ప్రధాన మంత్రి కార్యాలయం
ఆగస్టు 1న ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ప్రధానమంత్రి పర్యటన
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో రూ. 17,900 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభం, జాతికి అంకితం చేయనున్న ప్రధాని
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని
విమానయానాన్ని బలోపేతం చేసేలా, ప్రాంతీయ వృద్ధిని ప్రోత్సహించేలా రూ. 5,640 కోట్ల వ్యయంతో అత్యాధునిక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణం
ఆంధ్రప్రదేశ్లోని చుట్టిల్లు కాటేజీలు, అరకు లోయ, ఎగిరే చేప స్ఫూర్తిగా తీర్చిదిద్దిన విమానాశ్రయ టెర్మినల్
ఆంధ్రప్రదేశ్లోని మొదటి సెమీ కండక్టర్ తయారీ కేంద్రానికి ప్రధాని శంకుస్థాపన
మైసూరులోని శ్రీ రామకృష్ణ ఆశ్రమంలో స్వామి వివేకానంద యూత్ సెంటర్ – వివేక స్మారకను ప్రారంభించనున్న ప్రధాని
1892 నవంబర్లో స్వామి వివేకానంద చారిత్రక పర్యటనకు గుర్తుగా వివేక స్మారకం ఏర్పాటు
విలువ ఆధారిత విద్య, నాయకత్వం, వ్యక్తిత్వ వికాసం ద్వారా యువతలో స్ఫూర్తి నింపే వివేక స్మారకం
प्रविष्टि तिथि:
31 JUL 2026 9:56AM by PIB Vijayawada
ఈ ప్రాజెక్టులో అనేక పర్యావరణహిత సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వీటిలో తక్కువ విద్యుత్తును ఉపయోగించే హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ (హెచ్వీఏసీ) వ్యవస్థలు, విద్యుత్తును ఆదా చేసే లైటింగ్, 5 మెగా వాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం, వర్షపు నీటి నిల్వ వ్యవస్థ, స్మార్ట్ బిల్డింగ్ నిర్వహణ వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలు, విద్యుత్ వాహన ఛార్జింగ్ వసతులు, పర్యావరణ పర్యవేక్షణ చర్యలు ఉన్నాయి. హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా ఈ టెర్మినల్ను నిర్మించారు. యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (యూఎస్జీబీసీ)లో నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. టెర్మినల్ పై కప్పు... సంప్రదాయ చుట్టిల్లు కాటేజీలను, అరకు లోయ ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబిస్తుంది. అలాగే ఎగిరే చేప కదలికలను గుర్తు చేసేలా, ప్రాంతీయ నిర్మాణ శైలి, ఆధునిక విమానాశ్రయ డిజైన్ మేళవింపుగా దీనిని తీర్చిదిద్ధారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ఈ విమానాశ్రయం గణనీయమైన రీతిలో ప్రోత్సహిస్తుందనీ, ఈ ప్రాంతంలో విమానయాన అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
విశాఖపట్నంలో రూ.460 కోట్లకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేస్తున్న ఏఎస్ఐపీ సెమీకండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీనిని కొరియా రిపబ్లిక్కు చెందిన ఏపీఏసీటీ భాగస్వామ్యంతో ఏఎస్ఐపీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్లో తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం. దీనికి ఇండియా సెమీ కండక్టర్ మిషన్ పరిధిలో ఆమోదం లభించింది. ఈ ప్లాంట్ ఏటా సుమారు 96 మిలియన్ల సెమీకండక్టర్ చిప్లను తయారు చేయడంతో పాటు అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది. అదే సమయంలో సెమీకండక్టర్ తయారీకి తోడ్పాటు అందించేలా పటిష్టమైన అనుబంధ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది.
కర్నూల్- IV పునరుత్పాదక ఇంధన జోన్ (ఆర్ఈజడ్)- ఫేజ్- I (4.5 గిగావాట్లు) ఏకీకరణ కోసం ఏర్పాటు చేసే సరఫరా వ్యవస్థకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీనిని స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ద్వారా రూ.5,550 కోట్ల పెట్టుబడితో పవర్ గ్రిడ్ అమలు చేస్తోంది.
రూ.3,550 కోట్ల వ్యయంతో నిర్మించే కర్నూలు పవన విద్యుత్ జోన్/సౌర విద్యుత్ జోన్ (ఆంధ్రప్రదేశ్)- పార్ట్ ఏ, పార్ట్ బీ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అలాగే రూ.820 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన అనంతపురం (2,500 మెగావాట్లు), కర్నూలు (1,000 మెగావాట్లు) సౌర విద్యుత్ జోన్ల ట్రాన్స్మిషన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. దీనిని పవర్ గ్రిడ్ ద్వారా అమలు చేస్తున్నారు.
