పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియా పరిణామాలపై అంతర-మంత్రిత్వ శాఖల తాజా సమాచారం
పర్షియా ప్రాంతంలో ఇటీవల వాణిజ్య నౌకల సంబంధిత సంఘటనలపై ప్రభుత్వం ఆందోళన
గినీ బిస్సావు పతాకంగల ‘ఎంటీ జల్వీర్’ వాణిజ్య నౌకలోని 20 మంది భారతీయ సిబ్బంది సురక్షితం.. వారి రక్షణ కోసం ఒమన్లోని అధికారులతో భారత దౌత్య కార్యాలయం సమన్వయం
‘ఎంటీ సెట్టెబెల్లో’ వాణిజ్య నౌకపై దాడిలో మరణించిన ముగ్గురు భారతీయ సిబ్బంది కుటుంబాలకు రూ.10 లక్షలు చెల్లించాలని ‘సీమాన్ వెల్ఫేర్ ఫండ్ సొసైటీ’కి ఆదేశం
సంక్షోభానంతర దిగుమతులు.. దేశీయ ఉత్పత్తి ద్వారా అదనంగా సుమారు 153.79 లక్షల టన్నుల ఎరువులు సమకూరాయి
దేశంలో ఎరువుల లభ్యత బలంగా.. స్థిరంగా.. సజావుగా నిర్వహిస్తుండగా అన్ని ప్రధాన ఎరువుల నిల్వలు అవసరానికి మించి అందుబాటులో ఉన్నాయి
సుమారు 9.42 లక్షల పీఎన్జీ కనెక్షన్ల గ్యాసిఫికేషన్ పూర్తి కాగా మరో 3.12 లక్షల కనెక్షన్లకు మౌలిక సదుపాయాలు కల్పించారు.. 2026 మార్చి నుంచి కొత్త కనెక్షన్ల కోసం సుమారు 9.44 లక్షల మంది నమోదు చేసుకున్నారు
పీఎన్జీ నెట్వర్క్ లభ్యతగల ప్రాంతాల్లో ఎల్పీజీ వినియోగదారుల బదిలీని ప్రోత్సహించాలని రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ
గడచిన మూడు రోజుల్లో సుమారు 1.91 లక్షల మేర 5కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్లను విక్రయించగా.. వీటిలో 10,000కు పైగా 566 శిబిరాల ద్వారా విక్రయించారు
प्रविष्टि तिथि:
11 JUN 2026 7:07PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా దేశ పౌరులకు కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా తాజా సమాచారం తెలియజేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ జాతీయ మీడియా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించింది. ఇందులో పెట్రోలియం-సహజ వాయువు, ఓడరేవులు-నౌకా రవాణా-జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల అధికారులు ఇంధన లభ్యత, సముద్ర కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారత పౌరులకు చేయూత, కీలక రంగాల్లో స్థిరత్వం దిశగా చేపడుతున్న చర్యలపై తాజా సమాచారం వెల్లడించారు. అలాగే, దేశంలో ఎరువుల లభ్యత, నిల్వలపై రసాయనాలు-ఎరువుల మంత్రిత్వ శాఖ కూడా తాజా వివరాలు వెల్లడించింది.
ఎరువుల నిల్వల స్థితి... లభ్యత
-
దేశంలో మొత్తం మీద ఎరువుల నిల్వల స్థితి, లభ్యత సాధారణ స్థాయిలో ఉంది.
-
ఈ ఏడాది ఖరీఫ్ కాలంలో ఎరువుల అవసరాన్ని వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ 383.9 లక్షల టన్నులుగా అంచనా వేసింది. ఈ మేరకు ప్రస్తుతం సుమారు 195.79 లక్షల టన్నులు (51 శాతానికి మించి) ఉన్నాయి. ఇది సాధారణ నిల్వ 33 శాతం స్థాయిని మించి గణనీయంగా ఎక్కువ. మెరుగైన ప్రణాళికతోపాటు ముందస్తు నిల్వ, సమర్థవ రవాణా నిర్వహణలో ప్రభుత్వ దూరదృష్టికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది.
-
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో 07.06.2026 నాటికి దేశంలోని రైతులు మొత్తం 94.60 లక్షల టన్నుల రసాయన ఎరువులను కొనుగోలు చేశారు. ఇది మొత్తం అవసరంలో సుమారు 25 శాతానికి సమానం.
-
దేశంలో ఇప్పుడు సుమారు 22.8 లక్షల సేంద్రియ ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి.
