ప్రధాన మంత్రి కార్యాలయం
పశ్చిమబెంగాల్... తారకేశ్వర్లో జరిగిన పశ్చిమబంగ దివస్ వేడుకల్లో పీఎం ప్రసంగం
प्रविष्टि तिथि:
20 JUN 2026 7:47PM by PIB Hyderabad
జై బాబా తారక్నాథ్! హర్ హర్ మహాదేవ్!
గవర్నర్ ఆర్.ఎన్.రవి, ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి సువేందు అధికారి, వేదికపైనున్న ఇతర విశిష్ట ప్రతినిధులు, బెంగాల్ సోదరీసోదరులారా.. బాబా తారక్నాథ్ కొలువైన ఈ పవిత్ర భూమిపై పశ్చిమబెంగాల్ దినోత్సవం రోజున ఇక్కడ భారీ జన సందోహం... ఎన్నికలు, ప్రమాణస్వీకార కార్యక్రమం తర్వాత ఇలా మీ ముందుకు రావటం నాకెంతో గర్వంగా ఉంది. బెంగాల్ గాలిలో తాజాదనం నిండింది. ఇక్కడి ప్రతి అణువూ సరికొత్త పరిమళాన్ని వెదజల్లుతున్నట్లు ఉంది. సంకెళ్ల నుంచి బెంగాల్ విముక్తి పొందినట్లుగా, బెంగాల్ ఆత్మగౌరవం తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తోంది. సరికొత్త భవిష్యత్తును నిర్మించుకోవాలనే బెంగాల్ సంకల్పానికి నేటి కార్యక్రమం, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలే నిదర్శనం. ప్రజల ముఖాల్లోని వెలుగు, ప్రతి గ్రామంలో కనిపిస్తున్న ఆనందం, విశ్వాసం.. మీ సంతోషంలో భాగం పంచుకునేందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఒక ఓటు, ఒక ఎన్నిక ఎంతటి మార్పు తీసుకురాగలదో బెంగాల్లో స్పష్టంగా తెలుస్తుంది.
మార్పు మంచి అనుభూతిని ఇస్తోందా?
పశ్చిమబెంగాల్ దివోత్సవ వేడుకల సందర్భంగా బెంగాల్ ప్రజలకు, దేశ పౌరులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా.
మిత్రులారా,
మీరు చేపట్టిన "స్వచ్ఛతా సే స్వాగత్" కార్యక్రమాన్ని నేను ప్రశంసిస్తున్నాను. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పరిశుభ్రత మన దైనందిన జీవితంలో అంతర్భాగం కావాలి. పరిశుభ్రత ఉన్న చోట అభివృద్ధి మరింత అందంగా విరాజిల్లుతుంది.
మిత్రులారా,
ఈ ఏడాది పశ్చిమబెంగాల్ దినోత్సవం మరింత ప్రత్యేకమైనది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బెంగాల్ ఉజ్వల భవిష్యత్తు కోసం కన్న కలలు, బెంగాల్ మహానుభావుల దూరదృష్టి.. ఇవాళ పశ్చిమబెంగాల్ దినోత్సవం రోజున తొలిసారిగా ఆ కలలు నిజమవటాన్ని మనం కళ్లారా చూస్తున్నాం. ఈ చరిత్రాత్మక రోజు బెంగాల్ అభివృద్ధికి గొప్ప స్ఫూర్తిగా నిలవాలని, మనం సరికొత్త, ఘనమైన చరిత్రను సృష్టించాలని ఆకాంక్షిస్తున్నాను. బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఇదే లక్ష్యం కోసం నేడు భారీ అభివృద్ధి ఉద్యమం ప్రారంభమవుతోంది.
మిత్రులారా,
మొదట వామపక్షాలు, తర్వాత టీఎంసీ దశాబ్దాలుగా బెంగాల్ను కోలుకోలేనంత అగాధంలోకి నెట్టాయి. ఆ అగాధాన్ని పూడ్చేందుకు ఇప్పుడు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం శరవేగంతో పనిని ప్రారంభించింది. మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిలిచిపోయిన ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఇక్కడ వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. రైల్వే, రోడ్డు, వ్యవసాయం, మత్స్య రంగానికి చెందిన ప్రాజెక్టులు బెంగాల్ అభివృద్ధికి నూతనోత్తేజాన్ని అందిస్తాయి. ఇవి ఇక్కడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఈ ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా నేను బెంగాల్ ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నా. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను కూడా ఇవాళ విడుదల చేశాం. దేశవ్యాప్తంగా 9 కోట్లకు పైగా రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి దాదాపు రూ.19,000 కోట్లు నేరుగా జమ అయ్యాయి. లబ్ధిదారులైన రైతు కుటుంబాలన్నింటికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
మిత్రులారా,
బానిసత్వ రోజుల్లో బెంగాల్ ఎన్నో బాధలను, లెక్కలేనన్ని త్యాగాలను, ఎంతో వైరాగ్యాన్ని చూసింది. 1946లో కోల్కతాలో జరిగిన హింసాకాండ, నోయాఖాలీ అల్లర్లలో ఎంతోమంది అమాయక బెంగాలీలతో పాటు మరెన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
సోదరీసోదరులారా,
బెంగాల్.. రక్తపాతాన్ని చవిచూసింది. సొంత ప్రజలను కోల్పోయింది. మాతృభూమి ముక్కలవటాన్ని కళ్లారా చూసింది. అయినప్పటికీ అస్తిత్వాన్ని, ఆత్మ స్వరూపాన్ని కోల్పోవటానికి బెంగాల్ అస్సలు అంగీకరించలేదు. ఫలితంగా బెంగాల్ను భారత్ నుంచి వేరు చేసేందుకు కుట్ర జరిగినపుడు ఆ కుతంత్రాలు విజయవంతం కాకుండా పశ్చిమబెంగాల్ ఆవిర్భావం అడ్డుకుంది. వేల ఏళ్ల నాటి ఇక్కడి నాగరికత, సంస్కృతి, విశ్వాసాలు, సంప్రదాయాలు.. ఎన్నో పోరాటాల తర్వాత సజీవంగా నిలిచాయి. ఈ రోజు ఆ విలువలూ, సంప్రదాయాలూ పశ్చిమబెంగాల్లో కేవలం భద్రంగా ఉండటమే కాక, ఎంతో చైతన్యవంతంగా, సజీవంగా ఉన్నాయి. కాబట్టి పశ్చిమబెంగాల్ దినోత్సవాన్ని నిర్వహించటం కేవలం ఒక తేదీని గుర్తు చేసుకోవటం మాత్రమే కాదు.. సంపూర్ణ చరిత్రను స్మరించుకోవటం. వేల ఏళ్ల నాటి బెంగాల్ వారసత్వానికి మనం అర్పిస్తున్న ఘన నివాళి ఇది.
మిత్రులారా,
పశ్చిమబెంగాల్ దినోత్సవ ప్రాముఖ్యతను నేటి తరానికి గుర్తుచేయటం ఎంతో అవసరం. ఆ రోజుల్లో ఏం జరిగిందో నేటి యువతకు తప్పనిసరిగా తెలియాలి. బెంగాల్ మొత్తాన్ని పాకిస్తాన్లో భాగం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ ఆ కుట్రదారుల ముందు మోకరిల్లుతోంది. సరిగ్గా అదే సమయంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దీనికి వ్యతిరేకంగా గళమెత్తారు. 1947 ఏప్రిల్లో ఆయన ఒక చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించారు. బెంగాల్ మొత్తం పాకిస్తాన్లో భాగం కాదని ఆయన ప్రకటించారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ నాయకత్వంలో బెంగాలీ హిందూ హోమ్ల్యాండ్ మూవ్మెంట్ ప్రారంభమైంది. శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా, చరిత్రకారులు ఆర్. సీ. మజుందార్, జదునాథ్ సర్కార్, భాషా నిపుణుడు సునీతి కుమార్ ఛటర్జీ వంటి ప్రముఖ వ్యక్తులతో పాటు బెంగాల్కు చెందిన మరెంతో మంది మేధావులు ఈ ఉద్యమంలో చేరారు. జీడీ బిర్లా వంటి పారిశ్రామికవేత్తలు ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. మతువా సామాజికవర్గ నాయకుడు పీ.ఆర్. ఠాకూర్ దీనికి మద్దతు పలికారు. వార్తాపత్రికల్లో వ్యాసాలు, కథనాలు ప్రచురితమయ్యాయి. వందేమాతరం నినాదం మళ్లీ మారుమోగింది. మతతత్వ అజెండాల వల్ల అణచివేతకు గురైన బెంగాల్ గళం.. ఈ ప్రజా ఉద్యమం ద్వారా తిరిగి ఊపందుకుంది. ఫలితంగా.. బెంగాల్ మొత్తాన్ని భారత్ నుంచి వేరుచేయటం అసాధ్యమని భారత వ్యతిరేక శక్తులు గ్రహించాయి. అలా పశ్చిమబెంగాల్, మాతృభూమి భారతదేశంలో ఉండిపోయింది.
మిత్రులారా,
ఏ స్ఫూర్తితో స్వాతంత్ర్య సమయంలో పశ్చిమ బెంగాల్ను కాపాడుకున్నామో.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతా అదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సింది. కానీ దురదృష్టవశాత్తూ అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. పశ్చిమబెంగాల్ దినోత్సవం, దాని అసలు అర్థాన్ని ప్రజలు మర్చిపోయేలా చేసే ప్రయత్నం జరిగింది. రాజకీయ అజెండాల కోసం చరిత్రను "కప్పిపుచ్చే" ప్రయత్నం చేశారు.
సోదరీసోదరులారా,
దేశ విభజన సమయంలో బెంగాల్ను కాంగ్రెస్ వదిలించుకోవాలని అనుకుంది. విభజన తర్వాత కూడా మిగిలిన పశ్చిమబెంగాల్లో ఓటు బ్యాంకు రాజకీయాన్ని మొదలుపెట్టింది. పశ్చిమబెంగాల్కు సంబంధించిన చరిత్ర అణచివేతకు గురైంది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ స్థాపకుడు కావడంతో ఆయన సహకారాన్ని గుర్తించేందుకు నిరాకరించారు. ఆయన ఏ స్ఫూర్తితోనైతే బెంగాల్ కోసం పోరాడారో.. ఆ స్ఫూర్తినే నిరంతరం లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర ఛటోపాధ్యాయ, స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వంటి మహానుభావులకు జన్మనిచ్చిన ఈ గడ్డపై.. విదేశీ సిద్ధాంతాలను బలవంతంగా రుద్దారు. మొదట కాంగ్రెస్, ఆ తర్వాత వామపక్షాలు, అనంతరం టీఎంసీ.. దశాబ్దాల తరబడి పశ్చిమబెంగాల్ను పోషించి, బలోపేతం చేయటానికి బదులుగా అక్రమ చొరబాటుదారులకు స్థావరంగా బెంగాల్ను మార్చారు. భారతదేశ అభివృద్ధికి నాయకత్వం వహించాల్సిన బెంగాల్.. ముందుకు సాగటానికి బదులు వెనకబడిపోయింది.
మిత్రులారా,
పశ్చిమబెంగాల్ దినోత్సవం సందర్భంగా చరిత్రలో జరిగిన ఆ తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటామని ప్రతిజ్ఞ చేయటం మన బాధ్యత. పశ్చిమబెంగాల్ దినోత్సవ స్ఫూర్తితో సరికొత్త చరిత్ర రూపుదిద్దుకుంటుంది.
