పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
గువాహటిలో పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘సేవా సే సమృద్ధి’ ప్రాంతీయ సదస్సు ఉత్తమంగా నిలిచిన గ్రామ పంచాయతీలు, పౌర సేవా కేంద్రాలకు సన్మానం
కేంద్రమంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ అధ్యక్షతన సదస్సు నిర్వహణ... ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధన దిశగా సీఎస్సీలు, గ్రామ పంచాయతీల మధ్య మరింత సమన్వయం ఉండాలని పిలుపు
నాడు పోస్టు చేయడమైనది:
29 MAY 2026 4:15PM by PIB Hyderabad
నేడు గువాహటిలో ‘సేవా సే సమృద్ధి: పంచాయతీల ఆధ్వర్యంలో సేవల పంపిణీ’ ప్రాంతీయ సదస్సును కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఈ సదస్సును కామన్ సర్వీసెస్ సెంటర్ స్పెషల్ పర్పస్ వెహికల్ (సీఎస్సీ-ఎస్పీవీ), అస్సాం ప్రభుత్వ పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖల భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు. గ్రామీణ భారత్లో సేవలను మరింత మెరుగుపరచడం, ప్రజల జీవన ప్రమాణాలను సులభతరం చేయడం కోసం కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ చేపట్టిన నిరంతర ప్రయత్నాల్లో భాగంగా ఈ సదస్సు నిర్వహించారు. బాధ్యతాయుతమైన, చురుకైన పంచాయతీ రాజ్ సంస్థలను, గ్రామీణ స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. మొత్తం ఏడు రాష్ట్రాలు అస్సాం (ఆతిథ్య రాష్ట్రం), ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్ నుంచి పంచాయతీ కార్యకర్తలు, ఎన్నికైన ప్రతినిధులు, గ్రామ స్థాయి పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
ఈ సదస్సుకు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు, రైతులు, గ్రామీణ జీవనోపాధి ద్వారానే దేశ శ్రేయస్సు, అభివృద్ధి సాధ్యమవుతాయని చెప్పారు. ప్రతి ఒక్క వ్యక్తి నిజమైన సాధికారత మాత్రమే.. గ్రామాలను, రాష్ట్రాలను, చివరికి మన దేశాన్ని స్వయంసమృద్ధితో కూడిన అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి బలమైన పునాది అని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న పౌర సేవా కేంద్రాలు భారీ స్థాయిలో గ్రామీణ ఉపాధిని కల్పించడంతోపాటు పౌరులకు పెన్షన్లు, రకరకాల ధ్రువీకరణ పత్రాలు, బీమా పథకాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా అందిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఆధార్, బ్యాంకు ఖాతాలు, భూమి రికార్డుల్లో ఉండే వివరాలు ఎలాంటి తప్పులు లేకుండా కచ్చితంగా ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. వీటిలో దొర్లే చిన్న చిన్న తప్పుల వల్ల కూడా అర్హులైన లబ్ధిదారులు పీఎం కిసాన్ వంటి ఉపయోగకరమైన పథకాల ప్రయోజనాలను పొందలేకపోతున్నారని అన్నారు.
పౌర సేవా కేంద్రాల నిర్వాహకులకు మరింత మెరుగైన శిక్షణ ఇవ్వాలని, వారి సామర్థ్యాలను పెంచాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. ఈ డిజిటల్ సేవా కేంద్రాలను గ్రామ పంచాయతీలతో సమర్థవంతంగా అనుసంధానించినప్పుడు అవి ప్రతి పౌరుడి ఇంటి వద్దకే ప్రజా సేవలను అందించే శక్తిమంతమైన, వేగవంతమైన కేంద్రాలుగా మారుతాయని స్పష్టం చేశారు. డిజిటల్ వేదికలు, స్థానిక పాలనా సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత పటిష్టం చేయాలని అధికారులను కోరారు. దీనివల్ల అర్హత ఉన్న ప్రతి పౌరుడికి సరైన సమయానికి ప్రభుత్వ ఫలాలు అందుతాయని, తద్వారా ‘సేవా సే సమృద్ధి’ లక్ష్యం నెరవేరడంతోపాటు 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి గొప్ప సహకారం అందించగలమని తెలిపారు.