-
నిరుడు ఇదే కాలంలో 3.24 లక్షల టన్నుల సేంద్రియ ఎరువుల కొనుగోలుతో పోలిస్తే, ఈసారి వివిధ రాష్ట్రాల (పంజాబ్-2.88 లక్షల టన్నులు, ఉత్తరప్రదేశ్-2.76 లక్షల టన్నులు, హర్యానా 1.37 లక్షల టన్నులు, మధ్యప్రదేశ్ 1.27 లక్షల టన్నులు, గుజరాత్ 0.98 లక్షల టన్నులు మహారాష్ట్ర 0.84 లక్షల టన్నులు) రైతులు 11.38 లక్షల టన్నుల (ఎఫ్ఓఎం, ఎల్ఎఫ్ఓఎం, పీఆర్ఓఎం) ఎరువులను కొనుగోలు చేశారు. సేంద్రియ పోషక వనరుల వినియోగంపై రైతులలో సానుకూల ధోరణిని, రసాయన ఎరువుల నుంచి సేంద్రియ ప్రత్యామ్నాయాల వైపు వారి ప్రాధాన్యంలో క్రమంగా వస్తున్న మార్పును ఈ గణనీయ పెరుగుదల సూచిస్తుంది.
-
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎరువుల లభ్యతకు సంబంధించి పెద్దగా సమస్యలేవీ లేవు.
సంక్షోభానంతరం ఎరువుల దేశీయ ఉత్పత్తి.. దిగుమతి (లక్షల టన్నులలో)
|
ఎరువు
|
సంక్షోభానంతర దేశీయ ఉత్పత్తి
|
దేశానికి చేరిన దిగుమతులు
|
|
యూరియా
|
71.41
|
20.13
|
|
డీఏపీ
|
10.04
|
3.13
|
|
ఎన్పీకే
|
22.96
|
7.91
|
|
ఎస్ఎస్పీ
|
13.74
|
0
|
|
ఎంఓపీ
|
0
|
4.45
|
|
మొత్తం
|
118.15
|
35.64
|
-
సంక్షోభానంతరం దిగుమతులు, దేశీయ ఉత్పత్తి ద్వారా సుమారు 153.79 లక్షల టన్నుల ఎరువులు అదనంగా సమకూర్చుకున్నాం.
-
ప్రస్తుత విపత్కర స్థితిలో భారత్ 50 లక్షల టన్నులకు పైగా యూరియా, ఫాస్ఫరస్-పొటాష్ ఎరువులను కూడా సమీకరించుకుంది.
-
విదేశాల్లోని 28 దౌత్య కార్యాలయాల ద్వారా ఒమన్, మలేషియా, వియత్నాం, జార్జియా, నైజీరియా, రష్యా, ఫిన్లాండ్, ఈజిప్ట్, అల్జీరియా, టర్కీ, నెదర్లాండ్స్ దేశాల నుంచి యూరియాను భారత్ దిగుమతి చేసుకుంది. అలాగే, రష్యా, మొరాకో, ఈజిప్ట్, అమెరికా, జోర్డాన్, దక్షిణ కొరియా, ట్యునీషియా, సౌదీ అరేబియా (ఎర్ర సముద్రం మీదుగా) తదితర దేశాల నుంచి డీఏపీ, ఎన్పీకే ఎరువులను సమీకరించింది.
-
దిగుమతి చేసుకున్న 25 లక్షల టన్నులకు పైగా యూరియా, డీఏపీ, ఎన్పీకే ఎరువులు ప్రస్తుత జూన్ నెలలో మన ఓడరేవులకు చేరుతాయని అంచనా
-
ఇక 17 లక్షల టన్నుల యూరియా కొనుగోలు కోసం భారత్ గ్లోబల్ టెండర్ను జారీ చేసింది.
-
ఎరువుల ఉత్పత్తికి ముడిసరుకులైన యూరియా, ఫాస్ఫరస్-పొటాషియం లభ్యతను ఎరువుల విభాగం క్రమం తప్పకుండా సమీక్షిస్తోంది.
-
కంపెనీలు పంపిన అన్ని సబ్సిడీ బిల్లులపై ఆర్థిక శాఖ వారానికోసారి క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తోంది. ఇందుకు అవసరమైనన్ని నిధులు కూడా అందుబాటులో ఉన్నాయి.
-
ఎరువుల లభ్యతకు భరోసా దిశగా ఇప్పటిదాకా 12 ఈజీవోఎస్ సమావేశాలు నిర్వహించడం ద్వారా లభ్యత దిశగా చాలా సమస్యలను పరిష్కరించింది.
-
దేశంలో ఎరువుల భద్రత బలంగా, స్థిరంగా, సజావుగా ఉండటంతోపాటు అన్ని ప్రధాన ఎరువులు నిల్వలు అవసరానికి మించి ఉన్నాయి.