మిత్రులారా,
దశాబ్దాల నాటి దుష్పరిపాలన పశ్చిమబెంగాల్ను ఎంతో వెనక్కి నెట్టింది. గత ప్రభుత్వాల హయాంలో పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో మీరు చూశారు. పెద్ద పరిశ్రమలు పారిపోయాయి. చిన్న వ్యాపారాలు కుప్పకూలాయి. యువత ఉపాధి కోల్పోయింది. వనరులను చొరబాటుదారులు ఆక్రమించుకున్నారు. ఒకప్పుడు అవకాశాల గనిగా విలసిల్లిన బెంగాల్.. వలసల కేంద్రంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే మీరొక శపథానికి పూనుకున్నారు. టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని. మీరు రికార్డు స్థాయి స్థానాలతో బీజేపీని ఆశీర్వదించారు. ఫలితంగా బెంగాల్ శరవేగంగా ప్రయోజనాలను పొందటాన్ని ఈ రోజు దేశమంతా కళ్లారా చూస్తోంది. ఏళ్లుగా నిరాకరించిన హక్కులు ఇప్పుడు మీ ఇంటి వద్దకే వస్తున్నాయి. ఎన్నికల సమయంలో మీకు ఆయుష్మాన్ భారత్ పథకం అందిస్తానని హామీ ఇచ్చాను. ఇప్పుడు బెంగాల్లోని ప్రతి పేదవాడు దీని ద్వారా ప్రయోజనం పొందుతాడు. తల్లులు, సోదరీమణులు అన్నపూర్ణ యోజన ద్వారా నేరుగా లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందేలా చూసేందుకు జల జీవన్ మిషన్ ద్వారా పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఉద్యోగాల్లో వయోపరిమితిని సడలిస్తామని ఎన్నికల సమయంలో బెంగాల్ యువతకు మేము వాగ్దానం చేశాం. ఆ వాగ్దానం ఇప్పుడు నెరవేరింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్న హామీని కూడా నెరవేర్చాం.
మిత్రులారా,
రాజకీయ వైషమ్యాల కారణంగా ఏళ్లుగా ఎన్నో పథకాలు నిలిచిపోయాయి. ఆలస్యమయ్యాయి. ఈ రోజు ఆ అడ్డంకులన్నీ తొలగిపోయి.. జన కల్యాణ్ శిబిరాల ద్వారా ప్రతి ప్రభుత్వ పథకం నేరుగా లబ్ధిదారులకు చేరుతోంది. దళారులు లేరు, అవరోధాలు లేవు.. కేవలం మీ హక్కులపై, బెంగాల్ అభివృద్ధిపై, బెంగాల్, దేశ రక్షణపై మాత్రమే పూర్తిగా దృష్టి సారిస్తున్నాం. సరిహద్దు కంచె నిర్మాణానికి భూమి బదిలీ ప్రక్రియను గత ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి నిలిపివేయటం మీరు చూశారు. కానీ నూతన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆ పనులు ప్రారంభమయ్యాయి.
సోదరీసోదరులారా,
పశ్చిమబెంగాల్లో పారిశ్రామిక పురోగతి మళ్లీ ఊపందుకోవటం పట్ల ఎంతో సంతోషిస్తున్నా. పురోగతి పునాది రెండు కీలక అంశాలపై ఆధారపడి ఉంది. అవినీతి రహిత, పారదర్శకమైన పాలన.. చట్టబద్ధమైన పాలన. కేవలం పశ్చిమబెంగాల్ మాత్రమే కాదు.. ఇవాళ దేశమంతటా ఈ మార్పును కళ్లారా చూస్తోంది. మిమ్మల్ని దోచుకున్నవారే ఇప్పుడు ఆ సొమ్మును స్వయంగా తిరిగి ఇచ్చేస్తున్నారు. పెద్ద పెద్ద దోపిడీదారులు జైలు పాలవుతున్నారు. సిండికేట్ సభ్యులు ప్రజలకు క్షమాపణలు చెబుతున్నారు. టోల్ గేట్ల వద్ద డబ్బులు వసూలు చేసే గూండాలు పారిపోయారు. బెంగాల్ ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కమీషన్ల దందా ముగిసి, పనులు ప్రారంభమయ్యాయి.