మార్పు, అభివృద్ధి, కార్మిక సంక్షేమం, తేయాకు తోటల కార్మికులు, ఆదివాసీల సంక్షేమ శాఖల మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి మాట్లాడుతూ.. పంచాయతీ రాజ్ సంస్థల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సేవలను చేర్చడంలో భారత ప్రభుత్వం, అస్సాం ప్రభుత్వం కలిసికట్టుగా చేస్తున్న కృషిని అభినందించారు. తేయాకు తోటల కార్మికులు, ఆదివాసీ ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఈ వర్గాల ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడం, సంక్షేమ పథకాలు, విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రతను వారికి సులభంగా అందుబాటులోకి తీసుకురావడం కోసం నిరంతరం అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని, దీనివల్ల అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి విభాగానికి చేరుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో బలమైన పంచాయతీ పాలన కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ... వివిధ ప్రభుత్వ శాఖల మధ్య నిరంతర సమన్వయం వల్ల అస్సాం అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన అత్యుత్తమ గ్రామ పంచాయతీలను, గ్రామ స్థాయి పారిశ్రామికవేత్తలను ఈ సదస్సులో ఘనంగా సన్మానించారు. ముఖ్యంగా ఒడిశాలోని కేందుఝర్ జిల్లాలోని సువాకతి గ్రామ పంచాయతీని ప్రత్యేకంగా అభినందించారు. ఈ పంచాయతీ డిజిటల్ సేవల విప్లవంలో చేసిన కృషికి గాను జాతీయ డిజిటల్ పరిపాలన అవార్డులు 2025లో జ్యూరీ అవార్డును గెలుచుకుంది. వీరు ఒడిశావన్, సేవా ఒడిశా, వేదికల ద్వారా అవసరమైన అన్ని ప్రభుత్వ సేవలను డిజిటలైజ్ చేశారు. దీనివల్ల ప్రజలు 24 గంటలూ ఆన్లైన్ ద్వారా సేవలను పొందుతూ, తమ దరఖాస్తు ఏ దశలో ఉందో కూడా స్వయంగా చూసుకునే సదుపాయం లభించింది. క్షేత్రస్థాయిలో మహిళా నాయకత్వానికి, సమ్మిళిత సేవల పంపిణీకి ఈ పంచాయతీ ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.
జాతీయ డిజిటల్ పరిపాలన అవార్డులు 2025లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామ పంచాయతీల జాబితాలో నిలిచిన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని శివారెడ్డిగూడెం గ్రామ పంచాయతీని కూడా ఈ సదస్సులో ఘనంగా సన్మానించారు. పారదర్శకతకు, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పనిచేయడానికి, సాంకేతికతను ఉపయోగించుకుని గ్రామ స్థాయిలో అద్భుతమైన పాలన అందించడానికి ఈ పంచాయతీ ఒక ఆదర్శవంతమైన నమూనాగా కొనియాడారు.
గ్రామ స్థాయిలో డిజిటల్ సేవలను ప్రజలకు చేర్చడంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన గ్రామస్థాయి డిజిటల్ సేవల నిర్వాహకులైన శ్రీమతి గిరిజా నాథ్ (అస్సాం) శ్రీమతి సుమిత్రా దాస్ (ఒడిశా), శ్రీ అమన్దీప్ సింగ్ (పంజాబ్), శ్రీమతి సుర్తా దేవి సైనీ (రాజస్థాన్)లను సత్కరించారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి గ్రామ పంచాయతీలు, పౌర సేవా కేంద్రాలు కలిసి పనిచేయడం అత్యంత ముఖ్యమని కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి ముక్తా శేఖర్ పేర్కొన్నారు. ఇది స్థానిక అవసరాలపై ఉన్న అవగాహనను, డిజిటల్ సాంకేతికతతో ముడిపెడుతుందని చెప్పారు. ప్రతి గ్రామీణ పౌరుడికి గౌరవాన్ని, సులభంగా సేవలు పొందే సౌకర్యాన్ని, సమానత్వాన్ని అందించడమే డిజిటల్ పాలన ముఖ్య ఉద్దేశమని తెలిపారు.గ్రామ పంచాయతీల సేవల్లో సరికొత్త ఆవిష్కరణలను గుర్తించి, ప్రోత్సహించడం కోసం జాతీయ డిజిటల్ పరిపాలన అవార్డులు 2025 కింద గ్రామ పంచాయతీ సేవా పంపిణీ కోసం ప్రత్యేక విభాగాన్ని ప్రవేశపెట్టినట్లు ఈ సందర్భంగా ఆమె భాగస్వాములకు తెలియజేశారు.
