ప్రధాన మంత్రి కార్యాలయం
2026 వ సంవత్సరం జూలై 26 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 136 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
प्रविष्टि तिथि:
26 JUL 2026 12:08PM by PIB Hyderabad
ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మన జీవితంలో కొన్ని తేదీలను గుర్తుంచుకోవడానికి క్యాలెండర్ చూడాల్సిన అవసరం లేదు. ఈ రోజు- జూలై 26- అలాంటి ఒక తేదీ. ఈ రోజు 'కార్గిల్ విజయ్ దివస్'. ఈ రోజు మనలో గర్వాన్ని నింపుతుంది. మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తుంది. కార్గిల్లోని ఎత్తైన శిఖరాలు, కఠినమైన వాతావరణం, శత్రువుల సవాళ్లు- ఇలాంటి పరిస్థితులను ఎన్నో మన సైనికులు ఎదుర్కొన్నారు. కానీ వారి ధైర్యం ప్రతి సవాలునూ అధిగమించింది. వారు మాతృభూమిని రక్షించడానికి సర్వస్వం త్యాగం చేశారు. ఈ రోజు 'కార్గిల్ విజయ్ దివస్' సందర్భంగా అమరవీరులందరికీ, ధైర్యవంతులైన సైనికులందరికీ నేను నా గౌరవపూర్వక నివాళులు అర్పిస్తున్నాను.
మిత్రులారా! నేటి భారతదేశం తన వీరులను స్మరించుకోవడమే కాకుండా వారి కథలను కొత్త తరాలకు అందిస్తోంది. ఈ స్ఫూర్తితో ఈ సంవత్సరం ఒక ప్రత్యేక 'శౌర్య విజయ యాత్ర' జరిగింది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నుండి జూలై 14న ప్రారంభమైన ఈ మోటార్ సైకిల్ యాత్ర ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వరకు చేరుకుంటుంది. దీని సందేశం "ఒకే ప్రయాణం, ఒకే దేశం, ఒకే వందనం." దేశం కోసం చేసిన త్యాగాలను ఎన్నటికీ మరచిపోలేమని ఈ యాత్ర మనకు గుర్తు చేస్తుంది.
మిత్రులారా! నేడు భారతదేశం తన సైనికుల సాహసంతో పాటు సాంకేతిక సామర్థ్యాలను కూడా నిరంతరం బలోపేతం చేసుకుంటోంది. కొన్ని రోజుల కిందట ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళంలోకి చేర్చారు. ఈ ఆధునిక యుద్ధనౌకను భారతదేశంలోనే రూపకల్పన చేసి, నిర్మించారు. దీనిలోని 75 శాతానికి పైగా సామగ్రి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఇది ఆత్మనిర్భర భారతదేశం విషయంలో పెరుగుతున్న శక్తికి ప్రతీక. ఈ నెలలో పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయం మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సామూహిక కృషి ఫలితం. రెండు మూడు రోజుల కిందటే కుశ క్షిపణిని కూడా డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది.
మిత్రులారా! నేడు రక్షణ ఉత్పత్తి, రక్షణ ఎగుమతులు లేదా మిత్ర దేశాలతో రాజకీయ సహకారం వంటి ఏ విషయంలో అయినా సరే- భారతదేశం నిరంతరం కొత్త శిఖరాల వైపు దూసుకుపోతోంది. ఈ నెల మొదట్లో నేను ఇండోనేషియాలో ఉన్నాను. అక్కడ బ్రహ్మోస్, అస్త్ర క్షిపణుల కోసం ఒక కీలకమైన ఒప్పందం కుదిరింది. భారతదేశ రక్షణ పరికరాలు, సాంకేతికతపై ప్రపంచ విశ్వాసం పెరుగుతోంది. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన అమరవీరులకు నివాళులర్పిద్దాం. సురక్షితమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించాలనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుందాం.
నా ప్రియమైన దేశవాసులారా! 'మన్ కీ బాత్' కార్యక్రమం కిందటి ఎపిసోడ్లో నేను 'క్యాచ్ ది రెయిన్' ప్రచారం గురించి చర్చించాను. ప్రతి వర్షపు చినుకును కాపాడే ఈ ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని నేను మిమ్మల్ని కోరాను. ‘క్యాచ్ ది రెయిన్’ సందేశం చాలా సరళమైనది: వాననీరు ఎక్కడ పడినా, ఎప్పుడు పడినా దాన్ని సంరక్షించండి. జూలై 4వ తేదీ నుండి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం కింద వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం- గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, పాత నీటి వనరుల పునరుద్ధరణ మొదలైన కార్యక్రమాలతో పాటు వృక్షారోపణ- అంటే మొక్కలు నాటడానికి కొత్త ఊపునిస్తున్నారు. గ్రామాలు కానివ్వండి. నగరాలు కానివ్వండి. పాలక సంస్థలు, సామాజిక సంస్థలు అనే తేడా లేకుండా ప్రతిచోటా ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని చోట్ల పాత చెరువులలో పూడిక తీస్తున్నారు. మరికొన్ని చోట్ల బావులు, మెట్ల బావులను పునరుద్ధరిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న బోర్వెల్స్ ఇప్పుడు భూగర్భ జలాల పునరుజ్జీవనానికి మాధ్యమంగా మారుతున్నాయి.
మిత్రులారా! మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లాలో దాదాపు 1,500 చెరువులను నిర్మించారు. నరసింగ్పూర్లో అమృత్ సరోవర్లను పునరుద్ధరించారు. మహారాష్ట్రలోని నాసిక్ లో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారంలో చేరాయి. పాత చెరువులు తిరిగి ఉపయోగపడేలా చేశారు. మన నగరాలు కూడా ఈ కృషిలో వెనుకబడలేదు. ఛత్తీస్గఢ్లోని కోర్బా, ఒడిశాలోని భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఈ ప్రచారం ద్వారా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మన పరిసరాల్లోని చెరువు, బావి లేదా మెట్ల బావి బాధ్యతను మనమే తీసుకుందాం. ప్రతి నీటి చుక్కను ఆదా చేద్దాం. ఈ రోజు ఆదా చేసిన ప్రతి నీటి చుక్క రాబోయే తరాల భవిష్యత్తుకు గొప్ప ఆస్తి.
నా ప్రియమైన దేశప్రజలారా! కొద్ది రోజుల కిందటే గ్లాస్గో లో కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. దేశంలోని ప్రతి ఒక్కరూ భారత బృందానికి నిరంతరం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అథ్లెట్లు, క్రీడాకారులు అందరూ బాగా రాణించి ప్రజల హృదయాలను గెలుచుకోవాలని వారు కోరుకుంటున్నారు. మిత్రులారా! ఇటీవలి కాలంలో మన యువత క్రీడలలో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా పీవీ సింధు నిలిచారు. ఆమె సాధించిన ఈ ఘనతకు యావత్ దేశం గర్విస్తోంది. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా లండన్లోని లార్డ్స్ స్టేడియంలో తన తొలి టెస్ట్ మ్యాచ్ను గెలుచుకుంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. మన జట్టు ఈ మ్యాచ్ను 270 పరుగుల భారీ తేడాతో గెలుచుకుంది. అంతే కాదు. లార్డ్స్ సుదీర్ఘ చరిత్రలో మహిళల జట్టు ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. 1983లో ఇదే మైదానంలో భారతజట్టు తన తొలి క్రికెట్ ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఇప్పుడు అదే ప్రదేశంలో మన మహిళా శక్తి దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది.
మిత్రులారా! కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప సందేశాన్నిస్తాయి. కేరళంలోని ఎర్నాకులం ప్రాంతంలో ఉన్న దక్షిణ చిత్తూరు నుండి ఇలాంటి ఒక క్రీడా కార్యక్రమం గురించి నేను తెలుసుకున్నాను. అక్కడ ఒక పాఠశాలలో సంస్కృత క్లబ్ ఉంది. ఉపాధ్యాయుడు అభిలాష్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంస్కృతాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టును 'అక్షరకందుక్' అని పిలుస్తారు. ఫుట్బాల్లో ఉపయోగించే పదాలతో సంస్కృత అక్షరాలను అనుసంధానించి సులభంగా సంస్కృతాన్ని ఈ ప్రాజెక్టులో వివరిస్తారు. ఇది అభ్యసనను ఆనందదాయకంగా మార్చడమే కాకుండా క్రీడలలో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుంది.
