పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ఈ20 పెట్రోల్లో తేమ, క్లోరైడ్ ఉనికిని పరీక్షించిన చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు): 500 పీపీఎం క్లోరైడ్, తేమ ఉందన్నది అవాస్తవం
प्रविष्टि तिथि:
08 AUG 2026 11:20AM by PIB Hyderabad
ఈబీఎంఎస్ (ఈ20 పెట్రోల్)లో తేమ, క్లోరైడ్ ఉన్నట్లు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈబీఎంఎస్ సరఫరా వ్యవస్థలో ఓఎంసీలు సమగ్ర పరీక్షలు నిర్వహించాయి. ఇంధన నాణ్యత నిర్దేశించిన విధంగానే ఉన్నట్లు ఫలితాల్లో వెల్లడైంది. శాస్త్రీయ పద్ధతిలో విస్తృతంగా నిర్వహించిన పరీక్షల్లో... మీడియాలో వచ్చిన ఆరోపణలకు విరుద్ధంగా, ఇంధన కాలుష్యంపై ఆందోళన అవసరం లేదని రుజువైనట్లు ఓఎంసీలు తెలిపాయి.
ఇంధన నాణ్యత అత్యంత ప్రాధాన్యత గల అంశమని ఓఎంసీలు తెలిపాయి. వాహనాల పనితీరుపై లేదా వినియోగదారుల విశ్వాసంపై ప్రభావం చూపే ఏ సమస్యనైనా శాస్త్రీయ పద్ధతిలో విచారించి, వెంటనే దిద్దుబాటు చర్యలు చేపడతామని గౌరవ వినియోగదారులందరికీ హామీ ఇస్తున్నట్లు వెల్లడించాయి.
పెట్రోల్ బ్లెండింగ్లో ఉపయోగించే ఇథనాల్ కోసం భారత ప్రభుత్వం కఠినమైన క్లోరైడ్ ప్రమాణాలను నిర్దేశించింది. సరఫరా వ్యవస్థ వ్యాప్తంగా నిబంధనలను పాటించేలా చేసేందుకు అత్యంత నాణ్యతా పర్యవేక్షణ విధానాన్ని ఏర్పాటు చేసింది. రిఫైనరీలు, డిస్టిలరీలు, డిపోలు, టెర్మినళ్లు, దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ కేంద్రాలతో సహా సరఫరా వ్యవస్థలోని అనేక ప్రదేశాల్లో క్లోరైడ్ పర్యవేక్షణ జరుగుతోంది. దీనిద్వారా సరఫరా వ్యవస్థలో నాణ్యత స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న నాణ్యతా ప్రమాణాలతో పాటు ప్రతీ రిటైల్ కేంద్రాల్లో రోజుకు 8 నుంచి 12సార్లు తేమ, సాంద్రత పరీక్షలను నిర్వహించటం ద్వారా ఓఎంసీలు నిఘాను కఠినతరం చేశాయి. అత్యున్నత నాణ్యతా ప్రమాణాల నిర్ధారణకు, సొంత ఇంధన ప్రయోగశాలల పరీక్షా ఫలితాలను ధ్రువీకరిస్తూ... వివిధ ప్రాంతాల్లో సంచార ఇంధన పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాయి.
సరఫరా వ్యవస్థ అంతటా అమలైన ఈ బహుళ, పటిష్టమైన పరీక్షా విధానాలు.. ఇంధన నాణ్యతా ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉన్నట్లు నిరూపించాయి.
1. రిఫైనరీ నుంచి ఎమ్ఎస్: పెట్రోల్లో వాస్తవ క్లోరైడ్ స్థాయిలు 1 పీపీఎం కన్నా తక్కువ...
వివిధ రిఫైనరీల నుంచి ఎంపిక చేసిన 100కి పైగా పెట్రోల్ నమూనాలను పరీక్షించగా.. క్లోరైడ్ పరిమాణం తక్కువగా ఉన్నట్లు తెేలింది. పరీక్షించిన నమూనాలన్నింటిలోనూ క్లోరైడ్ స్థాయి 1 పీపీఎం లేదా అంతకన్నా తక్కువగా ఉంది. ఇది భారతదేశ బలమైన రిఫైనింగ్, సరఫరా ప్రక్రియలో నాణ్యతా తనిఖీల నిరంతర ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది.
2. స్వచ్ఛమైన ఇథనాల్ ఇఎక్స్ డిస్టిలరీ:
మిశ్రమం తయారీలో ప్రధానమైన డిస్టిలరీలు సరఫరా చేసే ఇథనాల్లో క్లోరైడ్ స్థాయిలు ఎల్లప్పుడూ నిర్దేశిత ప్రమాణాల కంటే చాలా తక్కువగానే నమోదవుతున్నాయి. ఇది ఉత్పత్తి దశలో పటిష్టమైన నాణ్యతా నియంత్రణ విధానాలు అమల్లో ఉన్నట్లు తెలియజేస్తుంది.
