మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
భారతదేశంలో క్యాంపస్లను ఏర్పాటు చేయడానికి బ్రిస్టల్, యార్క్, న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయాలకు
కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో అనుమతి పత్రాల అందజేత
ఎన్ఈపీ 2020 ‘అంతర్జాతీయీకరణ దార్శనికతను’ సాకారం చేసే దిశగా నమోదైన కీలక ఘట్టం
ప్రపంచ స్థాయి విద్యా భాగస్వామ్యాల ద్వారా భారతదేశపు విజ్ఞాన, సాంకేతికత, ఆవిష్కరణ హబ్లను మరింత బలోపేతం చేసేందుకు ముంబయి, బెంగళూరు నగరాలలో అంతర్జాతీయ క్యాంపస్ల ఏర్పాటు
प्रविष्टि तिथि:
09 JUN 2026 6:00PM by PIB Hyderabad
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మూడు విదేశీ ఉన్నత విద్యా సంస్థలైన బ్రిస్టల్ విశ్వవిద్యాలయం, యార్క్ విశ్వవిద్యాలయం, న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయాలకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ రోజు మూడు అనుమతి పత్రాలను (ఎల్ఓఏ) జారీ చేసింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి- విశ్వవిద్యాలయ నిధుల కమిషన్ (యూజీసీ) చైర్మన్ డాక్టర్ వినీత్ జోషి ఈ అనుమతి పత్రాలను ఆయా సంస్థల ప్రతినిధులకు అందజేశారు.
బ్రిస్టల్ విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక డీన్- డైరెక్టర్ శ్రీమతి మిషెల్ జోన్స్, యార్క్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ చార్లీ జెఫరీ, న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం డిప్యూటీ ఉపకులపతి (ఎడ్యుకేషన్ అండ్ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్) ప్రొఫెసర్ సారా మాడిసన్ స్వయంగా ఈ అనుమతి పత్రాలను (ఎల్ఓఏ) అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో బ్రిటిష్ హైకమిషన్, ఆస్ట్రేలియన్ హైకమిషన్, బ్రిటిష్ కౌన్సిల్, విద్యా మంత్రిత్వ శాఖ, విశ్వవిద్యాలయ నిధుల కమిషన్ (యూజీసీ) ప్రతినిధులతో పాటు ఆయా మూడు విశ్వవిద్యాలయాల ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. బ్రిస్టల్ విశ్వవిద్యాలయం, యార్క్ విశ్వవిద్యాలయం, న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయాలు భారత్లో తమ క్యాంపస్లను ఏర్పాటు చేయడం.. 'విద్య అంతర్జాతీయకరణ' అనే జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో మరొక ముఖ్యమైన ఘట్టం అని అన్నారు. ఈ విద్యాసంస్థలు భారత్లో నాణ్యమైన విద్యను, ప్రపంచ స్థాయి అభ్యాస భాగస్వామ్యాలను, పరిశోధనా సహకారాలను మరింత బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. బ్రిస్టల్, యార్క్ విశ్వవిద్యాలయాలు ముంబయిలో.. యూఎన్ఎస్డబ్ల్యూ బెంగళూరులో తమ క్యాంపస్లను ఏర్పాటు చేస్తుండటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత్లో విజ్ఞాన, సాంకేతిక, ఆవిష్కరణల కేంద్రాలుగా విరాజిల్లుతున్న నగరాల్లో ఈ విశ్వవిద్యాలయాలు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయని, అందులోనూ బెంగళూరు తూర్పు దేశాల్లో 'కొత్త సిలికాన్ వ్యాలీ'గా గుర్తింపు పొందిందని ఆయన గుర్తు చేశారు. ఈ మూడు విశ్వవిద్యాలయాలకు దేశంలోకి ఘన స్వాగతం పలుకుతున్నట్లు ఆయన తెలిపారు. భారత్లో వేగంగా విస్తరిస్తున్న ప్రపంచ ఉన్నత విద్యా వ్యవస్థలో భాగమైనందుకు వాటికి అభినందనలు తెలిపారు.
బ్రిస్టల్ విశ్వవిద్యాలయం ముంబయిలో తన 'ముంబయి ఎంటర్ప్రైజ్ క్యాంపస్'ను ఏర్పాటు చేయనుంది. ఇందులో ఇమ్మర్సివ్ ఆర్ట్స్, ఫైనాన్స్, డేటా సైన్స్, ఆర్థిక శాస్త్రం, బిజినెస్ మేనేజ్మెంట్, వ్యవస్థాపకత, ఆవిష్కరణలు వంటి రంగాలలో కోర్సులను అందించాలని ప్రతిపాదించారు.
