ప్రధాన మంత్రి కార్యాలయం
ప్యారిస్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
प्रविष्टि तिथि:
18 JUN 2026 11:39PM by PIB Hyderabad
ప్రధానమంత్రి 2026 జూన్ 18న ప్యారిస్లో ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన భారీ సభను ఉద్దేశించి ప్రసంగించారు. మాతృభూమి పట్ల అభిమానాన్ని ప్రతిబింబిస్తూ ప్రవాస భారతీయులు ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు.
ఫ్రాన్స్లోని వివిధ రంగాల్లో భారతీయ సమాజం చేసిన గణనీయమైన కృషిని ప్రధానమంత్రి కొనియాడారు. భారతీయ ఆవిష్కరణలనూ, ఆలోచనలనూ ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడంలోనూ, ఇండియా-ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ- వారు పోషిస్తున్న కీలక పాత్రను ఆయన మెచ్చుకున్నారు. ఎక్కువ సంఖ్యలో భారతీయ విద్యార్థులు, నిపుణులు, పర్యాటకులు ఫ్రాన్స్ను గమ్యస్థానంగా ఎంచుకోవడంతో రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలు విస్తరించాయని ఆయన తెలియజేశారు. ప్రజల రాకపోకలను సులభతరం చేయడానికి తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. ఫ్రాన్స్లో యూపీఐ విస్తరణ గురించి మాట్లాడుతూ.. ఇది రెండు దేశాల మధ్య పర్యాటకానికి ఊతమిస్తుందని వివరించారు.
సమ్మిళిత వృద్ధి, మహిళా నేతృత్వంలోని అభివృద్ధి నుంచి మానవ కేంద్రీకృత ఏఐ, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో పురోగతి వరకూ భారతదేశం సాధిస్తున్న పరివర్తన గురించి ప్రధానమంత్రి వివరించారు. గడచిన 12 ఏళ్లలో భారతదేశం 250 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చిందని ప్రధాని స్పష్టం చేశారు. యూకే, ఈయూలతో కుదిరిన వాణిజ్య ఒప్పందాలతో భారతీయ కార్మికులు, రైతులు, ఆవిష్కర్తలు, ఇతరులకు కొత్త అవకాశాలను లభిస్తాయని ఆయన తెలియజేశారు. నైస్లో జరిగిన భారత్ ఇన్నోవేట్స్-2026, ప్యారిస్లో జరిగిన వివాటెక్-2026లో భారత్ భాగస్వామ్యం గురించి వివరించారు. సాంకేతిక రంగంలో అంతర్జాతీయ సమాజానికి ప్రధాన భాగస్వామిగా భారత్ ఎదుగుతోందని తెలియజేశారు. భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమం సాధించిన విజయం గురించి కూడా ప్రధానమంత్రి మాట్లాడారు. ఆవిష్కరణల దౌత్యానికి ఈ వేదిక నమూనాగా నిలుస్తుందని తెలిపారు. ఏవియన్లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశంలో తాను పాల్గొనడం గురించి వివరిస్తూ.. గ్లోబల్ సౌత్ను సమాన భాగస్వామిగా పరిగణించే విశ్వాస ఆధారిత అంతర్జాతీయ భాగస్వామ్యాలను సృష్టించేందుకు భారత్ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. డిజిటల్ యుగంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు ప్రతిభ, నైపుణ్యం, ఆవిష్కరణతో భారత్ ప్రపంచానికి సహాయపడుతోందని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశ ప్రగతికి తమ వంతు తోడ్పాటు అందించాలనీ, వికసిత్ భారత్ లక్ష్యసాధనలో భాగస్వామిగా మారాలని ప్రవాస భారతీయులను ఆహ్వానించారు.
భారత్, ఫ్రాన్స్ మధ్య ఉన్న ప్రజా సంబంధాలను ఈ సమావేశం ప్రతిబింబించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయుల సంక్షేమమూ, శ్రేయస్సూ, భాగస్వామ్యం పట్ల భారత దేశానికున్న చిత్తశుద్ధిని పునరుద్ఘాటించింది.
***
(रिलीज़ आईडी: 2275214)
आगंतुक पटल : 6