ఇంధన సరఫరా... లభ్యత
పశ్చిమాసియాలో నానాటికీ పరిస్థితులు మారుతున్న దృష్ట్యా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరాయ సరఫరా దిశగా చేపట్టిన చర్యలను వివరిస్తూ- ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితిపై పెట్రోలియం-సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించిన తాజా సమాచారం కిందివిధంగా ఉంది:
ముడిచమురు నిల్వలు... శుద్ధి కర్మాగారాల కార్యకలాపాలు
· దేశంలో తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉండటంతో శుద్ధి కర్మాగారాలన్నీ అదనపు సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దీంతోపాటు పెట్రోల్, డీజిల్ నిల్వల నిర్వహణ సంతృప్తికరంగా ఉంది.
· దేశీయ వినియోగానికి కొరత రాకుండా శుద్ధి కర్మాగారాల్లో వంటగ్యాస్ ఉత్పత్తిని పెంచారు.
· దేశీయ మార్కెట్కు పెట్రోరసాయన ముడిసరకు సరఫరా లభ్యతకు భరోసా దిశగా అంతర-మంత్రిత్వ సంయుక్త కార్యవర్గం ఏర్పాటైంది. అనంతరం, 01.04.2026 నాటి ఒక ఉత్తర్వు ద్వారా పెట్రోరసాయన పరిశ్రమలు సహా చమురుశుద్ధి కర్మాగారాలను, సెంటర్ ఫర్ హై టెక్నాలజీ నిర్దేశిత కీలక రంగాలకు నిర్దిష్ట కనీస పరిమాణంలో సి3, సి4 స్ట్రీమ్లను అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
· ఔషధ విభాగం, రసాయనాలు, పెట్రో రసాయనాల విభాగం పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగాల నుంచి అందిన అభ్యర్థనల ఆధారంగా ఫార్మా, రసాయన, పెయింట్ రంగ సంస్థల కోసం ఎల్పీజీ నిల్వల నుంచి రోజుకు 1,120 ఎంటీల మేర సి3-సి4 మాలిక్యూల్స్ కేటాయింపు వెసులుబాటు కల్పించారు.
· ఈ ఏడాది జూన్ 1 నుంచి ముంబయి, కొచ్చి, విశాఖపట్నం, చెన్నై, మధుర, గుజరాత్ చమురుశుద్ధి కర్మాగారాలు రసాయన, ఔషధ, పెయింట్ పరిశ్రమలకు సుమారు 4,180 టన్నుల (ప్రొపిలీన్, బ్యూటిలీన్ సహిత) సి3-సి4 మాలిక్యూల్స్ను, సుమారు 3,460 టన్నుల బ్యూటైల్ అక్రిలేట్ను విక్రయించాయి.
చిల్లర ఇంధన లభ్యత... ధరల నిర్ధారణ చర్యలు
· దేశవ్యాప్తంగా అన్ని చిల్లర విక్రయ కేంద్రాలు యథావిధిగా పనిచేస్తున్నాయి.
· మధ్యప్రాచ్య సంక్షోభం వల్ల ముడిచమురు ధర అసాధారణంగా పెరిగింది. దీంతో వినియోగదారులను ఆదుకోవడానికి, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గించడం ద్వారా భారాన్ని పాక్షికంగా భరించాలని నిర్ణయించింది.
· కొన్ని ప్రాంతాల్లోని చిల్లర విక్రయ కేంద్రాల వద్ద అసాధారణంగా అధిక అమ్మకాలు, భారీ రద్దీ కనిపిస్తున్నప్పటికీ, దేశంలోని అన్ని పెట్రోల్ పంపులలో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.
ఇప్పటికే ఈ20 రకం ఇథనాల్ మిశ్రమ పెట్రోలుపై లభిస్తున్న ఎక్సైజ్ సుంకం మినహాయింపును.. అంతకు మించిన ఇథనాల్ శాతంతో కూడిన ఈ22, ఈ25, ఈ27, ఈ30 పెట్రోలు రకాలకూ విస్తరిస్తూ ప్రభుత్వ నిర్ణయం
· ముడి చమురుకు ప్రత్యామ్నాయంగా, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం, పర్యావరణ ప్రయోజనాలతోపాటు దేశీయ వ్యవసాయ రంగానికి ఊతమివ్వడం వంటి వివిధ లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈబీపీ) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న వివిధ సమన్వయ చర్యల వల్ల ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) పెట్రోల్లో కలిపే ఇథనాల్ శాతం క్రమంగా పెరిగింది. ఇథనాల్ సరఫరా సంవత్సరం (ఈఎస్ఐ) 2014-15లో అది 1.53 శాతంగా ఉండగా.. 2025-26 నాటికి 20 శాతానికి పెరిగింది. 2014-15 (2026 మే వరకు) నుంచి ఈ కార్యక్రమం ద్వారా రైతులకు రూ. 1.62 లక్షల కోట్ల మేర వేగవంతమైన చెల్లింపులు జరిగాయి. అలాగే రూ. 1.91 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడంతోపాటు, నికరంగా దాదాపు 931 లక్షల మెట్రిక్ టన్నుల మేర కార్బన్ డై ఆక్సైడ్ తగ్గింది. అంతేకాకుండా దాదాపు 310 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతులకు ఇది ప్రత్యామ్నాయమైంది.
