మెల్బోర్న్లో జూలై 9, 2026న జరిగిన ఆస్ట్రేలియా-ఇండియా సీఈఓల ఫోరమ్, ఎకనామిక్ రోడ్మ్యాప్ బిజినెస్ సమావేశాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి గౌరవ ఆంథోనీ అల్బనీస్ ప్రసంగించారు. ఈ రెండు కార్యక్రమాల్లో భారత్, ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ కంపెనీల సీఈఓలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆస్ట్రేలియన్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్స్ ప్రతినిధులు, అక్కడి ప్రముఖ విశ్వవిద్యాలయాల వైస్-ఛాన్సలర్లు పాల్గొన్నారు.
సీఈఓల ఫోరమ్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారతదేశంలోని బలమైన ఆర్థిక వృద్ధి, విధానపరమైన సంస్కరణలు, డిజిటల్ మార్పులు, విస్తరిస్తున్న ఆవిష్కరణలు, ఆస్ట్రేలియా భాగస్వాములకు నూతన వాణిజ్య అవకాశాలను కల్పిస్తాయని అన్నారు. భారత్, ఆస్ట్రేలియా వ్యవస్థల మధ్య పరస్పర అనుకూలతలను ఆయన ప్రస్తావించారు. భారత్ లో తయారీ రంగం, స్వచ్ఛ ఇంధనం, అరుదైన ఖనిజాలు, గనుల తవ్వకం, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి, విమానయానం, రవాణా, అధునాతన సాంకేతికతలు, కృత్రిమ మేధ, ఫిన్టెక్, ఆహార శుద్ధి, డిజిటల్ ఆర్థిక రంగాల్లోని విస్తృతమైన అవకాశాల గురించి ప్రధానమంత్రి వివరించారు. భారతదేశ విస్తృతమైన మార్కెట్కు ఆస్ట్రేలియా నైపుణ్యం తోడైతే ఇరుదేశాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
భారత్లో దీర్ఘకాలిక పెట్టుబడులకున్న అవకాశాలను వినియోగించుకోవాలని ఆస్ట్రేలియా పెట్టుబడిదారులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించారు. భారతదేశంలో ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం పెరుగుతుండటాన్ని స్వాగతించారు. ఉన్నత విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిలో ఇరుదేశాల మధ్య సహకారం మరింత బలోపేతం కావటం వల్ల ఇరుదేశాల యువత భవిష్యత్తు మెరుగవడమే కాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సహాయపడుతుందని స్పష్టం చేశారు.
సీఈఓల ఫోరమ్ తర్వాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎకనామిక్ రోడ్మ్యాప్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఇరుదేశాలకు చెందిన 200 మందికి పైగా సీఈఓలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఉన్న సహజ అనుబంధం గురించి మాట్లాడుతూ ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, ఇండో-పసిఫిక్ ప్రాంతం పట్ల ఏకాభిప్రాయం, ఇరుదేశాల ప్రజల మధ్య ఆత్మీయ సంబంధాలు, బలమైన రాజకీయ అవగాహన వంటివి రెండు దేశాల వాణిజ్య భాగస్వామ్యం కలిసికట్టుగా ఎదగటానికి, అభివృద్ధి చెందటానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాయని చెప్పారు. 2022 నాటి ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (ఈసీటీఏ) ఆధారంగా వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు వృద్ధి చెందటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య వ్యాపార సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈసీఏ) ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఇరుదేశాలు పరస్పర బలాలను వినియోగించుకుంటూ అరుదైన ఖనిజాలు, లిథియం, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, ఈవీలు, సెమీ కండక్టర్లు, ఏఐ, రక్షణ రంగ సరఫరా వ్యవస్థలో అంతర్జాతీయ పరిష్కారాలను రూపొందించాలని వాణిజ్య రంగ ప్రముఖులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోరారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు తదుపరి స్థాయికి చేరుకోవాలంటే భారతదేశంలోని రాష్ట్రాలు, ఆస్ట్రేలియా ప్రావిన్సుల ప్రధాన సామర్థ్యాల ఆధారంగా క్రియాశీల ఆర్థిక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవటం ముఖ్యమని సూచించారు. రెండు కార్యక్రమాల్లో జరిగిన చర్చల ద్వారా వచ్చిన సానుకూల, అర్థవంతమైన ఆలోచనలను ప్రస్తావిస్తూ.. భారత్-ఆస్ట్రేలియా ఆర్థిక సంబంధాలు మరింత వృద్ధి చెందుతాయనే విశ్వాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
***