అస్సాం ప్రభుత్వ పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ బల్లెపు కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. అందరికీ సమానమైన, డిజిటల్ పాలన అందించడానికి తమ రాష్ట్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో సేవలను మరింత సమర్థవంతంగా, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా అందించడంలో పంచాయతీ రాజ్ సంస్థల పాత్ర, అధికారాల వికేంద్రీకరణ ముఖ్యమని తెలిపారు వివిధ రాష్ట్రాలు తమ అనుభవాలను పరస్పరం పంచుకోవడం, గ్రామీణ పాలనను మెరుగుపరచడంలో డిజిటల్ వేదికల పాత్ర కీలకమని పేర్కొన్నారు. సేవా సే సమృద్ధి విస్తృత లక్ష్యానికి అస్సాం కట్టుబడి ఉంటుందని పేర్కొంటూ.. ఈ సదస్సులో జరిగే చర్చలు దేశవ్యాప్తంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉపయోగపడే ఆచరణాత్మక ఫలితాలకు దారితీస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
పౌర సేవా కేంద్రాలు నేడు ప్రపంచంలోనే అతిపెద్ద సేవా వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగాయని సీఎస్సీ-ఎస్పీవీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శ్రీ అఖిల్ కుమార్ తెలిపారు. దీనివల్ల ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉండే గ్రామీణ ప్రజలు కూడా ఆధార్, పాన్ కార్డు, బ్యాంకింగ్, బీమా, పెన్షన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల వంటి సేవలను సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా తమ సొంత ఊరిలోనే సులభంగా పొందగలుగుతున్నారని చెప్పారు. ఈ సీఎస్సీ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో గొప్ప సామాజిక, ఆర్థిక మార్పు వచ్చిందని పేర్కొన్నారు. లక్షలాది మంది గ్రామ స్థాయి డిజిటల్ సేవల నిర్వాహకులు ముఖ్యంగా ఎంతో మంది మహిళా పారిశ్రామికవేత్తలు దీని ద్వారా స్వయం సమృద్ధి సాధించారని, గ్రామ స్థాయిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు కూడా బలోపేతం అయ్యాయని వివరించారు.
వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఒకరి అనుభవాలను ఒకరు తెలుసుకోవడానికి, పంచాయతీల ఆధ్వర్యంలో సేవలను అందించడంలో తాము పాటిస్తున్న ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి ఈ సదస్సు ఒక గొప్ప వేదికగా నిలిచింది. ఇందులో ‘విధానాల నుంచి ప్రజల వరకు: పరిపాలనను ఆచరణలోకి తీసుకురావడం’ పేరుతో జరిగిన మొదటి ప్యానెల్ చర్చకు అస్సాం ప్రభుత్వ పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీమతి కీర్తి జల్లి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ చర్చలో సీఎస్సీ-ఎస్పీవీ, ఈ-మిత్ర (రాజస్థాన్), ఈ-సేవ (పంజాబ్), లోక్ సేవా గ్యారెంటీ పోర్టల్ (మధ్యప్రదేశ్), పంచాయతీ సచివాలయం (ఆంధ్రప్రదేశ్), మీ సేవ (తెలంగాణ), ఒడిశా వన్ (ఒడిశా) వంటి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ సేవా పంపిణీ వేదికల ప్రతినిధులు పాల్గొన్నారు.
‘సాంకేతికతతో కూడిన పంచాయతీ రాజ్, సేవల పంపిణీ’ అంశంపై జరిగిన మొదటి సాంకేతిక సమావేశాన్ని ఐఐటీ గువాహటి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధార్థ సింఘా నిర్వహించారు. రెండో సాంకేతిక సమావేశాన్ని భాషిణి సీఈఓ శ్రీ అమితాబ్ నాగ్ నిర్వహించారు. మౌలిక సదుపాయంగా భాష: భాషిణి ద్వారా చివరి వ్యక్తి వరకు పాలనను సరికొత్తగా అందించడం అంశంపై ఆయన మాట్లాడారు. వివిధ భాషలతో కూడిన డిజిటల్ సాంకేతికత ద్వారా దేశంలోని చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ పాలనను వారి సొంత భాషలోనే ఎంతో సులభంగా, సమానంగా ఎలా చేర్చవచ్చో ఆయన వివరించారు.
***
(రిలీజ్ ఐడి: 2266848)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16