శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఆకాంక్షాత్మక భారత్ను తయారు చేసిన 12 ఏళ్ల మోదీ పాలన: డాక్టర్ జితేంద్ర సింగ్
వరుసగా ఎన్నికైన ప్రధానమంత్రిగా శ్రీ మోదీ 4,399 రోజుల పదవీకాలాన్ని ప్రతిబింబిస్తూ.. గడచిన దశాబ్దంలో సాధించిన విజయాలను ప్రస్తావించిన డాక్టర్ జితేంద్ర సింగ్
మోదీ శకంలో సాధించిన అతి పెద్ద విజయం ఆలోచనాధోరణిలో వచ్చిన మార్పే: మంత్రి
సిఫారసుల నుంచి ప్రతిభ వరకు: ప్రజల ఆకాంక్షలను పునర్నిర్మించిన పాలనా సంస్కరణలు
అంతరిక్షం, అణు రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం ఇవ్వడంతో మారిన ఆవిష్కరణల వ్యవస్థ
400కు పెరిగిన అంతరిక్ష అంకుర సంస్థలతో విస్తరించిన భారత ఆవిష్కరణల వ్యవస్థ
प्रविष्टि तिथि:
07 JUN 2026 5:01PM by PIB Hyderabad
నరేంద్ర మోదీ ప్రభుత్వ పన్నెండేళ్ల పాలన భారతదేశాన్ని అవకాశాలు, ఆవిష్కరణలు, ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచే ఆకాంక్షాత్మక దేశంగా మార్చిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. పరిపాలన సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, పౌర కేంద్రక విధానాలు భారతీయులు తమ అవకాశాలను చూసే దృక్పథాన్ని ప్రాథమికంగా మార్చేశాయని మంత్రి స్పష్టం చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యం దిశగా దేశం ముందుకెళుతున్న నేపథ్యంలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ తదుపరి దశ గురించి మంత్రి వివరించారు. ప్రస్తుతం 9 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడు నుంచి ఎనిమిదేళ్లలో 45 బిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని అంచనా వేశారు.
వరుసగా ఎన్నికైన ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్రమోదీ 4,399 రోజుల పదవీకాలం గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. గడచిన దశాబ్దంలో అనేక కొలవదగిన ఫలితాలు సాధించామన్నారు. కొన్నేళ్ల క్రితం అంతరిక్ష రంగంలో వేళ్ల మీద లెక్కపెట్టేంత మాత్రమే అంకుర సంస్థలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 400కు చేరుకుందని అన్నారు. వాటిలో ఒక సంస్థ ఇటీవలే యూనికార్న్ హోదాను దక్కించుకుందని వెల్లడించారు. ప్రస్తుతం భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ సుమారుగా 9 బిలియన్ డాలర్లు కాగా వచ్చే ఏడు నుంచి ఎనిమిదేళ్లలో 45 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. దేశంలో అంకుర సంస్థలు 2014లో సుమారుగా 350 నుంచి 400 వరకు అంకుర సంస్థలు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 2.3 లక్షలకు పైగా చేరుకుందని మంత్రి అన్నారు. ఇవి దాదాపు 24-25 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాయని చెప్పారు. ఈ అంకుర సంస్థల్లో దాదాపు సగం వరకూ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్నాయి. 35-39 శాతం అంకుర సంస్థలకు మహిళలు నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవలే జరిగిన అంతరిక్ష ప్రయోగంలో 1500 మంది మీడియా సిబ్బంది, దాదాపుగా 10,000 మంది ప్రేక్షకులు పాల్గొనడం.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పెరుగుతున్న ప్రజల భాగస్వామ్యాన్ని సూచిస్తుందని మంత్రి అన్నారు.
పౌర కేంద్రిత పరిపాలనా నమూనా దిశగా వస్తున్న మార్పునకు ప్రతీకగా ప్రభుత్వం ఏర్పాటైన తొలి నాళ్లలో చేపట్టిన కొన్ని సంస్కరణలు నిలిచాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. డాక్యుమెంట్లపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ అవసరాన్ని తొలగించి స్వీయ ధ్రువీకరణకు అనుమతించాలనే నిర్ణయం.. పౌరులపై, ముఖ్యంగా యువతపై ఉన్న నమ్మకానికి సంకేతమన్నారు. ప్రభుత్వ నియామకాల్లో వివిధ విభాగాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేయడం గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. ఇది బంధుప్రీతి, అధికారం, అవకతవకలకు అవకాశాన్ని తగ్గించడంతో పాటు, అర్హతల ఆధారిత ఎంపికలను బలోపేతం చేసిందన్నారు. పలుకుబడి లేదా సిఫార్సుల ద్వారా కాకుండా సామర్థ్యం, కష్టపడటం ద్వారా విజయం సాధించవచ్చనే విశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ సంస్కరణలు దోహదపడ్డాయని మంత్రి తెలియజేశారు.