గత 10 రోజుల్లో దేశవ్యాప్తంగా 80 డిస్టిలరీల నుంచి ఇథనాల్ నమూనాలను సేకరించి.. ఓఎంసీలు, సీహెచ్టీ సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పరిశీలించింది. పరీక్షించిన అన్ని నమూనాల్లోనూ క్లోరైడ్ పరిమాణం 3 పీపీఎం కన్నా తక్కువగా ఉన్నట్లు తేలింది.
3. ఓఎంసీల మార్కెటింగ్ మౌలిక సదుపాయాల ద్వారా పంపిణీ అయ్యే ఇథనాల్ బ్లెండెడ్ ఎంఎస్ (ఈ20):
డిపోలు, ట్యాంకు లారీలు: డిపోలు, టెర్మినళ్లలో పరీక్షించిన ఇథనాల్, ఈ20 నమూనాల్లో క్లోరైడ్ స్థాయిలు పరిమితులకు లోబడి ఉన్నట్లు తేలింది. క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ద్వారా ఇంధనం నిల్వ, పంపిణీ వ్యవస్థలో నాణ్యత దెబ్బతినకుండా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ఓఎంసీ టెర్మినళ్ల నుంచి సేకరించిన 80కి పైగా నమూనాల్లో క్లోరైడ్ పరిమాణం 3 పీపీఎం కన్నా తక్కువగా ఉన్నట్లు నిర్దారణ అయింది.
రిటైల్ కేంద్రాలు (ఆర్ఓ): నిఘా కార్యక్రమంలో భాగంగా వెయ్యికి పైగా నమూనాలను సేకరించగా, క్లోరైడ్ పరిమాణానికి సంబంధించి ఇప్పటివరకు 160 పరీక్షా నివేదికలను విశ్లేషించారు. గత కొన్ని రోజులుగా క్లోరైడ్ స్థాయిలు సున్నా నుంచి 3 పీపీఎం పరిధిలోనే ఉన్నట్లు తేలింది. ఇది వందల కొద్ది పీపీఎం ఉందన్న పలువురి వాదనలకు విరుద్ధంగా ఉంది. కేవలం నాలుగు వేర్వేరు సందర్భాల్లో మాత్రమే క్లోరైడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు పర్యవేక్షణ వ్యవస్థ గుర్తించింది. వాటి సరఫరాను వెంటనే నిలిపివేసి, పరిస్థితిని విశ్లేషించి, దిద్దుబాటు చర్యలు చేపట్టిన తర్వాతే తిరిగి సరఫరాను పునరుద్ధరించారు.
4. తేమ పరీక్ష:
భూగర్భ ట్యాంకుల్లో నిల్వల తనిఖీ, పర్యవేక్షణను తప్పనిసరి చేస్తూ దాదాపు 90,000 రిటైల్ కేంద్రాల్లో (ఆర్ఓ) ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఆర్ఓల్లోని భూగర్భ ట్యాంకులను రోజూ 8-12 సార్లు తనిఖీ చేస్తుండగా... తేమ ఉన్నట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.
ఈ పరీక్షలకు సంబంధించిన వివరాలు పట్టిక రూపంలో సీహెచ్టీ అధికారిక వెబ్సైట్ www.cht.gov.in. లో అందుబాటులో ఉంది. మరిన్ని పరీక్షా ఫలితాలు అందుబాటులోకి వచ్చినప్పుడు అది అప్డేట్ అవుతుంది.
ఇంధన నాణ్యతే అత్యంత ప్రధానమైన అంశమని వినియోగదారులకు చమురు మార్కెట్ కంపెనీలు భరోసా ఇస్తున్నాయి. సరఫరా వ్యవస్థ అంతటా నాణ్యతను నిరంతరం పరిశీలిస్తూనే ఉంటామని, లోపాలు తలెత్తితే తక్షణమే కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి.
ఎలాంటి సందేహాలు లేకుండా వినియోగదారులు ఈ20 పెట్రోలును ఉపయోగించవచ్చని, ఓఎంసీ వ్యవస్థ ద్వారా సరఫరా అయ్యే ఇంధనం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని కంపెనీలు స్పష్టం చేశాయి. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు పటిష్టమైన నాణ్యత, పర్యవేక్షణ వ్యవస్థలు అమలవుతున్నట్లు తెలిపాయి.
***
(रिलीज़ आईडी: 2296526)
आगंतुक पटल : 6