నా ప్రియమైన దేశవాసులారా! గత ఆదివారం విజయవంతంగా నిర్వహించిన విక్రమ్-1 ప్రయోగం ప్రతి పౌరుడిని గర్వంతో నింపింది. భారత అంతరిక్ష రంగానికి చెందిన ఈ చారిత్రాత్మక క్షణానికి మనమందరం సాక్షులుగా నిలిచాం. ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇది. ఊహించడానికే కష్టమైన దాన్ని మన యువ ఆవిష్కర్తలు సాధించి, చూపించారు. వారు అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, సహనాన్ని ప్రదర్శించారు. చాలా కాలం పాటు మన అంతరిక్ష రంగం ప్రైవేట్ రంగానికి అవకాశం కల్పించలేదు. ఈ రంగంపై ఆసక్తి ఉన్న చాలా మంది యువతకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించలేదు. యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంతరిక్ష విభాగంలో ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పించాం. ఆ అవకాశాల ఫలితాలను ప్రపంచం ఈ రోజు చూస్తోంది.
మిత్రులారా! మన యువ సహచరులు విజ్ఞాన శాస్త్రంలో కూడా భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. సైన్స్ ఒలింపియాడ్లు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పోటీలలో స్థానం పొందాయి. వాటిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొంటారు. ఈ నెలలో భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, గణితశాస్త్రం అంశాలలో ఒలింపియాడ్లు జరిగాయి. ఈ పోటీలలో భారత బృందం అద్భుతంగా రాణించింది. భౌతికశాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు ఐదుగురు స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. భారతదేశం ప్రథమ ర్యాంకును పొందింది. గత దశాబ్ద కాలంలో జరిగిన ప్రతి భౌతికశాస్త్ర ఒలింపియాడ్లో మన దేశ విద్యార్థులు స్వర్ణం లేదా రజత పతకాన్ని గెలుచుకున్నారు. రసాయనశాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ స్వర్ణ పతకాలు సాధించారు. ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. జీవశాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ పతకాలు గెలుచుకున్నారు. వీటిలో ఒక స్వర్ణ పతకం కూడా ఉంది. గణితశాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు రెండు స్వర్ణ, నాలుగు రజత పతకాలు సాధించారు. దేశ యువత శక్తిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. భారతదేశంలో ఒలింపియాడ్లు, హ్యాకథాన్ల సంస్కృతి నిరంతరం పెరుగుతుండటం సంతోషం కలిగిస్తోంది. దేశంలోని యువత మరింత ఎక్కువగా ఇటువంటి వేదికలపై ఆసక్తి కనబరిచి, భారత పతాకాన్ని ఎగురవేస్తారని నేను విశ్వసిస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! నైపుణ్యం, ఏదైనా చేయాలనే అభిరుచి రెండూ మీలో ఉన్నప్పుడు ప్రతి మార్గం సులభతరం అవుతుంది. సంప్రదాయ కాశ్మీరీ చాప అయిన 'వగు'ను తయారు చేయడానికి ఈ రోజు జరుగుతున్న ప్రయత్నాలలో ఇది ప్రతిబింబిస్తుంది. దీన్ని రెల్లు, వరి గడ్డితో తయారు చేస్తారు. ఈ చాపను తయారుచేసే సంప్రదాయం శతాబ్దాల నాటిది. ముందుగా కాశ్మీర్లోని చిత్తడి ప్రాంతాల నుండి గడ్డి, రెల్లును సేకరిస్తారు. వాటిని ఎండలో ఆరబెట్టిన తర్వాత, వేరు చేస్తారు. తర్వాత చేతితో నేత ప్రక్రియను మొదలుపెడతారు. ఒక చాపను తయారు చేయడానికి ఇద్దరు కళాకారులకు సుమారు నాలుగు రోజులు పడుతుంది. ఈ చాప