గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
వికసిత్ భారత్కు మార్గసూచీని సిద్ధం చేసిన ‘రాష్ట్రీయ గ్రామీణ్ వికాస్ సమ్మేళన్-2026’
గ్రామీణ ప్రాంతాల మహిళలు నాయకత్వం వహించే వాణిజ్య సంస్థలను ప్రోత్సహించడానికి ‘సరస్ శక్తి’
మహిళా స్వయం సహాయ సంఘాల ఉత్పాదనల వైవిధ్యాన్నీ, నాణ్యతనీ, మార్కెట్ అవకాశాలపై ‘సరస్ శక్తి’ కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ
प्रविष्टि तिथि:
30 JUN 2026 11:44AM by PIB Hyderabad
గ్రామాల్లో పరివర్తనను తీసుకురావాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టికోణానికి అనుగుణంగా, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘రాష్ట్రీయ గ్రామీణ్ వికాస్ సమ్మేళన్’ (ఆర్జీవీఎస్)-2026’ ఈ నెల 29న ముగిసింది. ఈ సమ్మేళనంలో కేంద్ర, రాష్ట్రాల సహకారం, సముదాయాలు నాయకత్వం వహించే అభివృద్ధి, సాంకేతికత చోదక శక్తిగా ఉండే పాలనల ద్వారా ‘వికసిత గ్రామాలు, వికసిత భారత్’ దార్శనికతకు సత్వరం ఆచరణ రూపాన్ని ఇవ్వాలని సంకల్పించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ జాతీయ సమ్మేళనంలో ప్రధాన గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలును సమీక్షించడం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య అత్యుత్తమ పద్ధతుల మార్పిడితో పాటు గ్రామీణ పరివర్తన తదుపరి దశకు మార్గసూచీపై చర్చించారు.
ఈ సమ్మేళనాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసానితో పాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ కమలేశ్ పాస్వాన్ పాల్గొన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు, సీనియర్ అధికారులు, కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల నిపుణులు, రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్స్ (ఎస్ఆర్ఎల్ఎమ్)కు చెందిన ప్రతినిధులు, అభివృద్ధి భాగస్వాములు పాలుపంచుకున్నారు.
‘వీబీ-జీ రాంజీ చట్టం, 2025’ను ప్రభావవంతంగా అమలు చేయడంపై సమ్మేళనంలో ప్రధానంగా చర్చించారు. ఈ వేదిక అనేక ముఖ్య గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై సమగ్ర సమీక్షనూ చేపట్టింది. ఆ కార్యక్రమాల్లో ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్’, ‘ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన’, ‘దీన్దయాళ్ అంత్యోదయ యోజన-నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్’ (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎమ్), ‘గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల’తో పాటు ‘జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం’ ఉన్నాయి.
చర్చోపచర్చలలో గ్రామీణాభివృద్ధి ప్రణాళికను పటిష్ఠపరచడం, గ్రామపంచాయతీలకు సాధికారితను కల్పించడం, మహిళల నాయకత్వంలో బతుకుతెరువు మార్గాల్ని విస్తరించడం, గ్రామీణ గృహనిర్మాణాన్నీ, సంధానాన్నీ మెరుగుపరచడంతో పాటు వాతావరణ మార్పులకు తట్టుకొని నిలిచే జీవనోపాధులను ప్రోత్సహించడం ప్రస్తావనకు వచ్చాయి. 2029 కల్లా 6 కోట్ల మంది లఖ్పతి దీదీ (లక్షాధికారి సోదరీమణులు)గా ఎదిగేటట్లు వారికి తోడ్పడడానికి అమలు చేయదగిన డిజిటల్ కార్యక్రమాలకు ఉద్దేశించిన మార్గసూచీని కూడా సిద్ధం చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన నూతన ఆవిష్కరణల నమూనాలను దేశం అంతటా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలూ ప్రస్తావనకు వచ్చాయి.
ఈ మిషన్ ప్రస్తుతం స్వయంసహాయ బృందాలు (ఎస్హెచ్జీ)గా ఏర్పడ్డ 10 కోట్ల మందికి పైగా మహిళలకు బాసటగా నిలుస్తోంది. మహిళల నాయకత్వంలోని వాణిజ్య సంస్థలకు ఊతమివ్వడానికి డీఏవై-ఎన్ఆర్ఎల్ఎమ్లో భాగంగా ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో వాణిజ్య సంస్థలకు ఆర్థిక సహాయం, డిజిటల్ మాధ్యమంలో నూతన ఆవిష్కరణలు, బ్రాండింగు, మార్కెట్టును అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టిని కేంద్రీకరించారు.
ఈ సమ్మేళనం డీఏవై-ఎన్ఆర్ఎల్ఎమ్కు చెందిన జాతీయ మార్కెటింగ్ కార్యక్రమం ‘సరస్ ఆజీవికా’ స్థాయి విస్తరిస్తుండటాన్ని ముఖ్యంగా ప్రస్తావించింది. 1999లో ఒకటో సరస్ మేళాను ప్రారంభించిన తరువాత, ఈ కార్యక్రమం ఒక జాతీయ స్థాయి మార్కెటింగ్ విస్తారిత అనుబంధ వ్యవస్థ రూపాన్ని సంతరించుకుంది. దీనిలో 25 కన్నా ఎక్కువ రాష్ట్ర బ్రాండ్లు చేరాయి. ఏటా రూ.200 కోట్ల కన్నా ఎక్కువ వ్యాపారం నమోదవుతోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా, మంత్రిత్వ శాఖ సరస్ శక్తి కలెక్షనును ప్రారంభించింది. బ్రాండుకు జాతీయ గుర్తింపును దృఢతరం చేసే ఉద్దేశంతో సరస్ శక్తి కాఫీ టేబుల్ బుక్ను కూడా ఆవిష్కరించారు. దేశ వ్యాప్తంగా మహిళా స్వయంసహాయ సంఘాలు తయారు చేసిన ప్రీమియం ఉత్పాదనల శ్రేణి నుంచి ఎంపిక చేసిన ఉత్పాదనలకు సరస్ శక్తి కలెక్షన్లో చోటు కల్పించారు. ఈ వాణిజ్య సంస్థల వైవిధ్యాన్నీ, నాణ్యతనీ, మార్కెట్లో వాటి స్థానాన్నీ కాఫీ టేబుల్ బుక్ కళ్లకు కట్టింది. ఈ రెండు కార్యక్రమాలూ మార్కెట్టు లభ్యత పరిధిని పెంచడంతో పాటు, గ్రామీణ ఉత్పాదనలకు ఉన్నత స్థాయి సంస్థాగత, విస్తృత వినియోగదారు మార్కెట్లను అందుబాటులోకి తీసుకు రావాలన్న మంత్రిత్వ శాఖ ప్రయత్నాలకు బలాన్ని అందించేవే.
గుజరాత్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, బీహార్, కేరళ, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులు, ప్రతినిధులు సరస్ ఆజీవికా గ్యాలరీని చుట్టివచ్చారు. గేలరీలో చేనేతలు, వస్త్రాలు, గృహాలంకరణ సాధనాలు, వెల్నెస్ ఉత్పాదనలతో పాటు సాంప్రదాయిక ఆహార పదార్థాల నుండి ఎంపిక చేసిన వాటిని ప్రదర్శించారు. పంజాబుకు చెందిన ఫుల్కారీ, జమ్మూ కాశ్మీరుకు చెందిన పశ్మీనా, తెలంగాణ లోని ఇక్కత్, తేలియా వస్త్రాలు, మిజోరానికి చెందిన పౌంచెయీలతో పాటు మీనాకారీ, డోక్రా, ఇత్తడి సామగ్రి, కలపతో రూపొందించిన హస్తకళా వస్తువులను కూడా ప్రదర్శించారు. ఈ గేలరీలో విజయవంతమైన గ్రామీణ వాణిజ్య సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న లఖ్పతి దీదీలు రూపొందించిన కళాకృతులను కూడా ప్రదర్శించారు. పటిష్ఠ బ్రాండింగ్, ఉత్పాదనలను తీర్చిదిద్దే ప్రక్రియ, మార్కెట్తో ఏర్పరచుకొనే సంబంధాలు.. ఈ స్టాల్స్ మహిళా వాణిజ్య వేత్తలకు లాభసాటి వ్యాపారాలను నిర్మించడంలో ఎలా తోడ్పడుతున్నదీ కళ్లకు కట్టాయి.
సాముదాయిక సంస్థల నిర్మాణం, సుస్థిర జీవనోపాధుల విస్తరణతో పాటు విస్తృత మార్కెట్ అవకాశాల కల్పనకు కృషి చేయనున్నట్లు రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం పునరుద్ఘాటించింది. అభివృద్ధి లక్ష్యాలను సమ్మిళిత, స్వయంసమృద్ధ గ్రామీణ ఆర్థిక వృద్ధిలోకి మార్పు చేసేందుకు కేంద్రానికీ, రాష్ట్రాలకూ మధ్య సహకార పూర్వక కార్యాచరణ ఎంతైనా అవసరమని చర్చల్లో స్పష్టం చేశారు.



***
(रिलीज़ आईडी: 2279352)
आगंतुक पटल : 10