ఈ సరఫరా ప్రాజెక్టులు... కర్నూలు, అనంతపురంలో ఉన్న పునరుత్పాదక ఇంధన జోన్ల నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ తరలింపును సులభతరం చేస్తాయి. తద్వారా జాతీయ గ్రిడ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు విద్యుత్ సరఫరా చేస్తాయి. అలాగే భారీ పరిమాణంలో పునరుత్పాదక విద్యుత్తును అనుసంధానించడాన్ని కూడా సులభతరం చేస్తాయి. డిమాండ్ ఉన్న ప్రాంతాలకు స్వచ్ఛ విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తాయి. శిలాజ ఇంధన ఆధారిత విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా భారతదేశ ఇంధన పరివర్తన, డీకార్బనైజేషన్ ప్రయత్నాలకు తోడ్పాటునందిస్తాయి.
రూ.1,880 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. జాతికి అంకితమిస్తారు. ఎన్హెచ్-365బీజీలో రేచర్ల నుంచి గురవాయిగూడెం వరకు ఉన్న సెక్షన్లో నాలుగు లేన్ల ప్రవేశ నియంత్రిత గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారినీ, ఎన్హెచ్-365బీజీలో గురవాయిగూడెం నుంచి దేవరపల్లి వరకు ఉన్న సెక్షన్లో నాలుగు లేన్ల ప్రవేశ నియంత్రిత గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారినీ, ఎన్హెచ్-67పై నాలుగు లేన్ల తాడిపత్రి బైపాస్నూ జాతికి అంకితమిస్తారు. ఎన్హెచ్-565లోని పెంచలకోన-యేర్పేడు విభాగంలో లింగసముద్రం వద్ద హైలెవెల్ వంతెనకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులన్నీ విజయవాడ, ఇతర నగరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి. రోడ్డు భద్రతను పెంపొందిస్తాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరాన్ని, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి. ప్రాంతీయ అనుసంధానాన్ని పెంపొందిస్తాయి.
కర్ణాటకలో పీఎం
కర్ణాటకలోని స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ –వివేక స్మారకను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రారంభిస్తారు.
భారతదేశ వ్యాప్తంగా చేపట్టిన పర్యటనలో భాగంగా 1892 నవంబర్లో స్వామి వివేకానంద మైసూరును సందర్శించారు. ఆ చారిత్రక సందర్భానికి గుర్తుగా వివేక స్మారకాన్ని నిర్మించారు. ఈ ప్రాంతంలో ఆయన బస చేసి, ప్రసంగాలు చేశారు. పండితులు, భక్తులతో సంభాషించారు. అలాగే మహారాజా శ్రీ చామరాజేంద్ర వడియార్-X ఆదరణను పొందారు. ఆయన అందించిన సహకారంతోనే 1893లో షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద పాల్గొన్నారు.
చరిత్రాత్మక నిరంజన మఠంలో 81,000 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో వివేక స్మారక ఏర్పాటయింది. దీనిలో ఒక ప్రధాన భవనం, అనుబంధ భవనం ఉన్నాయి. ఇందులో 4-డీ ఎక్స్పీరియన్స్ సెంటర్, ఎగ్జిబిషన్ హాల్, 700 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న యాంఫీ థియేటర్, తరగతి గదులు, సమావేశ గదులు, గ్రంథాలయం, రీడింగ్ రూం, ధ్యానం, యోగా హాలు, బుక్ స్టాల్ ఉన్నాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కూడా ఈ కేంద్రంలో ఉన్నాయి.
స్వామి వివేకానంద జీవితం, సందేశం, ఆదర్శాలకు అంకితమైన ఈ సాంస్కృతిక యువజన కేంద్రం... విలువ ఆధారిత విద్యకూ, నాయకత్వ అభివృద్ధికీ, వ్యక్తిత్వ వికాసానికీ తోడ్పడే చైతన్య కేంద్రంగా పనిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనివల్ల సమీపంలోని విద్యాసంస్థల్లో చదువుతున్న 10,000 మందికి ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. జాతి నిర్మాణం, వ్యక్తిత్వ అభివృద్ధి దిశగా- స్వామి వివేకానంద తాత్వికత స్ఫూర్తిగా- ఇక్కడ నిర్వహించే ఉపన్యాసాలు, వర్కుషాపులు, స్వల్పకాల వ్యవధి కోర్సులు, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు... గ్రామీణ, పట్టణ ప్రాంత యువతకు ప్రయోజనం చేకూరుస్తాయి.
***
(रिलीज़ आईडी: 2292468)
आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam