జౌళి మంత్రిత్వ శాఖ
‘భారత్ టెక్స్ 2026’ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద జౌళి ఉత్పత్తుల ప్రదర్శనకు సిద్ధమవుతోన్న భారత్
జూలై 14న కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ శ్రీ గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభం
‘భారత్ టెక్స్ 2026: ప్రపంచ వృద్ధిలో భారత జౌళి రంగ నైపుణ్యాల మేళవింపు’
प्रविष्टि तिथि:
13 JUL 2026 2:22PM by PIB Hyderabad
భారతీయ అతిపెద్ద ప్రపంచ జౌళి రంగ ప్రదర్శన ‘భారత్ టెక్స్ 2026’ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాట్లు పూర్తవడంతో దేశీయ జౌళి, దుస్తుల పరిశ్రమ రంగంలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. రేపటి నుంచి (జూలై 14) ప్రారంభమై జూలై 17 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. కేంద్ర జౌళి శాఖ మంత్రిత్వ శాఖ పూర్తి మద్దతుతో జౌళి ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, పరిశ్రమల సంఘాల సమాఖ్య ‘భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్’ ఈ ప్రదర్శనను నిర్వహిస్తోంది. దుస్తులు, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రపంచ కేంద్రంగా ఎదగాలనే భారత్ ఆకాంక్షకు ఈ వేదిక నిదర్శనం కానుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘5ఎఫ్’ దార్శనికత (ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్) స్ఫూర్తితో భారత్ టెక్స్ 2026 రూపుదిద్దుకుంది. జౌళి రంగానికి సంబంధించిన వ్యాపారాలు, పెట్టుబడులు, ఆవిష్కరణలు, విధానపరమైన చర్చలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ఇదొక అత్యుత్తమ ప్రపంచ స్థాయి వేదికగా నిలవనుంది. జూలై 14 ఉదయం భారత్ మండపంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా ఈ ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవ వేడుకలో కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీ పవిత్ర మార్గరీటా, జౌళి శాఖ కార్యదర్శి శ్రీమతి నీలం షమీ రావుతో పాటు మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, విదేశీ ప్రతినిధులు, పారిశ్రామిక భాగస్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.

కార్యక్రమం నేపథ్యంలో భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ చైర్మన్ శ్రీ నరేన్ గోయెంకా మాట్లాడుతూ.. ‘‘ రేపు భారత్ మండపంలో ప్రారంభం కాబోయే ప్రదర్శన ఇప్పటి వరకు జరిగిన భారత్ టెక్స్ కార్యక్రమాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. ఇందుకోసం వేలాది మంది ప్రదర్శనకారులు, 20కిపైగా దేశాల నుంచి సుమారు 7,000 మంది కొనుగోలు దారులు, ప్రతినిధులు భారత్ మండపానికి రానున్నారు. కేంద్ర జౌళి శాఖ మంత్రిత్వ శాఖ, జౌళి ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, పరిశ్రమల సంఘాల మధ్య కుదిరిన ఉమ్మడి సహకారానికి ఈ ప్రదర్శన ఒక నిదర్శనం. వారి నిరంతర నాయకత్వం, విలువైన మద్దతు ఈ కార్యక్రమాన్ని ప్రపంచ స్థాయి జౌళి వేదికగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయి’’ అని పేర్కొన్నారు.
భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ సహ అధ్యక్షులు శ్రీ భద్రేష్ దొధియా మాట్లాడుతూ.. ‘‘రాబోయే నాలుగు రోజుల్లో 4,000కు పైగా బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) సమావేశాలు జరగనున్నాయని, 30 కి పైగా అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని అన్నారు. కేవలం సాధారణ చర్చలకే పరిమితం కాకుండా.. వాణిజ్యపరమైన లావాదేవీలు, దీర్ఘకాలిక భాగస్వామ్యాలు మార్చే లక్ష్యంతో ఈ సమావేశాలను రూపొందించాం. కొనుగోలు నిర్ణయాలు, పెట్టుబడుల నిబద్ధత, వ్యాపార భాగస్వామ్యాలు జరిగేలా భారత్ టెక్స్ 2026 వేదికను తీర్చిదిద్దాం’’ అని తెలిపారు.
ఇండియా ఎక్స్పోజిషన్ మార్ట్ లిమిటెడ్ (ఐఈఎంఎల్) చైర్మన్, భారత్ టెక్స్ 2026 ముఖ్య కమిటీ సభ్యుడు డాక్టర్ రాకేశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర స్థాయి పెట్టుబడిదారుల అనుసంధాన సదస్సులతో పాటు వాణిజ్యం, సాంకేతికత, స్థిరత్వం, హస్తకళలకు సంబంధించిన 100కి పైగా సమావేశాలను నిర్వహిస్తున్నాం. దేశంలోని అతిపెద్ద ఎగుమతిదారుల నుంచి చిన్న తరహా ఎంఎస్ఎమ్ఈ రంగాల వరకు భారతీయ వస్త్ర పరిశ్రమలోని ప్రతీ విభాగానికి ప్రయోజనం చేకూరేలా దీనిని రూపొందించాం. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రదర్శన జౌళి రంగం పూర్తి సామర్థ్యాన్ని, గుర్తింపును చాటుకునే గొప్ప వేదికగా నిలిచిపోతుంది’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రభుత్వాల భాగస్వామ్యం -ఎనిమిది భాగస్వామ్య రాష్ట్రాలు, తొమ్మిది ప్రదర్శన రాష్ట్రాల సారథ్యం
ఈ సారి జరగబోయే భారత్ టెక్స్ ప్రదర్శనలో ప్రభుత్వాల భాగస్వామ్యం అత్యంత బలంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు వంటి ఎనిమిది రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా నిలిచాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, మణిపూర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్తో సహా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రదర్శనదారులుగా పాల్గొంటున్నాయి.
కేంద్ర-రాష్ట్ర-పరిశ్రమల సహకారాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్రాల పెట్టుబడిదారుల అనుసంధాన సదస్సులు
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, పారిశ్రామిక రంగాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా రాష్ట్రాల పెట్టుబడిదారుల అనుసంధాన సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుల ద్వారా గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు తమ ప్రాంతాల్లోని పెట్టుబడి అవకాశాలను, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, పీఎం మిత్ర అనుసంధానాలు, ప్రభుత్వ విధానపరమైన మద్దతును ఈ వేదికపై ప్రదర్శించనున్నాయి. ఇందులో గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా పీఎం మిత్ర మాస్టర్ డెవలపర్ సమావేశం కూడా నిర్వహించనున్నారు.
వ్యాపారమే ప్రధాన లక్ష్యంగా: 7,000 మందికి పైగా కొనుగోలుదారులు, 1,600 మందికి పైగా ప్రదర్శనకారులు, 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్యం
వ్యాపార పరంగా చూస్తే ఈ మూడో విడత సదస్సులో 7,000 మందికి పైగా కొనుగోలుదారులు, 1.3 లక్షల మంది వాణిజ్య సందర్శకులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. 16 లక్షల చదరపు అడుగుల భారీ ప్రదర్శన స్థలంలో 20,000కు జౌలి ఉత్పత్తులను ప్రదర్శిస్తూ, ఈ కార్యక్రమమంతటా బలమైన వాణిజ్య లావాదేవీలను సాగించనున్నారు.
ఇందులో 1,600 మందికి పైగా ప్రదర్శకులు పాల్గొని.. ఫైబర్, నూలు, బట్టలు, దుస్తులు, ఫ్యాషన్, గృహ సంబంధిత వస్త్రాలు, సాంకేతిక వస్త్రాలు, అనుబంధ పరిశ్రమలతో కూడిన పూర్తి స్థాయి దేశ జౌళి రంగాన్ని ప్రదర్శించనున్నారు. తిరుపూర్, ఇచ్చల్కరంజి, అహ్మదాబాద్ వంటి ప్రసిద్ధ వస్త్ర పరిశ్రమల విభాగాలు కూడా ఇందులో భాగం కానున్నాయి. అమెరికా, బ్రిటన్, జపాన్, పోర్చుగల్, స్పెయిన్, న్యూజిలాండ్, దక్షిణా కొరియా, దక్షిణాఫ్రికా, నేపాల్ వంటి 14 దేశాల అంతర్జాతీయ ప్రదర్శకులు ఇందులో పాల్గొంటున్నారు. ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ఈ ప్రదర్శనలో భాగం కానున్నాను. ట్రైడెంట్, వర్ధమాన్ టెక్స్టైల్స్, ఆర్ఎస్డబ్ల్యూఎం, షాహీ ఎక్స్పోర్ట్స్, కలర్జెట్, అరవింద్, పీడీఎస్ లిమిటెడ్, సత్త్వ వంటి ప్రముఖ పరిశ్రమలు ఈ కార్యక్రమానికి కీలక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి.