ప్రత్యేకమైనది. పర్యావరణ అనుకూలమైనది కూడా. వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలంలో వెచ్చదనాన్ని అందించడం దీని ముఖ్యమైన ప్రయోజనం. గతంలో ఇది కాశ్మీర్లోని ప్రతి ఇంట్లో కనిపించేది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా దీని వాడకం తగ్గిపోయింది. అటువంటి పరిస్థితిలో శ్రీనగర్కు చెందిన గులాం హుస్సేన్ గారు, ఆయన కుమార్తె తంజిలా గారు ఒక ప్రతిజ్ఞ చేశారు. వారు 'వగు' కళకు, ఆ ప్రాచీన సంప్రదాయానికి కొత్త జీవం పోయడానికి నిశ్చయించుకున్నారు. గులాం హుస్సేన్ చాలా సాధారణమైన కుటుంబం నుండి వచ్చారు. ఈ ప్రయత్నంలో ఆయన అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ 'వగు'ను పరిరక్షించాలన్న ఆయన సంకల్పం అచంచలమైనది. స్వల్పకాలంలో- చూస్తూ ఉండగానే- చాలా మంది ఆయన ప్రయత్నాలలో జతగూడారు. గులాం హుస్సేన్ గారు ఈ నైపుణ్యాన్ని ఎంతగానో మెరుగుపరిచారు. ఆయన తన ఈ లక్ష్యంలో స్థానిక ప్రభుత్వ మద్దతును కూడా పొందారు. నేడు 'వగు' వేగంగా ప్రజాదరణ పొందుతూ దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుకుంటోంది. ఈ ప్రయత్నంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ చూసి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ రోజు మనమందరం స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇస్తున్నాం. మనం 'వోకల్ ఫర్ లోకల్' అనే మంత్రాన్ని పాటిస్తున్నాం. ఇలాంటి తరుణంలో దయచేసి కాశ్మీర్ 'వగు'ను మీ ఇంట్లో ఒక భాగంగా చేసుకోండి.
మిత్రులారా! మన దేశంలో చాయ్ – అంటే టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు. అది ఒక అనుబంధానికి చిహ్నం కూడా. ఉదయకాలపు ప్రారంభమైనా, స్నేహితులతో సమావేశం అయినా, లేదా కుటుంబంతో సమయం గడిపినా ప్రతి సందర్భంలోనూ 'టీ' ఒక భాగమైపోతుంది. చాయ్ తో నాకున్న అనుబంధం ఏమిటో మీకు బాగా తెలుసు. అయితే నేను ఈ రోజు చర్చిస్తున్న ఈ చాయ్ ఎంతోమంది సోదరీమణుల జీవితాలలో కేవలం రుచిని మాత్రమే కాకుండా, ఆత్మనిర్భరత అనే కొత్త సువాసనను కూడా నింపింది. ఉత్తర ప్రదేశ్లోని బిజ్ నౌర్ జిల్లా లఖివాలా గ్రామంలోని స్వయం సహాయక బృందానికి చెందిన మహిళలు 'విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ'ని తయారు చేశారు. లెమన్ గ్రాస్, గిలోయ్, లవంగాలు, తులసి, పచ్చి పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు వంటి సహజ పదార్థాలతో దీన్ని తయారు చేశారు. దీని విశిష్టమైన రుచి, గుణాల కారణంగా ఈ టీ అతి తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందింది. ప్రయాగ్రాజ్లోని మహా కుంభమేళాలో, ఢిల్లీలోని అంతర్జాతీయ ఆహార ఉత్సవంలో ఈ హెర్బల్ టీ పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. విదేశాల నుండి వచ్చే సందర్శకులు కూడా దీనిపై ఆసక్తి చూపారు.
మిత్రులారా! అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయం దీని ఆరంభమే. ఈ మొత్తం ప్రయత్నం కేవలం లక్ష రూపాయలతో ప్రారంభమైంది. నేడు, ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా ప్రధాన సంస్థలకు చేరుకుంది. స్థానిక పరిజ్ఞానం, ప్రకృతి, మహిళల ఆత్మవిశ్వాసం అనుసంధానమైనప్పుడు ఒక చిన్న ప్రయత్నం కూడా ఒక పెద్ద మార్పుకు నాంది పలకగలదని ఈ చొరవ మనకు చూపిస్తుంది.
