మంత్రిమండలి
మొబైల్ ఫోన్ల తయారీ పథకాన్ని (ఎంపీఎంఎస్) ఆమోదించిన కేంద్ర క్యాబినెట్
प्रविष्टि तिथि:
15 JUL 2026 3:23PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ రూ. 62,500 కోట్ల భారీ బడ్జెట్ కేటాయింపుతో ‘మొబైల్ ఫోన్ల ఉత్పాదక పథకానికి’ ఆమోదం తెలిపింది.
పథకానికి సంబంధించిన ముఖ్యాంశాలు:
-
మొబైల్ ఫోన్ల ఉత్పత్తిని మరింత పెంచడం, దేశీయంగా విలువ జోడింపును పెంపొందించడం, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థను దృఢతరం చేయటం, ప్రపంచ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఎంపీఎంఎస్ పథకాన్ని తీసుకొచ్చింది.
-
సాంకేతిక సార్వభౌమత్వాన్ని సాధించడానికి, భారీగా ఆర్థిక వాటాను దక్కించుకోవడానికి, డిజైన్- పరిశోధన అభివృద్ధి (ఆర్-డీ) రంగాల్లో సరికొత్త భారతీయ పేటెంట్లను సృష్టించేలా భారతీయ బ్రాండ్లను ప్రోత్సహించాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈ పథకం ఉంది.
-
ఈ పథకం 5 సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. అంటే ఆర్థిక సంవత్సరం 2026-27 నుంచి 2030-31 వరకు కొనసాగుతుంది.
-
ఈ పథకం భారత్లో మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించి అర్హత కలిగిన విక్రయాలపై 2.25 శాతం నుంచి 5 శాతం వరకు భిన్న రేట్లలో ప్రోత్సాహకాల రూపంలో మద్దతును అందిస్తుంది. కీలకమైన విడిభాగాలు, సబ్-అసెంబ్లీల దేశీయ సేకరణకు సంబంధించి 1.5 శాతం వరకు అదనపు ప్రోత్సాహకాన్ని కూడా ఈ పథకం సమకూరుస్తుంది. భారతీయ బ్రాండ్ల తయారీని పెంపొందించడానికి.. సదరు ఉత్పత్తుల డిజైన్- పరిశోధన అభివృద్ధి కోసం అర్హత కలిగిన విక్రయాలపై 3 శాతం చొప్పున అదనపు ప్రోత్సాహకాన్ని అందించనుంది.
పథకం వల్ల లాభాలు:
ఈ పథకం అమలులో ఉండే కాలంలో దేశంలో మొబైల్ ఫోన్ల సంచిత ఉత్పత్తి సుమారు రూ. 39 లక్షల కోట్లకు చేరుకుంటుందని, మొబైల్ ఫోన్ల ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతుందన్న అంచనా ఉంది. ఈ పథకం ద్వారా దాదాపు 60,000 ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని భావిస్తున్నారు. తద్వారా ఇది ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు తోడ్పడటమే కాకుండా ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
నేపథ్యం:
-
గౌరవ ప్రధానమంత్రి 'మేక్ ఇన్ ఇండియా' దార్శనికత ఫలితంగా 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం 7 రెట్లు, ఎగుమతులు 11 రెట్ల గణనీయ వృద్ధిని సాధించాయి. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం ఒక ప్రధాన ఉపాధి కల్పనా రంగంగా కూడా అవతరించింది. ముఖ్యంగా మారుమూల గ్రామాలకు చెందిన యువతీ యువకులకు ఇది ఎంతో మేలు చేస్తోంది. కొన్ని తయారీ ప్లాంట్లు ఒకే చోట 5,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులకు ఉపాధిని కల్పిస్తున్నాయి.
-
ఈ వృద్ధికి మొబైల్ ఫోన్ల తయారీ రంగమే ప్రధాన చోదక శక్తిగా నిలిచింది. ఇది భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థకు ఒక బలమైన పునాదిగా మారింది. ఉత్పత్తి పరిమాణం పరంగా ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా అవతరించింది. ప్రస్తుతం దేశంలో ఉపయోగించే మొబైల్ ఫోన్లలో 99.2 శాతం దేశీయంగానే తయారవుతున్నాయి.
-
2025లో భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువుల విభాగాల్లో స్మార్ట్ఫోన్లు అతిపెద్ద విభాగంగా అవతరించాయి. సంప్రదాయకంగా అగ్రస్థానంలో ఉండే డీజిల్ ఇంధనం, మెరుగుపెట్టిన వజ్రాలు వంటి ఎగుమతులను కూడా ఈ రంగం అధిగమించింది. ప్రస్తుతం భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి, ఎగుమతుల్లో మొబైల్ ఫోన్లు ప్రధాన వాటాను కలిగి ఉన్నాయి. ప్రపంచ విలువ గొలుసులలో భారత్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి.
-
భారత్ను మొబైల్ తయారీ, ఎగుమతులకు ప్రపంచ కేంద్రంగా మార్చడంలో 'పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం ఉద్దేశించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం' (పీఎల్ఐ-ఎల్ఎస్ఈఎం) అద్భుతమైన మార్పును తీసుకొచ్చింది. ఈ పీఎల్ఐ-ఎల్ఎస్ఈఎం పథకం కాలపరిమితి 2026 మార్చి 31తో ముగిసింది.
***
(रिलीज़ आईडी: 2284877)
आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam