జాతీయ మానవ హక్కుల కమిషన్
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో పేలుడు
8 మంది మరణించారని, ఆరుగురికి గాయపడ్డారని వచ్చిన వార్తాకథనం...
ఆ వార్తాకథనాన్ని స్వయంగా పరిశీలనకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ ఇండియా
యాజమాన్యం భద్రతా ప్రోటోకాల్స్ను అలక్ష్యం చేసిందని ఆరోపించిన వర్కర్స్ యూనియన్
ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి నోటీసులను జారీ చేసిన కమిషన్... రెండు వారాల్లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచన
మృతుల ఆత్మీయులకు ఎక్స్గ్రేషియా సొమ్ము చెల్లింపు వివరాలతో పాటు గాయపడ్డ వ్యక్తుల ఆరోగ్య స్థితిపై నివేదికలో ప్రస్తావించే అవకాశం
प्रविष्टि तिथि:
11 JUN 2026 12:51PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో పేలుడు సంభవించి 8 మంది కార్మికులు మరణించారని, కనీసం ఆరుగురికి తీవ్రమైన కాలిన గాయాలు అయ్యాయని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తాకథనాన్ని భారత జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) స్వయంగా పరిశీలనకు స్వీకరించింది. సంస్థ యాజమాన్యం భద్రతా ప్రోటోకాల్స్ను అలక్ష్యం చేసిందని కార్మికుల సంఘం ఆరోపించినట్లుగా వార్తాకథనంలో పేర్కొన్నారు.
వార్తల కథనాలు నిజమేనని తేలిన పక్షంలో, మానవ హక్కుల ఉల్లంఘన చోటు చేసుకున్నట్లేనని కమిషన్ అభిప్రాయపడింది. ఈ కారణంగా, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి కమిషన్ నోటీసులను జారీ చేసింది. రెండు వారాల లోపల సమగ్ర నివేదికను అందించాలంటూ కమిషన్ పిలుపునిచ్చింది. నివేదికలో మృతుల ఆత్మీయులకు ఎక్స్గ్రేషియా సొమ్ము చెల్లింపు వివరాలతో పాటు గాయపడ్డ వ్యక్తుల ఆరోగ్య స్థితికి సంబంధించిన సమాచారం పొందుపరుస్తారని భావిస్తున్నారు.
ప్రసార మాధ్యమాల్లో 2026 జూన్ 9న వచ్చిన కథనంలో పేర్కొన్న ప్రకారం.. ప్లాంటు ‘స్టీల్ మెల్టింగ్ షాపు’లో సంభవించిన సంఘటనలో దాదాపు 1600 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగిన సుమారు 150 టన్నుల ద్రవరూప ఉక్కును మోసుకుపోతున్న ఒక ల్యాడిల్ ఉన్నట్టుండి పేలిపోవడంతో, కరిగించిన ఉక్కు షాప్ ఫ్లోర్లోకి చిమ్మింది. దీని ఫలితంగా కార్మికులకు ఒళ్లు కాలి, తీవ్రంగా గాయపడ్డారు.
***
(रिलीज़ आईडी: 2271589)
आगंतुक पटल : 16