమేటిక్‌ రీఫండ్‌ సదుపాయం ప్రస్తుతం ఆన్‌లైన్‌లో బుక్‌ చేసిన ఈ - టికెట్లకు మాత్రమే అందుబాటులో ఉంది. కౌంటర్‌ టికెట్లకు ఈ సదుపాయం లేదు. కాబట్టి కౌంటర్‌ టికెట్‌ కలిగిన ప్రయాణికుడు రీఫండ్‌ కోసం సమీపంలోని ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌ (పీఆర్ఎస్) కౌంటర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

రైల్‌వన్‌ భారతీయ రైల్వేల అధికారిక యాప్‌. భారతీయ రైల్వేలకు సంబంధించి ప్రజలకు అందుబాటులో ఉన్న అన్ని సేవలను ఒకే వేదికపై అందిస్తుంది. ఈ యాప్‌ ద్వారా రిజర్వ్‌డ్‌, అన్‌రిజర్వ్‌డ్‌, ప్లాట్‌ఫారమ్‌ టికెట్ల బుకింగ్‌, ప్రయాణ ప్రణాళిక, రైలు సమాచారం, ప్రయాణికుల సహాయ సేవలు తదితర రైల్వే సేవలను ఒకే, సమగ్ర మొబైల్‌ యాప్‌ ద్వారా సులభంగా పొందవచ్చు.

ప్రస్తుతం రిజర్వ్‌డ్‌  టికెట్లలో సుమారు 89 శాతం ఆన్‌లైన్‌లోనే బుక్‌ అవుతున్నాయి. 2013 - 14లో ఈ సంఖ్య సుమారు 49 శాతంగా ఉండేది. వివిధ కౌంటర్‌ రహిత విధానాల ద్వారా బుక్‌ చేసే అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్ల సంఖ్య కూడా దాదాపు 39 శాతానికి పెరిగింది.

రైల్వే, సమాచార ప్రసార, ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌ ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు తెలిపారు. 

 

***


(रिलीज़ आईडी: 2298695) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Kannada