ఆర్థిక మంత్రిత్వ శాఖ
పాకిస్తాన్ నుంచి నిషేధిత ఎండు ఖర్జూరాల దిగుమతిని అడ్డుకున్న డీఆర్ఐ... స్వాధీనం చేసుకున్న 364 మిలియన్ టన్నుల (ఎంటీ) ఖర్జూరాల విలువ రూ.3 కోట్లు
యూఏఈ నుంచి దిగుమతి అయినట్లు తప్పుడు ప్రకటన చేసి, పాకిస్తాన్ ఎండు ఖర్జూరాలను కండ్లా నౌకాశ్రయానికి తీసుకెళ్తున్న 13 కంటైనర్లను అడ్డుకున్న డీఆర్ఐ
పాకిస్తాన్ నుంచి ఉత్పత్తుల దిగుమతిని నిషేధించిన భారత్
प्रविष्टि तिथि:
05 AUG 2026 12:22PM by PIB Hyderabad
పాకిస్తాన్ ఉత్పత్తుల దిగుమతులపై భారత్ నిషేధం విధించింది. ఇందుకు వ్యతిరేకంగా మూడో దేశం ద్వారా పాకిస్తాన్కు చెందిన వస్తువులను రహస్యంగా భారత్కు మళ్లించటం, తప్పుడు ప్రకటన చేయటాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వెలుగులోకి తెచ్చింది. ఈ ఆపరేషన్ ఫలితంగా రూ. 3 కోట్ల విలువైన 364 ఎంటీల పాకిస్తాన్కు చెందిన ఎండు ఖర్జూరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నిఘా వర్గాల సమాచారంతో చేపట్టిన ఆపరేషన్లో కాండ్లా ఓడరేవుకు దిగుమతి అయిన సుమారు రూ. 3 కోట్ల విలువైన 364 ఎంటీల ఎండు ఖర్జూరాలతో ఉన్న 13 కంటైనర్లను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సరకు యూఏఈ నుంచి వచ్చినట్లు ప్రకటించినప్పటికీ, అది పాకిస్తాన్కు చెందినదని విచారణలో తేలింది.
ఈ కంటైనర్లను మొదట పాకిస్తాన్ నుంచి దుబాయ్కి తరలించి, ఆ తర్వాత భారతదేశానికి పంపటానికి ముందుగా వేరే కంటైనర్లకు మార్చినట్లు విచారణలో తేలింది. పాకిస్తాన్ వస్తువుల దిగుమతిపై ఉన్న నిషేధాన్ని తప్పించుకునే క్రమంలో దిగుమతిదారులు కీలకమైన వాస్తవాలను దాచిపెట్టి, సరకు ఏ దేశానికి చెందినదో తప్పుగా ప్రకటించినట్లు ఆరోపణలున్నాయి. దీని ప్రకారం కస్టమ్స్ చట్టం-1962లోని సంబంధిత నిబంధనల ద్వారా మొత్తం సరకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గతవారంలో టూటికోరిన్ ఓడరేవులో వస్తువుల వివరాలు, ఉత్పత్తి దేశాన్ని తప్పుగా పేర్కొంటూ... పాకిస్తాన్కు చెందిన సుమారు 14 ఎంటీల గుగ్గులు రెసిన్ను అక్రమంగా దిగుమతి చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని డీఆర్ఐ అధికారులు భగ్నం చేశారు. సుమారు రూ. 1.4 కోట్ల విలువైన ఈ సరకును సోమాలియాలో తయారైన సహజమైన రెసిన్గా, దుబాయ్ మీదుగా వచ్చినట్లు తప్పుడు ప్రకటన చేశారని అధికారులు గుర్తించారు.
భారత్, పాకిస్తాన్లోని ఎడారి ప్రాంతాల్లో అంతరించిపోతున్న మొక్కల జాతికి చెందిన గుగ్గులు రెసిన్ (కమ్మిఫోరా రెసిన్), సీఐటీఈఎస్ అనుబంధం-2 జాబితాలో చేర్చారు. ఐయూసీఎన్ రెడ్ లిస్టులో అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్న జాతిగా దీన్ని వర్గీకరించారు. రవాణా చేసిన సరకు గుగ్గులు రెసిన్ అని, ఇది పాకిస్తాన్కు చెందినదని, నకిలీ పత్రాలను ఉపయోగించి అక్రమంగా రవాణా చేసినట్లు తనిఖీల్లో తేలింది. ఈ కుట్రలో భాగమైన ఇద్దరు వ్యక్తులు కూడా అరెస్టయ్యారు.
02.05.2025 తేదీ నాటి డీజీఎఫ్టీ నోటిఫికేషన్ నెం. 06, 2025-26 ద్వారా సవరించిన విదేశీ వాణిజ్య విధానం-2023 ప్రకారం... పాకిస్తాన్లో ఉత్పత్తి అయిన లేదా పాకిస్తాన్ నుంచి ఎగుమతి అయ్యే అన్ని రకాల వస్తువుల ప్రత్యక్ష లేదా పరోక్ష దిగుమతి లేదా రవాణాను, 02.05.2025 నాటి నుంచి నిషేధించారు. రెండు సందర్భాల్లోనూ జరిగిన దిగుమతులు నిషేధానికి విరుద్ధంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అక్రమ రవాణా, కస్టమ్స్ మోసాలు, ఇతర రకాల చట్టవిరుద్ధమైన అంతర్జాతీయ వాణిజ్యాల్లో నిమగ్నమైన వ్యవస్థీకృత నెట్వర్కులను గుర్తించేందుకు, అడ్డుకునేందుకు, నిర్మూలించేందుకు ఈ విజయవంతమైన ఆపరేషన్లు... డీఆర్ఐ చేస్తున్న నిరంతర ప్రయత్నాలను స్పష్టం చేస్తున్నాయి.
***
(रिलीज़ आईडी: 2294795)
आगंतुक पटल : 7