· పెట్రోలులో ఇథనాల్ను కలపడమన్నది ఒక రకమైన ఉత్పాదక ప్రక్రియ. దీనికి ఎక్సైజ్ సుంకం పడే అవకాశముంది. సాధారణంగా పెట్రోలుకు ఎక్సైజ్ సుంకాన్ని, ఇథనాల్కు జీఎస్టీని వాటికి సంబంధించి వివిధ దశల్లో చెల్లిస్తారు. అయితే, ఈ రెండింటినీ కలిపినప్పుడు.. అనంతరం వచ్చే తుది ఉత్పత్తి మొత్తం పరిమాణంపై మరోసారి ఎక్సైజ్ సుంకం పడొచ్చు.
· ఈ నేపథ్యంలో 20 శాతం వరకు ఇథనాల్ మిశ్రమ పెట్రోలుకు సంబంధించి.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎక్సైజ్ సుంకం నుంచి మినహాయింపునిచ్చింది. అప్పటికే చెల్లించిన సుంకాలను.. ఈ మిశ్రమ ఇంధనంపై రెండోసారి వసూలు చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ మినహాయింపునిచ్చింది.
· అంతకన్నా ఎక్కువ ఇథనాల్ శాతంతో కూడిన ఈ22, ఈ25, ఈ27, ఈ30 ఇంధన రకాలకు సంబంధించి నాణ్యత ప్రమాణాలను ఇటీవలే 2026 మే నెలలో బీఐఎస్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో 2026 జూన్ 10న జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ద్వారా.. అవే ఎక్సైజ్ సుంకం మినహాయింపులను ఇప్పుడు ఈ22, ఈ25, ఈ27, ఈ30 రకాలకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
· ఎక్కువ ఇథనాల్ శాతం కలిగిన ఇంధన రకాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఇదొక ప్రాథమిక ముందస్తు చర్య. అంతేకానీ, ఈ ఇంధన రకాలను అప్పుడే మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు కాదు. విస్తృతస్థాయి పరీక్షలు, సంప్రదింపుల తర్వాతే వీటి విడుదలకు సంబంధించి తుది నిర్ణయం ఉంటుంది.
· ఇథనాల్ కలిపిన పెట్రోలుపై రెండుసార్లు ఎక్సైజ్ సుంకాన్ని విధించకుండా చూడడమే ఈ నోటిఫికేషన్ ఏకైక ఉద్దేశం.
సహజ వాయువు సరఫరా, పీఎన్జీ విస్తరణ కార్యక్రమాలు
· డీ-పీఎన్జీ, సీఎన్జీ రవాణాకు 100 శాతం సరఫరాను అందిస్తూ.. వినియోగదారుల అవసరాలకే అత్యంత ప్రాధాన్యమిచ్చారు.
· ప్రస్తుతం నడుస్తున్న యూరియా కర్మాగారాలకు.. వాటి గత ఆరు నెలల సగటు వినియోగంలో దాదాపు 98 శాతం వరకు సరఫరా జరుగుతోంది.
· సీజీడీ వ్యవస్థల ద్వారా చేసే సరఫరాలు సహా.. ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80 శాతం వరకు పెంచారు.
· వాణిజ్యపరమైన ఎల్పీజీ లభ్యతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం కోసం.. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్జీ కనెక్షన్లను ఇచ్చేందుకు ప్రాధాన్యమివ్వాలని సీజీడీ సంస్థలకు సూచనలు అందాయి.
· సీజీడీ వ్యవస్థల విస్తరణకు అవసరమైన అనుమతుల దరఖాస్తుల ఆమోదాన్ని వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను భారత ప్రభుత్వం కోరింది.
· దీర్ఘకాలంలో ఎల్పీజీ నుంచి పీఎన్జీ దిశగా మార్పునకు సహకరించగలిగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు.. వాణిజ్యపరమైన ఎల్పీజీ కేటాయింపులో 10 శాతం అదనంగా ఇవ్వనున్నట్లు 2026 మార్చి 18 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రకటించింది.
· పీఎన్జీ విస్తరణ సంస్కరణలతో ముడిపడి ఉన్న అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పొందుతున్నాయి.