వాణిజ్య ఫలితాలను పెంచేలా 4,000 పైగా బీ2బీ సమావేశాలు, 30 కి పైగా ఒప్పందాలు
ఈ వేదిక ద్వారా 4,000కు పైగా బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) సమావేశాలు, 100కు పైగా బిజినెస్ టు గవర్నమెంట్ (బీ2జీ) సమావేశాలు జరగనున్నాయి. అలాగే 30 కి పైగా అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, సుస్థిరత, మార్కెట్ ప్రవేశం వంటి అంశాలపై ఈ ఒప్పందాలు జరగడం వల్ల వస్త్ర తయారీదారులు, ఎగుమతిదారులు, ప్రపంచ భాగస్వాములకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది.
వాణిజ్య భాగస్వామ్యాలను బలోపేతం చేయనున్న అంతర్జాతీయ వ్యాపార, ప్రభుత్వ ప్రతినిధి బృందాలు
భారత్ టెక్స్ 2026 ప్రదర్శనలో భాగంగా 20కు పైగా దేశాలకు చెందిన అంతర్జాతీయ నిపుణులు, పరిశ్రమల అధిపతులు, సీఎక్స్ఓలు, విధాన నిర్ణేతలు, మేధావులతో కలిపి మొత్తం 350 మందికి పైగా వక్తలు ప్రసంగించనున్నారు. సరిహద్దుల దాటి అంతర్జాతీయ వ్యాపార సంబంధాలను పటిష్టం చేయడం కోసం ఈ వేదికపై ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ పెవిలియన్ను కూడా ఏర్పాటు చేశారు.
అంతర్జాతీయ విధానపరమైన చర్చలకు, ద్వైపాక్షిక సహకారానికి భారత్ టెక్స్ వేదికగా మారుతోంది. దీనికి నిదర్శనంగా న్యూజిలాండ్, శ్రీలంక, జోర్డాన్, కంబోడియా, బ్రూనై దేశాల నుంచి మంత్రుల బృందాలు ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరిచాయి.
అమెరికా, జపాన్, స్పెయిన్, బ్రిటన్, పోర్చుగల్, రష్యా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, యూఏఈ, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ వంటి అనేక దేశాల నుంచి పారిశ్రామిక, వ్యాపార ప్రతినిధి బృందాలు ఈ ప్రదర్శనకు హాజరుకానున్నాయి. ఇది సరికొత్త వాణిజ్య లావాదేవీలకు, కొనుగోళ్లకు, పెట్టుబడులకు కొత్త అవకాశాలను అందించనుంది. ఈ సదస్సులో భాగంగా భారత్-యూఎస్ పత్తి భాగస్వామ్యం, భారత్-న్యూజిలాండ్ ఉన్ని వ్యవస్థ, భారత్-యూకే ఎఫ్టిఏ అమలు, జపాన్ ప్రతినిధి బృందంతో ప్రత్యేక సమావేశం, రష్యా కేంద్రీకృత జౌళి రంగ చర్చలు వంటి ద్వైపాక్షిక సదస్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఎగుమతుల సన్నద్ధతకు, ఎంఎస్ఎంఈల వృద్ధికి తోడ్పడేలా 100కు పైగా అవగాహన సదస్సులు
ఈ ప్రదర్శనలో భాగంగా 50కుపైగా అత్యంత నైపుణ్యం కలిగిన భాగస్వాముల మద్దతుతో 100కు పైగా అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. వీటిలో 39 నిపుణుల చర్చలు, 16 రౌండ్ టేబుల్ సమావేశాలు, 37 మాస్టర్క్లాస్లు, 8 రాష్ట్ర స్థాయి సదస్సులు ఉన్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, సుస్థిరత, పరిశ్రమ 5.0, ఆవిష్కరణలు, టెక్నికల్ టెక్స్టైల్స్, ఫ్యాషన్, ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ కొనుగోళ్లు వంటి విభిన్న అంశాలపై ఈ సదస్సులు జరగనున్నాయి. ఎగుమతుల పోటీతత్వాన్ని పెంపొందించడానికి, చిన్న తరహా పరిశ్రమలకు మద్దతు ఇవ్వడానికి, అంతర్జాతీయ మార్కెట్ పోకడలను అవగాహన చేసుకోవడానికి వీలుగా వీటిని రూపొందించారు.
బాధ్యతాయుతమైన వ్యాపార పద్ధతులకు గుర్తింపుగా సీఐటీఐ టెక్స్టైల్ సుస్థిరత అవార్డులు 2026
భారత్ టెక్స్ 2026 వేదికగా సీఐటీఐ టెక్స్టైల్ సుస్థిరత అవార్డులు 2026 ప్రదానోత్సవం కూడా జరగనుంది. ఈ అవార్డులను ప్రధానంగా ఏడు కీలక అంశాల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అవి వనరుల సామర్థ్యం, ఇంధనం-ఉద్గారాలు, సర్క్యులర్ ఎకానమీ, పర్యావరణ అనుకూల పదార్థాలు, సామాజిక బాధ్యత, బాధ్యతాయుతమైన వ్యాపారం, పరిశ్రమల ఉమ్మడి సహకారం.
వ్యాపార అనుసంధానానికి డిజిటల్ వేదికల విస్తృత వినియోగం
వ్యాపార లావాదేవీలు అత్యంత సులభంగా, వేగంగా సాగడం కోసం భారత్ టెక్స్ 2026 సరికొత్త సాంకేతికతను రంగంలోకి దించింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్, ప్రీ-ఫెయిర్ డైరెక్టరీ వంటి డిజిటల్ వేదికలను నిర్వాహకులు అందుబాటులోకి తెచ్చారు. ఈ డిజిటల్ సాధనాల ద్వారా ప్రదర్శకుల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. సమావేశాల సమయాన్ని ముందుగానే నిర్ణయించడం, ప్రదర్శన ప్రాంతానికి సంబంధించిన నావిగేషన్, క్యూఆర్ కోడ్ ఆధారిత లీడ్ క్యాప్చర్, డిజిటల్ బ్యాడ్జ్ యాక్సెస్, ఏఐ ఆధారిత సహాయం వంటి అత్యాధునిక సదుపాయాలు కల్పించారు. ఆధునాతన బయ్యర్-సెల్లర్ మ్యాచ్ మేకింగ్ సాంకేతికత ద్వారా సరైన కొనుగోలుదారులను, విక్రేతలను అనుసంధానిస్తూ ఈ సదస్సును మరింత సమర్థవంతమైన డేటా ఆధారిత వ్యాపార వేదికగా మార్చనున్నారు.
భారతీయ జౌళి రంగ భవిష్యత్తుకు సరికొత్త వేదిక
రేపటి నుంచి ప్రపంచ జౌళి పరిశ్రమకు స్వాగతం పలికేందుకు భారత్ టెక్స్ 2026 సిద్ధమైంది. కేవలం భారత్ జౌళి రంగ సామర్థ్యాలను ప్రదర్శించడమే కాకుండా, ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునే స్థిరమైన సరఫరా వ్యవస్థను నిర్మించాలనే దేశ దార్శనికతను ప్రతిబింబిస్తోంది. వివిధ ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు, విధాన నిర్ణేతలు, పెట్టుబడిదారులు, తయారీదారులను ఒకే తాటిపైకి తీసుకురావడం ద్వారా అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. కొత్త వ్యాపార, పెట్టుబడి అవకాశాలను అన్వేషిస్తూ ప్రపంచ జౌళి రంగ సరఫరా వ్యవస్థలో నమ్మకమైన భాగస్వామిగా దేశ స్థానాన్ని ఇది మరింత బలోపేతం చేయనుంది.
ఈ ప్రదర్శనకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం https://bharat-tex.com/ వెబ్సైట్ను సందర్శించవచ్చు.
***
(रिलीज़ आईडी: 2284238)
आगंतुक पटल : 15