ప్రధాన మంత్రి కార్యాలయం
జీ7 శిఖరాగ్ర సమావేశ సదస్సు సందర్భంగా ప్రధాని ప్రసంగం: సురక్షితంగా, వేగంగా, సమర్థంగా ఏఐ వినియోగం
प्रविष्टि तिथि:
17 JUN 2026 9:20PM by PIB Hyderabad
గౌరవనీయ పెద్దలారా,
ఈ ముఖ్యమైన అంశాన్ని మన చర్చల్లో భాగం చేసిన మిత్రుడు మెక్రాన్కు నా అభినందనలు. మానవుడు సృష్టించిన అత్యంత విప్లవాత్మక సాంకేతికతల్లో కృత్రిమ మేధ ఒకటి. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు.
నేడు మానవ జీవితంలో కృత్రిమ మేధ స్పృశించని అంశమంటూ లేదు. మునుపెన్నడూ లేనంత వేగంగా వైజ్ఞానిక పరిశోధనలను ఏఐ వేగవంతం చేస్తోంది. ఇది పాలనను మరింత ప్రభావవంతంగా, జవాబుదారీగా మార్చడంతోపాటు.. ఆరోగ్య రక్షణ, విద్య, తయారీ రంగాలనూ శక్తిమంతం చేస్తోంది.
అయితే, యంత్రాలు ఎంత శక్తిమంతమయ్యాయన్నది కాదు.. జనసామాన్యాన్ని ఏ మేరకు సశక్తులను చేసిందన్నదే ఏఐకి కొలమానం. దీనినే భారత్ దృఢంగా విశ్వసిస్తోంది. ఈ యేడు నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లోనూ మానవుడే కేంద్రంగా ఏఐ అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకతను భారత్ స్పష్టం చేసింది. భారత్ తన ‘మానవ్’ సంకల్పాన్ని ఈ సదస్సులో స్పష్టంగా చాటింది. ఈ సంకల్పమే ఏఐ రంగంలో భారత్కు మార్గదర్శకం.
ఏఐపై సందేశాన్ని అందిస్తూ.. మానవ విలువలు, సమ్మిళితత్వం, అర్థవంతమైన మానవ నియంత్రణలు దానికి పునాదిగా నిలవాలని గౌరవనీయులైన పోప్ ఇటీవల పేర్కొన్నారు. సాంకేతికత ఎంత అధునాతనమైనా సరే - మానవులే దానికి కేంద్రంగా ఉండాలి... భారత్ మానవ్ సంకల్పం, గౌరవ పోప్ సందేశం రెండూ ఇదే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాయి.
మిత్రులారా,
ఏఐ వినియోగంలో పిల్లల భద్రత అతి ముఖ్యమైన అంశం. పిల్లలకు వారి మాతృభాషలో విద్యను ఏఐ అందించగలదు. వారిలో సృజనను పెంచుతుంది. అభ్యసన ప్రక్రియను వారికి మరింత అనుకూలంగా మారుస్తుంది. అయితే, సరైన రక్షణలు లేకపోతే.. అదే సాంకేతికతతో తప్పుడు సమాచారం, డీప్ఫేక్, దుష్ప్రభావాల బారిన పడే ప్రమాదమూ ఉంది.
ఈ రెండు సందర్భాల మధ్య తేడా సాంకేతికతలోనిది కాదు.. దాని వినియోగానికి దిశానిర్దేశం చేసే విలువలు, విధాన నిర్ణయాలు, పాలన విధానాల్లో ఆ తేడా ఉంది. డిజిటల్ రంగం పిల్లల అభ్యాసానికీ, వికాసానికీ వేదికగా నిలవాలి తప్ప.. వారిని తప్పుదోవ పట్టించే సాధనంగా మారకుండా మనం చూసుకోవాలి.