· నిత్యావసర వస్తువుల చట్టం- 1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సదుపాయాల నిర్మాణం, నిర్వహణ, విస్తరణ ద్వారా) ఉత్తర్వు- 2026ను భారత ప్రభుత్వం 2026 మార్చి 24 నాటి గెజిట్ ద్వారా ప్రకటించింది. దేశవ్యాప్తంగా పైప్లైన్ల నిర్మాణం, విస్తరణ కోసం ఒక సరళీకృత, కాలపరిమితితో కూడిన విధానాన్ని ఈ ఉత్తర్వు నిర్దేశిస్తుంది. భూసేకరణ, అనుమతుల్లో జాప్యాన్ని నివారిస్తూ.. నివాస ప్రాంతాలు సహా అన్ని చోట్లా సహజ వాయు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల పీఎన్జీ వ్యవస్థ పురోగమనం వేగవంతమవడంతోపాటు.. మారుమూల ప్రాంతాలకు కూడా అనుసంధానం పెరుగుతుంది. ఇది శుద్ధ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ.. భారత ఇంధన భద్రతను, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
· డీ-పీఎన్జీ కనెక్షన్లను వేగవంతం చేయాలని సీజీడీ సంస్థలను పీఎన్జీఆర్బీ ఆదేశించింది. అలాగే, పీఎన్జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడం కోసం జాతీయ పీఎన్జీ కార్యక్రమం 2.0ను 2026 జూన్ 30 వరకు పొడిగించింది.
· పర్యావరణ హిత, సురక్షితమైన, స్వావలంబన కలిగిన ఇంధన భద్రత దిశగా.. రాష్ట్రాల కోసం ఒక నమూనా సీబీజీ విధాన ముసాయిదాను భారత ప్రభుత్వం రూపొందించింది. పెట్టుబడిదారులకు అనుకూలమైన, అమలు ప్రాతిపదికన వ్యవస్థలను రాష్ట్రాలు సొంతంగా రూపొందించుకునేలా ఒక సమగ్రమైన, సరళమైన మార్గదర్శకంగా ఈ నమూనా విధానం ఉపయోగపడుతుంది. ఈ విధానాన్ని అమలు చేసే రాష్ట్రాలకు.. వాణిజ్యపరమైన ఎల్పీజీ కోటా అదనపు కేటాయింపుల తదుపరి విడతలో ప్రాధాన్యమిస్తారు.
· 2026 మార్చి నుంచి దాదాపు 9.42 లక్షల పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా మొదలైంది. మరో 3.12 లక్షల కనెక్షన్లకు మౌలిక సదుపాయాలను కల్పిచారు. దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య 12.54 లక్షలకు చేరింది. అంతేకాకుండా దాదాపు 9.44 లక్షల వినియోగదారులు కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారు.
ఎల్పీజీ సరఫరా
గృహ వినియోగ ఎల్పీజీ సరఫరా స్థితిగతులు:
· ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఎల్పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
· గృహ వినియోగదారులకు ఎల్పీజీ సరఫరాకు ప్రాధాన్యమిచ్చారు.
· ఎల్పీజీ పంపిణీ కేంద్రాల వద్ద నిల్వలు పూర్తిగా అయిపోయినట్టు ఎలాంటి సమాచారమూ లేదు.
· పరిశ్రమ స్థాయిలో ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగులు నిన్న దాదాపు 99 శాతానికి పెరిగాయి.
· పంపిణీదారుల స్థాయిలో గ్యాస్ సిలిండర్ల పక్కదారి మళ్లింపును అరికట్టేందుకు.. డెలివరీ ధ్రువీకరణ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీని దాదాపు 96 శాతానికి పెంచారు. వినియోగదారుడు నమోదు చేసుకున్న మొబైల్ నంబరుకు కోడ్ వస్తుంది.
· గత మూడు రోజుల్లో దాదాపు 1.40 కోట్ల ఎల్పీజీ సిలిండర్ల బుకింగులకు గాను దాదాపు 1.49 కోట్ల సిలిండర్లు పంపిణీ అయ్యాయి.
వాణిజ్యపరమైన ఎల్పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు:
· సంస్కరణలతో ముడిపడి ఉన్న 10 శాతం కేటాయింపు సహా.. మొత్తం వాణిజ్యపరమైన కేటాయింపును సంక్షోభానికి ముందు స్థాయుల్లో దాదాపు 70 శాతానికి పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
· గత మూడు రోజుల్లో -
· దాదాపు 1.91 లక్షల అయిదు కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల అమ్మకాలు జరిగాయి.
· దాదాపు 566 శిబిరాల ద్వారా.. 10,000కు పైగా 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల అమ్మకాలు జరిగాయి.
