గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
‘వీబీ-జీ రామ్-జీ’ చట్టం-2025 కింద గ్రామీణ ఉపాధి పనులకు సవరించిన వేతనాలను ప్రకటించిన ప్రభుత్వం
అన్ని రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో పెంపు.. కనీసం ₹300 స్థాయికి తగ్గకుండా సగటున 10 శాతం పెరుగుదల
ఉత్తరప్రదేశ్.. బీహార్.. జార్ఖండ్.. పశ్చిమ బెంగాల్.. అస్సాం.. అరుణాచల్ ప్రదేశ్.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 15 నుంచి 25 శాతం దాకా పెరుగుదల
కేరళ.. హర్యానా.. పంజాబ్.. కర్ణాటక రాష్ట్రాల్లో వేతనం ₹360 నుంచి ₹409 వరకూ ఉంటుంది
లోగడ తక్కువ వేతనాలున్న రాష్ట్రాల్లోనే అత్యధిక పెంపుదల వర్తింపు.. తద్వారా లక్షలాది గ్రామీణ కార్మికుల జీవనోపాధి బలోపేతం
प्रविष्टि तिथि:
30 JUN 2026 11:46PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్- గ్రామీణ్ చట్టం-2025’ (వీబీ-జీ రామ్-జీ) కింద సవరించిన వేతన రేట్లను ప్రకటించింది. ఈ చట్టం దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన నేపథ్యంలో జూలై 1 నుంచి సవరించిన రేట్లు వర్తిస్తాయి.
అధిక వేతనాల చెల్లింపు, ప్రాంతీయ అసమానతల తగ్గింపు, శ్రమకు తగిన గౌరవం ద్వారా గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడంలో ఈ సవరణ ప్రకటన ఓ కీలక ఘట్టం కాగలదు. ఈ మేరకు మధ్యంతర కనీస వేతనాన్ని ₹300గా నిర్ణయించడం ఈ సవరణ ప్రత్యేకత. దీనివల్ల గ్రామీణ ఉపాధి కల్పనలో వేతనం ఏ రోజునా ₹300కన్నా తక్కువ ఉండే వీల్లేదు.
ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం-రైతు సంక్షేమ శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ-
“గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన దేశంలోని ప్రతి పేదకూ ప్రగతి ఫలాలు దక్కేవిధంగా మా ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తెచ్చిన వీబీ-జీ రామ్-జీ చట్టం అమలుకు శ్రీకారం చుట్టడం ఒక కీలక ఘట్టం. సుసంపన్న గ్రామాల తోడ్పాటు ద్వారా ‘వికసిత్ భారత్’గా దేశాన్ని రూపుదిద్దడంలో ఇదొక చారిత్రక మలుపు. ఉపాధి హామీని 125 రోజులకు విస్తరించడం సహా గ్రామీణ కార్మికులకు మెరుగైన వేతనాలు లభించేలా మేం చర్యలు చేపట్టాం. లోగడ వేతనాలు తక్కువగా ఉన్న రాష్ట్రాలకు అత్యధిక పెంపు ద్వారా ప్రయోజనం కల్పించాం. దీనివల్ల ప్రధానంగా నిరుపేదలకు ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఈ చారిత్రక వేతన సవరణతో గ్రామీణ జీవనోపాధి బలోపేతం కావడంతోపాటు ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, గ్రామీణ భారతంలో సార్వజనీన వృద్ధిని మరింత వేగిరపరుస్తుంది” అని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా వేతన పెంపు చారిత్రక మలుపు
వేతన సవరణ ప్రకటన ఫలితంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత-వేతన వైవిధ్యంగల ప్రాంతాల్లోనూ పెంపు సాధ్యమవుతుంది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద అత్యంత ముఖ్యమైన వేతన సవరణలలో ఇదొకటిగా నిలుస్తుంది.
సవరణ ప్రకటన ముఖ్యాంశాలు:
-
దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత-వేతన వైవిధ్య ప్రాంతాలన్నిటా వేతనాల పెంపు.
-
ముఖ్యంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పాలన విభాగాల పరిధిలో వేతనాలను ప్రస్తుత మధ్యంతర కనీస వేతనం ₹300 స్థాయికి పెంపు.
-
‘ఎంజీఎన్రెగా’ కింద జాతీయ సగటు వేతనం రోజుకు ₹298.80 కాగా, వీబీ–జీ రామ్-జీ కింద ₹327.40కి.. అంటే- రోజుకు సగటున ₹28.60 వంతున పెరిగింది.
-
దేశవ్యాప్తంగా సగటు పెంపు 10 శాతంకన్నా అధికం. ఆ మేరకు ‘వీబీ-జీ రామ్-జీ’ కింద గ్రామీణ వేతనాలకు ₹300 పరిమితి కొత్త జాతీయ ప్రమాణంగా మారింది.
జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం కింద రోజుకు ₹300 తాత్కాలిక కనీస వేతన పరిమితిని ప్రభుత్వం తొలిసారి నిర్దేశించింది.
ఈ సవరణ ప్రకటనకు ముందు అనేక రాష్ట్రాల్లో వేతనం ₹300 కన్నా తక్కువగా.. అంటే- రోజుకు ₹241గా ఉండేది. ఇటువంటి పరిస్థితిగల ప్రతి రాష్ట్రానికి కొత్త ప్రమాణాన్ని వర్తింపజేసింది. దీనివల్ల గ్రామీణ కార్మికులకు ఆదాయ భద్రత గణనీయంగా మెరుగుపడటం సహా ప్రాంతీయ వేతన వ్యత్యాసాలు కూడా సమసిపోతాయి. ఈ కొత్త తాత్కాలిక కనీస వేతన నిర్ణయంతో ముఖ్యంగా 21 రాష్ట్రాలు, పరిపాలన విభాగాలకు ప్రత్యక్ష ప్రయోజనం లభిస్తుంది.
చారిత్రకంగా తక్కువ వేతనాలున్న రాష్ట్రాలకు అత్యధిక ప్రయోజనాలు
సవరించిన వేతన స్వరూపం చారిత్రకంగా తక్కువ వేతనం అమలులోగల రాష్ట్రాలకు అధిక ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం జాగ్రత్త వహించింది. తద్వారా సమానత్వం, సమతుల ప్రాంతీయాభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
తదనుగుణంగా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో కార్మికులు దాదాపు 24.5 శాతంతో అత్యధిక పెంపు పొందారు. వీటితోపాలు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, అస్సాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా సహా అనేక ఇతర రాష్ట్రాలకూ వేతన పెంపు గణనీయ స్థాయిలో ఉంది.
అధిక వేతనాలున్న రాష్ట్రాలకూ పెంపు
ఇప్పటికే మధ్యంతర కనీస వేతనంకన్నా ఎక్కువ చెల్లిస్తున్న రాష్ట్రాలకూ నిర్దేశిత పద్ధతి ప్రాతిపదికన సవరణ ప్రకటనతో ప్రయోజనం కలుగుతుంది.
ఈ మేరకు హర్యానా (₹409), గోవా (₹406), కేరళ (₹401), సిక్కిం (పర్వత ప్రాంత పంచాయతీలు-₹450) రాష్ట్రాల్లో ప్రకటిత వేతనం రోజుకు ₹400 దాటుతుంది. ఇంతకుముందు ఈ స్థాయి వేతనం ఒకే ఒక వేతన ప్రాంతానికి మాత్రమే పరిమితంగా ఉండేది.
పారదర్శక.. శాస్త్రీయ పద్ధతిలో వేతన నిర్ధారణ
వీబీ-జీ రామ్-జీ చట్టం-2025 నిబంధనల ప్రకారం సవరించిన వేతనాలపై ప్రభుత్వం ప్రకటన జారీచేసింది. గ్రామీణ వేతన చెల్లింపులో చారిత్రక అసమానతలను తగ్గిస్తూ, సముచిత వేతన నిర్ధారణకు ఉద్దేశించిన ఈ ప్రకటనతో ఇటీవలి కొత్త మధ్యంతర కనీస వేతనం సహా వార్షిక సూచీకరణ సమ్మిళితం అవుతుంది.
వికసిత భారత్ కింద గ్రామీణ సౌభాగ్య బలోపేతం
అర్హతగల ప్రతి గ్రామీణ కుటుంబానికీ 125 రోజుల హామీ సహిత వేతన ఉపాధినిచ్చే కొత్త చట్టంలోని వినూత్న నిబంధనలకు ఈ సవరణ వేతన నోటిఫికేషన్తో మరింత బలం చేకూరుతుంది. ఉపాధి హామీ విస్తరణతోపాటు వేతనం పెంపుతో గ్రామీణ భారతంలో ఆదాయ వృద్ధి ద్వారా కొనుగోలు శక్తి మెరుగుపడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే, గ్రామాలకు శాశ్వత ఆస్తుల సృష్టితోపాటు సార్వజనీన, సుస్థిర గ్రామీణాభివృద్ధికి దోహదం చేస్తుందని భావిస్తోంది.
గరీబ్ కల్యాణ్, అంత్యోదయ, వికసిత భారత్-2047 దార్శనికతపై ప్రభుత్వ నిబద్ధతను ఈ కొత్త చట్టం అమలు, వేతన సవరణ ప్రకటన ప్రస్ఫుటం చేస్తున్నాయి. దేశ పురోగమన ఫలాలు ప్రతి గ్రామానికి, గ్రామీణ కుటుంబానికి చేరేవిధంగా ఇది భరోసానిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2279700)
आगंतुक पटल : 20