నటులుగా, దర్శకులుగా కొత్త సాంకేతికతకు, మన కళాత్మక మూలాలకు మధ్య సరైన సమతుల్యతను సాధించాలి: 19వ ఎంఐఎఫ్ఎఫ్ వేదికగా దర్శకురాలు ధ్వని దేశాయ్ పిలుపు
కథాంశాలు, సృజనాత్మకత, భవిష్యత్తుపై ఎంఐఎఫ్ఎఫ్ సదస్సులో యానిమేషన్ చిత్ర దర్శకుల విశ్లేషణ
‘‘మీరు సముద్ర తీరానికి వెళ్లి గవ్వలు ఏరుకోవచ్చు, ఇసుక కోటలూ కట్టుకోవచ్చు, లేదా ఎవరైనా అక్కడ శాంతిని కూడా పొందవచ్చు. అదంతా మీరు ఆ అనుభవం నుంచి ఏం పొందుతున్నారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది’’ అని ప్రముఖ చలనచిత్ర దర్శకురాలు ధ్వని దేశాయ్ వ్యాఖ్యానించారు. 19వ ముంబయి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2026లో కథనాలు, సృజనాత్మకత, ప్రేక్షకుల విశ్లేషణ అంశంపై జరిగిన ఆసక్తికరమైన చర్చా వేదికలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు. వివిధ సాంస్కృతిక, కళాత్మక నేపథ్యాల నుంచి వచ్చిన యానిమేషన్ చలనచిత్ర దర్శకులను ఒకచోటకు చేర్చిన ఈ సదస్సు.. ఆలోచనలు చిత్రాలుగా ఎలా రూపుదిద్దుకుంటాయి. ప్రేక్షకులు వాటి నుంచి అర్థాలను ఎలా గ్రహిస్తారనే అంశాలపై లోతుగా చర్చించింది.
ఒక ప్రసిద్ధ జెన్ బౌద్ధ కథను ఉదాహరణగా తీసుకుంటూ.... ప్రేక్షకులు సినిమాలను వేర్వేరు కోణాల్లో ఎలా అనుభూతి చెందుతారో ధ్వని దేశాయ్ వివరించారు. మీరు సముద్రానికి వెళ్లి గవ్వలు ఏరుకోవచ్చు, ఇసుక కోటలు కట్టుకోవచ్చు, కొందరు అక్కడ శాంతినీ పొందవచ్చు. అదంతా ఆ అనుభవం నుంచి మీరు ఏమి స్వీకరిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. సముద్రతీర ఉదాహరణ ద్వారా ఆమె ఒకే సినిమాను వేర్వేరు ప్రేక్షకులు ఎలా తమ సొంత ఆలోచనల ప్రకారం అర్థం చేసుకుంటారో స్పష్టం చేశారు.
యానిమేషన్ చలనచిత్ర దర్శకుడు రైముండ్ క్రుమ్మే కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ప్రేక్షకులు తన సినిమాలను తమదైన శైలిలో అర్థం చేసుకునే స్వేచ్ఛను కలిగి ఉండటాన్ని తాను ఎంతగానో ఆస్వాదిస్తానని చెప్పారు. ‘‘ప్రతి సంస్కృతికి ఒక సినిమాను అర్థం చేసుకునే సొంత విధానం ఉంటుంది. నాకు ఆ స్వేచ్ఛ నచ్చుతుంది’’అని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకులను ఒకే ఒక నిర్దిష్ట అర్థం వైపు నడిపించడం కంటే.. విశ్వవ్యాప్తంగా అందరికీ అర్థమయ్యే భావోద్వేగాలు, అనుభవాల చుట్టూ తన కథలను నిర్మిస్తూ, వ్యక్తిగత విశ్లేషణలకు తగినంత అవకాశాన్ని ఇవ్వడానికే తాను ఇష్టపడతానని ఆయన తెలిపారు.
తన సృజనాత్మక ప్రక్రియ గురించిన ఆసక్తికర విషయాలను దర్శకుడు వెల్లడించారు. తన ఆలోచనలలో చాలా వరకు నేరుగా గోడలపై గీసే స్కెచ్లతోనే మొదలవుతాయని చెప్పారు. ‘‘నా ఆలోచనలు స్వేచ్ఛగా సాగడం కోసం నేను గోడలపై చిత్రాలను గీస్తాను’’ అని ఆయన అన్నారు. ఈ పెయింటింగ్లు తరచుగా ప్రదర్శనలు, సినిమాలు రెండింటికీ ప్రారంభ విషయంగా మారుతుంటాయని తెలిపారు. తన కళాత్మక సాధనలో చలనం అత్యంత కీలకమైన భాగమని తెలుపుతూ.. తన స్కెచ్లు చాలా వరకు శక్తినీ, లయనీ, చలనాన్నీ ప్రతిబింబించేలా రూపొందిస్తాయని పేర్కొన్నారు.
గడిచిన కొన్నేళ్లుగా యానిమేషన్ రంగంలో వచ్చిన మార్పుల గురించి కూడా ఈ చర్చలో విశ్లేషించారు. ఈ మాధ్యమం కాలక్రమేణా ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం ఇదొక కళాత్మక వ్యక్తీకరణ రూపంగా మరింత ఎక్కువ గుర్తింపును పొందుతోందని ఇద్దరు దర్శకులు అంగీకరించారు. వేగంగా మారుతున్న ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధ, ఇతర సరికొత్త సాంకేతికతల పెరుగుతున్న పాత్రను కూడా వారు ఈ వేదికగా గుర్తించారు.
నృత్యం చేసే జంట నేపథ్యంగా రూపొందించిన తన చిత్రం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని దర్శకుడు రైముండ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ కథ ప్రయాణం చుట్టూ తిరిగినప్పటికీ, ఇది నిజానికి ప్రయాణంలో పొందే అద్భుతమైన అనుభూతికి సంబంధించినదని ఆయన చెప్పారు. ‘‘ప్రయాణం అంటే కేవలం ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు వెళ్లడం మాత్రమే కాదు. అది మనసుకు ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండాలి’’ అని పేర్కొంటూ.. ప్రయాణాలకు, జీవితంలోని విస్తృత అనుభవాలకు మధ్య ఉన్న సారూప్యతను ఆయన వివరించారు.
ఈ సదస్సు యానిమేషన్ చిత్ర దర్శకుల సృజనాత్మక ఆలోచనా విధానాన్ని ప్రేక్షకులకు ఎంతో ఆసక్తికరంగా పరిచయం చేసింది. వ్యక్తిగత అనుభవాలు, వినూత్న ఆలోచనలు, సరికొత్త సాంకేతికతలు వారు చెప్పే కథలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో ఈ వేదిక వివరించింది. యానిమేషన్ కేవలం తెరపై కదిలే బొమ్మలు మాత్రమే కాదని.. ప్రేక్షకులు తమ మనసుకు హత్తుకునేలా చేసి, సినిమా ముగిసిన తర్వాత కూడా చాలా కాలం పాటు గుర్తుంచుకునేలా ఒక అర్థవంతమైన అనుభూతిని సృష్టించడమే అసలైన యానిమేషన్ అని ఈ చర్చా కార్యక్రమం స్పష్టం చేసింది.
***
रिलीज़ आईडी:
2276411
| Visitor Counter:
3