వ్యవసాయ మంత్రిత్వ శాఖ
అస్సాం ఎన్ఆర్ఏఏ ప్రాయోజిత అటవీ వరి ధాన్య సంరక్షణ ప్రాజెక్టునకు గుర్తింపు
జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా సోనిత్పూర్లోని బోర్జులి ప్రాంతం
प्रविष्टि तिथि:
02 JUL 2026 11:19AM by PIB Hyderabad
కేంద్ర వ్యవసాయ - రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ వర్షాధార ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎన్ఆర్ఏఏ).. దేశంలోని అటవీ వరి జన్యు వనరుల సంరక్షణలో కీలక విజయాన్ని సాధించింది. సంస్థ నిధులతో అస్సాంలోని శోణిత్పుర్ జిల్లాలో చేపట్టిన ‘అటవీ వరి (ఒరైజా రుఫిపోగన్) స్థానీయ సంరక్షణ – నిర్వహణ’ ప్రాజెక్టు ద్వారా ఈ విజయం సాధ్యమైంది. అస్సాం రాష్ట్ర జీవవైవిధ్య బోర్డుతో కలిసి.. 2022 నుంచి న్యూఢిల్లీకి చెందిన ఐసీఏఆర్- జాతీయ వృక్ష జన్యు వనరుల బ్యూరో ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేస్తోంది.
ఐసీఏఆర్- ఎన్బీపీజీఆర్కు చెందిన శాస్త్రవేత్తల బృందం.. ఎన్ఆర్ఏఏ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ చంద్ర శేఖర్ కుమార్ ఐఏఎస్ను కలిసి, అటవీ వరి జన్యు పదార్థ సంబంధిత ప్రయోగం, పరిరక్షణ, లక్షణాల గుర్తింపులో ఆ ప్రాజెక్టు సాధించిన విజయాలను ఆయనకు వివరించారు. ఈ ప్రాజెక్టు కింద గుర్తించిన అస్సాంలోని శోనిత్పూర్ జిల్లాలో ఉన్న బోర్జులి ప్రదేశాన్ని.. జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ ప్రకటించిందని ఈ బృందం తెలిపింది. సుసంపన్నమైన దేశ అటవీ వరి ధాన్య వైవిధ్య సంరక్షణలోనూ, వాతావరణ మార్పులను తట్టుకోగలిగేలా వ్యవసాయాన్ని తీర్చిదిద్దడంలోనూ ఈ గుర్తింపు ఉపయోగపడుతుంది.
పరిశోధక బృందం కృషిని డాక్టర్ చంద్రశేఖర్ కుమార్ అభినందించారు. వాతావరణ మార్పులను తట్టుకునే, అధిక దిగుబడినిచ్చే, అత్యుత్తమ పోషకాలు కలిగిన కొత్త వరి వంగడాలను అభివృద్ధి చేయడానికి అటవీ వరి జాతులు అమూల్యమైన జన్యు వనరులని ఆయన పేర్కొన్నారు. భారతీయ వ్యవసాయ రంగంలో స్థిరత్వాన్ని, దీర్ఘకాలిక ఆహార భద్రతను పెంపొందించడం లక్ష్యంగా.. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర పంటల అటవీ రకాల సంరక్షణకు కూడా ఇలాంటి ప్రాజెక్టులను చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎన్ఆర్ఏఏ డైరెక్టర్ (వ్యవసాయం - ఉద్యాన విభాగం) డాక్టర్ పంకజ్ కుమార్ షా, ఎన్ఆర్ఏఏ సాంకేతిక నిపుణుడు (వాటర్షెడ్ నిర్వహణ) డాక్టర్ అనిల్ కుమార్ మిశ్రా పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2280299)
आगंतुक पटल : 18