· మొత్తం 22,339 మెట్రిక్ టన్నుల వాణిజ్యపరమైన ఎల్పీజీ అమ్మకాలు జరిగాయి.
· దాదాపు 736 మెట్రిక్ టన్నుల ఆటో ఎల్పీజీని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు విక్రయించాయి.
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ చర్యలు
· నిత్యావసర వస్తువుల చట్టం-1955, ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వు-2000 ప్రకారం.. సరఫరాను పర్యవేక్షించడానికి, అలాగే అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారముంది.
· పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడంలో, నియంత్రించడంలో రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం పలు లేఖలు, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది.
· తగినంత ఇంధనం అందుబాటులో ఉందన్న విషయాన్ని ప్రజలకు స్పష్టం చేస్తూ, వారిలో నమ్మకాన్ని నింపడానికి.. వారికి ఎప్పటికప్పుడు విస్తృతంగా సమాచారాన్ని చేరవేయాలని భారత ప్రభుత్వం పలు లేఖలు, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా వివరించింది.
· 2026మే 26 నాటి లేఖ ద్వారా అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు భారత ప్రభుత్వం ఒక కీలకమైన అభ్యర్థన చేసింది. హెచ్ఎస్డీ, ఎమ్ఎస్ వినియోగ విధానాన్ని పర్యవేక్షించాలని రాష్ట్ర/జిల్లా అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా అందులో కోరింది. ముఖ్యంగా పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు పెట్రోల్ బంకుల ద్వారా అనధికారికంగా డీజిలును కొనుగోలు చేయకుండా నిరోధించడానికి.. సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన రవాణా, పారిశ్రామిక కారిడార్లలో తనిఖీలను తీవ్రతరం చేయాలని స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.
· పీఎన్జీ అందుబాటులో ఉన్న ప్రతిచోటా.. ఎల్పీజీ వినియోగదారులు పూర్తిగా పీఎన్జీ వైపు మళ్లేలా వారిని ప్రోత్సహించాలనీ.. ఇందుకు సంబంధించి ఆయా ఎస్ఎల్సీలు/ సీజీడీ సంస్థలతో కలిసి పనిచేసేలా జిల్లా కలెక్టర్లు/ జిల్లా మేజిస్ట్రేట్లు/ మున్సిపల్ కమిషనర్లు/ పట్టణ స్థానిక సంస్థల ప్రత్యేక అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ.. 2026 జూన్ 10 నాటి లేఖ ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కేంద్ర ప్రభుత్వం అభ్యర్థించింది. జిల్లా, పట్టణ పరిపాలన యంత్రాంగాన్ని ఇందులో భాగస్వామ్యం చేయడం ద్వారా.. పీఎన్జీని విస్తరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మరింత మెరుగైన ఫలితాలు లభిస్తాయి.
ఎన్ఫోర్స్మెంట్, పర్యవేక్షణ చర్యలు
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్లను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా తనిఖీ చర్యలు కొనసాగుతున్నాయి.
ఎల్పీజీ సంబంధిత చర్యలు – గత 3 రోజుల్లో దేశవ్యాప్తంగా 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా... ఒక వ్యక్తిని అరెస్టు చేసి, 225 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
పెట్రోల్, డీజిల్ సంబంధిత చర్యలు – మణిపూర్ రాష్ట్రంలో 3680 లీటర్ల పెట్రోల్ను స్వాధీనం చేసుకోగా, 1 ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేశారు.
అదేసమయంలో, పీఎస్యూ ఓఎంసీల అధికారులు చేపట్టే ఆకస్మిక తనిఖీలూ కొనసాగుతున్నాయి.
ఎల్పీజీ పంపిణీ కేంద్రాలు - గత 3 రోజుల్లో క్రమశిక్షణారహిత ప్రవర్తనకు గాను 19 ఎల్పీజీ పంపిణీ కేంద్రాలకు జరిమానాలు విధించారు.
రిటైల్ అవుట్లెట్లు – గత 3 రోజుల్లో, మార్కెట్ క్రమశిక్షణ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 14 రిటైల్ అవుట్లెట్లపై జరిమానాలు విధించగా, 461 రిటైల్ అవుట్లెట్లను సస్పెండ్ చేశారు.
ప్రభుత్వ సంసిద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో గృహావసరాల కోసం ఎల్పీజీ, పీఎన్జీ, సీఎన్జీ (రవాణా)లకు 100 శాతం సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వాణిజ్య ఎల్పీజీ సరఫరాలో ఆసుపత్రులకు, విద్యా సంస్థలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఔషధ, ఉక్కు, ఆటోమొబైల్, విత్తన, వ్యవసాయ రంగాలకూ ప్రాధాన్యత కొనసాగిస్తున్నారు.
