రక్షణ మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్లోనూ, జార్ఖండ్లోనూ కొత్తగా ఎన్సీసీ రాష్ట్ర డైరెక్టరేట్ కార్యాలయాలు యువతకు అవకాశాలతో పాటు లభ్యతను పెంచడమే లక్ష్యం
प्रविष्टि तिथि:
15 JUN 2026 12:33PM by PIB Hyderabad
యువతకు సాధికారతను కల్పించడంతో పాటు నేషనల్ కేడెట్ కోర్ (ఎన్సీసీ)లో చేరికలను పెంచే దిశగా ఆ సంస్థ ప్రధానకేంద్రం డైరెక్టరేట్ జనరల్ ఒక ముఖ్య నిర్ణయాన్ని తీసుకుంది.. ఆంధ్రప్రదేశ్లోనూ, జార్ఖండ్లోనూ స్వతంత్రంగా పనిచేసే రాష్ట్ర డైరెక్టరేట్ల ఏర్పాటుకు అనుమతిని ఇచ్చింది. దీంతో దేశంలో ఎన్సీసీ డైరెక్టరేట్ల సంఖ్య 17 నుంచి 19కి పెరిగింది.
ఆంధ్రప్రదేశ్లో, జార్ఖండ్లో స్వతంత్ర రాష్ట్ర డైరెక్టరేట్లను ఏర్పాటు చేయడం వల్ల కేడెట్లకూ, విద్యాసంస్థలకూ ఎన్సీసీ మరింత చేరువవుతుంది. కొత్త పరిపాలన స్వరూపంతో మరింత ఎక్కువ సమన్వయం, మెరుగైన పర్యవేక్షణ, శిక్షణ, అభివృద్ధి సంబంధిత కార్యకలాపాలకు మెరుగైన సహాయం అందించడానికి వీలుపడుతుంది. మెరుగైన శిక్షణ సదుపాయాలు, సహాయక యంత్రాంగాలు అందుబాటులోకి వచ్చి ఆ రాష్ట్రాల యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి.
భారత్ యువతకు సాధికారతను కల్పించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత నుంచి స్ఫూర్తిని పొంది తీసుకున్న ఈ నిర్ణయంతో మరింత మంది యువత ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతూ, సమర్థులూ, సామాజికంగా నిబద్థులూ అయిన పౌరులుగా మారడానికి తోడ్పాటు లభిస్తుంది. ఫలితంగా వారు దేశ ప్రగతికి తమ వంతు సేవలను అందించడానికి సంసిద్ధులు కాగలుగుతారు.
ఎన్సీసీని 1948లో 20,000 కేడెట్లతో మొదలుపెట్టారు. ప్రస్తుతం ఎన్సీసీ యూనిఫారాన్ని ధరించే 20 లక్షలకు పైగా యువ కేడెట్లతో, ప్రపంచంలోనే ఇలాంటి అతి పెద్ద సంస్థగా పేరుతెచ్చుకుంది. ఈ సంస్థలో 2014 నుంచి 2025 మధ్య 6 లక్షల మందికి పైగా కేడెట్లు చేరారు. ఈ సంస్థ దేశమంతటా 750 కన్నా ఎక్కువ జిల్లాలకు విస్తరించింది. కొత్తగా రెండు డైరెక్టరేట్లు వచ్చిన కారణంగా బాధ్యత కలిగిన పౌరులను ఈ సంస్థ తీర్చిదిద్దుతూ మరింత శక్తిమంతం, మరింత సమర్థం అయిన, అభివృద్ధి చెందిన భారత్ ను సాకారం చేయడంలో తోడ్పడనుంది.
***
(रिलीज़ आईडी: 2273011)
आगंतुक पटल : 45