వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఉత్తర అమెరికా సమ్మర్ ఫ్యాన్సీ ఫుడ్ షో... ఇండియా పెవిలియన్ ప్రారంభం
మొదటిసారి భారీ ప్రభావాన్ని నమోదు చేసిన భారత్
ప్రదర్శనలో ఆరు ఎగుమతి రకం మామిడి
సమ్మర్ ఫ్యాన్సీ ఫుడ్–2026లో భారతీయ బియ్యం ప్రత్యేకతను తెలియజేసిన బాస్మతీ వంటకాలు
प्रविष्टि तिथि:
29 JUN 2026 8:26PM by PIB Hyderabad
ఉత్తర అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సమ్మర్ ఫ్యాన్సీ ఫుడ్–2026లో భారత్ పాలుపంచుకుంటున్నది. ఈ ప్రత్యేక ఆహార ప్రదర్శనలో భారత్ ఇంత పెద్ద ఎత్తున పాల్గొనడం ఇదే తొలిసారి. న్యూయార్క్లోని జాకబ్ కే జావిట్స్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను- భారత కాన్సుల్ జనరల్ బినాయా శ్రీకాంత ప్రధాన్, షెఫ్, రచయిత, టైమ్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న వికాస్ ఖన్నా 2026 జూన్ 28న ప్రారంభించారు. ఈ ఆహార ప్రదర్శనను వందలాది భారతీయ ఆహార బ్రాండ్లు, ఎగుమతిదారులు, ఆవిష్కర్తలను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది.
భారత ప్రభుత్వ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో వ్యవసాయం, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ), భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ (ఐటీపీవో) సంయుక్తంగా ఇండియా విభాగాన్ని ఏర్పాటు చేశాయి. ఇది భారతీయ ఆహార ఉత్పత్తులకు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆదరణను సూచిస్తోంది. అదేవిధంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులకూ, చిల్లర వర్తకులకూ, పంపిణీదారులకూ భారత దేశ వ్యవసాయ, ఆహార శుద్ధి పరిశ్రమ గొప్పతనాన్నీ, వైవిధ్యాన్నీ, నాణ్యతనూ తెలియజేస్తోంది.
సమ్మర్ ఫ్యాన్సీ ఫుడ్ షోలో భారతదేశం నుంచి బాస్మతీ బియ్యం, మసాలా దినుసులు, రెడీ టు ఈట్ ఆహారాలు, పానీయాలు, సేంద్రీయ ఉత్పత్తులు, శీతలీకరించిన ఆహారం, తినుబండారాలు, విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో సహా విభిన్న రంగాలకు చెందిన ఎగుమతిదారులు పాల్గొన్నారు. ఇది ప్రపంచంలోనే ఆహారం ఎగుమతుల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తోంది.
ఈ పెవిలియన్లో ఏర్పాటు చేసిన ఇండియన్ మ్యాంగో షోకేస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిలో ఆరు ప్రీమియం ఎగుమతి రకాలను, మామిడితో తయారు చేసిన వినూత్న ఆహార వంటకాలను ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శన భారత్లో పండే మామిడి పండ్ల వైవిధ్యాన్ని వివరిస్తోంది. ప్రపంచంలోనే ఈ పండ్లను అత్యధికంగా పండించే దేశంగా భారత్ స్థానాన్ని తెలియజేస్తోంది.
ఇక్కడ ఏర్పాటు చేసిన బాస్మతి వంటలను సందర్శకులు రుచి చూపిస్తున్నారు. నాణ్యమైన బాస్మతితో రూపొందించిన విదేశీ వంటకాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. సందర్శకుల కోసం ఎంపిక చేసిన భారతీయ వంటకాలను ప్రముఖ మిషెలిన్ స్టార్ షెఫ్ హేమంత్ మాథుర్ తయారు చేస్తున్నారు.
భారత్లో పండే బాస్మతీకి ఉన్న ప్రత్యేకమైన సువాసన, మృదుత్వం, నాణ్యత వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరుగుతోంది. భారతీయ ఆహారానికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో… వ్యవసాయ క్షేత్రాలు, కర్మాగారాల నుంచి డైనింగ్ టేబుల్ వరకు సాగిన ఈ ప్రయాణానికి ఇండియా పెవిలియన్ ఒక శక్తిమంతమైన చిహ్నంగా నిలుస్తుంది. ఇది వ్యవసాయం, ఆహార రంగాల్లో మిలియన్ల మంది చేసిన సమష్టి ప్రయత్నాలతో సాధ్యమైంది.