వలస కార్మికులు, విద్యార్థులు మొదలైన వారి ఎల్పీజీ అవసరాలకు మద్దతుగా 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల సరఫరాను పెంచారు.
సరఫరా, డిమాండ్ రెండు వైపులా ప్రభుత్వం ఇప్పటికే అనేక హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. రిఫైనరీల ద్వారా ఉత్పత్తిని పెంచడం... పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ విరామాన్ని 21 రోజుల నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచడం... సరఫరా విషయంలో నిర్దిష్ట రంగాలకు ప్రాధాన్యమివ్వడం వంటి చర్యలు వీటిలో భాగంగా ఉన్నాయి.
ప్రజలకు సూచనలు - అవగాహన
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీల లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నందున, పౌరులు వీటిని భయాందోళనతో కొనుగోలు చేయడం మానుకోవాలి.
వదంతుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, సరైన సమాచారం కోసం అధికారిక వనరులపైనే ఆధారపడాలి.
పౌరులు పీఎన్జీ, ఇండక్షన్/ఎలక్ట్రిక్ కుక్టాప్లు మొదలైన ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాలని కోరడమైనది.
పెద్దమొత్తంలో, పారిశ్రామికంగా డీజిల్ను వినియోగించేవారు అధీకృత కొనుగోలు వనరుల ద్వారానే కొనుగోలు చేయవలసిందిగా కోరడమైనది.
ప్రస్తుత పరిస్థితుల్లో, పౌరులంతా తమ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయాలని కోరడమైనది.
నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్లో నెలకొన్న సముద్ర పరిస్థితిపై ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. ఈ ప్రాంతంలో భారతీయ నౌకలు, సిబ్బంది భద్రత, రక్షణను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఈ నివేదికను అందించింది. అందులో కింది విషయాలను పేర్కొన్నది:
పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలకు సంబంధించి ఇటీవల జరిగిన సంఘటనలపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల నమోదైన సంఘటనల వివరాలు కింది విధంగా ఉన్నాయి:
08 జూన్ 2026న, ఒమన్ తీరానికి సమీపంలో పలావు జెండా కలిగిన ఎమ్టీ మారివెక్స్ నౌకలో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది. అందులో 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. అందరు సిబ్బందిని ఒమన్ వైమానిక దళం సురక్షితంగా రక్షించింది.
2026 జూన్ 10వ తేదీన, అంటే నిన్న... పలావు జెండా కలిగిన ఎమ్టీ సెట్టెబెల్లో చమురు ట్యాంకర్పై దాడి జరిగింది. నౌకలో అత్యవసర చర్యలు ప్రారంభించారు. ఈ సంఘటన జరిగిన సమయంలో, నౌకలో 24 మంది భారతీయులు, ఇద్దరు పాకిస్తానీలు, 1 రష్యన్, 1 ఉక్రేనియన్ సహా మొత్తం 28 మంది నావికులు ఉన్నారు. దురదృష్టవశాత్తూ, ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వారి మృతి పట్ల మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం.
21 మంది భారతీయులు సహా మిగిలిన మొత్తం 25 మంది సిబ్బందిని సురక్షితంగా తరలించారు.
డీజీఎస్ ద్వారా, మరణించిన సిబ్బంది సమీప బంధువులతో మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతూ, అన్ని రకాల సహాయాన్ని అందిస్తోంది.
మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లించాలని సీమాన్ వెల్ఫేర్ ఫండ్ సొసైటీని కోరారు.
11 జూన్ 2026న, అనగా ఈ రోజున, గినియా-బిస్సావు జెండా కలిగిన ఆస్ఫాల్ట్/బిటుమెన్ ట్యాంకర్ ఎమ్టీ జల్వీర్ (ఐఎమ్వో: 9486283)... ఒమన్లోని షినాస్ పోర్టు సమీపంలో ఒక నౌకా వాణిజ్య సంబంధిత భద్రతా ఘటనలో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ నౌకలో 20 మంది భారతీయ నావికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరిగినట్లు నివేదించలేదు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, ఇతర సంబంధిత భాగస్వాములతోనూ నిరంతరం సమన్వయం చేసుకుంటోంది.
డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ అప్డేట్: యాక్టివేషన్ అయినప్పటి నుంచి ఈ కంట్రోల్ రూమ్ 12,331 కాల్లు, 27,515 కంటే ఎక్కువ ఈమెయిళ్లనూ నిర్వహించింది. గత 72 గంటల్లో, నౌకా వాణిజ్య సిబ్బంది, వారి కుటుంబాలు, నౌకా వాణిజ్య రంగ భాగస్వాముల నుంచి మొత్తం 311 కాల్లు, 683 ఈమెయిళ్లూ అందాయి.
స్వదేశానికి తరలించడంపై తాజా సమాచారం: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) ద్వారా, గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి గత 72 గంటల్లో స్వదేశానికి చేరిన 31 మంది సహా, ఇప్పటివరకు 3,537 మందికి పైగా భారతీయ నావికులను మంత్రిత్వ శాఖ సురక్షితంగా స్వదేశానికి రప్పించడానికి సౌకర్యం కల్పించింది.
ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత
గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తూనే ఉంది. ఈ ప్రాంతంలోని భారతీయ పౌరుల భద్రత, రక్షణ, సంక్షేమాన్ని నిర్ధారించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కింది విషయాలను తెలియజేసింది:
సమాచార మార్పిడి, కృషిలో మెరుగైన సమన్వయం కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖ... రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు సకాలంలో సహాయం అందించేందుకు నిరంతరం పనిచేసే హెల్ప్లైన్లను కొనసాగిస్తూ, మన పౌరులకు చురుగ్గా సహాయపడుతున్నాయి. అవి స్థానిక ప్రభుత్వాలతోనూ సన్నిహిత సంప్రదింపులు జరుపుతున్నాయి.
స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు, విమాన ప్రయాణ పరిస్థితులు, కాన్సులర్ సేవలు, భారత పౌరుల కోసం చేపడుతున్న వివిధ సంక్షేమ చర్యలకు సంబంధించి సమాచారంతో కూడిన సూచనలు జారీ చేస్తున్నారు.
భారతీయ మిషన్లు స్థానిక భారతీయ పౌర సంఘాలతో చురుగ్గా సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి. వారి సమస్యలను పరిష్కరించడం కోసం వారు భారతీయ పౌర సంఘాలు, సంస్థలు, వృత్తిపరమైన నిపుణుల బృందాలు, భారతీయ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన దాడులపై తాజా సమాచారం
ఎమ్టీ మారివెక్స్పై తాజా సమాచారం
ఎమ్టీ మారివెక్స్లో ఉన్న 24 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా రక్షించారు.
ఒమన్లోని భారత మిషన్ వారికి అన్ని విధాలా సహాయం అందిస్తోంది. వారిని త్వరగా భారత్కు రప్పించడానికి సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. వారు రేపు భారత్ తిరిగి వస్తారని భావిస్తున్నారు.
ఎమ్టీ సెట్టెబెల్లో తాజా సమాచారం
ఒమన్ తీరంలో పలావు జెండా కలిగిన ఎమ్టీ సెట్టెబెల్లో వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ ఖండించింది.
ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు భారతీయ సిబ్బంది కుటుంబాలకు మంత్రిత్వ శాఖ ప్రగాఢ సంతాపం తెలియజేస్తోంది. వారి మృత దేహాలను త్వరగా స్వదేశానికి రప్పించేందుకు ఒమన్లోని భారత విదేశాంగ అధికారులు సంబంధిత అధికారులతో నిరంతరం చర్చిస్తున్నారు.
రక్షించిన భారతీయ నావికులకు మన అధికారులు అన్ని విధాలా సహాయం అందిస్తున్నారు. వారు త్వరగా భారత్ తిరిగి రావడానికి సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నారు.
ఎమ్టీ జల్వీర్పై తాజా సమాచారం
ఒమన్లోని షినాస్ పోర్టు సమీపంలో దాడికి గురైన గినియా బిస్సావు జెండా కలిగిన ఎమ్టీ జల్వీర్ వాణిజ్య నౌకలోని 20 మంది భారతీయ సిబ్బందిలో అందరూ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.
పరిస్థితిని ఒమన్లోని మన విదేశాంగ ప్రతినిధులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. భారతీయ సిబ్బందిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడం కోసం ఒమన్ అధికారులతో మాట్లాడుతున్నారు.
ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకాయానాన్ని ప్రభావితం చేస్తున్న సంఘటనలు కొనసాగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సముద్రయాన సిబ్బంది భద్రత, రక్షణను నిర్ధారించడం, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా అంతర్జాతీయ జలమార్గాల ద్వారా స్వేచ్ఛాయుత, నిరాటంకమైన నౌకాయాన, వాణిజ్యాన్ని కొనసాగించాల్సిన ప్రాముఖ్యతను మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటిస్తోంది.
వాణిజ్య నౌకపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ న్యూఢిల్లీలోని అమెరికా విదేశాంగ శాఖ వద్ద భారత్ నిరసన తెలిపింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ - నిన్న అమెరికా సీడీఏను పిలిపించి మాట్లాడింది. భారతీయ నావికులు ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై అమెరికా నౌకాదళం దాడులు చేసింది.
***
(रिलीज़ आईडी: 2271952)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam