గనుల మంత్రిత్వ శాఖ
ఇండియా-యూకే కీలక ఖనిజాల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ అబ్జర్వేటరీని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ కార్యదర్శి ఇవెట్ కూపర్
నాడు పోస్టు చేయడమైనది:
04 JUN 2026 4:11PM by PIB Hyderabad
ఈ రోజు న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ. కిషన్ రెడ్డి, బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి, కామన్వెల్త్, అభివృద్ధి వ్యవహారాల మంత్రి ఇవెట్ కూపర్ భారత్-యూకే కీలక ఖనిజాల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల అబ్జర్వేటరీ (జీఎస్సీవో)ను అధికారికంగా ప్రారంభించారు.

కీలకమైన ఖనిజాలు, సరఫరా వ్యవస్థల స్థిరత్వంలో భారత్-యూకే భాగస్వామ్యం సాధిస్తున్న వృద్ధిని ఈ ఘట్టం సూచిస్తుంది అలాగే, స్వచ్ఛ ఇంధన స్వీకరణ, అధునాతన తయారీ, విద్యుత్ వాహన రంగం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలకు అవసరమైన వనరులను పొందడంలో సహకారాన్ని బలోపేతం చేస్తుంది. ఈ కార్యక్రమానికి భారత గనుల మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు, యునైటెడ్ కింగ్డమ్లో భారత హై కమిషన్ కార్యాలయ ప్రతినిధులు, యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు, భారత్లో బ్రిటన్ హైకమిషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటుగా టెక్స్మిన్, ఐఐటీ (ఐఎస్ఎం)-ధన్బాద్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ ప్రతినిధులు, రెండు దేశాలకు చెందిన పారిశ్రామిక, విద్య, పరిశోధన సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కీలక ఖనిజాలను ఆధునిక ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా, శుద్ధ ఇంధన సాంకేతిక పరిజ్ఞానాలు, విద్యుత్ వాహన రంగం, వ్యూహాత్మక రంగాల్లో ఆవశ్యకమైనవిగా కిషన్ రెడ్డి వర్ణించారు. ఈ అబ్జర్వేటరీ.. కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థ నిఘాలో భారత దేశ సామర్థ్యాలను బలోపేతం చేస్తుందని, సాక్ష్యం ఆధారిత విధాన రూపకల్పనకు తోడ్పాటు అందిస్తుందని, జాతీయ కీలక ఖనిజాల కార్యక్రమం (ఎన్సీఎంఎం) లక్ష్యాలను ముందుకు తీసుకెళుతుందని మంత్రి తెలియజేశారు.

విశ్వసనీయ భాగస్వాములతో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందిస్తూనే.. స్థిరమైన, వైవిధ్యమైన కీలక ఖనిజ విలువ ఆధారిత వ్యవస్థలను నిర్మించడంలో భారతదేశ నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
దృఢమైన, వైవిధ్యమైన, సుస్థిరమైన కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో భారత్-యూకే సహకారానికున్న ప్రాధాన్యాన్ని యూకే విదేశాంగ కార్యదర్శి ఇవెట్ కూపర్ స్పష్టం చేశారు. రెండు దేశాల పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా కీలక ఖనిజాలను విస్తృతంగా అందుబాటులోకి రావాలని, సమాచార వినిమయం మెరుగవ్వాలని అన్నారు. ఇవి ఆర్థిక వృద్ధికి, సరఫరా వ్యవస్థ భద్రతకు
గణనీయంగా దోహదపడగలవని ఆమె చెప్పారు
కీలక ఖనిజాల రంగం, సంబధిత వ్యూహాత్మక పరిశ్రమల్లో విస్తృత సహకారానికి పునాదిగా పనిచేసే సామర్థ్యం ఈ భాగస్వామ్యానికి ఉందని ఆమె వెల్లడించారు.
టెక్స్మిన్ (టీటీఆర్పీ, డీఎస్టీ, జీవోఐ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఎస్ఎం) ధన్బాద్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ అబ్జర్వేటరీని ఏర్పాటు చేశాయి. అంతర్జాతీయ కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థల పర్యవేక్షణకూ, విశ్లేషణకూ డేటా ఆధారిత వేదికను రూపొందించడమే దీని లక్ష్యం.
2025 అక్టోబరులో భారత్-యూకే ప్రధానమంత్రుల ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. అనంతరం 2026 మార్చిలో కుదిరిన పరిశోధనా సహకార ఒప్పందం ద్వారా దీనిని కార్యాచరణలోకి తీసుకు వచ్చారు.

భారత దేశ జాతీయ కీలక ఖనిజాల మిషన్, యూకే సాంకేతిక భద్రతా పథకం పరిధిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికున్న ప్రాధాన్యం గురించి ఐఐటీ (ఐఎస్ఎం) ధన్బాద్ డైరెక్టర్, టెక్స్మిన్ గవర్నింగ్ బోర్డు ఛైర్మన్ అయిన ప్రొఫెసర్ సుకుమార్ మిశ్రా వివరించారు.
ఈ అబ్జర్వేటరీకి సంబంధించిన సమాచారాన్ని టెక్స్మిన్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం సంయుక్తంగా వివరించాయి. అంతర్జాతీయ కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థల పర్యవేక్షణ, సరఫరాలో ముప్పులు, అవాంతరాల గుర్తింపు, మార్కెట్ ఇంటిలిజెన్స్ను రూపొందించడంతో పాటు విధాన రూపకర్తలకు, పరిశ్రమలకూ, పరిశోధకులకు సమాచారంతో కూడిన నిర్ణయాలను తీసుకొనే వీలును ఈ వేదిక కల్పిస్తుంది.

కీలకమైన ఖనిజాల రంగంలో భారత్-యూకే మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికీ, దృఢమైన, సురక్షితమైన, స్థిరమైన అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకు సంబంధించి సమాచార ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికీ మద్దతు ఇచ్చేందుకు విలువైన వేదికగా ఈ కార్యక్రమం పని చేస్తుందని భావిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2269154)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9