సమ్మర్ ఫ్యాన్సీ ఫుడ్–2026లో గతంలో ఎన్నడూ లేనంత విస్తృత స్థాయిలో ఇండియా పెవిలియన్ ప్రారంభం కావడం పట్ల ఐటీపీవో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నీరజ్ కర్వాల్ హర్షం వ్యక్తం చేశారు. ఐటీపీవో, అపెడా మధ్య ఉన్న సహకారం.. భారతీయ ఆహార ఎగుమతులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో న్యూయార్క్లోని భారత కాన్సుల్ జనరల్ బినాయా శ్రీకాంత ప్రధాన్ ప్రసంగించారు. అమెరికాలో భారతీయ ఆహార ఉత్పత్తులను, బ్రాండ్లను బలోపేతం చేసే కార్యక్రమంగా ఈ పెవిలియన్ నిలుస్తుందని ఆయన చెప్పారు. అమెరికా మార్కెట్లో విస్తరణకు ప్రయత్నిస్తున్న భారతీయ బ్రాండ్లకు సమ్మర్ ఫ్యాన్సీ ఫుడ్ షోలో ఏర్పాటు చేసిన ఇండియా పెవిలియన్ ప్రామాణిక కార్యక్రమంగా నిలుస్తుందని చెప్పారు. అలాగే భారతీయ ఆహార పరిశ్రమ నమ్మకాన్నీ, సామర్థ్యాన్నీ, నాణ్యతనూ ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో షెఫ్ వికాస్ ఖన్నా పాల్గొనడం గొప్ప విషయమన్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆహారమనే సార్వత్రిక భాష ద్వారా భారత దేశ సంస్కృతినీ, సంప్రదాయాలనూ, విలువలనూ పాశ్చాత్య దేశాలకు తీసుకువెళుతున్న గొప్ప రాయబారుల్లో ఆయన ఒకరని తెలిపారు.
భారతీయ ఆహార ఎగుమతులకు సంబంధించి కీలకమైన సమయంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది. వాణిజ్య అంచనాల ప్రకారం, వచ్చే దశాబ్ద కాలంలో భారతీయ ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులకు సుమారు 30 నుంచి 50 బిలియన్ డాలర్ల విలువైన అవకాశాన్ని ఉత్తర అమెరికా మార్కెట్ అందిస్తుందని భావిస్తున్నారు. ఈ వృద్ధికి ప్రామాణికమైన భారతీయ రుచులు, నాణ్యమైన పదార్థాలు, విశ్వసనీయమైన ఆహార బ్రాండ్లకు వినియోగదారుల నుంచి పెరుగుతున్న గిరాకీ దోహదపడుతున్నాయి.
ప్రారంభ కార్యక్రమంలో షెఫ్ వికాస్ ఖన్నా మాట్లాడుతూ.. ఇక్కడ ప్రదర్శించిన ప్రతి ఉత్పత్తి ఆహార రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయుల ఆకాంక్షలకూ, జీవనాధారానికీ ప్రతీక అని అన్నారు. ఈ పరిశ్రమ కేవలం ఉత్పత్తుల గురించి మాత్రమే కాదనీ, ప్రతి ధాన్యమూ, మసాలా దినుసూ, ప్యాకేజీ వెనుక ఉన్న లక్షలాది మంది రైతులు, వ్యాపారులు, తయారీదారులు, ఫ్యాక్టరీ కార్మికులు, ఎగుమతిదారులు, పంపిణీదారులు, రిటైల్ వ్యాపారుల గురించి కూడా అని ఆయన వివరించారు. భారతీయ ఆహారానికి లభించే ప్రతి అవకాశమూ.. ఈ సరఫరా రంగంలో అనేక కుటుంబాలకు అవకాశాలను కల్పిస్తుందన్నారు. ఈ విజయం.. ఈ ఉత్పత్తుల వెనక ఉన్న ప్రతి రైతుకూ, వ్యాపారికీ, తయారుదారునికీ, కార్మికునికీ చెందుతుందని తెలియజేశారు.
అంతర్జాతీయ స్థాయి కొనుగోలుదారులను ఇండియా పెవిలియన్కు అపెడా ఛైర్మన్ అభిషేక్ దేవ్ ఆహ్వానించారు. ఈ ప్రదర్శనలో భారత్ రికార్డు స్థాయిలో పాల్గొనడానికి ఉన్న ప్రాధాన్యాన్నీ, ప్రపంచ ఆహార ఎగుమతుల్లో పెరుగుతున్న దేశ ప్రాభవాన్నీ వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లలో తమ నాణ్యతనూ, ఆవిష్కరణనూ, వైవిధ్యాన్నీ ప్రదర్శించేందుకు అవసరమైన వేదికను భారతీయ ఆహార సంస్థలకు సమ్మర్ ఫ్యాన్సీ ఫుడ్ షో అందిస్తుంది. ఈ కార్యక్రమంలో 70 మందికి పైగా భారతీయ ఎగ్జిబిటర్ల పాల్గొన్నారనీ, వారి భాగస్వామ్యం భారతీయ ఎగుమతుదారుల నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తుందనీ, భారతదేశ ఉత్పత్తులపై అంతర్జాతీయ మార్కెట్లలోని వినియోగదారుల్లో పెరుగుతున్న విశ్వసనీయతను ప్రతిబింబిస్తుందనీ ఆయన అన్నారు.
***
(रिलीज़ आईडी: 2279325)
आगंतुक पटल : 9