గత పన్నెండేళ్లలో విధానపరంగా మాత్రమే కాకుండా.. మానసికంగా కూడా మార్పు వచ్చిందనీ డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. భారతదేశంలో సరికొత్త ఆకాంక్షాత్మక సంస్కృతి ఆవిర్భవించిందని చెప్పారు. ‘’12 ఏళ్ల ప్రధానమంత్రి మోదీ పాలనలో సాధించిన విజయాల్లో ఆలోచనధా ధోరణిలో మార్పు ఒకటి అని ఆయన అన్నారు. ‘‘నేను కూడా ఇది చేయగలను అనే సంకల్పం గతంలో లేదు’’. సాంకేతికత, పారదర్శకత, నిష్పక్షపాతమైన పోటీ ద్వారా అందరికీ అవకాశాలను అందిస్తూ.. చిన్న పట్టణాలు, మెట్రోపాలిటన్ కాని నగరాల నుంచి పెరుగుతున్న సివిల్ సర్వీసు టాపర్ల సంఖ్యలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి అన్నారు.
ఈ విస్తృత పరివర్తనకు శాస్త్రీయ రంగంలో భారత్ సాధిస్తున్న విజయాలను సైతం మంత్రి అనుసంధానించారు. చంద్రయాన్ మిషన్ల గురించి ప్రస్తావించారు. దేశం సాధిస్తున్న శాస్త్రీయ విజయాల గురించి ప్రజలకు చేరువ చేసే, ఆవిష్కరణలను జాతీయ విజయాలుగా చూసే సంస్కృతిని ప్రభుత్వం ప్రోత్సహించిందని ఆయన అన్నారు. అపజయాలను ఎదుర్కొన్న సందర్భాల్లో శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి మోదీ అండగా నిలిచారనీ, వారి విజయాలను వేడుకగా నిర్వహించారనీ తద్వారా ఆవిష్కరణ, ప్రగతిలో అపజయం సాధారణమనే భావనను తీసుకురావడంలో సహాయపడ్డాయని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేసుకున్నారు. చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో భారత్ విజయవంతంగా దిగడం సైన్స్ పట్ల ప్రజల్లో ఆసక్తిని పెంపొందించిందనీ, భారత్ చేపట్టిన మిషన్లు చంద్రునిపై నీటి అణువుల జాడను గుర్తించడంలో సాయపడ్డాయనీ ఆయన అన్నారు.
సంస్థాగత మార్పుల గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ వివరిస్తూ.. వ్యూహాత్మక రంగాలైన అంతరిక్షం, అణు రంగంలోని కొన్ని విభాగాల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి మోదీ ప్రభుత్వం అవకాశాన్ని కల్పించిందనీ, దశాబ్దాల పాటు కొనసాగిన నియంత్రణకు ముగింపు పలికిందని తెలియజేశారు. ఈ రంగాలు ఒకప్పుడు రహస్యంగా కార్యకలాపాలు సాగించేవనీ, కానీ ఇప్పుడు పరిశ్రమలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలతో అనుసంధానమయ్యాయని ఆయన చెప్పారు. విధానపరమైన ఈ మార్పుల వల్ల ఉద్యోగావకాశాలు విస్తరించాయనీ, ఆవిష్కరణలు వేగవంతమయ్యాయనీ, ప్రపంచంలోని ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా భారతీయ సైంటిఫిక్ రంగం మారిందనీ మంత్రి తెలిపారు. దేశీయంగా కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో భారత దేశం సాధించిన పురోగతిని సరిపోల్చడానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని వికసిత్ భారత్ లాంటి కార్యక్రమాలు ప్రతిబింబిస్తున్నాయని కూడా ఆయన వివరించారు.
సార్వత్రికమైన, పారదర్శకమైన అమలు దిశగా సంక్షేమ పథకాల పంపిణీ ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. గృహ నిర్మాణం, ఇతర సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ.. కులం, మతం, లేదా మరే ఇతర అంశాల ఆధారంగా వివక్షారహితంగా ప్రయోజనాలను అందిచడం వల్ల ప్రభుత్వ సంస్థలు, పాలనా వ్యవస్థలపై విశ్వాసం పెరిగిందన్నారు.
భవిష్యత్తులో భారత దేశ అభివృద్ధి ప్రయాణానికి బలమైన ప్రభుత్వ-ప్రైవేటు సహకారమూ, మహిళలు-యువత అందించే దృఢమైన భాగస్వామ్యమూ, అంతరిక్షం, అణు విద్యుత్తు, క్వాంటం టెక్నాలజీల లాంటి నూతన రంగాల విస్తరణా, పనితీరు-ఆవిష్కరణల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడమూ అవసరమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆర్థిక వృద్ధి మాత్రమే ప్రభుత్వానికి దీర్ఘకాలిక లక్ష్యం కాదనీ, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే దార్శనికతకు దోహదపడేలా సాధికారత సాధించిన, ఆకాంక్షాత్మక సమాజాన్ని తయారుచేయడం కూడా అని మంత్రి తెలియజేశారు.
పాలనా సంస్కరణలూ, సంస్థగాత మార్పులూ అనే విస్తృత కోణంలో ప్రభుత్వ 12 ఏళ్ల పాలనను పై వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. అలాగే హక్కులు కల్పించడం, ఆధారపడి ఉండటమనే సంస్కృతి నుంచి ఆకాంక్ష, ప్రతిభ, ఆవిష్కరణ దిశగా మార్పు తీసుకు వచ్చేందుకు చేపట్టిన ప్రయత్నాన్ని వివరిస్తున్నాయి.
***
(रिलीज़ आईडी: 2270188)
आगंतुक पटल : 6