నా ప్రియమైన దేశవాసులారా! 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి పట్ల తమ బాధ్యతను నెరవేరుస్తున్నారు. సమాజం ఈ స్ఫూర్తితో మమేకమైనప్పుడు ఎన్నో అందమైన, స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు ఆవిర్భవిస్తాయి. మిత్రులారా! ప్రజా భాగస్వామ్యంలోని అద్భుతమైన శక్తి అహ్మదాబాద్లో ప్రదర్శితమైంది. భాడజ్ ప్రాంతంలో గంట వ్యవధిలోనే మూడున్నర లక్షలకు పైగా మొక్కలను నాటారు. ఈ భారీ చొరవలో 25,000 మందికి పైగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, ఎన్సిసి క్యాడెట్లు, వాలంటీర్లు, సాధారణ పౌరులు అందరూ ఈ ప్రచారంలో పాల్గొన్నారు. రాబోయే సంవత్సరాలలో ఈ మొక్కలు దట్టమైన పట్టణ అడవిగా రూపుదిద్దుకుంటాయి. ఈ కృషి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. మిత్రులారా! 'ఏక్ పేడ్ మా కే నామ్' ఉద్యమం కింద ఉత్తర ప్రదేశ్ కూడా ప్రజల అద్భుతమైన సంకల్పానికి సాక్ష్యంగా నిలిచింది. జూలై 12వ తేదీన ఒక్క రోజులోనే అక్కడ 35 కోట్లకు పైగా మొక్కలను నాటారు. పార్లమెంటులో ఉత్తర ప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడిగా ఇది నాకు ప్రత్యేక గర్వకారణం.
నా ప్రియమైన దేశప్రజలారా! చెట్లు కేవలం మనుషుల కోసమే కాదు. అవి లెక్కలేనన్ని జీవులకు నివాసంగా కూడా ఉన్నాయి. దాదాపు 60 సంవత్సరాల తర్వాత గుజరాత్లోని గిర్ అడవులలో ఇండియన్ గ్రే హార్న్బిల్ పక్షి మరోసారి గూడు కట్టుకుంటోంది. గిర్లో సంవత్సరాల తరబడి చేసిన పరిరక్షణ, పునరుద్ధరణ ప్రయత్నాల ఫలితమే ఇది. హార్న్బిల్ పక్షులను అడవుల రైతులు అని పిలుస్తారు. అవి పండ్లను తిని, వాటి విత్తనాలను నలుదిక్కులా వ్యాప్తి చేస్తాయి. వాటి నుండి అడవిలో కొత్త చెట్లు పెరుగుతాయి. ఈ విధంగా ఒక పక్షి అడవిని మళ్లీ పచ్చగా మార్చడానికి సహాయపడుతుంది. మీ జీవితంలోని ఏదైనా ఒక ప్రత్యేక సందర్భాన్ని ప్రకృతితో ముడిపెట్టాలని మీ అందరినీ నేను కోరుతున్నాను. మీ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటండి. ఈ రోజు నాటిన ఒక చిన్న మొక్క రాబోయే తరాలకు పచ్చదనం, స్వచ్ఛమైన గాలి అందజేస్తుంది. అందమైన భవిష్యత్తుకు వారసత్వంగా నిలుస్తుంది.
ప్రియమైన దేశవాసులారా! ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచ పర్యావరణానికి ఒక పెద్ద సవాలుగా నిలుస్తుందని మనందరికీ తెలుసు. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు సంవత్సరాల తరబడి ప్రకృతికి హాని కలిగిస్తూనే ఉంటాయి. అందువల్ల ప్లాస్టిక్ను సరైన పద్ధతిలో పారవేయడం చాలా ముఖ్యం. మిత్రులారా! బీహార్లోని సీతామఢిలో 'వ్యర్థాల నుండి సంపద'కు ఒక అద్భుతమైన ఉదాహరణ ఆవిర్భవించింది. ఇక్కడ వ్యర్థాలను పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీలను తయారు చేస్తున్నారు. ఒక బెంచీని తయారు చేయడానికి సుమారు 40 కిలోల ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ను ఉపయోగిస్తున్నారు. ఈ బెంచీలు దృఢంగా, మన్నికగా, సౌకర్యవంతంగా, పర్యావరణ అనుకూలంగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వ పాఠశాలలు, పార్కులు, బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేస్తారు. ఇది పర్యావరణ పరిరక్షణపై ప్రజలలో అవగాహనను కూడా పెంచుతోంది. ఈ ప్రయత్నంలో స్థానిక విభాగంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తోంది. రెడ్యూస్, రీ-యూజ్, రీసైకిల్ అనేవి కేవలం నినాదాలు మాత్రమే కాదని, అవి మన జీవితంలో ఒక భాగంగా మారుతున్నాయని సీతామఢిలోని ఈ చొరవ మనకు చూపిస్తుంది.
మిత్రులారా! కిందటి 'మన్ కీ బాత్'లో నేను గణేష్ ఉత్సవం గురించి మాట్లాడిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మన దేశ మట్టితో చేసిన గణేశుడిని పూజించాలని నేను విజ్ఞప్తి చేశాను. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్- PoP- తో చేసిన విగ్రహాలకు లేదా విదేశాల నుండి దిగుమతి చేసుకున్న గణేశ్ విగ్రహాలకు బదులుగా, మన దేశ మట్టితో చేసిన గణేశుడిని మన ఇళ్లలో ప్రతిష్టించుకోవాలి. ఈ విషయంపై చాలా మంది నాకు సందేశాలు పంపి, వారి ఆలోచనలను పంచుకున్నారు. వారు నా అభ్యర్థనను ప్రశంసించారు. స్థానిక మట్టితో చేసిన గణేశుడిని ప్రతిష్టించాలని వారు నిశ్చయించుకున్నారు. ఈ విషయంపై ఇప్పటికే 'మన్ కీ బాత్'లో చర్చ జరిగిందని, సరైన సమయంలో సరైన అడుగు వేయడానికి ఆ చర్చ వారికి సహాయపడిందని ప్రజలు లేఖలు రాశారు. నేను మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వినాయక పూజ నాడు మన దేశ మట్టితో చేసిన గణేశుడిని మీ ఇంట్లో ప్రతిష్టించి, ఆయనను పూజించండి. మీరు చేసే ఈ ప్రయత్నం కూడా ఒక రకమైన ప్రకృతి పూజ అవుతుంది.
నా ప్రియమైన దేశప్రజలారా! మీరు వినడానికి చాలా గర్వపడే ఒక వ్యక్తి గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఆయన విజ్ఞాన, ఆవిష్కరణ రంగాలలో చురుకుగా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. తన మూలాలతో గాఢంగా అనుబంధం కలిగిఉన్నారాయన. అవకాశం వచ్చినప్పుడల్లా తన మట్టిని గౌరవించడం మరచిపోని ఆ వ్యక్తే మణిపూర్కు చెందిన డాక్టర్ రోనాల్డో లెష్రమ్ గారు. ఆయన పేరు రోనాల్డో. కానీ వృత్తిరీత్యా ఆయన ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఆయన జపాన్లో పనిచేస్తున్నారు. యంగ్ గెలాక్సీల ఒక పెద్ద సమూహాన్ని కనుగొన్న బృందంలో ఆయన కూడా ఒక సభ్యుడు. ఆయన ఏం చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా? మణిపూర్లోని ఒక అందమైన సరస్సు పేరు మీద ఆయన ఈ మొత్తం సమూహానికి 'లోక్తక్ ప్రోటో-క్లస్టర్' అని నామకరణం చేశారు. లోక్తక్ ఒక పెద్ద మంచినీటి సరస్సు. లోక్తక్ సరస్సులో తేలియాడే ఫూమ్డీలు ఒక ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాన్ని సృష్టిస్తాయి. విశాలమైన సముద్రంలో చిన్న చిన్న ద్వీపాలు తేలుతున్నట్టుగా అవి కనిపిస్తాయి. అదేవిధంగా విశ్వంలో కూడా ఈ యువ గెలాక్సీలు ఒక భారీ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. నేడు మణిపూర్ లోక్తక్ కేవలం జాతీయ పటంపైనే కాకుండా విశాల విశ్వంలో కూడా ప్రకాశిస్తోంది. ఈ ఘనత ప్రతి భారతీయుడికి గర్వకారణం. తమ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటూనే కొత్త శిఖరాలను చేరుకోగలరని ఇది మన యువ మిత్రులకు బోధిస్తుంది. నక్షత్ర ప్రపంచానికి సైతం వెలుగులు అందిస్తున్న మూలాలు ఇవే.
ప్రియమైన దేశవాసులారా! మరికొద్ది రోజుల్లో- ఆగస్టు 7వ తేదీన- మన దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మన నేత సోదర సోదరీమణుల నైపుణ్యాలను, సృజనాత్మకతను మనం వేడుక చేసుకుంటాం. ఈ నేత కార్మిక మిత్రులు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్తున్నారు.
మిత్రులారా! చేనేత మగ్గంపై తయారైన ప్రతి వస్త్రం ఒక ప్రాంతం, ఒక సమాజం, వాటితో సంబంధం ఉన్న లెక్కలేనంత మంది ప్రజల కథను వెలుగులోకి తెస్తుంది. వీరే భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా పరిరక్షిస్తున్నారు. ఈ రోజున, హస్తకళలను ప్రోత్సహించడం ద్వారా మన నేత కార్మిక మిత్రులను గౌరవించాలని నేను అందరినీ కోరుతున్నాను. 'వోకల్ ఫర్ లోకల్' స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం.
మిత్రులారా! ఈ రోజు దేశంలో చేనేతను ప్రోత్సహిస్తున్న తీరు ఎంతో మంది ప్రజల జీవితాలను మెరుగుపరుస్తోంది. పోచంపల్లి నుండి పాట్నా వరకు, కుథంపల్లి నుండి కచ్ వరకు దీనికి లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి. మన ఘనమైన చేనేత సంప్రదాయానికి కొత్త శక్తిని, గుర్తింపును ఇస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి సమూహాలు కూడా ఎన్నో ఉన్నాయి. కొందరు పోచంపల్లి ఇకత్ అందమైన సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళుతుంటే, మరికొందరు మహిళా నేత కార్మికులను ఏకం చేసి ఉన్ని ఉత్పత్తులను సృష్టిస్తున్నారు. కొందరు కేరళం సంప్రదాయ ‘కసావు’ కళను పరిరక్షిస్తున్నారు. ఇది మన తల్లులకు, సోదరీమణులకు ఉపాధిని కూడా కల్పిస్తోంది.
మిత్రులారా! నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్న మరో విషయం ఖాదీ. మహాత్మా గాంధీకి ఖాదీ అంటే చాలా ఇష్టమని మనందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా ఖాదీకి చాలా ప్రజాదరణ లభిస్తోంది. గత 12 సంవత్సరాలలో దీని అమ్మకాలు ఆరు రెట్లు పెరిగాయి. ఈ సంఖ్య ఇప్పుడు దాదాపు 8,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. రాబోయే పండుగల సమయంలో మీరందరూ ఏదైనా ఖాదీ వస్త్రం, లేదా చేనేత వస్త్రం లేదా హస్తకళల వస్తువును కొనుగోలు చేయాలని నేను కోరుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! భారతదేశంలో ఎన్ని రకాల సంగీత వాయిద్యాలు ఉన్నాయని మిమ్మల్ని అడిగితే మీరు ఆలోచనలో మునిగిపోతారు. ఎందుకంటే మన దగ్గర చాలా సంగీత వాయిద్యాలు, వాటికి సంబంధించిన సంప్రదాయాలు ఉన్నాయి. అటువంటి వాయిద్యాలలో ఒకటి త్రిపురకు చెందిన చౌంగ్ ప్రెంగ్. ఇది అక్కడి గిరిజన వర్గాలలో చాలా ప్రసిద్ధి చెందింది. వెదురుతో తయారైన ఈ వాయిద్యానికి మూడు తీగలు ఉంటాయి. ఇది వెలువరించే రాగం సరోద్ నుండి వెలువడే మాదిరిగానే చాలా మధురంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల యువతలో దీని ప్రజాదరణ తగ్గడం ప్రారంభమైంది. సూరజ్ కుమార్ దేవ్ వర్మ గారు దాన్ని పునరుద్ధరించాలని సంకల్పించారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన చౌంగ్ ప్రెంగ్ తో పాటు ఇతర సాంప్రదాయిక వాద్య పరికరాలపై ప్రదర్శనలు ఇస్తున్నారు. ఆయనకు కోక్బొరోక్ జానపద గీతాలు, బౌల్ పాటలు, బెంగాలీ జానపద గీతాలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఒక చిన్న ఆడియో క్లిప్ను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ సంగీతాన్ని మీరు ఎప్పటికీ మరచిపోలేరు.
#(సంగీతం)#
మిత్రులారా! ఇది విన్న తర్వాత మీకెంతో ఆనందంగా ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవ్ వర్మ గారి కృషిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. సంప్రదాయ సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం. మీ చుట్టూ ఉన్న సంప్రదాయ వాద్య పరికరాల గురించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ ప్రయత్నాలు ఇతరులను సంప్రదాయ భారతీయ సంగీతంతో తప్పకుండా అనుసంధానిస్తాయి.
నా ప్రియమైన దేశవాసులారా! రేపు- అంటే జూలై 27వ తేదీన భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి వర్ధంతి. డాక్టర్ కలాం గారి వ్యక్తిత్వంలో ఎన్నో స్ఫూర్తిదాయకమైన అంశాలు ఉన్నాయి. కానీ ఉపాధ్యాయుడి పాత్ర ఆయనకు అత్యంత ప్రియమైనది. పిల్లలను, యువతను పెద్ద కలలు కనడానికి ఆయన ప్రేరేపించారు. యాదృచ్ఛికంగా ఈ వారంలోనే మనం పవిత్ర పర్వదినమైన "గురు పూర్ణిమ"ను జరుపుకోబోతున్నాం. మన తల్లిదండ్రులు మన మొదటి గురువులు. పాఠశాల ఉపాధ్యాయులు మనకు అక్షరజ్ఞానం అందిస్తారు. అటువంటి గురువులందరికీ కృతజ్ఞతలు తెలియజేయడానికి గురు పూర్ణిమ ఒక సందర్భం. దేశంలోని ఉపాధ్యాయులు, గురువులందరికీ నేను నా శ్రద్దాపూర్వక ప్రణామాలు అందజేస్తున్నాను.
మిత్రులారా! మరికొన్ని వారాల్లో మనం మన స్వాతంత్ర్య మహోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. ఆగస్టు 15వ తేదీ ప్రతి భారతీయుడికి గర్వకారణమైన రోజు. మాతృభూమి స్వాతంత్ర్యం కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన అసంఖ్యాక వీరులను స్మరించుకునే రోజు ఇది. వారి త్యాగం, తపస్సు కారణంగా ఈ రోజు మనం త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకున్నాం. ఈ త్రివర్ణ పతాకం మన రాజ్యాంగ ఆదర్శాలకు ప్రతిరూపం.
మిత్రులారా! గత కొన్నేళ్లలో 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమం యావత్ దేశాన్ని ఒక అద్భుతమైన స్ఫూర్తితో ఏకం చేసింది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో త్రివర్ణ పతాక సంబరాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం కూడా మనం 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమాన్ని పూర్తి ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్లాలి. మన ఇళ్లపై పూర్తి గౌరవంతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి.
మిత్రులారా! ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీకి ముందు మీరు నాకు ఎన్నో ఆలోచనలు, సూచనలు పంపిస్తుంటారు. ఈ సంవత్సరం కూడా MyGov పై మీ అభిప్రాయాలను పంచుకోండి. మీ సూచనల కోసం ఎదురుచూస్తున్నాను.
మిత్రులారా! ‘మన్ కీ బాత్’ ఈ భాగంలో ఇప్పటికి ఇంతే. మన దేశ ప్రజల అనేక కొత్త విజయాలు, స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలతో వచ్చే నెలలో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
***
(रिलीज़ आईडी: 2289579)
आगंतुक पटल : 42
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Urdu
,
Manipuri
,
English
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam