జౌళి మంత్రిత్వ శాఖ
అపూర్వ వాణిజ్య వేదికగా భారత్ టెక్స్ 2026: భారీగా తరలి వచ్చిన సందర్శకులు
ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్స్టైల్ కొనుగోలు, ఆవిష్కరణల కేంద్రంగా
భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేసిన ప్రదర్శన
प्रविष्टि तिथि:
17 JUL 2026 3:11PM by PIB Hyderabad
భారత్ టెక్స్ 2026లో మొదటి మూడు రోజుల ప్రదర్శనతో భారత్ మండపం ప్రపంచ జౌళి, దుస్తుల పరిశ్రమకు ఒక ప్రధాన కేంద్రంగా మారింది. ఈ కార్యక్రమానికి దేశీయ, అంతర్జాతీయ భాగస్వాముల నుంచి అపూర్వమైన స్పందన లభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సమగ్ర జౌళి కార్యక్రమం అయిన ఈ ప్రదర్శన.. అత్యధిక సంఖ్యలో సందర్శకుల రాకను, చురుకైన వ్యాపార లావాదేవీలను, విస్తృతమైన కొనుగోలుదారులు- విక్రేతల సమావేశాలను, సరికొత్త విజ్ఞాన మార్పిడికి వేదికగా మారింది. తద్వారా జౌళి రంగంలో నమ్మకమైన ప్రపంచ కొనుగోలు, తయారీ, ఆవిష్కరణలు, పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్ ఎదుగుతోందనే విషయాన్ని ఇది మరోసారి చాటిచెప్పింది.

16 లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన 'భారత్ టెక్స్ 2026' ప్రదర్శనలో 1647 మంది ప్రదర్శకులు, దాదాపు 95000 మంది వ్యాపార సందర్శకులు (వీరిలో 20,000 మందికి పైగా పునరావృత సందర్శకులు ఉన్నారు), 6090 మంది అంతర్జాతీయ కొనుగోలుదారులతో కలిపి మొత్తం 11315 మంది కొనుగోలుదారులు, 138 దేశాల నుంచి 3,461 మంది ప్రతినిధులు- భాగస్వాములు ఒకే వేదికపైకి వచ్చారు. ఇది భారత్లో వేగంగా విస్తరిస్తున్న జౌళి వ్యవస్థపై అంతర్జాతీయంగా ఉన్న అపూర్వమైన నమ్మకాన్ని తెలియజేస్తోంది. మొదటి మూడు రోజుల్లోనే 28,500 కంటే ఎక్కువ బీటూబీ సమావేశాలు, 100 కంటే ఎక్కువ బీటూజీ- జీటూజీ పరస్పర చర్చలు, పలు వ్యూహాత్మక పెట్టుబడి చర్చలతో ప్రదర్శన హాల్స్ అన్నీ ఎంతో సందడిగా మారాయి. భారత జౌళి, దుస్తుల రంగంలో వికేంద్రీకృత, రాష్ట్రాల నేతృత్వంలోని వృద్ధిని ముందుకు తీసుకెళ్లటంలో ఈ కార్యక్రమం కీలకపాత్ర పోషించింది. వివిధ రాష్ట్రాలు కుదుర్చుకున్న 30కి పైగా అవగాహన ఒప్పందాల (ఎంఓయూ) ద్వారా 'భారత్ టెక్స్ 2026' దాదాపు రూ. 14,300 కోట్ల జౌళి పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా మారింది. పెట్టుబడులు పొందిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ (రూ. 4,100 కోట్ల పెట్టుబడి), కర్ణాటక (రూ. 2,821 కోట్ల పెట్టుబడి, 11020 ఉద్యోగాలు), బీహార్ (రూ. 1476 కోట్ల పెట్టుబడి, 40500 కంటే ఎక్కువ ఉద్యోగాలు), మహారాష్ట్ర (రూ. 1095 కోట్ల పెట్టుబడి) ఉన్నాయి. ఆర్ఈ-యూపీ సంస్థ భారత్లో రూ. 4,800 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 2.8 బిలియన్ డాలర్ల విలువ కలిగిన వ్యాపారంగా ఆసక్తి వ్యక్తీకరణలు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయి. బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు 'భాగస్వామ్య రాష్ట్రాలుగా' పాల్గొన్నాయి. మరికొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేటాయించిన ప్రత్యేక పెవీలియన్ల ద్వారా తమ జౌళి రంగ సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, పంజాబ్ ముఖ్యమంత్రి శ్రీ భగవంత్ సింగ్ మాన్లతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, అస్సాం, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన సీనియర్ మంత్రులు హాజరయ్యారు. ఇది భారతదేశపు అత్యున్నత జౌళి వేదికగా 'భారత్ టెక్స్'కు ఉన్న ప్రాముఖ్యతను మరింతగా తెలియజేసింది.
ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ భాగస్వామ్యం కూడా అదే స్థాయిలో ఉంది. న్యూజిలాండ్, శ్రీలంక, రష్యా, కంబోడియా, పోర్చుగల్ దేశాల నుంచి మంత్రుల బృందాలు హాజరవగా ఐరోపా సమాఖ్య ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు. అమెరికా, జపాన్, యూకే, స్పెయిన్, ఇటలీ, దక్షిణ కొరియా, యూఏఈ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీతో సహా పలు దేశాల నుంచి 30కి పైగా పరిశ్రమ, అంతర్జాతీయ వ్యాపార ప్రతినిధి బృందాలు ఈ ప్రదర్శనలో చురుగ్గా పాల్గొన్నాయి.
ఈ కార్యక్రమంలో విజ్ఞాన మార్పిడి ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ ఏర్పాటు చేసిన 100 అత్యున్నత స్థాయి నాలెడ్జ్ సెషన్లలో 600 మందికి పైగా విధాన నిర్ణేతలు, అంతర్జాతీయ నిపుణులు, పరిశ్రమల అధిపతులు, సీఎక్స్ఓలు, విద్యావేత్తలు పాల్గొన్నారు. ప్యానెల్ చర్చలు, రౌండ్టేబుల్ సమావేశాలు, మాస్టర్క్లాస్లలో ప్రపంచ వాణిజ్య విధానాలు, సుస్థిరత, చక్రీయత, సాంకేతిక ఆవిష్కరణలు, కృత్రిమ మేధ, బాధ్యతాయుతమైన కొనుగోళ్లు, పెట్టుబడి అవకాశాలు, సాంకేతిక వస్త్రాలు వంటి కీలక అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా నిలిచిన వాటిలో 'టీబీడీ పెవీలియన్' వద్ద నిర్వహించిన 'సంరచన హాకథాన్' ఒకటి. ఇది సాంకేతిక వస్త్రాల రంగంలో భారతీయ యువ ఆవిష్కర్తల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. రైతులకు రక్షణ కల్పించే దుస్తులు, అధునాతన డయాబెటిక్ గాయాలకు సంబంధించిన సంరక్షణ ఉత్పత్తుల నుంచి మారుమూల శీతల వాతావరణం తట్టుకునే తేలికపాటి ఇన్సులేటెడ్ పరుపుల వరకు ఎన్నో ఆచరణాత్మక పరిష్కారాలను దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ఆవిష్కర్తలు ప్రదర్శించారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్.. కేంద్ర జౌళి, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ పవిత్ర మార్గరీటా ప్రశంసించిన ఈ పరిష్కారాలు.. తదుపరి తరం సాంకేతిక వస్త్రాల అభివృద్ధిలో విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వం కలిసి పనిచేయడం వల్ల వచ్చే విప్లవాత్మక మార్పును నిరూపించింది. సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించే మరో కీలకమైన చొరవలో భాగంగా.. భారత్లోని ఆకాంక్షిత జిల్లాల నుంచి వచ్చిన 250 మందికి పైగా నూతన పారిశ్రామికవేత్తలు, చేనేత కార్మికులకు ప్రత్యేక ఎక్స్పోజర్ పర్యటనలను 'భారత్ టెక్స్ 2026' నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా ఎంఎస్ఎమ్ఈలు నేరుగా కొనుగోలుదారులు, ప్రదర్శకులు, పరిశ్రమ నిపుణులతో సంభాషించడానికి అవకాశం లభించింది. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు, బ్రాండింగ్, ఉత్పత్తి ఆవిష్కరణలు, ఎగుమతి అవకాశాలపై వీరికి లభించిన విలువైన అవగాహన.. క్షేత్రస్థాయిలో వ్యాపార నైపుణ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ప్రపంచ దుస్తుల తయారీ రంగంలో పెరుగుతున్న భారత్ ప్రభావాన్ని మరింత చాటుతూ.. ఇంటర్నేషనల్ అప్పారెల్ ఫెడరేషన్ (ఐఏఎఫ్) బోర్డు సమావేశం కూడా 'భారత్ టెక్స్ 2026'తో పాటే ఇక్కడే నిర్వహించారు.
'భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్' (బీటీటీఎఫ్), ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టెక్స్టైల్- ఫ్యాషన్ సోర్సింగ్ ప్లాట్ఫామ్లలో ఒకటైన 'ప్రీమియర్ విజన్ పారిస్'.. ఒక ఆసక్తి వ్యక్తీకరణ పత్రంపై (ఎల్ఓఐ) సంతకాలు చేశాయి. ఇది ఈ మొత్తం కార్యక్రమంలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం మార్కెట్ యాక్సెస్, సుస్థిర కొనుగోళ్లు, డిజైన్ ఇంటెలిజెన్స్, కొనుగోలుదారులు-విక్రేతల మధ్య బంధాన్ని మెరుగుపరచడం ద్వారా భారత్-ఐరోపా సమాఖ్య జౌళి భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారతీయ తయారీదారులు, ఎగుమతిదారులు, ఎంఎస్ఎమ్ఈలకు సరికొత్త అంతర్జాతీయ అవకాశాలను సృష్టిస్తుంది. భారతదేశ సంప్రదాయ జౌళి సంపదను అంతర్జాతీయ ప్రీమియం బ్రాండ్లుగా ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై కూడా 'భారత్ టెక్స్ 2026' వేదికగా అర్థవంతమైన చర్చలు జరిగాయి. ప్రముఖ డిజైనర్లు రాహుల్ మిశ్రా, వైశాలి షడంగూలేలతో పాటు పరిశ్రమల అధిపతులు.. భారత్కు ఉన్న హస్తకళలు, చేనేత, సంప్రదాయ నేత విషయంలో సుసంపన్నమైన వారసత్వాన్ని, వారి అద్భుతమైన నైపుణ్యం, సాంస్కృతిక కథనాల ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో దేశానికే ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా మార్చవచ్చని చెప్పారు.
ప్రత్యేకమైన థీమాటిక్ పెవీలియన్లలో ముమ్మరంగా సాగిన వ్యాపార కార్యకలాపాలతో ప్రదర్శన ప్రాంగణం అంతా సందడిగా మారింది. 4వ నంబర్ హాల్లో సీఎంఏఐ ఏర్పాటు చేసిన 'బ్రాండ్స్ ఆఫ్ ఇండియా' పెవీలియన్ ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా నిలిచింది. ఇది 70కి పైగా ప్రముఖ భారతీయ దుస్తుల బ్రాండ్లను ఒకే చోటకు చేర్చి కొనుగోలుదారులకు భారత వైవిధ్యభరితమైన ఫ్యాషన్, వస్త్ర రంగ వ్యవస్థను అద్భుతంగా ప్రదర్శించింది. మొదటిసారిగా ఈ పెవీలియన్ వేగంగా విస్తరిస్తున్న భారత లోదుస్తుల (ఇంటిమేట్ - ఇన్నర్వేర్) రంగానికి ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. ముంబయి, ఢిల్లీకి చెందిన ప్రముఖ బ్రాండ్లు తమ సరికొత్త ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించాయి. వెస్ట్సైడ్, టామీ హిల్ఫిగర్, కాల్విన్ క్లైన్, యూఎస్ పోలో అసోసియేషన్, యారో, ఫ్లయింగ్ మెషిన్, లూయిస్ ఫిలిప్, వాన్ హ్యూసెన్, అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లాండ్, రీబాక్, అమెరికన్ ఈగిల్, రాల్ఫ్ లారెన్, సబ్యసాచి, తరుణ్ తహిలియాని, జైపూర్, డబ్ల్యూ ఫర్ ఉమెన్, బెవకూఫ్, డాలర్, బాడీకేర్, డ్యూక్ వంటి పలు అంతర్జాతీయ, భారతీయ బ్రాండ్లు కొనుగోలుదారులను, రిటైలర్లను ఎంతగానో ఆకర్షించాయి. సీఎంఏఐ, గ్లోబల్ అలయన్స్ ఫర్ టెక్స్టైల్ సస్టైనబిలిటీ (గ్యాట్స్) సంయుక్తంగా సమర్పించిన 'ఎకో-స్టిచ్ సస్టైనబిలిటీ - సర్క్యులారిటీ హబ్' ద్వారా 'భారత్ టెక్స్ 2026'లో సుస్థిరత ఒక ప్రధానాంశంగా నిలిచింది. 'సుస్థిర, చక్రీయ, పోటీతత్వ భారత్' అనే ఇతివృత్తంతో రూపొందించిన ఈ పెవీలియన్.. రీసైక్లర్లు, తయారీదారులు, బ్రాండ్లు, ఆవిష్కర్తలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సంస్థలు, పర్యావరణ భాగస్వాములను ఒకే వేదికపైకి తెచ్చింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన 'ఇండియా ఇంపాక్ట్ వాల్, సర్క్యులారిటీ ఎట్ స్కేల్, ఫ్రమ్ వేస్ట్ టు గ్లోబల్ వార్డ్రోబ్, మేడ్ ఇన్ సర్క్యులర్ భారత్, మెటీరియల్ అండ్ ఇన్నోవేషన్ లైబ్రరీ, సర్క్యులర్ భారత్ ఫోరమ్ వంటి ప్రత్యేక జోన్లు.. మరింత పర్యావరణ అనుకూలమైన జౌళి భవిష్యత్తు వైపు సాగడానికి ఆచరణాత్మక మార్గాలను విజయవంతంగా ప్రదర్శించాయి.
కిక్కిరిసిన ప్రదర్శన శాలలు, సందడిగా సాగిన సదస్సులు, చురుకైన వ్యాపారానుబంధాలు, ప్రదర్శన ప్రాంగణమంతటా వ్యక్తమైన బలమైన వ్యాపార భాగస్వామ్యాలతో 'భారత్ టెక్స్ 2026' మునుపెన్నడూ లేని ఉత్సాహంతో కొనసాగుతోంది. జౌళి రంగ తయారీ, కొనుగోళ్లు, సరికొత్త ఆవిష్కరణలు, బాధ్యతాయుతమైన వృద్ధిలో ప్రపంచ దేశాల మొదటి ప్రాధాన్యతగా నిలవాలనే భారతదేశ దార్శనికతను ఇది మరింత బలోపేతం చేస్తోంది. అంతర్జాతీయ జౌళి, దుస్తుల విలువ గొలుసులో దేశ నాయకత్వ స్థానాన్ని ఈ ప్రదర్శన మరోసారి సుస్థిరం చేసింది.
***
(रिलीज़ आईडी: 2285834)
आगंतुक पटल : 9