సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఈ నెల 17 నుంచి 26 వరకు ‘నషా ముక్త్ భారత్ సప్తాహం ‘‘నషా ముక్త్ భారత్ అభియాన్ - వికసిత్ భారత్ కీ పెహ్చాన్’’లో ఓ భాగం
సామాజిక న్యాయ, సాధికారత శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం
प्रविष्टि तिथि:
16 JUN 2026 3:50PM by PIB Hyderabad
మాదక పదార్థాల వినియోగాన్ని అరికట్టడానికి నోడల్ విభాగంగా పనిచేస్తున్న సామాజిక న్యాయ, సాధికారత విభాగం (డీఓఎస్జేఈ) 2026 జూన్ 26న ‘‘మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ తరలింపునకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని’’ నిర్వహిస్తుంది. ఆ దినోత్సవానికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాల్లో క్షేత్రస్థాయితో పాటు ఆన్లైన్లోనూ ఏటా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలను మరింత విస్తరిస్తూ, ‘‘నషా ముక్త్ భారత్ అభియాన్ - వికసిత్ భారత్ కీ పహ్చాన్’’లో భాగంగా ఈ నెల 17 నుంచి 26 వరకూ దేశమంతటా- నషా ముక్త్ భారత్ సప్తాహాన్ని డీఓఎస్జేఈ పాటిస్తోంది.
ఈ సప్తాహాన్ని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ఈ నెల 17న దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా నషా ముక్తి మిత్ర (ఎన్ఎమ్ఎమ్)కు సంబంధించిన పర్సనల్ డ్యాష్బోర్డు, నషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్ఎమ్బీఏ)పై ఒక లఘు చిత్రం వంటి కీలక కార్యక్రమాలను కూడా ఆయన శ్రీకారం చుడతారు. పౌరుల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, స్వచ్ఛంద సేవకుల భాగస్వామ్యాన్ని పెంపొందించడంతో పాటు మత్తు పదార్థాల అలవాటుకు వ్యతిరేకంగా చైతన్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడమే ఈ కార్యక్రమాల లక్ష్యం.
నషా ముక్త్ భారత్ సప్తాహ కార్యక్రమంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అడ్డుకోవడంతో పాటు ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా సమన్వయంతో కూడిన ప్రయత్నాన్ని చేపడతారు. దీనిలో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జిల్లా పాలనాయంత్రాంగాలు, ఆధ్యాత్మిక సంస్థలు, ఆర్థిక సహాయాన్ని అందుకుంటున్న (జీఐఏ) సంస్థలనూ, వివిధ ఆసక్తిదారు సంస్థలనూ భాగస్వాముల్ని చేస్తారు.
దేశం నలుమూలలా 2026 జూన్ 17 నుంచి 26 మధ్య వివిధ అవగాహన ప్రధాన, ప్రజాసమీకరణ కార్యకలాపాల్ని చేపడతారు. వీటిలో భాగంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాలు, చైతన్య ప్రధాన ఊరేగింపులు, సైకిల్ ర్యాలీలు, యువత నాయకత్వంలో ప్రచార కార్యక్రమాలు, పోస్టర్ల తయారీ, నినాదాలు రాసే పోటీలు, వ్యాసరచన పోటీలు, వెబినార్లు, నిపుణులతో మాటామంతీ, వీధి నాటకాలు, జానపద కళాకారులతో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజాసంబంధ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.
పాఠశాలల్లో, కళాశాలల్లో, ఉన్నత విద్య సంస్థల్లో యువతను భాగస్వాములను చేయడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. క్షేత్ర స్థాయిలో భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి పంచాయతీ రాజ్ సంస్థలు, ఎన్ఎస్ఎస్ , మై భారత్ వాలంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలతో పాటు స్థానిక నాయకత్వంలోని సంస్థల సాయాన్ని తీసుకొని, ప్రజల్లో అవగాహనను పెంచుతారు.
మాదక ద్రవ్యాలకు అలవాటు పడడాన్ని మాన్పించడానికి ఆరోగ్యదాయక జీవనశైలితో పాటు వెల్నెస్ ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కూడా పలు కార్యక్రమాల్ని నిర్వహిస్తారు. ‘‘యోగా ఫర్ వెల్నెస్, సే నో టూ డ్రగ్స్’’ సందేశంతో యోగా, ధ్యాన కార్యక్రమాల్నీ, వెల్నెస్ ప్రధాన కార్యక్రమాల్నీ, ప్రజలు పాల్గొనేందుకు అవకాశం ఉండే చైతన్య కార్యక్రమాల్నీ ఏర్పాటు చేస్తారు.
క్షేత్ర స్థాయిలో చేపట్టే కార్యకలాపాలకు తోడు సమగ్ర మల్టీమీడియా ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తారు. నషాముక్త భారత్ హ్యాష్ట్యాగ్లో భాగంగా సామాజిక మాధ్యమ వేదికలు సహా ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోయే మాధ్యమాలను ఈ ప్రచార ఉద్యమం పెద్ద ఎత్తున ఉపయోగించుకొంటుంది. ఆరోగ్యవంతులు, చైతన్యవంతులు, సాధికారత కలిగిన పౌరులు దన్నుగా నిలుస్తూ ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు బలం లభించే విధంగా దేశవ్యాప్తంగా ఈ-ప్రతిజ్ఞ (e-Pledge)లో వారందరూ పాలుపంచుకొనేటట్లు, https://nmba.dosje.gov.in/volunteer/registration వెబ్సైట్ చిరునామా లోకి వెళ్లి గాని, లేదా ఈ కింద ఇచ్చిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి గాని నషా ముక్తి మిత్ర అయ్యేటట్లు వారిని ప్రోత్సహిస్తారు.

***
(रिलीज़ आईडी: 2273651)
आगंतुक पटल : 23