రాష్ట్రపతి సచివాలయం
నార్త్ మాసిడోనియా పార్లమెంటులో ప్రసంగించిన భారత రాష్ట్రపతి
మన పార్లమెంటు సభ్యుల మధ్య జరిగే పరస్పర సంప్రదింపులు, చర్చలు రాజకీయ పరిణామాలకు అతీతంగా సుదీర్ఘకాలం నిలిచిపోయే సంస్థాగత విశ్వాసాన్ని పెంపొందిస్తాయి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ద్వైపాక్షికంగా, విస్తృత ప్రాంతీయ స్థాయిలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
प्रविष्टि तिथि:
21 JUL 2026 8:53PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నేడు (2026 జూలై 21) స్కోప్జెలో నార్త్ మాసిడోనియా అధ్యక్షురాలు డాక్టర్ గోర్డానా సిల్జానోవ్స్కా-దావ్కోవా సమక్షంలో ఆ దేశ పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు.
భారత్లో మేం 'నార్త్ మాసిడోనియా'ను ఏదో దూరపు దేశంగా భావించడం లేదని.. ఒక స్థిరమైన, బహుళ ధ్రువ, సుసంపన్నమైన ప్రపంచ భవిష్యత్తు నిర్మాణంలో ఒక ముఖ్యమైన ఆధారంగా చూస్తున్నామని రాష్ట్రపతి అన్నారు. “మన మధ్య సంబంధాలకు రెండు వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ ప్రాంతానికి చెందిన యోధులు, వ్యాపారుల చారిత్రాత్మక దండయాత్రలు, ప్రయాణాలు, వాణిజ్యం, తత్వశాస్త్రం, కళల విస్తరణకు ద్వారాలు తెరిచి మన ప్రాచీన నాగరికతలను అనుసంధానించాయి” అని ఆమె వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యం కేవలం ఒక పరిపాలనా విధానం మాత్రమే కాదని.. అది భారత్, నార్త్ మాసిడోనియాలను ఏకం చేసే ఒక ఉమ్మడి విశ్వాసమని రాష్ట్రపతి పేర్కొన్నారు. మన పార్లమెంట్లు ప్రజల స్వేచ్ఛకు రక్షకులుగా, మన చట్టాల రూపశిల్పులుగా, మన జాతీయ విలువలకు అద్దాలుగా నిలుస్తున్నాయన్న ఆమె..పార్లమెంటరీ దౌత్యం చాలా ముఖ్యమైనదని తెలిపారు. మన పార్లమెంట్ సభ్యుల మధ్య జరిగే పరస్పర సంప్రదింపులు రాజకీయ పరిణామాలకు అతీతంగా సుదీర్ఘకాలం నిలిచిపోయే సంస్థాగత విశ్వాసాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. ఢిల్లీ, స్కోప్జె మధ్య పర్యటనలు చేస్తూ పార్లమెంటరీ విధానాలు, ప్రభుత్వ విధానాల రూపకల్పనలోని అత్యుత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవాలని ఆమె యువ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.
భౌగోళిక రాజకీయ, ఆర్థిక ప్రాధాన్యతా కేంద్రాలు క్రమంగా మారుతున్నాయని రాష్ట్రపతి స్పష్టం చేశారు. ఈ నూతన శకంలో ఆగ్నేయ ఐరోపాను ఏదో ఒక మూలన ఉన్న ప్రాంతంగా భారత్ చూడటం లేదని.. వేగవంతమైన వృద్ధి, నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా భావిస్తోందని అన్నారు. ఈ మార్పుకు నార్త్ మాసిడోనియా ఒక కీలకమైన సంగమమని ఆమె పేర్కొన్నారు. ఇది మధ్యధరా సముద్ర ప్రాంతాన్ని మధ్య ఐరోపాతో, తూర్పును పశ్చిమంతో అనుసంధానించే ఒక అత్యంత ప్రధానమైన ముఖద్వారం అని చెప్పారు. వర్ధమాన వాణిజ్య, పెట్టుబడి అవకాశాలతో సహా ద్వైపాక్షిక, విస్తృత ప్రాంతీయ స్థాయిలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని ఆమె వెల్లడించారు.
ఏ దేశమూ ఒంటరిగా పురోగమించలేదని స్పష్టం చేసిన రాష్ట్రపతి.. 'వసుధైవ కుటుంబకం- ప్రపంచమంతా ఒకే కుటుంబం’ అనే పురాతన భావనలో భారతదేశపు ప్రాచీన నాగరికతా తత్వం ఉందనే విషయాన్ని ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. వివాదాలు, ఆర్థిక విభజనలతో ప్రపంచం విచ్ఛిన్నమవుతున్న ప్రస్తుత తరుణంలో... ఈ తత్వం సరిహద్దు గోడలను నిర్మించడం కాకుండా అనుసంధాన వారధులను నిర్మించాలని పిలుపునిస్తోందని చెప్పారు. చరిత్రలో బలమైన పునాదులు ఉండి రేపటి ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులేస్తున్న రెండు ప్రజాస్వామ్య దేశాలుగా మనం కలసికట్టుగా మన ప్రజలకు శాంతి, సమృద్ధిని చేకూర్చే బాటను నిర్మించాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర వినియోగదారు వ్యవహారాలు, ఆహార- ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీమతి నిముబెన్ జయంతిభాయ్ బంభానియా.. పార్లమెంట్ సభ్యులు డాక్టర్ దినేష్ శర్మ, శ్రీ విజయ్ భగేల్ కూడా పాల్గొన్నారు.
Please click here to see the President's Speech
***
(रिलीज़ आईडी: 2287520)
आगंतुक पटल : 7