మిత్రులారా,
ఒకప్పుడు దెబ్బతిన్న రహదారులు, శిథిలావస్థకు చేరిన మౌలిక వసతులతో కొట్టుమిట్టాడిన బెంగాల్.. ఏళ్లుగా నిలిచిపోయిన ప్రాజెక్టులు అత్యంత వేగంగా ముందుకు సాగడాన్ని చూస్తోంది. కోల్కతా మెట్రో ఆరెంజ్ లైన్కు సంబంధించి చింగ్రీఘాటా క్రాసింగ్ వద్ద ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తయ్యాయి. హౌరాలో దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో డివిజనల్ రైల్వే నూతన ఆసుపత్రికి శంకుస్థాపన జరిగింది. ఇది అత్యవసర సేవలతో పాటు ప్రమాదకర వ్యాధులకు మెరుగైన చికిత్సను అందిస్తుంది. తూర్పు మేదినీపూర్లో హౌర్, రాధామోహన్పూర్ మధ్య పైవంతెన, సంక్రైల్-సంత్రాగచ్చి లింక్ లైన్ వంటి ప్రాజెక్టులు ఇక్కడి ప్రజలకు సౌకర్యాలను మెరుగుపరుస్తాయి.
మిత్రులారా,
ఇవాళ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా దేశవ్యాప్తంగా 9 కోట్లకు పైగా రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము నేరుగా జమ అయింది. పశ్చిమబెంగాల్ రైతులకు మరో సంతోషకరమైన వార్త. ఈ రోజు నుంచి రాష్ట్రంలో పీఎం పంట బీమా పథకం ప్రారంభమవుతోంది. ఈ పథకం కష్టకాలంలో రైతు కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుంది. ఒకవేళ పంటలు దెబ్బతిన్నా రైతుపై ఆర్థిక భారం పడదు.
మిత్రులారా,
డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో ఇప్పుడు పశ్చిమబెంగాల్ కూడా భాగస్వామ్యం వహిస్తోంది. అగ్రి-స్టాక్ ద్వారా రైతుల సమగ్ర సమాచార రిజిస్టర్ను రూపొందించారు. దీనిద్వారా గ్రామ పటాలు, పంటలకు సంబంధించిన వివరాలు డిజిటల్ రూపంలో అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల ఎరువుల కొనుగోలు, రైతు క్రెడిట్ కార్డులు, డీబీటీ, కనీస మద్దతు ధరకు పంటల కొనుగోలు సేవలు మరింత సులభమవుతాయి.
మిత్రులారా,
వ్యవసాయ రంగంలో అత్యంత వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు పీఎం ధన-ధాన్య కృషి యోజనను ప్రభుత్వం ప్రారంభించింది. పశ్చిమబెంగాల్లోని నాలుగు జిల్లాలు.. పురూలియా, డార్జిలింగ్, అలీపుర్ద్వార్, ఝార్గ్రామ్ను ఈ జాబితాలో చేర్చారు. ఇందులో భాగంగా ఉత్పాదకతను పెంచేందుకు, నిల్వ వసతుల నిర్మాణానికి, రైతులకు సులభంగా రుణాలను అందించే పనులు జరుగుతాయి. బెంగాల్లో చేపల పెంపకం.. రైతులను, మత్స్యకారులను, వ్యాపారులను ఒకచోట చేరుస్తుంది. ఇందుకోసం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫ్రేజర్గంజ్ ఫిషింగ్ హార్బర్ సామర్థ్య విస్తరణ జరిగింది. బీర్భూమ్లో ఆధునిక చేపల మార్కెట్ను కూడా నిర్మించారు. ఇకపై బెంగాల్ ఆగిపోదు. ఇక బెంగాల్ వెనకడుగు వేయదు.. చరిత్ర సృష్టిస్తుంది.
మిత్రులారా,
ఈ రోజు దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతు సోదరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. వారితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. దేశ నలుమూలన ఉన్న రైతులు ఈ ఉత్సవంలో పాలుపంచుకున్నారు. ఈ రైతులందరూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులే. నా రైతు సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వకంగా ఒక విన్నపం చేయాలనుకుంటున్నాను. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. నేను మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. మన పిల్లల కోసం బంజరు భూములను మిగల్చకూడదు. పచ్చని సారవంతమైన భూములను అందించాలి. భూమాతను మనం కాపాడుకోవాలి. భారత ప్రభుత్వం "సేవ్ ది ఫీల్డ్స్" ప్రచారాన్ని చేపట్టింది. ఇది నేల ఆరోగ్యాన్ని పరిరక్షించటం, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించటం, ప్రకృతి వ్యవసాయ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మీరందరూ ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, మీ పొలాలను కాపాడుకునేందుకు ప్రతిజ్ఞ పూనాలని, మీ చుట్టుపక్కనున్న రైతులను కూడా ఈ దిశగా ప్రోత్సహించాలని, మనమందరం కలిసి భూమాతను రక్షించుకోవాలని కోరుతున్నా. పుడమి.. మన మాతృమూర్తి. రసాయనాలతో భూమాతను చంపే మహా పాపానికి మనం ఒడిగట్టకూడదు. భూమాతను మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి.
మిత్రులారా,
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో మనం ముందుకు సాగుతున్నాం. ఈ సంకల్పానికి తూర్పు భారత అభివృద్ధి అత్యంత కీలకమైనది. ఇందుకోసం మిషన్ పూర్వోదయపై పని చేస్తున్నాం. ఈ మిషన్లో బెంగాల్ పాత్ర ఎంతో కీలకం. బెంగాల్ సాధించే పురోగతే తూర్పు భారతదేశ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుంది.
సోదరీసోదరులారా,
ఈ అభివృద్ధి ప్రయాణంలో మనం ఇంకొక విషయాన్ని కూడా తప్పక గుర్తుంచుకోవాలి. అభివృద్ధికి మొదటి, అత్యంత ముఖ్యమైన నిబంధన.. శాంతి, సామరస్యం, సామాజిక స్థిరత్వం. ఈ విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. బెంగాల్ సాంస్కృతిక అస్తిత్వాన్ని, సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేయాలి. మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగాలి.
మిత్రులారా,
దేశంతో పాటు ప్రపంచమంతా రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈసారి నేను బెంగాల్ గడ్డపై యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటాను. స్వామి వివేకానంద, మహర్షి అరబిందో వంటి గొప్ప యోగులకు జన్మనిచ్చిన ఈ పుణ్యభూమి, యావత్ ప్రపంచానికి మార్గనిర్దేశం చేసేలా గొప్ప సందేశాన్ని అందిస్తుంది. బెంగాల్లోని ప్రతి మూలన, ప్రతి ప్రాంతంలోనూ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నేను కోరుకుంటున్నా. మీరందరూ యోగాభ్యాసం చేయాలి. ఈ యోగా దినోత్సవంలో భాగస్వాములు కావాలి. ఈ విన్నపంతో పాటు ఈ అభివృద్ధి ప్రాజెక్టుల సందర్భంగా మీ అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నా. ఇవాళ మనం పశ్చిమబెంగాల్ దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకుంటున్న తరుణంలో మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను. మీ మొబైల్ ఫోన్లు బయటకు తీసి, ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి. అందరం కలిసి ఈ బెంగాల్ దినోత్సవ వేడుకను జరుపుకుందాం. మొబైల్ లైట్లన్నీ వెలగాలి. నాతో కలిసి గట్టిగా చెప్పండి. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.
వందేమాతరం. వందేమాతరం. వందేమాతరం.
వందేమాతరం. వందేమాతరం. వందేమాతరం.
వందేమాతరం.
ధన్యవాదాలు.
***
(रिलीज़ आईडी: 2276409)
आगंतुक पटल : 4