మిత్రులారా,
అత్యాధునిక ఏఐ మోడళ్లు సైబర్ భద్రత రంగంలో అపూర్వమైన అవకాశాలను సృష్టిస్తున్నాయి. అయితే, సైబర్ వేదికలో అన్ని దేశాలూ సురక్షితంగా ఉంటేనే తప్ప.. ఏ దేశమూ నిజంగా సురక్షితంగా ఉన్నట్టు కాదు. అందుకే ఎల్లప్పుడూ సైబర్ వేదికను ప్రపంచ ప్రజా ప్రయోజనంగా భారత్ పరిగణిస్తుంది. అందువల్ల ఈ ముఖ్యమైన ఏఐ సాంకేతికతలు మరింత విస్తృతంగా అందుబాటులోకి రావాలి. అవి సమ్మిళితంగా ఉండాలి. ప్రజాస్వామ్య దేశాలు తమ కీలక సమాచార మౌలిక సదుపాయాలను కాపాడుకోవడానికీ, పెరుగుతున్న సైబర్ ముప్పులను సమర్థంగా ఎదుర్కొనడానికీ వీలుగా.. ప్రజాస్వామ్య దేశాలకు ఆ ఏఐ మోడళ్లు అందుబాటులో ఉండాలి.
మిత్రులారా,
భద్రత, వేగం, సామర్థ్యాల మధ్య సమతౌల్యంతో కూడిన సమగ్ర విధానంతో ముందుకు సాగేందుకు నేను కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను:
మొదటిది - రూపకల్పన దశ నుంచే సురక్షిత ఏఐ వ్యవస్థలను మనం ప్రోత్సహించాలి. భద్రతను ఏదో అదనపు అంశంగానో లేదా చివరగా పరిగణించే విషయంగానో చూడకూడదు. ఏఐ రూపకల్పనలో అది మొదటి నుంచీ ప్రాథమిక అంశంగా ఉండాలి.
రెండోది - ఏఐ వినియోగం విషయంలో ఆవిష్కరణలు, నిర్వహణ సమాంతరంగా ముందుకు సాగేలా చూసేందుకు.. ఉమ్మడి ప్రమాణాలు, పరీక్ష పద్ధతులు, నియంత్రణ విధానాలను మనం రూపొందించుకోవాలి. అన్ని దేశాలకూ విజయవంతంగా ప్రయోజనాలను చేకూర్చేలా.. ఉమ్మడి నియమాలను ప్రపంచం రూపొందించుకున్న రంగాలకు పౌర విమానయానం, నౌకా వాణిజ్య రవాణా మంచి ఉదాహరణలు. బాధ్యతాయుతంగా కృత్రిమ మేధ అభివృద్ధి, వినియోగం విషయంలో అలాంటి పాఠాలను మనం నేర్చుకోవచ్చు.
మూడోది - డీప్ఫేక్లు, తప్పుడు సమాచారం, సైబర్ మోసాలను ఎదుర్కోవడానికి ప్రపంచ స్థాయి సహకారాన్ని మనం బలోపేతం చేసుకోవాలి. ఏఐ ద్వారా రూపొందించిన కంటెంటును గుర్తించడంలో సహాయపడేందుకూ, డీప్ఫేక్ల ముప్పును తగ్గించడానికీ డిజిటల్ వాటర్ మార్కింగ్, కంటెంట్ ప్రామాణీకరణ సాధనాల వంటి సాంకేతికతలను మనం ప్రోత్సహించాలి.
నాలుగోది - ఏఐ ప్రయోజనాలు అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటికీ అందేలా చూడాలి. ఇప్పటికే ఉన్న అంతరాలను మరింత పెంచేదిగా కాకుండా.. సమ్మిళితంగా, ఉమ్మడి పురోగతికి చోదకశక్తిగా ఏఐ నిలవాలి.
మిత్రులారా,
ఏఐ పట్ల మన విధానం, వ్యూహం స్పష్టంగా ఉండాలి. ఏఐ మానవ సామర్థ్యాన్ని విస్తరించాలి. ప్రజలు సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకునేలా వారిని సశక్తులను చేయాలి. మానవ గౌరవాన్ని కాపాడాలి. ఈ కీలక అంశంపై భాగస్వామ్య పక్షాలన్నింటితో సంప్రదింపులనూ, సహకారాన్నీ భారత్ కొనసాగిస్తుంది.
ధన్యవాదాలు.
గమనిక – ప్రధానమంత్రి ప్రసంగానికి ఇంచుమించుగా చేసిన అనువాదమిది. మౌలిక ప్రసంగం హిందీలో ఉంది.
***
(रिलीज़ आईडी: 2274775)
आगंतुक पटल : 8