యార్క్ విశ్వవిద్యాలయం ముంబయిలో తన మొట్టమొదటి విదేశీ క్యాంపస్ను స్థాపించనుంది. ఇక్కడ ఫైనాన్స్, కృత్రిమ మేధతో కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్, ఎకనామిక్స్, సృజనాత్మక పరిశ్రమలు, మేనేజ్మెంట్ వంటి విభాగాలలో కోర్సులను అందించాలని ప్రతిపాదించారు.
న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం బెంగళూరులోని మాన్యతా బిజినెస్ పార్క్లో 'యూఎన్ఎస్డబ్ల్యూ బెంగళూరు' క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. ఇది 2026 ఆగస్టు నుంచి ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్యాంపస్ బిజినెస్, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలలో కోర్సులను అందించడమే కాకుండా పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్యం, రవాణా, విద్యా రంగాలలో భారత్తో మరింత లోతైన భాగస్వామ్యానికి దోహదపడుతుంది.
ఈ క్యాంపస్ల ఏర్పాటు అనేది జాతీయ విద్యా విధానం 2020 పరిధిలోని విస్తృత అంతర్జాతీయకరణ ఎజెండాలో ఒక భాగం. ఈ విధానం ఉన్నత విద్యా ప్రమాణాలలో అత్యున్నత ప్రపంచ స్థాయి నాణ్యతను సాధించడంపై, భారతదేశాన్ని ఒక అంతర్జాతీయ విద్యా గమ్యస్థానంగా తీర్చిదిద్దడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది.
భారత్లో విదేశీ ఉన్నత విద్యా సంస్థల క్యాంపస్ల ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన యూజీసీ నిబంధనలు... ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థలు తమ సంస్థాగత స్వయంప్రతిపత్తిని, ప్రపంచ స్థాయి ప్రమాణాలను కాపాడుకుంటూనే దేశంలో క్యాంపస్లను ఏర్పాటుచేయటానికి ఒక పారదర్శకమైన, సులభతరమైన, కాలపరిమితితో కూడిన విధివిధానాలను అందిస్తున్నాయి.
ఈ క్యాంపస్లు భారత్లోనే ఉన్నత ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ విద్యను అందుబాటులోకి తెస్తాయని, ఉభయ దేశాల మధ్య విద్యాసంబంధిత రాకపోకలను ప్రోత్సహిస్తాయని, పరిశోధన- ఆవిష్కరణలను బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. ఇవి భారతీయ విద్యార్థులకు కొత్త అవకాశాలను సృష్టించడంతో పాటు బ్రిటన్, ఆస్ట్రేలియాలతో భారతదేశ విద్యా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి.
ఈ కార్యక్రమం భారతదేశ నియంత్రణ, విద్యా వ్యవస్థపై ప్రపంచంలోని ప్రముఖ విద్యాసంస్థలకు పెరుగుతున్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం ఉన్న, అందరికీ సమాన అవకాశాలు కల్పించే, భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా ఉండే ఉన్నత విద్యా రంగాన్ని సృష్టించడంలో తోడ్పడుతుంది.
నేడు బ్రిస్టల్ విశ్వవిద్యాలయం, యార్క్ విశ్వవిద్యాలయం, న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయాలకు అనుమతి పత్రాల (ఎల్ఓఏ) అందజేతతో కలిపి ఇప్పటి వరకు మొత్తం ఐదు అనుమతి పత్రాలు జారీ అయ్యాయి. విదేశీ ఉన్నత విద్యా సంస్థల కోసం తీసుకొచ్చిన యూజీసీ నిబంధనల ప్రకారం వీటిని అందించారు. వీటిలో గతంలో అనుమతి పొందిన సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం, లివర్పూల్ విశ్వవిద్యాలయం కూడా ఉన్నాయి. సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం ఇప్పటికే 2025–26 విద్యా సంవత్సరం నుంచి తన విద్యా సంబంధిత కార్యకలాపాలను ప్రారంభించింది. భారతదేశమంతటా తమ క్యాంపస్లను ఏర్పాటు చేయటం కోసం బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలకు చెందిన మరికొన్ని ప్రపంచ ప్రఖ్యాత విదేశీ ఉన్నత విద్యా సంస్థలకు యూజీసీ ఇప్పటికే 10 ఉద్దేశ పత్రాలను (లెటర్ ఆఫ్ ఇంటెంట్) జారీ చేసింది. ఇవి కాకుండా డీకిన్ విశ్వవిద్యాలయం, వోలోంగాంగ్ విశ్వవిద్యాలయం, క్వీన్స్ యూనివర్సిటీ- బెల్ ఫాస్ట్ సంస్థలు ఇప్పటికే గిఫ్ట్ సిటీలో తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.
***
(रिलीज़ आईडी: 2270964)
आगंतुक पटल : 4